పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటు చేయడం ఓ చారిత్రక పరిణామం అని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు.
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటు చేయడం ఓ చారిత్రక పరిణామం అని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. గురువారం తాడేపల్లిగూడెంలో నిట్ విద్యా కేంద్రానికి కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, వెంకయ్యనాయుడులు శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సుజనా చౌదరి మాట్లాడుతూ... దేశంలో ఎక్కడైనా నిట్ ఏర్పాటు చేస్తే 120 సీట్లే ఇస్తారని... కానీ తాడేపల్లిగూడెంలో నిట్ విద్యా సంస్థకు 420 సీట్లు వచ్చాయని తెలిపారు.
తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటుకు స్థలం ఏర్పాటులో కొంత జాప్యం జరిగిందని ఈ సందర్భంగా సుజనా చౌదరి గుర్తు చేశారు. ఏలూరులో కూడా విద్యా కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామని సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.