Social service
-
Saloni Patel: అనుకొని ఈ ఫీల్డ్లోకి రాలేదు.. కానీ అనుకోకుండా?
‘అనుకొని ఈ ఫీల్డ్లోకి రాలేదు. అనుకోకుండా ఎంటర్ అయ్యాను. ఈ జాబ్ రొటీన్గా ఉండదు. నేర్చుకోవడానికి రోజూ ఏదో ఒక కొత్త విషయం ఉంటుంది. కెరీర్లో నేను ఏ ఎక్సయిట్మెంట్నైతే కోరుకున్నానో అది ఈ ఫీల్డ్లో దొరికింది. అందుకే ఇందులో సెటిల్ అయిపోయాను!’ – సలోనీ పటేల్.ఆమె పుట్టింది, పెరిగింది.. న్యూ ఢిల్లీలో. పంజాబీ కుటుంబం. చిన్నప్పుడే కథక్ డాన్స్లో శిక్షణ పొందింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో బీటెక్ చేసింది. చదువైపోగానే టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్)లో జావా డెవలపర్గా పనిచేసింది. కానీ ఎలాంటి ఉత్సాహాన్నివ్వని ఆ ఉద్యోగం ఆమెకు ఆసక్తినివ్వలేదు. అందుకే ఇతర కెరీర్ ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేద్దామనుకుని టీసీఎస్ జాబ్కి రిజైన్ చేసింది.ఉద్యోగం కోసం దరఖాస్తులు పెట్టుకుంటూనే ఎంబీఏ ఎంట్రెన్స్ రాసింది. సీట్ వచ్చింది. బిజినెస్ స్కూల్లో జాయిన్ కావడానికి 6 నెలల టైమ్ ఉండటంతో మళ్లీ ఉద్యోగ అన్వేషణలో పడిపోయింది. ఈలోపే ‘పర్పుల్ థాట్స్’ అనే మోడలింగ్ ఏజెన్సీ నుంచి మోడలింగ్ చాన్స్ వచ్చింది. ఏంబీఏలో జాయిన్ అయ్యేవరకు సరదాగా మోడలింగ్ చేద్దామని ఆ చాన్స్కి ఓకే చెప్పింది.ర్యాంప్ వాక్లు, కొత్తకొత్త వాళ్ల పరిచయం, కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లడం.. ఇవన్నీ మోడలింగ్ మీద సలోనీకి ఇంట్రెస్ట్ను పెంచాయి. మోడలింగ్లోనే కెరీర్ వెదుక్కోవాలని నిశ్చయించుకుంది.మోడలింగ్ షూట్ కోసం ఒకసారి ముంబై వెళ్లినప్పుడు.. అక్కడ యాక్టింగ్, థియేటర్ వర్క్షాప్కి హాజరైంది. నచ్చడంతో థియేటర్లో ట్రైనింగ్ తీసుకుంది. పలు నాటకాల్లో నటించింది. ఆ టైమ్లోనే ప్యార్ విచ్, పీవైటీ (ప్రెటీ యంగ్ థింగ్) మ్యూజిక్ వీడియోల్లో కనిపించింది.సలోనీ థియేటర్ పర్ఫార్మెన్స్ జీటీవీ ‘కోల్డ్ లస్సీ ఔర్ చికెన్ మసాలా’ అనే వెబ్ సిరీస్లో అవకాశాన్నిచ్చింది. ఆ తర్వాత ‘ద హార్ట్బ్రేక్ హోటల్’ అనే వెబ్ సిరీస్, ‘ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్’ అనే షార్ట్ ఫిల్మ్లోనూ నటించింది. సలోనీకి బ్రేక్నిచ్చిన సిరీస్ మాత్రం ఎమ్ఎక్స్ ప్లేయర్లోని ‘క్యాంపస్ డైరీస్’.ఆమె నటించిన మరో షార్ట్ ఫిల్మ్ ‘ద గుడ్ న్యూస్’ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టడమే కాదు పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో స్క్రీన్ అయ్యి, అవార్డులనూ అందించింది.సలోనీ సామాజిక సేవా కార్యకర్త కూడా! ఏమాత్రం సమయం చిక్కినా ముంబైలో జరిగే సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకుంటుంది. కోవిడ్ సమయంలో తన సేవింగ్స్ అన్నిటినీ కోవిడ్ రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేసింది.సలోనీ లేటెస్ట్ వెబ్ సిరీస్లు ‘సన్ఫ్లవర్’ జీ5లో, ‘పాట్లక్’ సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతున్నాయి. -
సమాజానికి అండగా ఉండాలి
వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): సామాజిక సేవలందించే సంస్థలు సమాజానికి మరింత అండగా ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ సూచించారు. అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ తృతీయ వార్షికోత్సవం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పొట్టి శ్రీరాములు చలువాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆవరణలో ఆదివారం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ కృపాసాగర్ మాట్లాడుతూ.. అన్నసంతర్పణ సమితి అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ సేవలను విçస్తృతం చేయాలని సూచించారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ సమరం, వాసవి క్లబ్ గవర్నర్ కొత్త గణేష్బాబు అన్నసంతర్పణ సమితి ట్రస్ట్ సేవలను కొనియాడారు. ట్రస్ట్ అధ్యక్షుడు గుండు దిలీప్, కార్యదర్శి పీఎస్ఆర్ మూర్తి మాట్లాడుతూ.. మూడేళ్లుగా నిర్విరామంగా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. త్వరలో ఒక సత్రంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. అనంతరం సేవలందించిన వలంటీర్లకు ప్రశంసా పత్రాలు అందించారు. -
అమ్మాయిలను కాపాడుకుందాం...
గ్రామీణ మహిళలను నిత్యం కలుస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తూ పరిష్కారాలను సూచిస్తూ మహిళా రైతుల అభివృద్ధికి చేయూతనిస్తున్నారు డాక్టర్ రుక్మిణీ రావు. ఏళ్ల తరబడి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఆమె. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్గానూ, వందకు పైగా మహిళా రైతు సంఘాలతో కూడిన జాతీయవేదిక మకాం సహ వ్యవస్థాపకులుగానూ ఉన్నారు. నారీ శక్తి పురస్కార గ్రహీత, హైదరాబాద్ వాసి, సామాజిక కార్యకర్త రుక్మిణీరావుతో మాట్లాడినప్పుడు స్త్రీ సంక్షేమానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఆమె ఇలా మనముందుంచారు. ‘‘ఒక మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా, ఆపకూడదు, ఆగకూడదు. ఈ రోజుల్లో మన అమ్మాయిలను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మేం తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో 50 గ్రామాల్లోని 8 నుంచి 17 ఏళ్ల వయసు లోపు అమ్మాయిల సంక్షేమానికి గ్రామ్య రిసోర్స్ సెంటర్లో భాగంగా వర్క్ చేస్తున్నాం. మహిళల సంక్షేమానికి కృషి చేద్దామని చేసిన ప్రయత్నంలో ఎన్నో సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల 15–16 ఏళ్ల లోపు అమ్మాయిలు తెలిసిన, తెలియని అబ్బాయిల మాటలు నమ్మి ఇల్లు వదిలి వెళ్లిన ఘటనలను ఎక్కువ చూస్తున్నాం. దీంతో స్కూల్ నుంచి డ్రాపౌట్ అయిన వాళ్లకు, ఇల్లు వదిలి బయటకు వెళ్లిన వాళ్లను తిరిగి వచ్చేలా, కౌన్సెలింగ్స్ చేస్తున్నాం. ఇద్దరు చిన్నపిల్లలను వారి తల్లిదండ్రులు అమ్మడం గురించి తెలిసి మా స్నేహితురాలు జమునతో కలిసి నేనూ అక్కడకు వెళ్లాను. ఆ అమ్మకం కార్యక్రమాన్ని అడ్డుకుని, వారికి సహాయం చేయాలనుకున్నప్పుడు ‘గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్స్’’ని ప్రారంభించాం. ఈ సంస్థకు 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఆరు మండలాల్లో దాదాపు 800 మంది మహిళలు తమ జీవనోపాధిని మెరుగుపరచుకోవడానికి, ఆడపిల్లల పట్ల వారి వైఖరిని పునరాలోచించడానికి వర్క్ చేస్తున్నాం. ఏళ్లుగా ఆడ శిశుహత్యలతో పాటు అంతర్జాతీయ దత్తత ద్వారా కూడా ఆడపిల్లల అక్రమ రవాణాకు విస్తృతమైన నెట్వర్క్ ఉందని కనుక్కొన్నాం. ప్రచార పద్ధతిలో పని చేస్తూ, అనేక అక్రమ దత్తత కేంద్రాలను మూసివేయించాం. వివక్ష లేని చోట పెంపకం నా చిన్నతనంలో మా అమ్మమ్మ, అమ్మ, అత్తల మధ్య పెరిగాను. ఆ విధంగా ఇంటిని నడిపే సమర్థ మహిళల గురించి నాకు తెలుసు. మా ఇంట్లో అబ్బాయిలు, అమ్మాయిలు అనే వివక్ష ఉండేది కాదు. నేను బాగా చదువుకోవాలన్నది అమ్మ ఆలోచన. ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కాలేజీ నుండి సైకాలజీలో మాస్టర్స్ పూర్తి చేశాను. చదువు చెప్పాలనే ఆలోచనతో హైదరాబాద్లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ లో టీచింగ్ చేశాను. ఆ తర్వాత ఢిల్లీలో సైకాలజీలో పీహెచ్డీ చేశాను. 1970 – 1980ల మధ్య వరకు ఢిల్లీలోని నేషనల్ లేబర్ ఇన్స్ స్టిట్యూట్, పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్స్ లో కెరియర్ స్టార్ట్ చేశాను. అప్పుడే జీవితం ఒక మలుపు తీసుకుందనిపిస్తుంది. వరకట్న మరణాలు తీవ్ర సమస్యగా ఉన్న రోజులవి. ఇది సమాజానికే అనారోగ్యం అనిపించేది. మా స్నేహితులతో కలిసి ఎడతెగని చర్చలు జరిపేవాళ్లం. వరకట్న వ్యతిరేక ప్రదర్శనలలో విస్తృతంగా పాల్గొన్నాం. అప్పుడు 1981లో మహిళల కోసం ‘సహేలీ రిసోర్స్’ సెంటర్ను ఏర్పాటు చేశాం. అక్కణ్ణుంచి ఈ మార్గంలో ఏళ్లుగా ప్రయాణిస్తున్నాను. నాతో పాటు ఎన్నో అడుగులు తోడయ్యాయి. సేవా కార్యక్రమాలు చేసేవారితో నేనూ కలుస్తున్నాను. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా... పదేళ్లక్రితం ఒక విషయం మమ్మల్ని కదిలించింది. కౌమార దశలో గ్రామాల్లో ఉన్న అమ్మాయిలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇచ్చారు. దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ మీద ఎవరూ దృష్టి పెట్టలేదు. అక్కడ ఆ అమ్మాయిలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో మేం స్వయంగా చూశాం. దీంతో ఇది సరైన పద్ధతి కాదని మా ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి సుప్రీం కోర్టులో కేసు వేశాం. విదేశాలలో ఒక వ్యాక్సిన్ గురించి నిర్ణయం తీసుకుంటే వాళ్లు సెంటర్ను ఏర్పాటు చేస్తారు. అలాంటిది మన దగ్గర లేదు. ఇప్పుడు వ్యాక్సిన్ ఖరీదు తగ్గిందన్నారు. వ్యాక్సిన్ వేయాలంటున్నారు. డాక్టర్లు చెప్పిన ఆలోచన కూడా బాగుంది. అయితే, ఆ తర్వాత వచ్చే సమస్యలపైన కూడా దృష్టి పెట్టమని, మెడికల్ సిస్టమ్ను కరెక్ట్ చేయమని ప్రభుత్వాలను కోరుతున్నాం. అప్పుడే, ఈ డ్రైవ్ను ముందుకు తీసుకెళితే బాగుంటుంది’’ అని తన అభిప్రాయలను వెలిబుచ్చారు రుక్మిణీరావు. గ్రామీణ మహిళలతో కలిసి... 1989లో ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్కు వచ్చేశాను. పుట్టిపెరిగిన ప్రాంతం, పరిచయమున్న సాంçస్కృతిక నేపధ్యంలో సమర్థంగా పని చేయగలనని భావించాను. న్యాయం కోసం కోర్టులకు వచ్చే మధ్యతరగతి మహిళలకు సహాయం చేయడం ప్రారంభించాం. వారి స్థితి చూశాక ఇంకా ఎంతో చేయాల్సింది ఉందనిపించింది. అక్కణ్ణుంచి గ్రామీణ మహిళల సంక్షేమానికి శ్రద్ధ వహించాల్సిన అవసరం గుర్తించి అటువైపుగా అడుగులు వేశాం. 30 ఏళ్లుగా మహిళా రైతుల హక్కులను ప్రోత్సహించడానికి డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీతో కలిసి పనిచేస్తున్నాను. సంస్థలో మహిళా నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం, వర్క్షాప్ల నిర్వహణ ముఖ్యంగా తీసుకున్నాను. సొసైటీలో డైరెక్టర్, బోర్డ్ మెంబర్గా ఉన్నాను. ఇవి కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న మహిళా రైతులతో ‘మకాం’ అనే వేదిక ద్వారా విస్తృత కార్యక్రమాలు చేస్తున్నాం. రైతు అనగానే ట్రాక్టర్పైన మగవాళ్లు ఉండటమే కనిపిస్తుంది. కానీ, ఇప్పుడు ఆడవాళ్లు కూడా ట్రాక్టర్లు నడపడం, వ్యవసాయం, ఆహార ఉత్పత్తుల తయారీలో అగ్రభాగాన ఉండేలా కృషి చేస్తున్నాం. ఒంటరి మహిళల కోసం సమాఖ్యను ఏర్పాటు చేశాం. ఇందులో సంఘాలున్నాయి. తెలంగాణలోని 10 జిల్లాల నుంచి కో ఆర్డినేషన్ చేస్తున్నాం. లెప్రసీ వ్యాధి అనేది దాదాపుగా కనుమరుగైందని అంతా అనుకుంటున్నారు. కానీ, లెప్రసీతో బాధపడుతున్న వారిని మేం గుర్తించాం. ఈ వ్యాధి ముదరకుండా ముందస్తు నివారణకు సాయం అందిస్తున్నాం. – నిర్మలా రెడ్డి ఫొటో: అనిల్ కుమార్ మోర్ల -
Sadhvi Bhagawati Saraswati: హాలీవుడ్ టు హిమాలయాస్
‘క్షమించకపోతే మీరు గతంలోనే ఉండిపోతారు’ అంటారు సాధ్వి భగవతి సరస్వతి. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ యూదురాలు పాతికేళ్లుగా హృషికేశ్లో జీవిస్తూ ఆధ్యాతికత సాధన చేయడమే కాదు సామాజిక సేవలో విశేష గుర్తింపు పొందారు. ‘ఆధునిక జీవితంలో పరుగు పెడుతున్నవారు ఆనందాలంటే ఏమిటో సరిగ్గా నిర్వచించుకోవాలి’ అన్నారామె. ‘హాలీవుడ్ టు హిమాలయాస్’ పేరుతో వెలువడి బెస్ట్ సెల్లర్గా నిలిచిన తన ఆత్మకథ గురించి ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో మాట్లాడారు. ఆమె ఒక కథతో మొదలెట్టింది. ‘ఒక ఊరిలో కోతుల బెడద ఎక్కువైంది. వాటిని పట్టుకుని అడవిలో వదిలిపెట్టాలి. ఏం చేశారంటే కొబ్బరి బోండాలకి కోతి చేయి పట్టేంత చిన్న చిల్లి చేసి వాటిలో కోతులకు ఇష్టమైన హల్వాను పెట్టారు. కోతులు ఆ హల్వా కోసం లోపలికి చేయి పెట్టి పిడికిలి బిగిస్తాయి. కాని చేయి బయటకు రాదు. కొబ్బరి బోండాంలో ఇరుక్కున్న చేతితో అది ఎక్కువ దూరం పోలేదు. అప్పుడు దానిని పట్టుకుని అడవిలో సులభంగా వదలొచ్చు. ఇక్కడ తెలుసుకోవాల్సిందేమంటే కోతి గనక పిడికిలి వదిలేస్తే చేయి బయటకు వచ్చేస్తుంది. కాని అది వదలదు. హల్వా కావాలి దానికి. మనిషి కూడా అంతే. తనే వెళ్లి జంజాటాల్లో చిక్కుకుంటాడు. పిడికిలి వదిలితే శాంతి పొందుతాడు’ అందామె. హృషికేశ్లోని గంగానది ఒడ్డున పరమార్థ్ ఆశ్రమ్లో గత పాతికేళ్లుగా జీవిస్తున్న సాధ్వి భగవతి సరస్వతి నిజానికి భారతీయురాలు కాదు. భారతదేశంతో ఏ సంబంధమూ లేదు. ఆమె అమెరికాలో జన్మించిన యూదురాలు (అసలు పేరు చెప్పదు). స్టాన్ఫర్డ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చేసి ఆ తర్వాత సైకాలజీలో íపీహెచ్డీ చేసింది. హాలీవుడ్ ఉండే లాస్ ఏంజిలస్లో ఎక్కువ కాలం నివసించిన ఆమె హాలీవుడ్లో పని చేసింది కూడా. కాని 1997లో భర్తతో కలిసి తొలిసారి ఇక్కడకు వచ్చినప్పుడు గంగానది చూసి ఆమె పొందిన ప్రశాంతత అంతా ఇంతా కాదు. ప్రశాంతమైన జీవన విధానం భారతీయ తత్త్వ చింతనలో ఉందని విశ్వసించి అప్పటినుంచి ఇక్కడే ఉండిపోయింది. విచిత్రమేమంటే ఈ దేశ జీవన విధానాన్ని మరచి ఆధునికవేగంలో కూరుకుపోయిన వారికి ఆమె పరిష్కార మార్గాలు బోధిస్తున్నది. సంతోషానికి నిర్వచనం ఏమిటి? ‘బిడ్డ పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు ఆ బిడ్డ సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో చెబుతుంటారు. బాగా చదవాలి, బాగా మార్కులు తెచ్చుకోవాలి, ఈ కోర్సులోనే చేరాలి, ఈ దేశమే వెళ్లాలి, ఫలానా విధంగా పెళ్లి చేసుకోవాలి, ఫలానా విధంగా డబ్బు వెనకేసుకోవాలి... ఇంత ప్రయాస పడితే తప్ప మనిషి సంతోషంగా ఉండలేడన్న భావన తలలో నిండిపోయి ఉంది. అయితే డబ్బు ఎక్కువగా ఉంటే సంతోషంగా ఉండగలమా? సంతృప్తిగా జీవించడంలో సంతోషం ఉంది. జీవితంలో అనుక్షణం సంతోషం పొందడం నేర్చుకోవడం లేదు. ఎప్పుడో ఏదో సంతోషం దొరుకుతుందనే తాపత్రయంతో ఈ క్షణంలోని సంతోషం పొందకుండా మనిషి పరిగెడుతున్నాడు’ అంటుందామె. హాలీవుడ్ను వదిలి సాధారణంగా చాలామంది అమెరికాలో స్థిరపడి సంతోషకరమైన జీవితం గడపాలనుకుంటారు. కాని సాధ్వి భగవతి అమెరికాను విడిచి గంగానది ఒడ్డున ప్రశాంతంగా జీవించడంలో సంతోషం ఉందని ఇక్కడ ఉండిపోయింది. ‘నా భర్త నాకు భారతదేశం గురించి చెప్పాడు. అతనే నన్ను ఇక్కడకు తీసుకొచ్చాడు. కానీ ఒక్కసారి ఇక్కడ గంగానదిని చూశాక, గురువును పొందాక ఇక ఎక్కడికీ వెళ్లకూడదనుకుని ఉండిపోయాను’ అని తెలిపిందామె. ఆధునిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవనంలో తాను ఎందుకు, ఎలా ప్రయాణించిందో తెలిపే ఆత్మకథను ‘హాలీవుడ్ టు హిమాలయాస్’ పేరుతో రాసిందామె. అది బెస్ట్ సెల్లర్గా ఉంది. గత పాతిక సంవత్సరాలుగా హిమాలయాల్లో పేదవారి కోసం సామాజిక సేవ చేస్తున్నదామె. అందుకే అమెరికా ప్రెసిడెంట్ బైడన్ ఆమెను ‘లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు’తో గౌరవించాడు. ఆ పిల్లల కళ్లల్లో నిశ్చింత ‘హిమాలయాలకు మొదటిసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒంటి మీద చొక్కా లేకపోయినా పిల్లల కళ్లల్లో నిశ్చింత చూశాను. లాస్ ఏంజిలస్లో అలాంటి నిశ్చింతతో పిల్లలు ఉండరు. ఆ నిశ్చింత, సంతోషం ఎందుకు పోగొట్టుకుంటున్నాం మనం? ఫిర్యాదులు, ప్రతీకారం, క్షమించకపోవడం... మనల్ని ముందుకు పోనీకుండా చేస్తాయి. ఎదుటివాళ్లు చేసిన తప్పులను మనం అంగీకరించకపోవచ్చు. కాని వాటిని దాటి ముందుకెళ్లాలంటే క్షమించడమే మార్గం. లేదంటే మనం గతంలోనే కూరుకుపోతాం. జీవితానికి ఏం మేలు చేస్తున్నావన్నది కాదు... జీవితం ద్వారా ఏం మేలు పొందుతున్నావన్నదే ముఖ్యం’ అన్నారామె. -
పెడితే రూపాయి రాదని తెలిసీ కోట్లు పెట్టుబడి..!
స్టాక్మార్కెట్ అంటేనే లాభాలకోసం ఎంచుకునే ఒక మార్గం. షేర్లు లేదా ఆఫ్షన్స్ కొనుగోలు చేసినా విక్రయించినా.. ఏదైనాసరే లాభాలే ప్రధానం. అయితే లాభం ఉండదనీ, మనం పెట్టిన డబ్బు తిరిగిరాదని తెలిసీ ఎవరైనా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతారా..! కానీ అందరూ ప్రతిసారి స్వలాభం కోసమే ఆలోచించరు. కాసింత సామాజిక స్పృహ ఉన్నవాళ్లు మాత్రం రూపాయి రాకపోయినా సమాజానికి ఖర్చు చేసేవాళ్లున్నారు. అలాంటి వారికోసం స్టాక్మార్కెట్లో కొత్త విభాగాన్ని ప్రారంభించారు. అదే ‘సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్’. అందులో షేర్లు కొనడం ద్వారా ఎవరైనా విరాళాలు ఇవ్వచ్చు. దానిద్వారా ఇటీవల జెరోధా సంస్థ కోటి రూపాయలు పెట్టింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. వ్యాపార సంస్థలు భవిష్యత్తులో కంపెనీ లాభాల కోసం పెట్టుబడులు సమీకరించేందుకు ఐపీఓకి వెళ్తూంటాయి. ఇప్పుడు సేవాసంస్థలు కూడా తమకు కావలసిన నిధుల కోసం స్టాక్ మార్కెట్కి వెళ్లొచ్చు. బెంగళూరులోని శ్రీ గురువాయూరప్పన్ భజన్ సమాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఉన్నతి ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ యువతకు వృత్తి విద్యల్లో శిక్షణ ఇస్తుంటుంది. కొత్తగా ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న పదివేల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆ తర్వాత వాళ్లు ఉద్యోగాల్లో చేరేలా సహకరించేందుకు ఒక ప్రాజెక్టును సిద్ధం చేసింది. దానికి దాదాపు రెండు కోట్ల రూపాయల దాకా నిధులు అవసరం అయ్యాయి. దాంతో ఆ సంస్థ సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో నమోదుచేసుకుంది. ఎవరినీ నోరు తెరిచి అడగాల్సిన అవసరం లేకుండా ఇరవై రోజుల్లోనే దానికి రూ.కోటీ 80 లక్షలు సమకూరింది. జెరోధా సంస్థ కోటి రూపాయలు, స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారు ఆశిష్ కచోలియా రూ.30లక్షలు, మరో ఇద్దరు చెరో రూ.25 లక్షలు పెట్టుబడి పెట్టారు. ప్రత్యేకంగా ఎందుకంటే.. ప్రత్యక్షంగా దాతలను అభ్యర్థించో, సోషల్ క్రౌడ్ ఫండింగ్ ద్వారానో ప్రభుత్వేతర, లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలు తమ సేవలకు అవసరమైన నిధులను సేకరిస్తుంటాయి. అలాంటప్పుడు ప్రత్యేకంగా ఈ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎందుకనే అనుమానం రావొచ్చు. పైన తెలిపిన కార్యక్రమాలకు చాలా సమయం పట్టొచ్చు, ఆశించిన మొత్తం అందకపోవచ్చు. చాలామంది దాతలకు తాము ఇచ్చే డబ్బు దుర్వినియోగం అవుతుందేమోననే సందేహం ఉంటుంది. ఈ సమస్యలన్నిటికీ సమాధానంగా సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ని ఎంచుకుంటున్నారు. ఇది దాతలకీ స్వచ్ఛంద సంస్థలకీ మధ్య వారధిలా పనిచేస్తుంది. తొలి సంస్థ ‘ఉన్నతి ఫౌండేషన్’.. మన దేశంలో 2019-20 సంవత్సరపు బడ్జెట్లో సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రతిపాదన తెచ్చారు. సామాజిక అభివృద్ధికి పాటుపడే సంస్థలకు పెట్టుబడి మార్కెట్ అందుబాటులో ఉండాలన్నదే దీని ఆశయం. ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ఎక్స్ఛేంజిల్లో అనుమతులు పొంది ఇటీవలే ఆచరణలోకి వచ్చింది. దీని ద్వారా నిధులు పొందిన తొలి సంస్థ ఉన్నతి ఫౌండేషన్. లాభాపేక్ష లేని సంస్థలూ(ఎన్పీఓ), లాభాపేక్ష ఉన్న సామాజిక సంస్థలూ(ఫర్ ప్రాఫిట్ సోషల్ ఎంటర్ప్రైజెస్) ఇందులో నమోదుచేసుకోవచ్చు. పేదరికం, పోషకాహారలోపం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, పర్యావరణ సమస్యలు... తదితర రంగాల్లో సేవలు అందించే సంస్థలు దీన్ని ఉపయోగించుకోవచ్చు. డబ్బు ఇచ్చిన దాతల ఖాతాల్లో జీరోకూపన్ జీరో ప్రిన్సిపల్ పేరుతో బాండ్లను జమచేస్తారు. అవి రికార్డు కోసమే తప్ప మరే లాభమూ ఉండదు. వ్యాపార సంస్థలు ఐపీఓకి వెళ్లినట్లే సేవాసంస్థలు నిధుల సేకరణకు వెళ్తాయన్న మాట. లాభాలు ఇవే.. ఈ విధానం వల్ల అటు దాతలకీ ఇటు లబ్ధిదారులైన సంస్థలకీ ఎన్నో లాభాలున్నాయి. తెలిసిన దాతలనే మళ్లీ విరాళాల కోసం అడగలేక ఇబ్బంది పడే ఎన్జీఓలకు కొత్త దాతలు లభిస్తారు. బహిరంగంగా జరిగే లావాదేవీలు కాబట్టి ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తి పొందుతారు. డబ్బు వినియోగంలో ఎక్కడికక్కడ లెక్కలు పక్కాగా ఉంటాయి. ఏ ప్రయోజనానికి ఖర్చు పెడుతున్నారో చెప్పాలి, గడువు లోపల ఖర్చు పెట్టాలి, ఏటా ఆడిట్ నివేదికలు సమర్పించాలి... కాబట్టి లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉంటాయి. దాతలు తామిచ్చిన ప్రతి రూపాయీ సద్వినియోగమైందని నిర్ధారించుకోవచ్చు. సామాజిక మార్పులో భాగస్వాములమయ్యామన్న తృప్తి ఉంటుంది. స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాల పట్ల నమ్మకమూ పెరుగుతుంది. ఆయా స్వచ్ఛంద సంస్థలూ మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తాయి. నిధులకు ఇబ్బంది ఉండదు కాబట్టి సేవల పరిధినీ విస్తరించుకోవచ్చు. ఇదీ చదవండి: 2024 పారిశ్రామిక పద్మాలు.. వీరే! అయితే యాభై లక్షలు, అంతకన్నా ఎక్కువ మొత్తం అవసరమైనప్పుడే ఈ విధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. దాతలు కనిష్ఠంగా పదివేల నుంచి విరాళం ఇవ్వచ్చు. దాతలకు పన్ను మినహాయింపు వెసులుబాటు ఉంటుంది. -
పల్లెకు పోదాం.. ప్రజాసేవ చేద్దాం!
సాక్షి, అమరావతి: ‘దేశానికి పల్లె సీమలే పట్టుగొమ్మలు’ అనే నానుడిని నిజం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుంబిగించాయి. గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం ప్రగతి పథంలో పయనించినట్టే. ఈ నేపథ్యంలో గ్రామాలను అభివృద్ధి చేయడానికి యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలను ప్రభుత్వం రంగంలో దింపుతోంది. ఉన్నత భారత్ అభియాన్ పేరుతో గ్రామాల్లో సామాజిక సేవలో పాలుపంచుకునేలా వర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలను భాగస్వాములను చేస్తోంది. ఇప్పటివరకు మన రాష్ట్రంలో 129 విద్యా సంస్థలు గ్రామాలను దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చాయి. ఒక్కో సంస్థ ఐదు చొప్పున 645 గ్రామాలను దత్తత తీసుకున్నాయి. గ్రామాల్లో ప్రభుత్వం నిర్దేశించుకున్న ఆరు ప్రాధాన్యత రంగాల్లో విద్యా సంస్థలు తోడ్పాటు అందిస్తున్నాయి. ఇలా గ్రామాలను దత్తత తీసుకుంటూ పల్లె సేవలో భాగస్వాములవుతున్న సంస్థలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున గ్రాంట్ అందిస్తోంది. 50 వేల విద్యా సంస్థలు.. 2.5 లక్షల పంచాయతీలు.. పరిశోధన ఫలాలు, ప్రభుత్వ పథకాలను సమన్వయపరుస్తూ సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ద్వారా గ్రామీణాభివృద్ధికి బాటలు వేయడమే ఉన్నత భారత్ అభియాన్ లక్ష్యం. దేశవ్యాప్తంగా 2023 నాటికి 50 వేల విద్యాసంస్థలను ఇందులో భాగస్వాములను చేయడం, వీటితో 2.5 లక్షల గ్రామ పంచాయతీలను అనుసంధానించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఈ సంయుక్త ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో ఐఐటీ ఢిల్లీ, రాష్ట్ర స్థాయిలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ సమన్వయ సంస్థలుగా వ్యవహరిస్తున్నాయి. ఆరు ప్రాధాన్యతా రంగాల్లో.. 129 విద్యా సంస్థలు ఆయా గ్రామాల్లో సురక్షిత మంచినీరు, ఆరోగ్యం–పరిసరాల పరిశుభ్రత, వ్యవసాయం, గ్రామీణ చేతివృత్తులు, స్త్రీ శిశు సంక్షేమం, గ్రామీణ మౌలిక వసతుల కల్పన వంటి ఆరు ప్రాధాన్యతా రంగాల్లో సౌకర్యాల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వ తోడ్పాటుతో కృషి చేస్తాయి. ఈ 129 విద్యాసంస్థలకు చెందిన 1.93 లక్షల మంది విద్యార్థుల ద్వారా దత్తత తీసుకున్న 645 గ్రామాల్లో పెద్దఎత్తున సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. నూతన ఆవిష్కరణల ఫలాలు, పరిశోధన ఫలితాల ద్వారా పల్లె ప్రగతికి బాటలు వేస్తున్నారు. జాతీయ స్థాయికి ఎంపికైన మూడు ఆవిష్కరణలు పల్లె ప్రగతిలో కీలకంగా మారే నూతన ఆవిష్కరణలను జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తారు. ఇవి పెట్టుబడులను ఆకర్షించినట్లైతే అందుకు అవసరమైన తోడ్పాటును జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా అందిస్తారు. గ్రామీణాభివృద్ధికి తోడ్పాటునందించే ఆవిష్కరణలను వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసి.. వచ్చే లాభాల్లో రాయల్టిని ఆయా విద్యాసంస్థలు, విద్యార్థులకు చెల్లిస్తారు. ఇలా ఇప్పటివరకు తిరుపతి ఐఐటీ విద్యార్థులు తాగునీటిని శుద్ధి చేసేందుకు రూపొందించిన కెపాసిటివ్ డీఅయోనైజేషన్ పరికరం, వైఎస్సార్ జిల్లా మనూ పాలిటెక్నిక్ విద్యార్థులు.. చేతివృత్తులు వారు సహజ ఉత్పత్తులు తయారీ చేసేందుకు అభివృద్ధి చేసిన నూతన సాంకేతికత, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించిన సోలార్ మొబైల్ చార్జర్ వంటి ఆవిష్కరణలను జాతీయ స్థాయి పరిశీలనకు పంపించారు. వీటితో పాటు మరో ఏడు విద్యాసంస్థలు కూడా నూతన సాంకేతికతలను అభివృద్ధి చేశాయి. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సాంకేతిక నైపుణ్యం.. https://unnatbharatabhiyan.gov.in ద్వారా నమోదైన విద్యాసంస్థలు జిల్లా కలెక్టర్కు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. నమోదు ప్రక్రియ పూర్తి కాగానే, ముందు ప్రాంతీయ సమన్వయ సంస్థ, ఆ తర్వాత జాతీయ సమన్వయ సంస్థ వివరాలు తనిఖీ చేసి ఆమోదముద్ర వేస్తాయి. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఆ విద్యాసంస్థకు రూ.10 లక్షల గ్రాంటు మంజూరు చేస్తారు. ఈ మొత్తాన్ని గ్రామాలను గుర్తించడం, అక్కడ పర్యటించడం, సమస్యలను అధ్యయనం చేయడం వంటి కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా ఆయా పల్లెలకు ఉపయోగపడేలా చేపట్టే పరిశోధనలకు కూడా వాడుకోవచ్చు. దత్తత గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలకు అవసరమయ్యే మద్దతును వివిధ శాఖల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. దత్తత తీసుకున్న పల్లెల్లో స్థానిక ప్రాధాన్యాల గుర్తింపు, సాంకేతికత బదిలీ వంటి కీలక అంశాల్లో సహకరిస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సాంకేతిక నైపుణ్యం, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు కూడా పెంపొందుతాయి. ఆయా విద్యా సంస్థల నుంచి ఉత్తీర్ణులయ్యేనాటికి మంచి నైపుణ్యాలను పొందుతారు. నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు ఉన్నత భారత్ అభియాన్ ప్రాజెక్టులో భాగస్వాములయ్యేందుకు పెద్ద ఎత్తున విద్యాసంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా అవి అభివృద్ధి చేసే నూతన ఆవిష్కరణలను నేరుగా పల్లెలకు తీసుకెళ్తున్నాయి. ఇప్పటికే 129 విద్యాసంస్థలు నమోదయ్యాయి. వీటి నుంచి 1.93 లక్షల మంది విద్యార్థులు భాగస్వాములయ్యారు. 645 గ్రామ పంచాయతీల్లో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ప్రాధాన్యతా రంగాల్లో ప్రగతికి బాటలు వేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటు అభినందనీయం. – ప్రొ.సర్జన్ రెడ్డి, కేంద్ర సమన్వయకర్త, ఉన్నత్ భారత్ అభియాన్ -
విలేజ్ పంచాయతీ ప్రెసిడెంట్: వీరమ్మాళ్ @ 89
‘సేవకు వయసుతో పని ఏమిటి?’ అంటోంది 89 సంవత్సరాల వీరమ్మాళ్. ఈ బామ్మ తమిళనాడులోని అరిట్టపట్టి గ్రామ పంచాయితీ ప్రెసిడెంట్. రకరకాల కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే వీరమ్మాళ్ తన ఆరోగ్య రహస్యం ‘నిరంతర కష్టం’ అంటోంది... మామూలుగానైతే బామ్మల మాటల్లో ‘మా రోజుల్లో’ అనేది ఎక్కువగా వినబడుతుంది. అది ఆ వయసుకు సహజమే కావచ్చుగానీ 89 సంవత్సరాల వీరమ్మాళ్ ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటుంది. నలుగురితో కలిసి నడుస్తుంది. వారి కష్టసుఖాల్లో భాగం అవుతుంది. వీరమ్మాళ్ విలేజ్ ప్రెసిడెంట్గా ఉన్న మధురైలోని అరిట్టపట్టి గ్రామాన్ని తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర తొలి బయో డైవర్శిటీ సైట్గా ఎంపిక చేసింది. అరిట్టపట్టిలో పుట్టి పెరిగి అక్కడే వివాహం అయిన వీరమ్మాళ్కు ఆ గ్రామమే ప్రపంచం. అలా అని ‘ఊరి సరిహద్దులు దాటి బయటకు రాదు’ అనే ముద్ర ఆమెపై లేదు. ఎందుకంటే గ్రామ సంక్షేమం, అభివృద్ధి కోసం ఉన్నతాధికారులతో మాట్లాడడానికి పట్టణాలకు వెళుతూనే ఉంటుంది. ‘ఫలానా ఊళ్లో మంచిపనులు జరుగుతున్నాయి’ లాంటి మాటలు చెవిన పడినప్పుడు పనిగట్టుకొని ఆ ఊళ్లకు వెళ్లి అక్కడ అమలు చేస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేస్తుంటుంది. తన గ్రామంలో అలాంటి కార్యక్రమాలు అమలయ్యేలా కృషి చేస్తుంటుంది. ‘స్త్రీలకు ఆర్థిక స్వాతంత్య్రం’ అనే మాట గట్టిగా వినిపించని రోజుల్లోనే స్వయం–సహాయక బృందాలను ఏర్పాటు చేసి గ్రామంలోని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేది. రైతులకు వ్యవసాయ రుణాలు అందేలా ఆఫీసుల చుట్టూ తిరిగేది. మహిళలు గడప దాటి వీధుల్లోకి వస్తే... ‘ఇదేం చోద్యమమ్మా’ అని గుసగుసలాడుకునే కాలం అది. వీరమ్మాళ్ మాత్రం గ్రామంలోని రకరకాల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో ఊళ్లు తిరిగేది. ఎవరు ఎలా మాట్లాడుకున్నా పట్టించుకునేది కాదు. ఆమె దృష్టి మొత్తం సమస్యల పరిష్కారంపైనే ఉండేది. విలేజ్ ప్రెసిడెంట్గా వాటర్ ట్యాంకులు, వాగులు దాటడానికి వంతెనలు నిర్మించింది. జల్ జీవన్ మిషన్ కింద ఎన్నో ఇండ్లకు తాగునీరు అందేలా చేసింది. వీధిలైట్ల నుంచి వీధుల పరిశుభ్రత వరకు అన్నీ దగ్గరి నుంచి చూసుకుంటుంది. అలా అని ఊళ్లో అందరూ వీరమ్మాళ్కు సహకరిస్తున్నారని కాదు. ఎవరో ఒకరు ఏదో రకంగా ఆమె దారికి అడ్డుపడుతుంటారు. వారి నిరసన వెనక రాజకీయ కారణాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతూనే ఉంటుంది. అలాంటి వారికి వీరమ్మాళ్ తరపున గ్రామస్థులే సమాధానం చెబుతుంటారు. గ్రామంలో వృథాగా పడి ఉన్న భూములను వినియోగంలోకి తీసుకువచ్చే విషయంపై దృష్టి పెట్టింది వీరమ్మాళ్. ‘పనికిరాని భూమి అంటూ ఏదీ ఉండదు. మనం దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటున్నామా, వృథాగా వదిలేస్తున్నామా అనే దానిపైనే ఆ భూమి విలువ ఆధారపడి ఉంటుంది’ అంటుంది వీరమ్మాళ్. ‘వీరమ్మాళ్ అంకితభావం గురించి ఆ తరం వాళ్లే కాదు ఈ తరం వాళ్లు కూడా గొప్పగా చెబుతుంటారు. గ్రామ అభివృధ్ధికి సంబంధించి ఎంతోమందికి ఆమె స్ఫూర్తి ఇస్తుంది’ అంటున్నాడు అరిట్టపట్టి విలేజ్ ఫారెస్ట్ కమిటీ హెడ్ ఆర్’ ఉదయన్. రోజూ ఉదయం అయిదు గంటలకు నిద్ర లేచే వీరమ్మాళ్ వంటపని నుంచి ఇంటి పనుల వరకు అన్నీ తానే స్వయంగా చేసుకుంటుంది. పొలం పనులకు కూడా వెళుతుంటుంది. ‘బామ్మా... ఈ వయసులో ఇంత ఓపిక ఎక్కడిది?’ అని అడిగితే– ‘నా గ్రామం బాగు కోసం నా వంతుగా కష్టపడతాను... అని అనుకుంటే చాలు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. అదే శక్తిగా మారి ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేవుడు నన్ను ఈ భూమి మీది నుంచి తీసుకుపోయే లోపు గ్రామ అభివృద్ధి కోసం నేను కన్న కలలు సాకారం కావాలని కోరుకుంటున్నాను’ అంటుంది వీరమ్మాళ్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ సుప్రియ సాహు అరిట్టపట్టి గ్రామానికి వచ్చి బామ్మను కలుసుకుంది. ‘వీరమ్మాళ్ బామ్మతో మాట్లాడడం, ఆమె నోటి నుంచి గ్రామ అభివృద్ధి ప్రణాళికల గురించి వినడం అద్భుతమైన అనుభవం’ అంటుంది సుప్రియ. -
టీసీఎస్ ఉద్యోగుల సరికొత్త రికార్డ్..
టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (TCS) ఉద్యోగులు సరికొత్త రికార్డు సృష్టించారు. జీతాలు, బోనస్లు కాదు.. సామాజిక సేవలో. ఐటీ ఉద్యోగులు అంటే ఎప్పుడూ లక్షల్లో జీతాలు.. పని ఒత్తిడి.. ఇవే కాదు.. టీసీఎస్ ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందున్నారు. 22 లక్షల గంటలు టీసీఎస్ ‘హోప్’ పేరిట ఉద్యోగులతో ప్రపంచవ్యాప్తంగా అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం కింద 2023 ఆర్థిక సంవత్సరంలో 2.2 మిలియన్ గంటలు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారి సహకారంతో టీసీఎస్ వాలంటీర్ల పరంగా ప్రపంచంలోనే నంబర్ వన్ కంపెనీ హోదాను సాధించిందని కంపెనీ పేర్కొంది. హోప్ చొరవలో భాగంగా టీసీఎస్ తన ఉద్యోగులు ప్రతి త్రైమాసికంలో 1 మిలియన్ గంటలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా #millionhoursofpurpose అనే కార్యక్రామాన్ని ప్రారంభించింది. ఉద్యోగులు కూడా ఈ సవాల్ను స్వీకరించి లక్ష్యాన్ని గణనీయమైన తేడాతో అధిగమించారు. ఒక్క నాలుగో త్రైమాసికంలోనే 2 మిలియన్ గంటల పాటు సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొని కొత్త రికార్డును సృష్టించారు. సేవా కార్యక్రమాలు ఇవే.. సామాజిక సేవాకార్యక్రమాల్లో భాగంగా వాతావరణ సంబంధమైన మొక్కల పెంపకం, ఇంధన సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ, క్లీనప్ డ్రైవ్లు, ఆరోగ్యానికి సంబంధించి మానసిక ఆరోగ్య అవగాహన, రక్తదానం, రోడ్డు భద్రత డ్రైవ్లను టీసీఎస్ ఉద్యోగులు నిర్వహిస్తుంటారు. అలాగే పేదరిక నిర్మూలనలో భాగంగా ఆహారం, దుస్తలు, పుస్తకాలు, బొమ్మల పంపిణీ, నైపుణ్యాలను పెంపొందించేలా వయోజన అక్షరాస్యత, నైపుణ్యం, యువత ఉపాధికి మార్గదర్శనం వంటివి చేస్తున్నారు. ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా 1.25 మిలియన్ల మంది జీవితాలను ప్రభావితం చేశాయని కంపెనీ పేర్కొంది. ఇదీ చదవండి: No Work From Home: ఇన్ఫోసిస్ మొదలుపెట్టేసింది.. ఉద్యోగులు ఇక ఇల్లు వదలకతప్పదు! -
ఆమె సేవ అనూహ్యం
లక్నో: ఈ ఫొటోలో మహిళ పేరు వర్ష వర్మ. వయసు 44 సంవత్సరాలు. ఉత్తరప్రదేశ్లో లక్నోకు చెందిన ఆమెలో సమాజానికి ఏదో ఒక విధంగా సేవ చేయాలనే తపన ఉంది. దీంతో అయిదేళ్లుగా ఎవరూ చేయలేని ఒక అనూహ్యమైన పనికి పూనుకున్నారు. ఏక్ కోషిస్ ఏసీ భీ అనే సంస్థను స్థాపించి మార్చురీల్లో గుర్తు పట్టని మృతదేహాలకు శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారం జరిపిస్తున్నారు. దీనివల్ల మరణించిన వారిని గౌరవంగా పైలోకాలకు పంపిస్తున్నట్టుగా ఆమె భావిస్తున్నారు. 72 గంటల సేపు మృత దేహం కోసం కుటుంబ సభ్యులెవరూ రాకపోతే స్థానిక అధికారులు ఆమెకే చెబుతారు. ఇలా వారానికి సగటున మూడు మృతదేహాలకు వర్ష అంతిమ సంస్కారం నిర్వహిస్తున్నారు. ప్రపంచం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయిన వారికి గౌరవప్రదంగా వీడ్కోలు పలకాలని వర్ష చెబుతున్నారు. -
జలకళ తీసుకువచ్చింది
బ్యాంకింగ్ రంగంలో క్షణం తీరిక లేని పనుల్లో ఉండేది వేదిక భండార్కర్. ఆ ఊపిరి సలపని పనుల్లో ఆమెకు కాస్త ఉపశమనం సామాజికసేవ. బ్యాంకింగ్ రంగాన్ని వదిలి సామాజికసేవా రంగం దారిని ఎంచుకున్న వేదిక... ‘సామాజిక సేవ మనకు వినయాన్ని నేర్పుతుంది. మనుసులో నుంచి మానవత్వ భావన పోకుండా కాపాడుతుంది. మరిన్ని మంచి పనులు చేయాలనే ఉత్సాహాన్ని ఎప్పుడూ ఇస్తుంది’ అంటోంది... ‘సామాజిక సేవారంగంలో పనిచేస్తానని కలలో కూడా అనుకోలేదు’ అంటుంది ముంబైకి చెందిన వేదిక భండార్కర్. ‘స్టార్ బ్యాంకర్’గా పేరు తెచ్చుకున్న వేదిక జేపీ మోర్గాన్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ హెడ్గా పనిచేసింది. ఆ తరువాత మరో కంపెనీలో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో పనిచేసింది. తన వృత్తిపనుల్లో తలమునకలయ్యే వేదిక తొలిసారిగా ముంబైలోని ‘జై వకీల్ ఫౌండేషన్’తో కలిసి పనిచేసింది. ఆ తరువాత ‘దస్రా’ అనే స్వచ్ఛందసంస్థతో కలిసి జార్ఖండ్, బిహార్ గ్రామీణ ప్రాంతాలలో మహిళలు, బాలికల విద్య, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంది. ‘అపుడప్పుడు’ అన్నట్లుగా ఉండే ఆమె సామాజికసేవలు ఆతరువాత నిత్యకృత్యం అయ్యాయి. అలాంటి సమయంలోనే తమ సంస్థకు ఇండియాలో సారథ్యం వహించమని ‘వాటర్.ఆర్గ్’ నుంచి పిలుపు వచ్చింది. మిస్సోరీ (యూఎస్) కేంద్రంగా పనిచేసే స్వచ్ఛందసంస్థ ‘వాటర్.ఆర్గ్’ సురక్షిత నీరు, జలసంరక్షణ, పారిశుద్ధ్యంకు సంబంధించి ఎన్నో దేశాల్లో పనిచేస్తోంది. ఆ సంస్థ నుంచి ఆహ్వానం అందినప్పుడు నిరాకరించడానికి వేదికకు ఏ కారణం కనిపించలేదు. ఒప్పుకోవడానికి మాత్రం చాలా కారణాలు కనిపించాయి. అందులో ప్రధానమైనది... ‘పేదప్రజలకు సేవ చేసే అవకాశం దొరుకుతుంది’ ‘వాటర్.ఆర్గ్’ సారథ్య బాధ్యతలు చేపట్టే ముందు నీటి సంక్షోభం గురించి లోతుగా అధ్యయనం చేసింది వేదిక. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ వో) గణాంకాల ప్రకారం సురక్షితమైన నీటి సౌకర్యానికి నోచుకోని ప్రజలు కోట్లలో ఉన్నారు. నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు మహిళలు. నీటి కోసం గంటల కొద్దీ సమయాన్ని వెచ్చించక తప్పని పరిస్థితుల వల్ల ఆ సమయాన్ని ఇతర ప్రయోజనకర పనులకోసం కేటాయించలేకపోతున్నారు. ‘మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా దృష్టి పెడతాను’ అంటున్న వేదిక ఆ సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తోంది. మరుగుదొడ్లు నిర్మించుకోవడం నుంచి వాటర్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకోవడం వరకు ‘వాటర్.ఆర్గ్’ ద్వారా సహాయపడుతోంది. ఒకసారి క్షేత్రపర్యటనలో భాగంగా కర్ణాటకలోని ఒక గ్రామానికి వెళ్లింది వేదిక. ఒక మహిళ తన పదకొండు సంవత్సరాల కూతురు గురించి చెప్పింది. ఆ అమ్మాయి చదువుకోడానికి వేరే ఊళ్లో బంధువుల ఇంట్లో ఉంటుంది. అయితే బడికి సెలవులు వచ్చినా ఆ అమ్మాయి ఇంటికి రావడానికి మాత్రం ఇష్టపడడం లేదు. దీనికి కారణం వారి ఇంట్లో టాయిలెట్ సౌకర్యం లేకపోవడం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మహిళ టాయిలెట్ నిర్మించుకోవడానికి సహకరించింది వేదిక. ఆ గృహిణి కళ్లలో కనిపించిన మెరుపును దగ్గర నుంచి చూసింది. ‘బ్యాంకర్గా క్లయింట్స్ ఆదాయం ఒక స్థాయి నుంచి మరో స్థాయి పెరగడానికి కృషి చేశాను. ఇప్పుడు...తమకున్న వనరులతోనే సౌకర్యవంతమైన జీవితం ఎలా గడపవచ్చు అనే విషయంలో సామాన్య ప్రజలతో కలిసి పనిచేస్తున్నాను’ అంటుంది వేదిక. ఒకప్పుడు ‘స్టార్ బ్యాంకర్’గా బ్యాంకింగ్ రంగంలో ఎన్నో విజయాలు సాధించిన వేదిక భండార్కర్ ఇప్పుడు ‘నీటిని మించిన అత్యున్నత పెట్టుబడి ఏదీ లేదు’ అంటూ జలసంరక్షణపై ఊరూరా ప్రచారం చేస్తోంది. -
అక్షర స్వరం
‘రచన చేయడం అంటే తెలుసుకోవడం కూడా’ అనే మాట ‘రైజింగ్ ఫ్రమ్ ది యాషెస్’ పుస్తక రచన కోసం కలం పట్టినప్పుడు కృతిక పాండేకు అనుభవంలోకి వచ్చింది. ఈ పుస్తకం మనల్ని బాధితుల ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. ఈ పుస్తక ప్రయాణం సానుభూతి కోసం కాదు. ‘మనలో వారి పట్ల చిన్న చూపు ఉంటే మార్చుకుందాం’ అని చెప్పడం. ‘వారితో కలిసి నడవండి’ అని చెప్పడం. ‘విజేతలకు కష్టాలు అడ్డు కాదు’ అనే సత్యాన్ని గుర్తు చేయడం... అవమానాలు, అనుమానాలు, లింగవివక్ష, వేధింపులు, గృహహింసలు... స్త్రీలు ఎదుర్కొనే సకల సమస్యలకు సమాధానం చెబుతుంది ‘రైజింగ్ ఫ్రమ్ ది యాషెస్: ఎ జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్’ పుస్తకం. ఇది కాల్పనిక ఊహల సమాహారం కాదు. నిజజీవితానికి చెందిన కథ. నిమృత్కు చిన్నప్పటి నుంచి మూర్ఛ సమస్య ఉంది. ఆ సమస్య తనను నీడలా వెంటాడింది. ‘ఈ సమస్యతో స్కూల్కు ఎలా పంపుతాం?’ ‘ఫ్రెండ్స్తో సినిమాకు వెళతావా? అక్కడ పడిపోతే ఎవరు చూస్తారు?’ పెళ్లి వయసులోనూ ఆ సమస్య ముందుకు వచ్చింది. ‘మీ అమ్మాయికి మూర్ఛ సమస్య ఉందా? ముందే చెప్పి బతికించారు’ అని వెనక్కి తిరిగి వెళ్లిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. నిమృత్కు పెళ్లి జరగడం అనేది అతి కష్టం అనుకునే సందర్భంలో తన సమస్య తెలిసి కూడా ఒక కుటుంబం పెళ్లికి ఒప్పుకుంది. ‘మూర్ఛ’ కారణంగా సంసార జీవితంలో ఒడిదొడుకులు మొదలయ్యాయి. అయితే ముందు కనిపిస్తున్న ముండ్లబాటను చూసి భయపడలేదు నిమృత్. అక్కడే ఆగిపోయి ఉంటే, వెనుతిరిగి ఉంటే ఆమె జీవితం ఈ పుస్తకంలోకి వచ్చేది కాదు. సమస్యను సవాలు చేసి ముందుకువెళ్లింది. కష్టాలను తట్టుకొని నిలబడింది. ప్రపంచం గుర్తుంచుకోదగిన అసాధారణ విజయలేమీ ఆమె సాధించకపోవచ్చు. అయితే తన జీవితాన్ని జయించింది. కష్టాల్లో ఉన్నవారికి స్ఫూర్తిని ఇచ్చింది. తనలాంటి వారెందరికో ధైర్యాన్ని ఇస్తోంది. ‘ఆరోగ్య స్థితిని బట్టి ఎవరూ నిర్లక్ష్యానికి గురి కావద్దు. వారికి సహాయంగా నిలవండి. వారి అడుగులు ముందుకు పడడానికి సహకరించండి’ అని ఈ పుస్తకం సందేశం ఇస్తుంది. కృతిక పాండే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం హెడ్గా పనిచేస్తోంది. బెంగళూరులో గ్రాడ్యుయేషన్ చేసిన కృతిక దిల్లీలో డిజిటల్ మార్కెటింగ్ కోర్సు చేసింది. డెహ్రడూన్కు చెందిన కృతిక ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు, స్త్రీ సాధికారతకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ఈ పుస్తకం అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తాన్ని దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేస్తున్న బెంగళూరులోని ‘మిత్ర జ్యోతి ట్రస్ట్’కు ఇవ్వనుంది కృతిక. -
సుధామూర్తికి పద్మభూషణ్.. అత్తపై బ్రిటన్ ప్రధాని ప్రశంసలు
సుధామూర్తి.. భారతీయులకు పరిచయం అక్కర్లేని వ్యక్తి. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి సతీమణిగానే కాకుండా రచయిత్రి, విద్యావేత్త సామాజిక వేత్తగా అందరికీ సుపరిచితురాలే. తన కోసం మాత్రమే కాకుండా సమాజం కోసం ఆలోచించే వారు అతి తక్కువమంది కనిపిస్తుంటారు. అలాంటి వారిలో సుధామూర్తి ముందువరుసలో ఉంటారు. వేల కోట్లకు అధినేత అయినా.. సింప్లీ సిటీకి మారుపేరులా ఉంటారు. కంప్యూటర్ ఇంజనీర్గా జీవితాన్ని ప్రారంభించి ఇన్ఫోసిస్ ఫౌండేషన్,. గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాలలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే పలు అనాథాశ్రయాలను ప్రారంభించిన ఆమె.. గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగాల్లో సేవలందింస్తున్నారు. కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి పేద విద్యార్థులు కూడా ఉచితంగా కంప్యూటర్ జ్ఞానాన్ని పొందగలిగేందుకు తోడ్పడుతున్నారు. సుధామూర్తి సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి ఇటీవల భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషన్ అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. తల్లికి దక్కిన గౌరవంపై మురిసిపోతూ ఆమె కూతురు, యూకే ప్రధాని రిషి సునాక్ భార్య అక్షత మూర్తి ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టారు. రాష్ట్రపతి నుంచి మా అమ్మ పద్మభూషన్ను అందుకుంటున్న క్షణాలను చూసి ఎంతో గర్వంగా ఫీల్ అయ్యానని అన్నారు. సమాజం కోసం చేసిన సేవకు ఆమెకీ అవార్డు దక్కిందని చెప్పుకొచ్చారు ‘25 సంవత్సరాలుగా స్వచ్చంద సంస్థలను ఏర్పాటు చేసి అక్షరాస్యతను పెంపొందించడానికి వివిధ కార్యక్రమాలలు నిర్వహిస్తుంది. ఆమె జీవితం నాకొక ఉదాహరణ. ఎలా జీవించాలో తనను చూసి నేర్చకున్నాను. గుర్తింపుకోసం అమ్మ ఎప్పుడూ ఎదురు చూడలేదు. కానీ నిన్న దక్కిన గుర్తింపు ప్రత్యేకం. మా తల్లిదండ్రులు మాకు(తమ్ముడు, నాకు) కష్టపడి పనిచేయడం, మానవత్వం చూపడం, నిస్వార్థంగా జీవించడం వంటి ఎన్నో విలువలు నేర్పించారు’ అంటూ తల్లిపై ప్రేమను చాటుకున్నారు. అక్షతమూర్తి పోస్టుపై అల్లుడు రిషి సునాక్ స్పందించారు. సుధామూర్తి ఘనతను కొనియాడుతూ.. ‘గర్వించదగ్గ రోజు’ అంటూ క్లాప్ ఎమోజీని షేర్ చేశారు. కాగా ఇప్పటికే సుధామూర్తి అందించిన సామాజిక కార్యక్రమాలకుగానూ 2006లో ఆమెను పద్మశ్రీ అవార్డు వరించిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Akshata Murty (@akshatamurty_official) -
12 ఏళ్ల బాలిక.. అవార్డుల ‘గీతిక’
సూళ్లూరుపేట రూరల్ (తిరుపతి జిల్లా): పర్యావరణాన్ని పరిరక్షించుకుందామంటూ 12 ఏళ్ల బాలిక చేపట్టిన కార్యక్రమం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ‘‘సేవ్ వాటర్.. సేవ్ అగ్రికల్చర్.. సేవ్ సాయిల్..’’ నినాదంతో సూళ్లూరుపేటకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని గీతిక ఇప్పటివరకు లక్ష మొక్కలను నాటడం గమనార్హం. విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సొంత ఖర్చులతో ఓపిగ్గా.. గీతిక తండ్రి వెంకటేషన్ రైల్వే ఉద్యోగి కాగా తల్లి భారతి సచివాలయంలో మహిళ పోలీసుగా పని చేస్తున్నారు. సూళ్లూరుపేటలోని సాయినగర్లో నివసించే గీతికకు చిన్నతనం నుంచే పర్యావరణంపై మక్కువ ఏర్పడింది. గత నాలుగేళ్లుగా సొంత డబ్బులతో యాదముడి ఇంటిగ్రేటెడ్ రూరల్, అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ పేరుతో మొక్కలను నాటుతోంది. భూతాపం నుంచి భూమిని కాపాడి పర్యావరణాన్ని రక్షించేందుకు మొక్కలను నాటుదామంటూ పాఠశాలలు, గ్రామాల్లో విద్యార్థులు, రైతులకు అవగాహన కల్పిస్తోంది. ఓపిగ్గా గంటల తరబడి ప్లకార్డులతో నిలుచుని తన లక్ష్యం దిశగా సాగుతోంది. పల్లెలే కాకుండా చెన్నై లాంటి మహా నగరంలోనూ గీతిక చేసిన ప్రయత్నాలను అభినందిస్తూ జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ప్రకటించారు. తమ కుటుంబానికి ఆర్థికంగా భారమే అయినప్పటికీ ఆ చిన్నారి ప్రయత్నాలకు తల్లిదండ్రులు సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. చెన్నై ప్రాంతంలో ప్లకార్డులతో గంటల కొద్ది నిలబడి అవగాహన కల్పిస్తున్న బాలిక గీతిక సాధించిన అవార్డులు బెంగళూరు, బిహార్, హైదరాబాద్కు చెందిన ఎన్జీఓలు, సామాజిక సేవా సంస్థల నుంచి పలు అవార్డులు. 2020 చైల్డ్ ఎన్విరాన్మెంట్ అవార్డు, యంగ్ క్లైమేట్ యాక్టివిస్ట్ అవార్డు 2021లో గ్లోబల్ కిడ్ అచీవర్ అవార్డు, ఇండియన్ ఐకాన్ అవార్డు, ఫేమ్ ఐకాన్ అవార్డు 2022లో సూళ్లూరుపేట ఎస్ఎస్ఎస్ సంస్థ ద్వారా ఏపీజే అబ్దుల్కలాం అవార్డు 2022లో ఇంటర్నేషనల్ ఎక్స్లెన్స్, ఎన్విరాన్మెంటల్ వారియర్ అవార్డులు. 2022లో ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఐకాన్ అవార్డు, విశ్వగురు వరల్డ్ రికార్డు సంస్థ ద్వారా నేషనల్ అవార్డు, ప్రశంసా పత్రం. ఢిల్లీలో 2023 జనవరిలో నిర్వహించిన కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ అవార్డు. -
మరోసారి గొప్ప మనుసు చాటుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్
కోలీవుడ్లో ధైర్యం, సాహసం, సాయం, సేవా వంటి గుణాలు కలిగిన అతి తక్కువ నటీనటుల్లో వరలక్ష్మి శరత్కుమార్ ఒకరు. శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీకి వచ్చిన స్వసక్తితోనే ఎదిగారు. నటిగా దక్షిణాదిలో తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నారు. పోడా పోడి చిత్రంతో కథానాయకిగా కోలీవుడ్లో తెరంగేట్రం చేసిన ఈమె ఆ తర్వాత రకరకాల పాత్రల్లో నటించి శభాష్ అనిపించుకున్నారు. తెరపై విలన్గా భయపెట్టే వరలక్ష్మిలో సేవ గుణం ఎక్కువే అనే విషయం తెలిసిందే. చదవండి: ప్రియుడి చేతిలో చావు దెబ్బలు తిన్న నటి, శరీరమంతా కమిలిపోయి.. తరచూ ఆమె సామాజిక సేవలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలను ఆదుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఆమె మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. క్యాన్సర్ బాధిత కుటుంబాలకు నిత్యవసర వస్తువులను సాయం చేసి అండగా నిలిచారు. కాగా శనివారం తన పుట్టిన రోజును స్థానిక ఎగ్మోర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్లో హాస్పిటల్లో వైద్యులు, క్యాన్సర్ బాధితుల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని జాయ్ ఆఫ్ షేరింగ్ పేరుతో శివశక్తి సంకల్ప్ బ్యటిఫుల్ వరల్డ్ సేవా సంస్థలు నిర్వహించాయి. ఈ సందర్భంగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. అనేకమంది క్యాన్సర్ బాధితులను కాపాడుతున్న వైద్యుల మధ్య తన పుట్టినరోజు వేడుకను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. మన సన్నిహితులు, దగ్గరి వారు మాత్రమే క్యాన్సర్ బాధితులైనప్పుడు వ్యాధి గురించి ఆలోస్తున్నామని అభిప్రాయపడ్డారు. చేతిలో ఉన్న పది రూపాయలు సాయం చేసినా బాధితుల జీవితాల్లో పెద్ద మార్పు వస్తుందన్నారు. అలాగే దేశమంత సైకిల్ యాత్ర చేస్తూ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్న చెన్నైకి చెందిన శివ రవి, జై అశ్వాణిలపై ఆమె ప్రశంసలు కురిపించారు. చదవండి: తీవ్రమైన గుండెపోటు నుంచి కాపాడింది అదే: సుస్మితాసేన్ కాగా క్యాన్సర్ మహమ్మారిపై అవగాహన కలిగించే విధంగా శివ రవి అనే 26 ఏళ్ల వ్యక్తి, జై అశ్వాణి అనే 18 ఏళ్ల యువకుడు కలిసి చెన్నై నుంచి కోల్కత్తా వరకూ 1746 కిలో మీటర్లు సైకిల్ యాత్ర చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు అదే విధంగా అనేకమంది క్యాన్సర్ బాధితులను కాపాడుతున్న సంకల్ప్ సేవా సంస్థ, వైద్యుల చర్యలను అభినందించారు. ఈ సందర్భంగా నటి వరలక్ష్మి క్యాన్సర్ బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులను సాయంగా అందించారు. అదేవిధంగా సైకిల్ యాత్రతో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రవన్ని చేపట్టిన యువకులకు జ్ఞాపికలను అందజేశారు. -
అలీ పెద్ద మనసు.. మెరిట్ స్టూడెంట్స్కు చేయూత!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ సామాజిక సేవా కార్యక్రమాలలో ఎప్పుడు ముందుంటారు. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వాడుతుంటాడు. తాజాగా అలీ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. విద్యా వైద్య రంగాలలో మెరిట్ స్టూడెంట్స్ కు చేయూత ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఆస్ట్రేలియన్ అర్వేంసిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ భాగస్వామ్యంతో మెరిట్ విద్యార్థులకు చేయూత తో పాటు ఉపాధి కూడా కల్పించబోతున్నారు. ఈ విషయంపై తాజాగా అలీ మీడియాతో మాట్లాడుతూ..చాలా మంది మెరిట్ స్టూడెంట్స్ ఏమి చేయలేకపోతున్నాం అని బాధపడుతుంటారు. అలాంటి వారికి చేయూతనివ్వడానికి అర్వేంసిస్ సభ్యులు సభ్యులు ముందుకు రావడం సంతోషంగా ఉంది. వీళ్లు విద్య వైద్య రంగాలలో మెరిట్ స్టూడెంట్స్ కి చేయూత తో పాటు ఉపాధి కూడా కల్పిస్తారు. ఇదేకాదు ఒకవేళ ఆస్ట్రేలియా ప్రభుత్వం అంగీకరిస్తే.. ఇండియా నుంచి 20 మంది రైతులను అక్కడకు తీసుకెళ్లి ఉపాధి అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరి ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నాను’అని అలీ అన్నారు. -
Ms శ్రీదేవి.. ఎల్లలెరుగని సేవ
ఇరవై నాలుగేళ్ల వయసులో మీరైతే ఏం చేస్తారు? శ్రీదేవి మాత్రం సమాజ సేవకు సిద్ధపడింది. పేదల బతుకుల్లో వెలుగులు నింపాలని నిశ్చయించుకుంది. పేదలతో మమేకమవుతూ.. వారి కష్టాలు విని ధైర్యం చెబుతూ.. ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయూతనిస్తోంది. చిన్ననాటి నుంచి ఎదుర్కొన్న కష్టాలు, కుటుంబ నేపథ్యమే తనను ఈ దిశగా అడుగులు వేసేలా చేశాయంటున్న శ్రీదేవి.. సేవా కార్యక్రమాలకు సామాజిక మాధ్యమాలను వినియోగించుకుంటోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిరుపేదలకు తన వంతు సాయం చేస్తున్న ఆమె జీవితం.. ఎందరికో స్ఫూర్తివంతం. మద్దిపాడు(ప్రకాశం జిల్లా): Ms శ్రీదేవి. పేరు ఎక్కడో విన్నట్టు.. చూసినట్టు అనిపిస్తోందా? తను సామాజిక మాధ్యమం యూట్యూబ్లో ఇన్ఫ్లూయెన్సర్. నిరుపేదలకు సేవ చేయడంలో కలిగే సంతృప్తిని సమాజానికి పరిచయం చేస్తోంది. విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన కృప, సత్యనారాయణల మూడో కుమార్తె శ్రీదేవి. తను పుట్టిన మూడు నెలలకే తండ్రి అనారోగ్యంతో కన్నుమూశారు. తనకంటే ముందు ఇద్దరు అక్కలు. అందరినీ కంటికి రెప్పలా చూసుకుంది తన తల్లి. ఈ క్రమంలో తల్లి పడిన కష్టాన్ని కళ్లారా చూసిన శ్రీదేవి మనసులో పేదలకు సేవ చేయాలన్న ఆలోచన నాటుకుపోయింది. తన 24వ ఏట నుంచి సేవా కార్యక్రమాలపై పూర్తిగా దృష్టి సారించింది. భర్తను కోల్పోయి చిన్న పిల్లలను పోషించలేక ఇబ్బంది పడుతున్న మహిళలు, పిల్లలు లేని వృద్ధులు, చదువుపై ఆసక్తి ఉన్నా చదివించే స్థోమత లేని నిస్సహాయ తల్లిదండ్రుల దీనగాథలు ఆమె దృష్టికి రాగానే వెంటనే స్పందించడం, ఆఘమేఘాల మీద ఆ ప్రాంతానికి వెళ్లి సాయం అందించి ఆత్మ సంతృప్తి పొందడం అలవాటుగా చేసుకుంది. గురువారం ఆమె మద్దిపాడు మండలంలోని గార్లపాడు పునరావాస కాలనీకి వచ్చింది. స్థానిక సర్పంచ్ గంగిరెడ్డి ద్వారా పేదల కష్టాలు తెలుసుకుంది. కాలనీ పది మంది పేదలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులతోపాటు దుస్తులు, కొంత నగదు అందజేసింది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో తన అంతరంగాన్ని పంచుకుంది. ‘నా ఆత్మ సంతృప్తి కోసమే సేవా కార్యక్రమాలు చేస్తున్నా. ప్రతి నెలా సుమారు రూ.3 లక్షలకు పైగా పేదల కోసం ఖర్చు చేస్తున్నా. చిన్న పిల్లలను చదివిస్తున్నా. నా టీమ్లో మరో ఇద్దరు పనిచేస్తున్నారు. ప్రతి నెలా ఏఏ జిల్లాలకు వెళ్లాలో ముందుగానే ప్లాన్ చేసుకోవడం, ఆ తర్వాత గ్రామాలను ఎంచుకుని సహాయం అవసరమైన వారిని గుర్తిస్తాం. 20 మంది బాలబాలికలకు స్కాలర్షిప్ అందిస్తూ వారి చదువుల బాధ్యతను కూడా తీసుకున్నా’ అని సంతోషంగా చెప్పింది. శ్రీదేవి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ముందుకు సాగాలని ఆశిద్దాం. -
సంక్షేమం చేరువచేస్తూ..సమాజాన్ని చదివిస్తూ..!
‘‘పనుల్లేక వలసలు పోతున్నారనేది అవాస్తవం. రోజుకు లక్ష మందికి ‘ఉపాధి’ పనులు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంటే 60వేల మంది మాత్రమే వస్తున్నారు. అలాగే పింఛన్లు తీసేశారనేది కూడా సత్యదూరమైన ప్రచారం. అర్హత ఉన్న ఎవ్వరి పింఛన్ తొలగించలేదు. ఏటికేడు పింఛన్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. పేదలకు ఇళ్లు, వారి పిల్లలకు చదువు, పోషకాహారం అందించి ఆరోగ్యవంతులను చేయడంపై ప్రధానంగా దృష్టి సాధించాం. నా బిడ్డను కూడా అంగన్వాడీలో చేర్పించా. క్షేత్రస్థాయి నుంచి సమాజం, పరిస్థితులు తెలుసుకుంటూ పిల్లలు ఎదగాలి. పేదల కష్టాలు తీర్చడమే ప్రభుత్వ, అధికారుల ప్రధాన లక్ష్యం.’’ అని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు అన్నారు. ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మరిన్ని విషయాలు పంచుకున్నారు. – సాక్షి ప్రతినిధి కర్నూలు సాక్షి: పనుల్లేక వలసలు పోతున్నారని ప్రచారం జరుగుతోంది? నిజంగా పనుల్లేవా? వలసకు కారణమేంటి? నివారణ చర్యలేంటి? కలెక్టర్: ఆదోని డివిజన్లో వలసలు దశాబ్దాలుగా ఉన్నాయి. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా వలసలు వెళ్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి చర్చించా. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెస్(సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషియల్ స్టడీస్)తో సర్వే చేయించా. గత డిసెంబర్ 12న రిపోర్ట్ ఇచ్చింది. ఉపాధి పనులు ప్రతీ గ్రామంలో ఉన్నాయి. జిల్లాలో రోజూ లక్ష పనిదినాలు కల్పించే అవకాశం ఉంది. కానీ 60వేల మందే వస్తున్నారు. పనుల్లేక వలసలు పోతున్నారనేది పచ్చి అబద్ధం. తెలంగాణ, గుంటూరులో నవంబర్, డిసెంబర్, జనవరిలో పత్తికోత కోసం ఆ పని తెలిసిన వారు వెళ్తారు. కిలోకు రూ.14చొప్పున కూలి ఇస్తారు. ఒక్కో వ్యక్తి క్వింటాపైన ఒలిచి రూ.1500–రూ.1800 వరకు సంపాదిస్తారు. పత్తికోత తర్వాత తిరిగి గ్రామాలకు వచ్చి ఉపాధి పనులకు వెళతారు. గతంలో కేరళ, కర్ణాటకకు వెళ్లేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సాక్షి: ఆదోని డివిజన్లో పోషకాహార లోపం కూడా ఎక్కువగా ఉంది? ముఖ్యంగా అమ్మాయిల్లో ఐరన్ లోపం తీవ్రంగా ఉందని తెలుస్తోంది? కలెక్టర్: పోషకాహార లోపాన్ని నివారించడంలో మనం ప్రథమస్థానంలో ఉన్నాం. ఆదోని డివిజన్ వెనుకబాటుకు గురైంది. పేదరికం కూడా ఉంది. దీంతో సరైన పోషకాహారం పిల్లలకు అందలేదు. అందుకే ప్రతీ స్కూలు, కాలేజీలో 10–19 ఏళ్ల బాలికల వివరాలు సేకరిస్తున్నాం. వారంలోపు వివరాలు వస్తాయి. రక్తపరీక్షలు చేసి వారికి ఐరన్ లోపం ఉంటే మందులు ఇస్తాం. హాస్టళ్లలో ఉంటే మెడిసిన్ అందిస్తాం. స్కూళ్లకు వచ్చేవారికి ఇంటికే పంపిస్తాం. ఇంటివద్దే ఉన్న పిల్లలకు ఫ్యామిలీ ఫిజీషియన్ ద్వారా అందిస్తాం. హాస్టళ్లు, విద్యాసంస్థల్లో పోషకాహారం అందిస్తున్నాం. పరీక్షలు రాసి పిల్లలు ఇళ్లకు వెళ్లేలోపు ఏ ఒక్కరిలో ఐరన్ లోపం లేకుండా చూస్తాం. సాక్షి: పింఛన్లు తీసేస్తున్నారని ప్రచారం జరుగుతోంది? వాస్తవం ఏంటి? కలెక్టర్: పింఛన్లు తీసేశారనే ప్రచారం సరికాదు. మొన్న ఒక గ్రామానికి వెళ్లాను. ఒక ఆవిడ వచ్చి పింఛన్ కావాలంది. అన్ని వివరాలు అడుగుతూ భూమి ఎంత ఉంది? అని ప్రశ్నిస్తే 17 ఎకరాలు అని చెప్పింది. ఇలాంటి వారికి పింఛన్లు ఎలా ఇస్తాం. పింఛన్ల పంపిణీ లక్ష్యం ఏంటి? అర్హత ఉన్న ఏ ఒక్కరికీ పింఛన్ తీయలేదు. కొత్తగా వితంతు, వృద్ధాప్య పింఛన్లు మరిన్ని ఇస్తున్నాం. ఏటికేడు పింఛన్ల సంఖ్య పెరుగుతోంది. సాక్షి: ఇళ్ల నిర్మాణం ఎంత వరకు వచ్చింది? ఉగాదికి పూర్తి చేసే అవకాశం ఉందా? కలెక్టర్: 16వేల ఇళ్లు నిర్మిస్తున్నాం. 7వేలు పూర్తయ్యాయి. తక్కినవి పలు దశల్లో ఉన్నాయి. సొంత స్థలం ఉన్నా, గుడిసెలు, శిథిలావస్థలోని ఇళ్లు ఉంటే వాటి స్థానంలో కొత్తవి నిర్మించుకోవచ్చు. సాక్షి: సమస్యల పరిష్కారం కోసం స్పందనకు వస్తున్నారు? ఫలితం ఉందా? కలెక్టర్: కచ్చితంగా. కావాలంటే మీరు ప్రజలను విచారించవచ్చు. అభ్యంతరం లేదు. సోమవారం మండల, డివిజన్, జిల్లా స్థాయిలో జరిగే స్పందన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కనెక్ట్ చేస్తాం. సమస్యకు అక్కడికక్కడే పరిష్కారం సూచిస్తున్నాం. ఎక్కువగా భూసమస్యలు వస్తున్నాయి. గతేడాది 4,727 భూసమస్యలు వచ్చాయి. ఇందులో 70శాతం కుటుంబ తగాదాలే. ఇవేమీ చేయలేం. కోర్టు పరిధిలోని అంశాలు. మా పరిధిలోని సమస్యలు తప్పక పరిష్కరిస్తున్నాం. సాక్షి: మీ కుమారుడిని అంగన్వాడీలో చదివిస్తున్నారు? కారణమేంటి? కలెక్టర్: క్షేత్రస్థాయిలో అన్ని పరిస్థితులు తెలుసుకుంటూ పిల్లలు ఎదగాలి. చదువు పేరుతో రుద్ది, వాళ్లను ఉద్యోగంలో వేసి బందీలను చేయకూడదు. ఒకే జీవితం స్వేచ్ఛగా చదవాలి. సామాజిక పరిస్థితులు అర్థం చేసుకోవాలి. అంగన్వాడీ నుంచి ఆక్స్ఫర్డ్ దాకా వెళ్లాలనేది నా కోరిక. ఫస్ట్ టీసీలో అంగన్వాడీ ఉండాలి. పిల్లలకు చదువుతో పాటు సమాజాన్ని చదివించడం నేర్పాలి. అందుకే ఈ నిర్ణయం. సాక్షి: ఇలా పనులకు వెళ్లడంతో పిల్లల చదువుకు ఇబ్బంది కలుగుతుంది కదా? ఈ కారణాలతోనే ఇది దేశంలో అక్షరాస్యతలో కూడా వెనుకబడి ఉందా? కలెక్టర్: పనుల కోసం వెళ్లేవారి పిల్లల కోసం సాధారణ హాస్టళ్లు కాకుండా 71 సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేశాం. గతేడాది ‘పది’ ఫెయిల్ అయినవారు, పనులకు వెళ్లేవారి పిల్లలను గుర్తించాం. వీరందరికీ అన్ని సౌకర్యాలు కల్పించి శిక్షణ ఇస్తున్నాం. ఏ కారణంతో ఎవ్వరూ బడికి వెళ్లని పరిస్థితి రాకూడదు. ‘పది’ ఫెయిల్ అయిన వారు కూడా మళ్లీ పరీక్ష రాసి ఉత్తీర్ణులై పై చదువులకు పంపే ఏర్పాటు తీసుకున్నాం. చదవులతోనే జీవితాలు బాగుపడతాయని మేమంతా నమ్ముతున్నాం. సాక్షి: సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత పాలన సులభతరమైందా? ప్రజలకు సేవలు అందించడంలో సంతృప్తి ఉందా? కలెక్టర్: గతంలో సమస్యల కోసం మండల కేంద్రానికి వెళ్లేవారు. ప్రజలు వెళ్లినప్పుడు అధికారులు ఉండొచ్చు? క్యాంపులకు వెళ్లొచ్చు. దీంతో ఒకటికి రెండుసార్లు పనులు వదులుకుని, డబ్బులు ఖర్చు చేసుకుని వచ్చేవారు. సచివాలయాలు వచ్చాక పింఛన్లు, రేషన్కార్డులు, ఇతర సమస్యలు అక్కడే పరిష్కారమవుతున్నాయి. ఇవి ప్రజలకు సౌలభ్యంగా ఉన్నాయి. వీటి పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నాం. సాక్షి: పదో తరగతి ఫలితాలు గతేడాది దారుణంగా వచ్చాయి? కారణమేంటి? ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెంచేందుకు చర్యలు తీసుకున్నారా? కలెక్టర్: గతేడాది ఫలితాలపై నేను చాలా బాధపడ్డాను. పిల్లలు కష్టపడి పాసవ్వాలి. అప్పడే భవిష్యత్లో వారి ఆలోచన దృక్పథం బాగుంటుంది. దొడ్డిదారిలో పాస్ అయితే, వారి ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. అలా అలవాటు చేయొద్దని టీచర్లకు చెప్పా. గతేడాది 22వేల మంది ఫెయిల్ అయ్యారు. ఈ అనుభవంతో ఈ ఏడాది ప్రత్యేకంగా మెటీరియల్స్ ఇచ్చి ప్రత్యేక చొరవ తీసుకున్నాం. ప్రత్యేక అధికారులను నియమించాం. ఒక్కో టీచర్కు 5గురు పిల్లల బాధ్యతను అప్పగించాం. 45రోజులు ప్రత్యేకంగా తీసుకున్నాం. వందశాతం లక్ష్యంగా పెట్టుకున్నాం. దగ్గరగా ఫలితాలు సాధిస్తామనే నమ్మకం ఉంది. -
సరిగమప విన్నర్ యశస్వి కొండెపూడి మోసం.. స్పందించిన స్వచ్చంద సంస్థ
యశస్వి కొండెపుడి.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సరిగమప సింగింగ్ షోలో లైఫ్ ఆఫ్ రామ్ పాట పాడి ఓవర్ నైట్లో స్టార్ అయ్యాడు. ఆ సమయంలో ఎక్కడ చూసిన యశస్వి పాటనే మారుమోగింది. ఆ సీజన్ సరిగమప సింగింగ్ ఐకాన్ విన్నర్గా టైటిల్ కూడా గెలిచాడు. తాజాగా యశస్వి వివాదంలో చిక్కుకున్నాడు. తనది కాని సంస్థను తనదని చెప్పుకుని మోసానికి పాల్పడ్డాడు. తాను చేయని సామాజిక సేవ గురించి తప్పుడు ప్రచారం చేసుకున్నాడు. తాజాగా అతడి బాగోతాన్ని నవసేవ పౌండేషన్ నిర్వహకురాలు ఫరా కౌసర్ బట్టబయలు చేశారు. చదవండి: షణ్ముఖ్తో హగ్లు, ముద్దులు.. శ్రీహాన్ ముందు సిరి కన్నీళ్లు! కాగా ఇటీవల ఓ షోలో పాల్గొన్న యశస్వి తాను నవసేవ అనే పేరుతో ఎన్జీవో నడుపుతున్నానని, దీని ద్వారా 50 నుంచి 60 మంది పిల్లలను చదివిస్తున్నట్లు చెప్పాడు. అయితే.. ఇది నిజం కాదని ఆ సంస్థ నిర్వాహకురాలు ఫరా కౌసర్ తాజాగా ఆరోపణలు చేస్తున్నారు. బుధవారం ఆమె సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను చేయని సేవా కార్యక్రమాలను చేసినట్లుగా ఓ టీవీ ఛానల్లో యశస్వి ప్రచారం చేశాడని చెప్పారు. నవసేవ అనే పేరుతో గత ఐదేళ్లుగా స్వచ్ఛంద సంస్థను స్థాపించి 56 మంది అనాథ పిల్లలను తానే చదివిస్తున్నానని చెప్పారు. కానీ ఓ ఛానల్లో పాటలు పాడిన యశస్వి ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందేందుకు సదరు కార్యక్రమం ఓట్లు రాబట్టేందుకు తాను చేయని సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నారని ఆమె మండిపడ్డారు. చదవండి: ‘తొలిప్రేమ’ హీరోయిన్ కీర్తి రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉంది, ఏం చేస్తుందో తెలుసా? అది తెలిసి వెంటనే తానే స్వయంగా యశస్విని క్షమాపణ చెప్పాలని కోరిన అతడు పట్టించుకోలేదు. ప్రేక్షకుల నుంచి అభిమానం పొందేందుకు చేయని సేవా కార్యక్రమాలను తామే చేస్తున్నట్లు ఎలా ప్రచారం చేసుకుంటారని నిలదీశారు. ఈ విషయంపై తాను ప్రచారం చేసిన టీవీ ఛానల్, సదరు కార్యక్రమానికి వ్యాఖ్యాతక వ్యవహరించిన యాంకర్పై, యసస్విపై త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. కాగా సరిగమప సింగింగ్ షో తెచ్చిన పెట్టిన పాపులారిటితో యశస్వి సెలబ్రెటి అయిపోయాడు. అదే క్రేజ్తో అతడు పలు ఈవెంట్స్లో తన గాత్రంతో అలరిస్తూ ఎన్నో షోలు చేస్తూ బిజీగా మారాడు. -
Bhavi Barad: స్ఫూర్తి ప్రవాహమై కదలింది
‘నేను, నా చదువు మాత్రమే’ అని ఎప్పుడూ అనుకోలేదు దిల్లీకి చెందిన 26 సంవత్సరాల భావి బరాద్. సామాజిక సేవ నుంచి యువతరం హక్కుల వరకు ఎన్నో విషయాలపై తన గొంతు వినిపిస్తోంది. ప్రస్తుతం యూత్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ‘ప్రవాహ్’లో పని చేస్తున్న భావి బరాద్ ‘పదిమందితో కలిసి పనిచేయడంలో ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు’ అంటుంది. కోవిడ్ సమయంలో ఎంతోమంది బాధితులకు అండగా నిలబడింది. సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంది. ‘వర్గ, కుల, మత భేదాలు లేకుండా అందరూ కలిసి శాంతిసౌభాగ్యాలతో జీవించాలి’ అనేది తన కోరిక. ఐక్యరాజ్య సమితి ‘ఇండియా యువ అడ్వకేట్స్’గా ఫస్ట్ బ్యాచ్కు ఎంపికైన ఆరుగురిలో భావి బరాద్ ఒకరు. ‘సామాజిక సేవలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఫలితం ఆశించకుండా నిజాయితీగా కష్టపడడం. అయితే నిజాయితీగా పనిచేసే వారికి మంచి ఫలితం దూరంగా ఉండదు. వారిని మరో రెండు అడుగులు ముందుకు నడిపిస్తుంది’ అంటుంది భావి బరాద్. సమాజసేవకు సంబంధించిన విషయాలను ఇతరులతో పంచుకోవడానికి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటుంది బరాద్. స్కూల్, కాలేజీలలో జెండర్ ఈక్వాలిటీ నుంచి పర్యావరణ స్పృహ వరకు రకరకాల విషయాలపై మాట్లాడడం, యూత్ కెరీర్కు సంబంధించి ప్యానల్ డిస్కషన్లలో చురుగ్గా పాల్గొంటుంది. ‘పుస్తకాలు చదవడం అంటే ఇష్టం’ అంటున్న భావి బరాద్ సమాజాన్ని చదవడం ద్వారా మర్ని విషయాలను తెలుసుకుంటుంది. (క్లిక్ చేయండి: ఉద్యోగం మానేశానని ఇంట్లోవాళ్లు మాట్లాడలేదు..) -
Gurrala Sarojanammam: సేవా సరోజనం
నేటి సమాజమంతా డబ్బు చుట్టూ తిరుగుతోందనేది జగమెరిగిన సత్యం. ఇందుకు భిన్నంగా తనకున్న ఆస్తులు, కష్టార్జితాన్ని నిరుపేదలు, అనాథల అవసరాలు గుర్తించి వారికి అండగా నిలుస్తోంది నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయురాలు గుర్రాల సరోజనమ్మ. ఎనిమిది పదుల వయసులో ఆమె సామాజిక సేవా దృక్పథం ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తోంది. గుర్రాల సరోజనమ్మ వయసు 84 ఏళ్లు. ప్రభుత్వ స్కూల్ టీచర్గా పనిచేసిన ఆమె విశ్రాంత జీవనం గడుపుతోంది. చుట్టుపక్కల అందరితో ఆత్మీయంగా ఉండే సరోజినమ్మ అంటే అందరికీ అభిమానమే. ఆమె ఉద్యోగం చేసి సంపాదించిన ఆస్తులను మానవతా దృక్పథంతో స్వచ్ఛంద సేవ కార్యక్రమాలకు కేటాయిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ► సొంతిల్లు దానం పట్టణ నడిబొడ్డున గోశాల రోడ్డులో 180 గజాల విస్తీర్ణంలో సుమారు రూ. కోటి విలువ చేసే సొంతిల్లు ఉంది సరోజనమ్మకు. ఆ ఇంటిని తెలంగాణ ఆల్ పెన్షర్స్ అండ్ రిటైర్డు పర్సన్స్ అసోసియేషన్ జిల్లా శాఖకు విరాళంగా ఇచ్చేశారామె. ఇప్పుడు ఆ ఇంటిని నిరుద్యోగ యువతీ యువకుల ఉపాధి కోసం వివిధ వృత్తుల్లో శిక్షణ, ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించేందుకు కేంద్రంగా ఉపయోగించుకోనున్నారు. నిజామాబాద్ నగర కేంద్రంలో మల్లు స్వరాజ్యం మెమోరియల్ క్లిని క్కు అనుబంధంగా జనరిక్ హాల్ కోసం రూ. 2 లక్షలు విరాళం అందిస్తూ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రం గోదావరి నది ఒడ్డున ఉన్న గోశాలకు రూ. లక్ష విరాళం ఇచ్చారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు రూ. 20 వేల విలువైన పుస్తకాలను స్థానిక గ్రంథాలయానికి అందించారామె. ప్రస్తుతం అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షురాలిగా, డివిజన్శాఖ గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు సరోజనమ్మ. ఆమె సేవా కార్యక్రమాలకు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా రామ్మోహన్రావు, ఇతర డివిజన్ ప్రతినిధులు తమ సహకారాన్ని అందిస్తున్నారు. ► పెన్షన్ కూడా పేదలకే! బోధన్ పట్టణంలోని రాకాసిపేట్కు చెందిన గుర్రాల సూర్యనారాయణ, వెంకట సుబ్బమ్మ రెండో కూతురు సరోజనమ్మ. వీరిది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. సరోజనమ్మ ఉన్నత విద్యనభ్యసించి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం సంపాదించింది. ఆమె భర్త వెంకట్రావ్ బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీలో పని చేసేవారు. 1996లో సరోజనమ్మ రిటైర్డ్ అయ్యింది. 2013లో భర్త మరణించారు. వీరికి సంతానం లేదు. నెలవారీగా వచ్చే పెన్షన్లో అవసరాలకు కొంత ఉంచుకుని మిగిలిన డబ్బులను పేదల ఆర్థిక అవసరాలకు సహాయం చేస్తూ తన ఉదారతను చాటుకుంటున్నారామె. మరణానంతరం తన శరీరాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించాలని దానపత్రం సమర్పించారు. ► అంతిమ సంస్కారాలకు ధర్మస్థలం పొట్ట కూటి కోసం పల్లె నుంచి పట్నాలకు వచ్చిన నిరుపేదలు అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తుంటారు. కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలు నిర్వహించుకునేందుకు చాలాచోట్ల ఇంటి యజమానులు అనుమతించరు. ఈ విషాదకర పరిస్థితిలో ఆ కుటుంబ సభ్యులు పడే మానసిక క్షోభను ప్రత్యక్షంగా చూసిన సరోజినమ్మ మనసు కలిచివేసింది. ఇందుకు ఏదో పరిష్కార మార్గం చూపాలని సంకల్పించింది. ఇలాంటి నిరుపేదలు తమ కుటుంబ సభ్యుడి అంతిమ సంస్కారాలు కుల, మత. వర్గాలకతీతంగా వారి వారి సంప్రదాయాలకు అనుగుణంగా ఉచితంగా జరుపుకునేందుకు సౌకర్యంగా ఉండేవిధంగా ధర్మస్థలిని ఏర్పాటు చేసింది. బోధన్ పట్టణంలోని చెక్కి చెరువు పరిసరాల్లో ఉన్న శ్మశాన వాటిక ప్రహరీకి ఆనుకుని తన సొంత డబ్బులు రూ. 20 లక్షలు వెచ్చించి ధర్మ స్థలం నిర్మాణం చేపట్టింది. ఈ భవనంలో ఫ్రీజర్, కరెంట్, తాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో ఈ ధర్మస్థలి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. – గడ్డం గంగులు, సాక్షి, బోధన్ మంచి పనులే తోడు ఎవరికైనా జీవితంలో చేసిన మంచి పనులే కడదాకా తోడుంటాయి. బతికి ఉన్నంత కాలం సాటివారికి నా వంతుగా ఏదైనా సాయం చేయాలనుకున్నాను. అందులో భాగంగానే నా శక్తి కొలదీ సాయం చేస్తూ వచ్చాను. చేసిన మేలు చెప్పుకోకూడదంటారు. నలుగురి మేలు కోసం చేసే ఏ పనైనా అది మనకు మంచే చేస్తుంది. ఈ కార్యక్రమాలకు ఇప్పటి వరకు ఎవరి నుంచి ఆర్థిక సహాయం తీసుకోలేదు. పొదుపు చేసినవి, నెలవారీ పెన్షన్గా వచ్చే డబ్బులే ఖర్చు పెడుతున్నాను. సేవ కార్యక్రమాలకు సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. – గుర్రాల సరోజనమ్మ -
Priyaswara Bharti: ప్రేరణనిచ్చే ప్రియస్వరం
పట్టుమని పదేళ్లు కూడా నిండకముందే తండ్రి మరణం, దీనికితోడు ఆర్థిక పరిస్థితులు దిగజారి భవిష్యత్ శూన్యంగా కనిపించింది. విధి వంచించిందని సర్దిచెప్పుకుని ముందుకు సాగుతోన్న తరుణంలో ఎంతో ఇష్టమైన చెల్లి, తల్లి అకాల మరణాలు అమాంతం పాతాళంలోకి లాగినట్టు అనిపించాయి. అయినా ఏమాత్రం భయపడకుండా ఎదురవుతోన్న ఆటుపోట్లను బలంగా మార్చుకుని సామాజిక వేత్తగా, డైరెక్టర్గా రాణిస్తోంది ప్రియస్వర భారతి. 21 ఏళ్లకే జీవితానికి సరిపడినన్ని కష్టాలను అనుభవించిన ప్రియస్వర నేడు అవార్డు విన్నింగ్ డాక్యుమెంటరీలు తీస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో చిన్న గ్రామానికి చెందిన ప్రియ స్వరభారతి. నలుగురు సంతానంలో ఒకరు. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రైవేటు స్కూలు టీచర్స్. భారతికి తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు అనుకోకుండా తండ్రికి యాక్సిడెంట్ అయ్యింది. మెరుగైన చికిత్సనందించేందుకు పాట్నాకు తీసుకెళ్లారు. ప్రారంభంలో ఆరునెలలు అనుకున్న చికిత్స మూడేళ్లపాటు కొనసాగింది. దీంతో కుటుంబం మొత్తం అక్కడే ఉండాల్సి వచ్చింది. ఉన్నదంతా ఖర్చుపెట్టి చికిత్స చేయించినప్పటికీ ఫలితం దక్కకపోగా, తండ్రిని కోల్పోయారు. మరోపక్క ఆర్థిక ఆధారం లేక నలుగురూ మూడేళ్లు స్కూలుకు వెళ్లలేదు. ట్యూషన్లు చెబుతూ... తండ్రి చనిపోయాక భారతి తల్లి ఉద్యోగం చేసినప్పటికీ కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. దీంతో తల్లికి సాయపడేందుకు హోమ్ ట్యూషన్స్ చెప్పేది భారతి. ఇదే సమయంలో స్కూలుకు వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో ఎక్స్ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్ను నేర్పించే కిల్కారి సంస్థలో చేరింది. అక్కడ సైన్స్ ప్రాజెక్టుపై మక్కువ ఏర్పడడంతో ఎంతో ఆసక్తిగా నేర్చుకునేది. దీంతో 2013లో కిల్కారి నుంచి యూనిసెఫ్కు ఎంపికైన 20 మందిలో భారతి ఒకరు. కిల్కారి, యూనిసెఫ్ ద్వారా పిల్లల హక్కుల గురించి వివరంగా తెలుసుకుని తన తోటి వలంటీర్లతో కలిసి ‘బీహార్ యూత్ ఫర్ చైల్డ్ రైట్స్’ పేరుతో సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా పిల్లలకు విద్య, బాలల హక్కులపై అవగాహన కల్పించడం, బాల్యవివాహాలు, మహిళలు, ప్రత్యుత్పత్తి అవయవాల ఆరోగ్యంపై అవగాహన కల్పించేది. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ వివిధ వర్క్షాపులు, వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. చెల్లితో కలిసి డైరెక్టర్గా... ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అసోసియేషన్, కిల్కారి సంస్థలు రెండు కలిసి పదిరోజుల పాటు డైరెక్షన్ లో ఉచితంగా వర్క్షాపు నిర్వహించాయి. అప్పుడు యూనిసెఫ్ అడ్వైజరీ బోర్డు యువ యంగ్ పీపుల్ యాక్షన్ టీమ్లో సభ్యురాలిగా కొనసాగుతోన్న భారతి సినిమాటోగ్రఫీపై ఆసక్తితో పదిరోజులపాటు వర్క్షాపుకు హాజరైంది. తరువాత తన చెల్లి ప్రియాంతరాతో కలిసి ‘గెలటాలజీ’ డాక్యుమెంటరీ తీసింది. తొమ్మిదో జాతీయ సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ డాక్యుమెంటరీకి స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. తరువాత 2019లో పట్నాను ముంచెత్తిన వరద బీభత్సాన్ని కళ్లకు కట్టేలా ‘ద అన్నోన్ సిటీ, మై ఓన్ సిటీ ఫ్లడెడ్’ పేరుతో మరో డాక్యుమెంటరీ రూపొందించింది. ఈ డాక్యుమెంటరీకి కూడా ఆర్ట్స్ అండ్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో స్పెషల్ జ్యూరీ అవార్డు వరించింది. 2018 నుంచి డాక్యుమెంటరీలు తీస్తూ జాతీయ, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్కు పంపిస్తూ అనేక అవార్డులను అందుకుంది. ప్రస్తుతం పట్నా యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ చదువుతున్న భారతి కొన్ని పెద్ద ప్రాజెక్టులకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తోంది. అవకాశాలు సృష్టించుకోవాలి అవకాశాలు వాటంతట అవే మన దగ్గరికి రావు. మనమే సొంతంగా సృష్టించుకుని ముందుకు సాగాలి. అప్పుడే జీవితంలో ఎదగగలుగుతాము. అదే నా విజయ రహస్యం. – ప్రియస్వర భారతి -
ఆహారం మిగిలిందా... మాకివ్వండి
సాక్షి,మదనపల్లె సిటీ: శుభ కార్యాల్లో ఆహారం మిగిలిపోయిందా? హోటళ్లలో భోజనం, అల్పహారం ఉండిపోయిందా.. అయితే ఆ ఆహారాన్ని మాకందించండి.. మీ తరపున పేదలకు అందిస్తాం అంటున్నారు మదనపల్లెకు చెందిన హెల్పింగ్ మైండ్స్ సభ్యులు. పేదల ఆకలిని తీర్చేందుకు స్థానిక ఆర్టీసీ బస్టాండులో ఫుడ్ బ్యాంకు కేంద్రం ఏర్పాటు చేశారు. ’ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే.. ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఫుడ్ బ్యాంకు కేంద్రం ఏర్పాటు చేశారు. మిగిలిపోయిన ఆహారాన్ని భద్రపరిచే ఆలోచనతో ఏర్పాటు చేసిన కేంద్రం ఇప్పుడు అన్నపూర్ణగా మారింది. ఈ కేంద్రాన్ని గత ఏడాది ఫిబ్రవరి 14న పుల్వాలో అమరులైన జవానుల జ్ఞాపకార్థం హెల్పింగ్మైండ్స్ సంస్థ ఏర్పాటు చేసింది. ఆకలి బాధను దిగమింగుకుంటూ అడుగులు వేస్తున్న పేద అవ్వాతాతలు, దివ్యాంగులు, అనాథల కడుపులు నింపుతున్నాయి. సంస్థ సభ్యులు ప్రతి రోజు ఇందులో ఆహారాన్ని నిల్వ చేస్తారు. ప్రధానంగా ఎవరైనా పుట్టిన రోజు వేడుకలు, వర్ధంతి కార్యక్రమాలకు దాతలు ముందుకు వచ్చి ఇందులో ఆహారపొట్లాలను పెడుతున్నారు. కేంద్రానికి వచ్చే ఆహార పదార్థాల్ని ఫ్రిజ్ల్లో భద్రపరచడం, పేదలకు అందించడం సిబ్బంది కర్తవ్యం. ఈ కేంద్రం ఏర్పాటుపై ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరూ సహకారం అందిస్తున్నారు పేదలకు గుప్పెడు అన్నం అందించాలనే లక్ష్యంతో ఫుడ్ బ్యాంకు ఏర్పాటు చేశాం. అందరూ సహకరిస్తున్నారు.మానవత్వం, సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరూ ఆహారాన్ని వృథాగా పారవేయకుండా ఈ కేంద్రానికి అందజేయాలి. –అబూబకర్సిద్దిక్, హెల్పింగ్మైండ్స్ వ్యవస్థాపకులు, మదనపల్లె -
మనసున్న మారాజు..
శిఖరం చేరడమే విజయం అనుకుంటే...అది చేరే ప్రస్థానంలో కష్టాలు పడుతున్న వారికి చేయూత ఇచ్చి, వెన్నుతట్టి, దారి చూపడం ఘన విజయం. ‘ఏకలవ్య’ మూమెంట్ ద్వారా రాజు కేంద్రె ఆ పనే చేస్తున్నాడు... విదర్భ(మహారాష్ట్ర)లోని సంచార తెగల్లో చదువు అనేది అరుదైన విషయం. అయితే రాజు కేంద్రె తల్లిదండ్రులు మాత్రం చదువుకు బాగా విలువ ఇచ్చారు. తమకు అక్షరం ముక్క రాకపోయినా పిల్లలను మాత్రం అవకాశం ఉన్నంత వరకు చదివించాలనుకున్నారు. రాజు చదువు ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగింది. హైస్కూలు వరకు పెద్దగా తెలియలేదుగానీ, కాలేజిలో చేరిన తరువాత రకరకాల దూరాలు పరిచయం అయ్యాయి. ఇంగ్లీష్కు తనకు మధ్య ఉండే దూరం, కమ్యూనికెషన్స్ స్కిల్క్కు తనకు మధ్య ఉండే దూరం, ఇంకా రకరకాల ఆర్థిక, సామాజిక దూరాలు! పుణె యూనివర్శిటీలో చదువుకోవాలనుకున్నప్పుడు కూడా ఇదే దూరం తనకు అడ్డుగా నిలిచించి. బుల్దాన జిల్లాలోని తన ఊరు నుంచి అక్కడికి 400 కిలోమీటర్ల దూరం. పుణె వెళ్లి చదువుకోవాలంటే, చదువు సంగతి సరే ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి. దీంతో యశ్వంత్రావు చవాన్ మహారాష్ట్ర ఒపెన్ యూనివర్శిటీలో చదుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత... టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(తుల్జాపూర్)లో చేరడం తన జీవితాన్ని మలుపు తిప్పింది. మేల్ఘాట్లోని ‘కొర్కు’లాంటి గ్రాస్రూట్ కమ్యూనిటీలతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. వారి పనితీరు, నైపుణ్యాలను దగ్గరి నుంచి చూశాడు. ‘వీరికి చదువు వస్తే ఎన్ని గొప్ప విజయాలు సాధించేవారో కదా’ అనుకున్నాడు. అట్టడుగు వర్గాల విద్యార్థుల కోసం ‘ఏకలవ్య ఇండియా’ అనే స్వచ్ఛందసంస్థకు ఉద్యమస్ఫూర్తితో శ్రీకారం చుట్టాడు రాజు. స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్, టెక్నాలజికల్ స్కిల్స్, మాక్ ఇంటర్వ్యూ వరకు ఎన్నో నేర్పిస్తుంది ఏకలవ్య. దీంతో పాటు చదువుల ప్రస్థానంలో తన కష్టాల నుంచి ప్రతిష్ఠాత్మకమైన చీవ్నింగ్ స్కాలర్షిప్(యూకే గవర్నమెంట్ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రాం) గెలుచుకోవడం వరకు ఎన్నో విషయాలు చెబుతున్నాడు రాజు. అట్టడుగు వర్గాల తొలితరం విద్యార్థులకు కొండంత అండగా ఉన్న ‘ఏకలవ్య’కు ఎంటర్ప్రెన్యూర్స్, సోషల్ వర్కర్స్, డాక్టర్లు, వివిధ రంగాల ప్రముఖలు సహకారం అందిస్తున్నారు. ‘ఏకలవ్య’ ఆర్గనైజేషన్ ఇప్పటి వరకు 300 మంది విద్యార్థులు ప్రముఖ విశ్వవిద్యాలయాలలో చదువుకునేందుకు సహాయం చేసింది. చదువు విలువ గురించి పేదకుటుంబాల దగ్గరకి వెళ్లి ప్రచారం చేస్తుంది ఏకలవ్య, 2030 నాటికి వెయ్యిమంది వరకు గ్రాస్రూట్స్ లీడర్స్ను తయారుచేయాలనేది ‘ఏకలవ్య’ లక్ష్యంగా పెట్టుకుంది. ‘అట్టడుగు వర్గాల గురించి అంకితభావంతో పనిచేస్తున్న రాజు ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తున్నాడు’ అని ప్రశంసపూర్వకంగా అంటున్నారు స్కూల్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్(టిస్) అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణ సుధీర్ పటోజు. -
Sparsh Hospice: దేవతల్లాగే కనిపించారు.. వాళ్ల నవ్వు అద్భుతం!
