
ఫస్టొచ్చింది.. పైసల్లేవ్!
- బ్యాంకుల్లో నిండుకున్న నగదు
- పట్టణాలు, నగరాల్లో ‘నో క్యాష్’ బోర్డులు
- నయా పైసా లేని గ్రామీణ ప్రాంత బ్యాంక్లు
- 1,816 బ్యాంకు శాఖల్లో పక్షం రోజులుగా లావాదేవీలు బంద్
- ప్రజల్లో అశాంతి పెరుగుతోంది.. శాంతిభద్రతల సమస్యగా మారొచ్చు
- కేంద్రానికి ఇంటెలిజెన్స బ్యూరో హెచ్చరిక
- గొడవలు మొదలైతే ఆపడం ఎవరితరం కాదని వ్యాఖ్య
- బ్యాంకుల వద్ద పోలీసు బందోబస్తు పెట్టండి
- డీజీపీని కోరిన రిజర్వ్ బ్యాంకు
హైదరాబాద్లోని బ్యాంకు శాఖలు.. 1,526
పైసా కూడా ఇవ్వనివి.. 1,100
ఇతర ప్రధాన నగరాల్లోని బ్యాంకు శాఖలు 674
పైసా కూడా ఇవ్వనివి.. 500
రాష్ట్రంలోని ప్రభుత్వరంగ బ్యాంకుల ఏటీఎంలు 3,400
వీటిలో పనిచేస్తున్నవి 400
(బుధవారం నాటి పరిస్థితి ఇది..)
సాక్షి, హైదరాబాద్
ఒకటో తారీఖు వచ్చేసింది.. ఇక కరెన్సీ కష్టాలు మరింత తీవ్రం కానున్నాయి! గురువారం పరిస్థితి ఎలా ఉంటుందోనని హైదరాబాద్తోపాటు ఇతర నగరాల్లోని బ్యాంక్ సిబ్బందిలో ఆందోళన మొదలైంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, ఖమ్మం నగరాల్లోని చాలా వరకు బ్యాంక్ శాఖల్లో నగదు లేదు. అక్కడక్కడ ఎస్బీఐ బ్రాంచీలకు రిజర్వుబ్యాంక్ నుంచి కొంత నగదు అందుతున్నా.. అది మొదటి గంటలో వచ్చే ఖాతాదారులకే సరిపోతోంది. అదీ ఒక్కొక్కరికి రూ.4 వేలు మాత్రమే అందించగలుగుతున్నారు. మిగిలిన అన్ని బ్యాంక్ల శాఖలు నో క్యాష్ బోర్డులు తగిలిస్తున్నాయి. రాజధాని హైదరాబాద్లో 1,526 బ్యాంక్ శాఖలు ఉండగా బుధవారం 1,100 శాఖల నుంచి ఖాతాదారులకు పైసా కూడా అందలేదు.
రాష్ట్రంలోని ఇతర నగరాల్లో 674 బ్యాంక్ శాఖలు ఉండగా.. 500కు పైగా బ్రాంచీల్లో డబ్బు లేదు. ఉన్నకొద్దిపాటి బ్రాంచీల్లో రూ.2 నుంచి 4 వేలు ఇస్తున్నారు. రాజధాని సహా ఇతర నగరాల్లో 3,400 ప్రభుత్వరంగ బ్యాంకుల ఏటీఎంలు ఉండగా వాటిలో 400 ఏటీఎంల్లో కూడా నగదు సౌకర్యం లేదు. ఏ ఏటీఎంలో అరుునా నగదు లోడ్ చేస్తే గంటలోనే అయిపోతోంది. ఈ నేపథ్యంలో గురువారం నాటి పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని, బ్యాంక్కు నగదు కోసం వచ్చే ఖాతాదారులకు సమాధానం చెప్పలేమని ప్రధాన బ్యాంక్ల ఉన్నతాధికారులు రిజర్వుబ్యాంక్ దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైతే పోలీసు బందోబస్తు పెట్టుకోవడం మినహా ఈ విషయంలో తాము చేయగలిగిందేమీ లేదని రిజర్వుబ్యాంక్ స్పష్టం చేసింది.
బ్యాంకుల వద్ద బందోబస్తు..
నగదు కొరత రోజురోజుకూ తీవ్రమవుతుండడం, అక్కడక్కడ బ్యాంక్ సిబ్బందితో ఖాతాదారులు గొడవ పడుతున్న ఘటనల నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి కొద్దిరోజుల పాటు బ్యాంకుల వద్ద పోలీసు బందోబస్తు పెట్టాలని రిజర్వు బ్యాంక్... తెలంగాణ డీజీపీని కోరింది. ఈ మేరకు ముంబై కార్యాలయం నుంచి ఫ్యాక్స్ ద్వారా లేఖ అందినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి తోడు నగదు కొరత శాంతిభద్రతల సమస్యగా మారే ప్రమాదం ఉందంటూ ఇంటెలిజెన్స బ్యూరో (ఐబీ) కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉన్నదని, నగదు కొరతతో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే గొడవలు ఆపడం ఎవరితరం కాదని కేంద్రానికి తెలిపింది.
పట్టణ, నగర ప్రాంతాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉందని నివేదించింది. రాష్ట్రంలో అక్కడక్కడ చోటుచేసుకున్న ఘటనలను సైతం ప్రస్తావించింది. బ్యాంక్లకు వెళ్లడానికి మహిళా సిబ్బంది జంకుతున్నారని, అనారోగ్య కారణాలతో వారు సెలవులకు దరఖాస్తు చేశారని ఐబీ తన నివేదికలో కేంద్రం దృష్టికి తెచ్చింది. డబ్బు కోసం వచ్చిన ఖాతాదారులకు సమాధానం చెప్పలేక, వారితో వాగ్వాదానికి దిగలేక మహిళా సిబ్బంది లీవ్లో వెళ్తున్నారని ఓ బ్యాంక్ ఉన్నతాధికారి పేర్కొన్నారు. పరిస్థితిలో మార్పు లేకపోతే గ్రామీణ ప్రాంతాల బ్యాంక్లను మూసివేయడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని ఆ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
రోగుల అష్టకష్టాలు
కరెన్సీ కొరతతో ముఖ్యంగా రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ‘‘నాకు షుగర్ వ్యాధి. ఫార్మసీకి వెళ్లి మందులు కొనుగోలు చేయడానికి పాత నోట్లు లేవు. పది రోజులుగా ట్యాబ్లెట్ వేసుకోలేదు. బ్యాంక్కు వైద్యుని మందుల చీటి తీసుకుని వెళ్లా. ఖాతాలో పెన్షన్ డబ్బు జమ అయింది. కానీ ఇవ్వడానికి వాళ్ల దగ్గర నగదు లేదట’’ అని రిటైర్డ్ టీచర్ సత్యనారాయణ ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్ గన్ఫౌండ్రిలోని ఓ బ్యాంక్ మేనేజర్తో ఎంతగా మొరపెట్టుకున్నా ఆయన ససేమిరా అన్నారని చెప్పారు. ‘‘నా దగ్గర ఉంటే ఇచ్చేవాడిని. జేబులో ఖర్చులకు రూ.250 ఉన్నాయి. ఎవరైనా ఉంటే రూ.500 ఇవ్వండని మా స్టాఫ్ను అడిగా, ఎవరి దగ్గరా నగదు లేదు. ఏం చేయమంటారు’’ అని మేనేజర్ అన్నట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇంటిల్లిపాది జ్వరంతో బాధపడుతున్నా డబ్బుల్లేక వైద్యుని దగ్గరకు వెళ్లలేని దీనస్థితిలో బాధపడుతున్న కుటుంబాలు కోకొల్లలున్నారుు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 1,816 బ్యాంక్ శాఖల్లో పక్షం రోజులుగా నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నారుు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే నగదు అందుబాటులో లేని కారణంగా రెండు లక్షల మంది ఉపాధికి దూరమయ్యారు. కరెన్సీ కష్టాలపై ఇటీవల కలెక్టర్లు సీఎం కేసీఆర్కు ఒక నివేదిక సమర్పించారు. వ్యవసాయం కుదేలైందని, నీటి వసతి ఉన్న చోట కూడా ఖర్చులకు డబ్బుల్లేక రైతులు పనులను నిలిపివేశారని ఖమ్మం జిల్లా నివేదికలో పేర్కొన్నారు. ఆర్బీఐ సమాచారం ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లో నవంబర్ 9న మూతపడ్డ గ్రామీణ ప్రాంతాల్లోని 799 ఏటీఎంలలో నేటికి ఒక్కటి కూడా తెరుచుకోలేదు. మరో వారమైనా అవి పని చేస్తాయన్న నమ్మకం కుదరడం లేదని ఏటీఎంలు నిర్వహిస్తున్న ఓ సంస్థ పేర్కొంది.
మున్సిపాలిటీల్లో అదే పరిస్థితి
చిరు వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే చిన్న చిన్న పట్టణాల్లోని లక్షలాది మంది పరిస్థితి దయనీయంగా మారింది. మొదట్లో వారం పాటు ఖాతాదారులకు కనీసం ఐదారు వేలు అందించిన బ్యాంక్లు నవంబర్ 20 తర్వాత నయా పైసా కూడా చెల్లించలేదు. బ్యాంక్లో పొదుపు చేసుకున్న చిరు వ్యాపారులు ఇప్పుడది తీసుకునే దారి లేక పస్తులుండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని జిల్లా కలెక్టర్లు తమ నివేదికల్లో తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో చిరు వ్యాపారాలు చేసే వారికి 15 రోజులుగా ఉపాధి లేకుండా పోయింది. మరో నాలుగైదు రోజుల్లో పట్టణ ప్రాంతాల్లో చాలా ఏటీఎంలు పనిచేస్తాయని రిజర్వుబ్యాంక్ వర్గాలు చెబుతున్నాయి. రూ.500 నోట్లు వచ్చేదాకా పరిస్థితిలో మార్పు ఉండదని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు.