వాట్సప్‌..హ్యాట్సాప్‌ | whtsup.. hatsup | Sakshi
Sakshi News home page

వాట్సప్‌..హ్యాట్సాప్‌

Published Sat, Aug 20 2016 11:37 PM | Last Updated on Fri, Jul 27 2018 1:22 PM

వాట్సప్‌..హ్యాట్సాప్‌ - Sakshi

వాట్సప్‌..హ్యాట్సాప్‌

  • సోషల్‌మీడియాలో స్నేహ వారధి 
  • ఒకే క్లిక్‌తో సమాచారం 
  • ఆన్‌లైన్‌ బంధాలు
  • అవసరార్థులకు క్షణాల్లో సాయం
  • వాట్సప్‌.. ఫ్రెండ్స్‌ పిచ్చాపాటిగా చాటింగ్‌ చేసుకునే వేదిక.
    వాట్సప్‌.. సమాజంలోని చెడుపై సమరం చేసేందుకు యూత్‌ ఎంచుకున్న వేదిక.
    వాట్సప్‌.. మన ఊరిలో ఏం జరిగిందో ఆ గ్రూప్‌లో పంచుకునేందుకు ఏర్పాటు చేసుకున్న సమూహ వేదిక.
    వాట్సప్‌.. అవసరార్థులకు సహాయం చేసేందుకు యూత్‌ ఏర్పాటు చేసుకున్న సమాజ వేదిక.
    ఇన్ని వేదికల కలయిక వాట్సప్‌లో వస్తున్న మార్పులు, కరీంనగర్‌ యువత మనోభావాలు తెలుసుకుందాం..
    ముకరంపుర : సోషల్‌ మీడియా సమాచార మార్పిడిలో పెనుమార్పు తీసుకొచ్చింది. మెున్నటి వరకు ఈమెయిల్, ఫేస్‌బుక్‌ హల్‌చల్‌ చేయగా.. ప్రస్తుతం ప్రపంచమంతా వాట్సప్‌ అయిపోయింది. ఒకే భావాలు కలిగిన వ్యక్తులు ఒక గ్రూపుగా చేరిపోయి తమకు నచ్చిన సమాచారాన్ని షేర్‌ చేసుకుంటున్నారు. ఇందులో వ్యక్తిగత క్షేమ సమాచారాలతోపాటు సమాజహితానికి ఉపయోగపడే పనులు సైతం ఆన్‌లైన్‌లోనే చేసేస్తున్నారు. కరీంనగర్‌లోని యూత్‌ బ్లడ్‌ డోనర్‌ గ్రూప్‌ పేరిట ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తం ఏర్పాటు చేస్తున్నారు. ఇలా పలు రకాల గ్రూపులు తమకు చేతనైంది, తమ పరిధిలో సాయం చేస్తూ సమాజానికి మేము సైతం అంటున్నారు వాట్సప్‌ గ్రూప్‌ యూత్‌. గతంలో రోజులు పట్టే సమాచార మార్పిడి ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్‌ పుణ్యమా అని నిమిషాల్లో చేరిపోతోంది. వాట్సప్‌ గ్రూపులు వచ్చాక ఎక్కడ ఉన్నా.. పక్కన ఉన్న భావన కలుగుతుందని యూత్‌ పేర్కొంటుంది. సామాన్య ప్రజలు, యువతే కాదు ఈ వాట్సప్‌ గ్రూపులు ప్రభుత్వ శాఖల్లో సిబ్బంది, అధికారుల మద్య వారధిగా ఉపయోగపడుతుంది.
    అంతా ఆన్‌లైన్‌లోనే
    కొన్నేళ్లకిత్రం పూర్వ విద్యార్థులు ఒక చోటకు రావాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు అపూర్వ సమ్మేళనాలు, కలయికలు నిమిషాల్లో నిర్ణయిస్తున్నారు. ఒంటరి అనే భావనను తొలగిస్తున్నారు. వాట్సప్‌ గ్రూపులు జిల్లా అధికారులు, సిబ్బందితో పాటు పోలీస్‌శాఖలో ఎస్పీ నుంచి ఎస్సై వరకు ఏర్పాటు చేసుకుంటూ నేర నియంత్రణలో వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. రక్తదానం, అవయవదానం