టీడీపీ ఎమ్మెల్యే పైశాచికత్వం
టీడీపీకి చెందిన ఎమ్మెల్యే పైశాచికత్వం ఆకాశాన్నంటుతోంది.
అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కుయుక్తులు
వైఎస్సార్సీపీ నాయకులపై..
అక్రమ కేసుల నమోదుకు అధికారులపై ఒత్తిడి
రేపల్లె(గుంటూరు): టీడీపీకి చెందిన ఎమ్మెల్యే పైశాచికత్వం ఆకాశాన్నంటుతోంది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేయిస్తూ గ్రామాల్లో భయాన వాతావరణాన్ని సృష్టిస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు విధుల నిర్వహణలో అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారుతున్నామని అధికారులు ఆత్మవిమర్శలో పడ్డారు. పుష్కరాల్లో జరిగిన కోట్ల రూపాయల అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు గ్రామాల్లో చిచ్చురేపుతూ ప్రజలను పక్కదోవపట్టించేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఘాట్ సమీపంలో బ్యానర్ కట్టారని...
టీడీపీకి చెందిన ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బ్యానర్లతో పాటు, ఎమ్మెల్యే ఫొటో ఉన్న పసుపు బెలూన్ను పెనుమూడి పుష్కరఘాట్లోని ఆంజనేయస్వామి దేవాలయంపై ఎగరవేశారు. దీంతో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకటరమణారావు బ్యానర్ను ఈనెల 12వ తేదీన పెనుమూడి గ్రామానికి చెందిన పార్టీ నాయకుడు, ఫిషర్ మెన్ నాగిడి వెంకటేశ్వరరావు తన పడవపై ఏర్పాటు చేసి పుష్కర ఘాట్కు దూరంగా ఆవలి ఒడ్డున నిలిపారు. దీంతో వైఎస్సార్ సీపీ నాయకుల బ్యానర్లు పుష్కర ఘాట్ సమీపంలో ఉండటానికి వీలులేదంటూ స్థానిక ఎమ్మెల్యే అదే రోజు సాయంత్రం పడవపై వైఎస్సార్ సీపీ నాయకుడు ఏర్పాటు చేసిన బ్యానర్ను అధికారులతో తొలగించి వేయించారు.
అయితే టీడీపీ బ్యానర్లను అలాగే ఉంచి వైఎస్సార్ సీపీ బ్యానర్ను తొలగిస్తే పక్షపాతమంటూ ప్రజల్లో విమర్శలు వస్తాయని చెప్పిన అధికారులపై ఎమ్మెల్యే దుర్భాషలాడారు. ఆ పరిస్థితుల్లో విధిలేక వైఎస్సార్సీపీ బ్యానర్ను అధికారులు తొలగించారు. దీంతో పాటు పెనుమూడి ఘాట్ రోడ్డులో వైఎస్సార్ సీపీ నాయకులు, అభిమానులు ఏర్పాటు చేసిన మోపిదేవి భారీ కటవుట్ను కొసి వేయటం, ఎమ్మెల్యే నేరుగా వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్కు ఫోన్ చేసి బెదిరించటంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వివాదాలలు సృష్టించి నియోజకవర్గంలో అలజడి సృష్టించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సహనంగా వ్యవహరించాలని, పుష్కర సమయంలో భక్తులకు ఎటువంటి ఆటంకం కలుగకుండా సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగాలని మోపిదేవి సూచిస్తూ ఆ దిశగా ముందుకు సాగారు.
అయినప్పటికీ 12వ తేదీన తన విధులకు ఆటంకం కలిగించారంటూ పెనుమూడి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు నాగిడి వెంకటేశ్వరరావుపై ఈనెల 17వ తేదీన ఆకస్మికంగా తహశీల్దార్ ఎం.నాగిరెడ్డి ఫిర్యాదు చేయటం, మరుసటి రోజు (18వ తేదీ) కేసు నమోదు చేయటం చకచకా జరిగిపోయాయి. దీనిపై తహశీల్దార్ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు. తహశీల్దార్పై ఒత్తిడి తీసుకువచ్చి ఐదురోజుల తరువాత ఫిర్యాదు చేయించటంపై అధికార వర్గల్లో కలకలం మొదలైంది.
ఫిర్యాదు మేరకు కేసు నమోదు..
పెనుమూడి గ్రామానికి చెందిన నాగిడి వెంకటేశ్వరరావు ఈనెల 12వ తేదిన పెనుమూడి పుష్కర ఘాట్ వద్ద ఫెక్సీ ఏర్పాటు చేసి విధులకు ఆటంక పరిచినట్లు ఈనెల 17వ తేదిన తహశీల్దార్ ఎం.నాగిరెడ్డి ఫిర్యాదు చేయటంతో ఈనెల 18వ తేది కేసునమోదు చేయటం జరిగింది.
– ఎన్.సుబ్రమణ్యం, ఎస్ఐ