సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరిట మోసం
► 20 మంది దగ్గర రూ.లక్షలు వసూలు చేసిన ఉద్యోగి
► ఎవరికి చెప్పుకున్నా నాకేం కాదంటూ బెదిరింపులు
పోచమ్మమైదాన్ (వరంగల్): సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు... పెద్దమెుత్తంలో వేతనం.. దీనికోసం చేయాల్సిందల్లా రూ.లక్ష చెల్లించడమే! అంటూ ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగి చెప్పిన మాటలతో పలువురు నిరుద్యోగులు అప్పులు తెచ్చి మరీ డబ్బు చెల్లించారు. ఇప్పుడు ఉద్యోగాలు లేకపోగా.. డబ్బులు సైతం ఇవ్వకుండా బెదిరిస్తుండడంతో ఏం చేయాలో పాలుపోక వారు ఆందోళన చెందుతున్నారు. వరంగల్ జిల్లా ములుగు వెంకటపూర్ మండల విద్యాశాఖ అధికారి ఐలయ్య కుమారుడు చాగర్ల వేణుమాధవ్ హైదరాబాద్లోని ప్రమతి టెక్నాలజీలో గ్లోబల్ అనాలసిస్ట్గా పని చేస్తున్నాడు.
పదో తరగతి నుంచి ఎంటెక్ వరకు చదివితే చాలు.. తమ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మబలికాడు. దీంతో జిల్లాలోని పస్రా, రేగొండ, శాయంపేట, నర్సంపేటకు చెందిన సుమారు 20 మంది గత ఏడాది డబ్బు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో అకౌంట్నంబర్ చెప్పిన వేణుమాధవ్ అందులో జమ చేయాలని సూచించగా నిరుద్యోగులు డబ్బు వేశారు. అప్పటి నుంచి రేపు, మాపు అంటూ సంవత్సర కాలంగా వేణుమాధవ్ గడుపుతుండడంతో సదరు నిరుద్యోగులు ఇటీవల నిలదీశారు. అయితే, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి.. నాకేం కాదంటూ బెదిరించడంతో పాటు ఫోన్ స్విచాఫ్ చేశాడు. దీంతో వారు వేణుమాధవ్ తండ్రి, ఎంఈఓ ఐలయ్య దృష్టికి తీసుకువెళ్లగా ఆయన పట్టించుకోలేదు. దీంతో రూ.20లక్షలకుపైగా ఇచ్చిన నిరుద్యోగులు తమకు జరిగిన మోసం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
దుబాయ్లో ఉద్యోగం ఉందని తీసుకువెళ్లాడు..
నేను డిగ్రీ పాస్ అయ్యాను. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ పెట్టిస్తా అంటే రూ.లక్ష ఇచ్చాను. అయితే, మరో రూ.1.3లక్షలు ఇస్తే దుబాయ్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో అవి కూడా ఇచ్చాను. అయతే, నన్ను దుబాయ్ తీసుకువెళ్లి హోటల్ ఉంచిన వేణుమాధవ్ ఉద్యోగం ఇప్పించలేదు.
– గుర్రల రమేష్, పస్రా
మాది రేగొండ. నీకు తప్పక జాబ్ ఇప్పిస్తానని నమ్మబలికిన వేణుమాధవ్ తన అకౌంట్లో రూ.లక్ష జమ చేయాలని సూచిస్తే వేశాను. నన్ను నమ్ము, తప్పక జాబ్ ఇప్పిస్తాను.. అక్కడ వచ్చే వేతనంతో నీ రూ.లక్ష మూడు నెలల్లో చేతికి అందుతుంది అని చెప్పాడు. ఇప్పుడు సంవత్సరం దాటినా ఉద్యోగం ఇప్పించలేదు. పైగా ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని సమాధానం వస్తోంది.
– రాజేందర్, రేగొండ