
ముంపు వాసులకు తక్షణమే పరిహారం ఇవ్వాలి
పులివెందుల రూరల్/సింహాద్రిపురం : గండికోట ప్రాజెక్టు ముంపు వాసులకు తక్షణమే పరిహారం అందించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ముంపు గ్రామమైన చౌటుపల్లె వాసులు చేపట్టిన ధర్నాకు సంఘీభావం తెలిపేందుకు వెళుతున్న వైఎస్ వివేకాను పోలీసులు దౌర్జన్యంగా కొండాపురం మండలం రేగటిపల్లె వద్ద పోలీసులు అడ్డుకొని సింహాద్రిపురం పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం పోలీస్స్టేషన్ గేటు బయట నేలపై కూర్చొని ధర్నాకు దిగారు. దాదాపు మూడు గంటలపాటు మండు టెండను సైతం లెక్కచేయకుండా పోలీస్స్టేషన్ వద్ద నీరు, అన్నం తీసుకోకుండా ధర్నాకు దిగారు.
టీడీపీ నాయకులు వ్యాఖ్యలు శోచనీయం :
పులివెందుల ప్రాంతానికి సాగునీరు ఇస్తుంటే వైఎస్ఆర్సీపీ అడ్డుకుంటుందని టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు శోచనీయమని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. ధర్నాలో భాగంగా ఆయన మాట్లాడుతూ పులివెందులతోపాటు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి కృష్ణా జలాలు తీసుకు రావడానికి సంకల్పించారు. అలాంటిది ఈ రోజు సాగు నీటిని అడ్డుకుంటున్నామని టీడీపీ నాయకులు చౌకబారు మాటలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. పైడిపాలెంకు 6 టీఎంసీలు, సీబీఆర్కు 8టీఎంసీలు నీటిని విడుదల చేయడంతోపాటు ముంపు వాసులకు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండు చేశారు.
పోలీసుల తీరుపై ప్రజల ఆగ్రహం :
ధర్నా అనంతరం ఎస్ఐ హనుమంతుకు డిమాండుతో కూడిన వినతి పత్రాన్ని మాజీ మంత్రి వైఎస్ వివేకా అందజేశారు. అనంతరం తమ ఇంటికి వెళుతున్నానని చెప్పినా వైఎస్ వివేకాను సీఐ మురళి, ఎస్ఐ హనుమంతులు అడ్డుకున్నారు. దీంతో భారీగా తోపులాటల మధ్య వైఎస్ వివేకా వాహనం దిగి నడుచుకుంటూ వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసుల వైఖరిపై ప్రజలు మండిపడ్డారు. వైఎస్ వివేకా వాహనాన్ని అనుసరిస్తూ పోలీసులు సైతం పులివెందుల వరకు వచ్చారు.
ధర్నాకు తరలి వచ్చిన నాయకులు :
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పోలీస్స్టేషన్కు తరలించారన్న విషయం తెలుసుకొని మండలంలోని పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు సోమశేఖరరెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి బి.ఎన్.బ్రహ్మానందరెడ్డి, మండల అధికార ప్రతినిధి కొమ్మా పరమేశ్వరరెడ్డి, మండల పరిశీలకుడు శివచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ సుధాకర్రెడ్డి, సర్పంచ్లు రామ్మోహన్రెడ్డి, రాజగోపాల్రెడ్డి, సుదర్శన్రెడ్డి, ఎంపీటీసీలు పద్మావతి, కృపాకర్రెడ్డి, బషీర్, ముజుబూర్, నగేష్, మహమ్మద్, రవి, సురేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు భాస్కర్రెడ్డి, కరుణాకర్రెడ్డి, మహేశ్వరరెడ్డి, రమణారెడ్డి, నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు.