
గిరిజన మహిళ దారుణ హత్య
నాగులపల్లిలో ఘటన
నర్సాపూర్ రూరల్: ఓ గిరిజన మహిళ శనివారం దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన నాగులపల్లి వద్ద చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. నాగులపల్లి పంచాయతీ పరిధి తౌర్యా గిరిజన తండాకు చెందిన మెగావత్ విఠల్ భార్య మెగావత్ తార (48) తన కూతురు బుజ్జీ ఇటీవలే కవలల పిల్లలకు జన్మనిచ్చింది. కూతురి కోసం నాగులపల్లిలోని అంగన్వాడి కేంద్రంలో పాలు, గుడ్లు తీసుకునేందుకు శనివారం ఉదయం వచ్చింది. అంగన్వాడీ కేంద్రం నుంచి పాలు, గుడ్లు తీసుకొని నాగులపల్లి పాఠశాల సమీపంలో కర్నాలకుంట శిఖం పక్క నుంచి ఉన్న దారి వెంట వెళ్తుండగా దుండగులు దారికాచి ఆమెను కుంటలో ఉన్న జేసీబీ గుంతలోకి లాక్కెళ్లి కల్లుసీసాతో హత్యచేసినట్లు సంఘటన స్థలాన్ని బట్టి తెలిసింది.
పాఠశాలకు సమీపంలో కర్నాల కుంట ఉండడంతో నాగులపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన కొంతమంది విద్యార్థులు మూత్రవిసర్జకు వెళ్లారు. కుంటలో మహిళ పడి ఉండడం చూసి వెంటనే పాఠశాల ఉపాధ్యాయులకు, గ్రామస్తులకు తెలిపారు. సర్పంచ్ నాగశ్రీజీవన్రెడ్డి నుంచి సమాచారం అందుకున్న ఎస్ఐ వెంకటపతిరాజు, సీఐ తిరుపతిరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కల్లుసీసాతో గొంతు, పలుచోట్ల కిరాతకంగా పొడిచి హత్యచేసినట్టు గుర్తించారు. శవాన్ని నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రి మర్చూరీకి తరలించారు. మృతురాలి భర్త విఠల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని హంతకులకోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టపగలే హత్య జరగడంతో నాగులపల్లితోపాటు తౌర్యతండా గిరిజనులు భయాందోళనకు గురయ్యారు.
మృతురాలికి ఒకే ఒక కూతురు..
మెగావత్ తార, విఠల్ దంపతులకు ఒకే ఒక కూతురు బుజ్జీ. ఆమెను తండాకు చెందిన జగదీష్కు ఇచ్చి వివాహం జరిపించారు. ఇటీవల బుజ్జీ ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. అత్త తార, మామ విఠల్కు సంబంధించిన ఆస్తి కోసమె అల్లుడు జగదీష్ అత్తను హత్య చేసి ఉంటాడని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు సైతం అదే కోణంలో విచారణ చేపడుతున్నట్లు తెలిసింది.