- రెండు కిడ్నీలూ పాడై.. ప్రాణాపాయంలో ఇంజనీరింగ్ విద్యార్థి
- దాతల సాయం కోసం ఎదురుచూపు
బతుకు పోరాటం
Published Mon, Dec 26 2016 11:22 PM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM
ఇంజనీరై కుటుంబంతో సంతోషంగా గడపాల్సిన యువకుడు. పేద కుటుంబమైనా.. కుమారుడిని ఉన్నత స్థితిలో చూడాలని అతడి తల్లిదండ్రులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. వారి ఆశలపై క‘న్నీళ్లు’ చిమ్మినట్టుగా.. ఆ యువకుడి రెండు కిడ్నీలూ పాడయ్యాయి. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న ఆ కుటుంబం అతడికి వైద్యం చేయించే స్తోమత లేక తల్లడిల్లుతోంది. వివరాల్లోకి వెళితే..
– కంబాలచెరువు (రాజమహేంద్రవరం)
సీతానగరం మండలం రఘుదేవపురానికి చెందిన మహ్మద్ ఇబ్రహీం ఆటోడ్రైవర్. అతడి సంపాదనతోనే కుటుంబం గడుస్తోంది. తమ కుమారుడిని ఇంజనీర్గా చూడాలన్న తపనతో రేయింబవళ్లు శ్రమిస్తున్నాడు. అతడి కుమారుడు 20 ఏళ్ల మహ్మద్ జాఫర్ షాజిద్ దివా¯ŒSచెరువులోని బీవీసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇలాఉండగా ఇటీవల జాఫర్షాజిద్కు తీవ్ర స్థాయిలో వాంతులయ్యాయి. దీందో అతడిని ఆస్పత్రిలో చూపించి, వైద్యుడి సలహా మేరకు వైద్య పరీక్షలు చేయించారు. రెండు కిడ్నీలు పాడైనట్టు నివేదిక వచ్చింది. కిడ్నీ మార్పిడి చేయాలని, ఇందుకు భారీ మొత్తంలో ఖర్చు కాగలదని వైద్యులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్నేహితుల సహకారంతో కొంతమేర వైద్యం చేయించారు. పూర్తి స్థాయిలో వైద్యం అందించాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న విషయం కావడంతో అతడి కుటుంబం దిక్కు తోచని స్థితిలో మథనపడుతోంది. అతడికి క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించాలి. ఎన్టీఆర్ ఆరోగ్య పథకం ఉన్నప్పటికీ.. మందుల ఖర్చులు భరించలేని పరిస్థితి. దాతలు ముందుకువచ్చి తన కుమారుడిని కాపాడాలంటూ తండ్రి ఇబ్రహీం ప్రాథేయపడుతున్నాడు. దాతలు ఎస్బీఐ ఖాతా నం.34524807267(ఐఎఫ్ఎస్సీ : 15366)లో నగదు జమ చేయవచ్చని, 80960 04871 సెల్ నంబర్లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
Advertisement
Advertisement