తదితర గ్రూపులు ఏర్పాటు చేస్తూ సామాజిక సేవలో యువత ముందుంటోంది. ప్రతి వంద మందిలో 99 మంది వాట్సప్‌ వినియోగదాలు ఉన్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏడాది క్రితం అమెరికాకు చెందిన జాన్‌కోమ్‌ అనే యువకుడు ప్రపంచానికి వాట్సప్‌ను పరిచయం చేశాడు. అప్పటి నుంచి అప్‌డేట్‌ అవుతూ కొత్త ఫీచర్లతో వాట్సప్‌ అప్లికేషన్‌ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. చివరకు వీడియో కాల్స్‌ను త్వరలోనే అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రచారంలో ఉంది.  
    ఫీచర్స్‌
    వాట్సప్‌లో మొన్నటివరకు కేవలం మెసేజ్‌లు, ఫొటోలు మాత్రమే పంపుకునే అవకాశముండేది. ప్రస్తుతం లొకేషన్‌ షేరింగ్, కాంటాక్ట్‌ ఇతర అన్ని రకాల ఫైళ్లను సులభంగా షేర్‌ చేసుకునే వీలు కల్పిస్తోంది. వాయిస్‌ మెయిల్‌ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి చ్చింది. వాట్సప్‌ కాల్‌ చేసిన సందర్భంలో ఎదుటి వ్యక్తి ఆన్‌లైన్‌లో లేకుంటే ఈ ఆప్షన్‌ ద్వారా మిస్డ్‌కాల్‌ మాత్రమే కాకుండా వాయిస్‌ మెయిల్‌ రూపంలోనూ సందేశాన్ని  చేరవేస్తుంది.  ఇందుకోసం కాల్‌ బటన్‌ పక్కనే మైక్‌ బటన్‌ ఉంటుంది. దాన్ని ఒత్తి పట్టుకుని మీరు చేరవేయాల్సిన విషయం చెప్పి సెండ్‌ చేయాల్సి ఉంటుంది.  
    బ్లడ్‌ డోనార్స్‌ గ్రూపు 
    – సోమిడి వేణుప్రసాద్‌
    ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులకు రక్తం ఎక్కించాల్సి వస్తే బ్లడ్‌ డోనార్స్‌ గ్రూప్‌లోకి మెస్సేజ్‌ పెడితే చాలు.. రక్తం సమకూర్చే ప్రయత్నాలు చేస్తున్నాం. 98854 88654కు బ్లడ్‌గ్రూప్, పేషెంట్, ఆస్పత్రి పేరు, ఫోన్‌ నంబర్‌ మెస్సేజ్‌ పెడితే చాలు. రక్తం అందక పలువురు పడ్డ ఇబ్బందులను చూసి ఈ గ్రూప్‌ ఏర్పాటు చేశాం.  
    కనెక్టింగ్‌ పీపుల్‌
    –సీహెచ్‌. దిలీప్‌చారి
    వాట్సప్‌ అంటేనే కనెక్టింగ్‌ పీపుల్‌ అని చెప్పొచ్చు. సోషల్‌ నెట్‌వర్క్‌లు అందుబాటులోకి వచ్చాక చాలా మార్పులు వచ్చాయి. బంధువులు, స్నేహితులు ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండేందుకు ఉపయోగపడుతున్న వాట్సప్‌కు హ్యాట్సాప్‌ చెప్పాలి. కొత్త విషయాలు షేర్‌ చేస్తుండడంతో విజ్ఞానం పెరుగుతుంది. సోషల్‌ రెస్పాన్సిబులిటీ తెలిసి వస్తోంది. వాట్సప్‌ వచ్చాక విదేశాల్లో ఉన్నవారితోనూ ఎప్పుడంటే అప్పుడు చాట్‌ చేస్తున్నాం. ఫొటోలు షేర్‌ చేసుకుని క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నాం.  
     
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement