మనువాడతానని మోసం
Published Fri, Aug 26 2016 1:32 AM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
మలేసియా టౌన్షిప్(హైదరాబాద్) : పెళ్లి చేసుకుంటానని యువతిని మోసం చేసిన ఓ వ్యక్తిని కేపీహెచ్బీ పోలీసులు గురువారం కటకటాల్లోకి నెట్టారు. సీఐ కుషాల్కర్ కథనం ప్రకారం... పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణానికి చెందిని అడపా శ్యామ్కుమార్రెడ్డి కేపీహెచ్బీ కాలనీ 6వ ఫేజ్లో నివాసముంటూ ఈవెంట్ ఆర్గనైజర్గా పని చేసేవాడు. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన యువతితో తాను సాఫ్ట్వేర్ ఇంజినీర్నని పరిచయం చేసుకున్నాడు. ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఆమె తన తల్లిదండ్రులకు చెప్పగా వారు శ్యామ్కుమార్రెడ్డితో మాట్లాడారు. రూ.10 లక్షలు కట్నం కావాలని కోరడంతో రూ. 5 లక్షలను వారు అతడికి ముట్టజెప్పి.. మిగతా డబ్బు పెళ్లి సమయంలో ఇస్తామన్నారు. ఆ తర్వాత మనిద్దరికీ పెళ్లి కుదిరిపోయింది కాదా.. అని చెప్పి శ్యామ్కుమార్రెడ్డి యువతిని తనతో సినిమాలు, షికార్లకు తిప్పాడు. ఆరు నెలలుగా పెళ్లి మాట ఎత్తితే దాటేస్తున్నాడు. యువతికి అనుమానం వచ్చి ఆరా తీయగా.. అతడు మరో పెళ్లి చేసుకున్నట్టు తెలిసింది. దీంతో బాధితురాలు మూడు రోజుల క్రితం కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు శ్యామ్కుమార్రెడ్డిని గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
Advertisement
Advertisement