బిడ్డను పొత్తిళ్లలో చూసుకున్నంతటి ప్రేమను కుటుంబం అంతా పంచుతుంది మహిళ. జీవితం చివరి దశలో ఉన్న వారిని అక్కున చేర్చుకునే ప్రేమ కూడా అమ్మ సొంతమే అని హైదరాబాద్లోని స్పర్శ్ హాస్పిస్ స్పష్టం చేస్తుంది. ఇంటి బాధ్యతల్లోనూ, చదువుల్లోనూ మునిగి ఉండే మహిళ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మానవ సేవయే మాధవ సేవగా భావించడానికి కదులుతోంది. జీవితం నేర్పిన అనుభవాల పాఠాలను మూటగట్టుకొని సేద తీరుతున్న చివరి దశ ఎప్పుడూ భయపెడుతూనే ఉంటుంది. తప్పక వచ్చి చేరే దశను కుటుంబం అంతా జాగ్రత్తగా చూసుకుంటుంది. కానీ, కొన్ని సందర్భాల్లో అది ఆ కుటుంబానికి కష్టంగా మారచ్చు. వృద్ధాప్యంతోనూ, జబ్బుతోనూ ఉండే చివరి దశను గౌరవంగా, ప్రేమగా, బాధ్యతగా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకోసారి కుటుంబంలో ఇది అన్నివేళలా కుదరని పరిస్థితి ఉండచ్చు. అలాంటప్పుడు స్పర్శ్ లాంటి కేంద్రాల్లో సేవ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావచ్చు. సమాజ బాధ్యతల్లో తామూ ‘సేవ’లో పాలుపంచుకోవచ్చు అనే వారి సంఖ్య పెరుగుతోంది. దీంట్లో మరీ ముఖ్యంగా తమ ఇంటి పరిధులను దాటి సేవలో భాగం పంచుకుంటోంది మహిళ. ‘ఇదో అనిర్వచనీయమైన అనుభూతి. ప్రతిఫలం ఏమీ ఆశించని సేవ ఇంతకు మించి ఉండదు. మన అమ్మానాన్నలకు సేవ చేసుకున్నట్టే’ అంటున్నారు స్వచ్ఛంద సేవికలు. వాళ్ల నవ్వు అద్భుతం.. సైకాలజీ అండ్ ఫిలాసఫీ లో డిగ్రీ సెకండియర్ చేస్తున్నాను. నా ఫ్రెండ్ శోభ క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు నేను స్పర్శ్ సెంటర్కి వెళ్లాను. తన ద్వారా ఇలాంటి ఒక సేవ ఉంటుందని తెలిసింది. అక్కడ అందరూ చాలా సహనంగా ఉండటం కనిపించింది. సేవ పొందుతున్న చివరిదశలో ఉన్నవారు దేవతల్లాగే కనిపించారు. భవిష్యత్తును చాలా పాజిటివ్గా చూస్తారు వాళ్లంతా. నాకు అది చాలా నచ్చింది. వారానికి ఒకసారి వెళ్లి అక్కడ వాళ్లతో మాట్లాడి వస్తుంటాను. వాళ్లే చాలా ధైర్యంగా ఉంటారు. నాకు భవిష్యత్తు గురించి మంచి విషయాలు చెబుతుంటారు. శారీరకంగా బెడ్ మీద నుంచి కూడా లేవడానికి వారికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ, వాళ్లలో ఒక మంచి నవ్వు ఉంటుంది. వారిలో ఆ నవ్వు చూడటానికి వెళుతుంటాను. – మహిక, స్టూడెంట్ ప్రతిఫలం ఆశించకూడదు.. మా నాన్నగారు క్యాన్సర్తో చనిపోవడంతో నా ఆలోచన సేవ వైపుగా మళ్లింది. క్యాన్సర్ పేషెంట్కు ఎలాంటి సేవ అందించాలనే విషయంలో చాలా తపన పడ్డాను. చివరి దశలో ఉన్న వాళ్లకి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించాను. మా వారి ఫ్రెండ్ ద్వారా స్పర్శలో సేవ చేసే అవకాశం లభించింది. స్వచ్ఛందంగా పాల్గొన్నప్పుడు ఆ అనుభూతిని స్వయంగా పొందాను. చివరి దశలో ఉన్నవారికి ఓదార్పు ఇవ్వాలి. వండాలి, తినిపించాలి. మందులు వేయాలి. మాట్లాడాలి. ప్రతిదీ వారికి దగ్గరగా ఉండాలి. అదంతా ఒక అసాధారణమైన అనుభూతి. డబ్బు ఒక్కటే కాదు మనసు కూడా ఉండాలి. ఎప్పుడైనా సరే ఏమీ ఆశించని ప్రేమ ఇవ్వడం అనేది చాలా గొప్ప. పాతికేళ్లపాటు గృహిణిగా ఉన్న నేను, సేవ ద్వారా చాలా మందికి చేరువయ్యాను. బయటకు వచ్చి సమాజ బాధ్యతలో మరొక ప్రపంచాన్ని చూశాను. బాధలో ఉన్నవారికి ‘నేనున్నాను’ అని ధైర్యం ఇవ్వడమనేది చాలా ముఖ్యం. ఏమీ ఆశించకుండా చేసినప్పుడే మనం చేసిన సేవకు సార్థకత ఉంటుందని అభిప్రాయం. – పద్మారెడ్డి, బిజినెస్ ఉమన్ అవగాహనే ప్రధానం చివరిదశలో ఉన్నవారికి సేవ చేసుకునే భాగ్యం నాలుగేళ్లుగా నాకు లభించింది. చాలా మందికి ఈ చివరి దశలో ఉన్న సెంటర్ గురించి తెలియదు. చివరి దశలో ఉన్నవారిని ఎలా చూసుకోవాలో కూడా తెలియదు. డాక్యుమెంటేషన్, సోషల్ మీడియా, డోనర్ రిపోర్ట్ను స్వచ్ఛందంగా చేస్తుంటాను. నాకు తెలిసిన వారందరికీ మానవ సేవలో ఉన్న గొప్పదనాన్ని గురించి చెబుతుంటాను. ఈ దశలో ఉన్నవారిని ఎలా జాగ్రత్తగా, ప్రేమగా చూసుకోవాలో తెలుస్తుంది. – నేహారాణి పటేల్, ఉద్యోగి సేవాగుణానికి నైపుణ్యం తోడు.. విద్యాసంబంధ సంస్థలతో కలిసి వర్క్ చేస్తుంటాను. ఒకరి ద్వారా తెలిసి స్పర్శ్ కేంద్రాన్ని విజిట్ చేశాను. ముఖ్యంగా సేవాగుణం ఉండటంతో పాటు నైపుణ్యం గల వాళ్లతో మాట్లాడి ఇలాంటి సేవ గురించి పరిచయం చేస్తాను. డాక్టర్ల దగ్గరకు చివరి దశలో ఉన్న పేషెంట్స్ వస్తుంటారు. అలాంటి వారికి సేవ అందించడానికి ఈ సెంటర్కి తీసుకువస్తుంటాను. అలాగే ఆన్లైన్ మ్యాగజైన్స్, డాక్యుమెంటరీ, వీడియో, సోషల్ మీడియాలో పబ్లిష్ చేయడం.. వంటివి చేస్తుంటాను. దీని ద్వారా మరికొందరికి ఈ సర్వీస్ అందేలా చూస్తాను. – అన్నపూర్ణ, సాఫ్ట్స్కిల్స్ ట్రైనర్ చదవండి: Women's Day 2022: విజయవంతంగా 25 ఏళ్లు.. రూ. 20 సభ్యత్వంతో మొదలై.. ఇప్పుడు కోటికి పైగా నిధులతో.. -
నయీ సోచ్
కాలంతోపాటు మనుషులూ మారిపోతున్నారు. ఒకప్పటిలా సమాజాభివృద్ధికి జీవితాలను అంకితం చేసేవారు కనుమరుగైతే, కనీసం ఆ దిశగా ఆలోచించేవారు వారు సైతం క్రమంగా తగ్గిపోతున్నారు. ‘‘నేను, నా వాళ్లు, నా కుటుంబం’’ అంటూ స్వార్థంగా మారిపోతున్న ఈ రోజుల్లో కాలుష్యంతో పాడైపోతున్న పర్యావరణాన్ని పరిరక్షించేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రీతూ సింగ్. డ్రెస్లు తయారయ్యాక వృథాగా పోతున్న బట్ట ముక్కలతో సరికొత్త డ్రెస్లు రూపొందించి వాటిని నిరుపేద పిల్లలకు ఉచితంగా పంచుతోంది. పంజాబ్కు చెందిన రీతూ సింగ్ ఎమ్బీఏ పూర్తయ్యాక ఏడాదిపాటు ఫ్యాషన్ రంగంలో పనిచేసింది. ఆ తర్వాత తనకు సామాజిక సేవచేయాలన్న ఆలోచన వచ్చింది. ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో.. ఓ రోజు రీతూ తన కుమార్తెని స్కూల్ బస్ ఎక్కించడానికి బస్స్టాప్లో ఎదురు చూస్తోంది. ఆ సమయంలో ఓ టైలర్, బట్టలు కుట్టగా మిగిలిపోయిన గుడ్డ ముక్కలను దగ్గరలో ఉన్న చెత్త కుండీలో పడవేయడం చూసింది. అది చూసిన రీతూ ‘‘రోజూ ఇన్ని ముక్కలు వృథాగా పోతున్నాయి. టన్నుల కొద్ది బట్ట ముక్కలు ఇలా చెత్తలో కలవడం కాలుష్యానికి దారి తీస్తుంది’’ అని అనుకుని, వృథాగా పోతున్న ఆ బట్ట ముక్కలకు చక్కటి పరిష్కారం చూపాలనుకుంది. ఏడాది పాటు ఫ్యాషన్ రంగంలో అనుభవం ఉన్న రీతూకు ..‘‘ఈ బట్టముక్క లన్నింటిని కలిపి కుడితే మంచి డ్రెస్ రూపొందుతుంది’’ అన్న ఆలోచన వచ్చింది. వెంటనే బొటిక్లు, టైలర్ల దగ్గర నుంచి ముక్కలను సేకరించి వాటిని పిల్లలు వేసుకునే విధంగా డ్రెస్లు రూపొందించింది. అలా కుట్టిన డ్రెస్లను నిరుపేద పిల్లలకు ఇవ్వడంతో వారు వాటిని ధరించి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. దీంతో రీతూకు మరింత ఉత్సాహం వచ్చింది. మరిన్ని గుడ్డ ముక్కలను సేకరించి ఎక్కువమొత్తంలో డ్రెస్ల రూపకల్పన చేయసాగింది. ఇలా గత నాలుగేళ్లుగా రీతు వేస్ట్ పీసెస్తో కుట్టిన డ్రెస్లను చాలామందికి పంచిపెట్టింది. డ్రెస్లతోపాటు బ్యాగులు, జాకెట్లు, నిత్యావసర వస్తువులను వేసుకోగల సంచులను కూడా తయారు చేస్తోంది. నయీ సోచ్తో అవగాహన మురికి వాడల్లో నివసిస్తోన్న నిరుపేద పిల్లలకేగాక వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లోని పెద్దలు, పిల్లలకు సైతం డ్రెస్లు కుట్టి ఇస్తోంది రీతు. స్కూలుకెళ్లే విద్యార్థులు వేసుకోగలిగిన స్టైలిష్ డ్రెస్లను రూపొందించి యాభైకి పైగా మురికివాడల్లో పంచింది. తన కార్యక్రమానికి వస్తోన్న స్పందనకు సోషల్ మీడియాలో ‘నయీ సోచ్’ పేరిట పేజ్ క్రియేట్ చేసి అవగాహన కల్పిస్తోంది. ఈ పేజీ ఫాలో అయ్యేవారు చాలా మంది తమకు తెలిసిన బొటిక్స్, టైలర్స్, బట్టల తయారీ యూనిట్ల నుంచి మిగిలిపోయిన బట్ట ముక్కలను సేకరించి తీసుకొచ్చి ఇస్తున్నారు. స్కూళ్లకు వెళ్లి వస్త్ర పరిశ్రమల ద్వారా కాలుష్యం ఎలా ఏర్పడుతుందో వివరించి, పర్యావరణంపై పిల్లల్లో అవగాహన కల్పిస్తోంది. నలుగురు మహిళలను తన పనిలో చేర్చుకుని వారికి ఉపాధి కల్పిస్తో్తంది. మనసుంటే మార్గం ఉంటుందని పెద్దలు ఎప్పుడో చెప్పారు. అందుకు రీతూ ఉదాహరణగా నిలుస్తోంది. సమాజాభివృద్ధికి సేవచేసే శక్తి, స్థోమతలు నాకు లేవు అని చేతులు దులుపుకోకుండా, తనకున్న నైపుణ్యంతో గుడ్డముక్కలను చక్కని డ్రెస్లుగా తీర్చిదిద్ది ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది రీతు. రోజూ ఇన్ని బట్టముక్కలు వృథాగా పోతున్నాయి. టన్నుల కొద్ది బట్ట ముక్కలు ఇలా చెత్తలో కలవడం కాలుష్యానికి దారి తీస్తుంది. ఈ బట్టముక్కలన్నింటిని కలిపి కుడితే మంచి డ్రెస్ రూపొందుతుంది అన్న ఆలోచన నుంచి పుట్టిందే నయీ సోచ్. -
పిక్ ఆఫ్ ది డే.. తులసమ్మకు జేజేలు!!
‘పిక్చర్ ఆఫ్ ది డే’ అంటూ ఈ ఫొటోను సోషల్ మీడియాలో నెటిజనులు షేర్ చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం జరిగిన పద్మ పురస్కారాలు ప్రదానోత్సవం సందర్భంగా తీసిన చిత్రమిది. ప్రత్యేక వస్త్రాలంకరణతో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా అవార్డు అందుకోవడానికి వెళుతున్న వృద్ధురాలికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముకుళిత హస్తాలతో అభివాదం చేస్తుండడం ఈ ఫొటోలో కనిపిస్తుంది. ఈ చిత్రంలో ఉన్న వృద్ధురాలి పేరు తులసి గౌడ. సామాజిక సేవ విభాగంలో ఆమెకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. అటవీ విజ్ఞాన సర్వస్వం కర్ణాటకకు చెందిన 73 ఏళ్ల తులసి గౌడ.. అడవుల్లోని సమస్త జీవజాతుల గురించిన తెలిసిన, అటవీ విజ్ఞాన సర్వస్వంగా ప్రఖ్యాతి గాంచారు. గత ఆరు దశాబ్దాలుగా పర్యావరణ పరిక్షరణకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. 30 వేలకు పైగా మొక్కలు నాటి ప్రకృతి పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుకున్నారు. ఇప్పటికీ ఆమె ఈ యజ్ఞాన్ని కొనసాగిస్తూ ఆదర్శమూర్తిగా నిలిచారు. ఆమె నిస్వార్థ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. (చదవండి: పద్మ పురస్కారాలు.. ఏపీ నుంచి ముగ్గురు) సింప్లిసిటీకి జేజేలు పద్మశ్రీ అవార్డును అందుకోవడానికి దేశరాజధాని ఢిల్లీకి వచ్చిన తులసి గౌడ ఎటువంటి ఆడంబరాలకు పోకుండా తనకు అలవాటైన వస్త్రాధారణనే కొనసాగించారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడానికి నిరాడంబరంగా వచ్చిన ఆమెను చూసి ప్రధాని మోదీ సహా ఇతర మంత్రులు, ఉన్నత అధికారులు వినమ్రంగా నమస్కరించారు. తులసి గౌడ నిరాడంబరతకు నెటిజనులు సైతం జేజేలు పలుకుతున్నారు. ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో విరివిగా షేర్ చేస్తూ.. ప్రశంసలు కురిపిస్తున్నారు. శభాష్.. హజబ్బ! కాగా, కర్ణాటక రాష్ట్రానికే చెందిన హరేకల హజబ్బ కూడా కాళ్లకు చెప్పులు లేకుండా నిరాడంబరంగా రాష్ట్రపతి చేతులు మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అక్షరం ముక్క రాని హజబ్బ ఎంతోమంది పిల్లలకు చదువుకునే భాగ్యం కల్పించారు. మంచి పనికి పేదరికం అడ్డుకాదని ఆయన నిరూపించారు. పళ్లు అమ్ముకుని జీవనం సాగిస్తున్న హజబ్బ.. సొంతిల్లు కూడా కట్టుకోకుండా తన ఊరి పిల్లల కోసం ఏకంగా పాఠశాల కట్టించారు. పద్మ అవార్డుతో వచ్చిన 5 లక్షల రూపాయలను కూడా స్కూల్కే ఇచ్చేసి మంచి మనసు చాటుకున్నారు. నెటిజనులు ఆయనకు కూడా సలాం చేస్తున్నారు! (Harekala Hajabba: అవమానం నుంచి పుట్టిన ఆలోచన..) -
ఆమె చేయని మంచి పని లేదు, సేవా రంగం లేదు.. ఓ అలుపెరుగని సంచారి!!
ఆమెకు నిరంతరం ఏదో ఒకటి చేయాలనే ఉత్సాహం. ఉత్సాహంగా ఉంటేనే అలసట తెలియదంటారు. యువత కోసం కొత్తకొత్తగా ఆలోచిస్తుంటారు అన్నీ నలుగురికీ చెప్పాలనేదే ఆమె ఆకాంక్ష. చూసిన ప్రతిదీ రాస్తారు, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తారు. ఒంటరిగానే ప్రయాణిస్తారు. సైకిల్ తొక్కాలి, కొండలు ఎక్కాలి అనే ఆలోచనతోనే ఉంటారు.. పాండమిక్ సమయంలోనూ ఎంతో ధైర్యంగా చురుగ్గా పనిచేశారు. యువతను ప్రోత్సహించడానికి గ్యాలరీ తెరిచారు. యువత జీవనానికి కావలసిన విషయాలు ప్రముఖులతో చెప్పిస్తున్నారు. హైదరాబాద్ లో నివసిస్తున్న భార్గవి నిరంతర సంచారి. ఆమె గురించి ఆమె మాటల్లోనే... మాస్టర్స్లో గోల్డ్ మెడల్ నేను పుట్టి పెరిగింది హైదరాబాదులోనే. బి.కామ్ వరకు చదువుకున్నాను. ఆ తరవాత వివాహం జరగడం, బాబు పుట్టడం, వాడు స్కూల్ కి వెళ్లటం... అన్నీ సామాన్యంగానే జరిగిపోయాయి. అప్పుడు నాకు ఆర్ట్ నేర్చుకోవాలని కోరిక కలిగింది. చిన్నప్పటి నుంచే నేను బొమ్మలు వేసేదాన్ని. ఏదో కారణంగా అప్పుడు నాకు ఆర్ట్ మీద దృష్టి పెట్టడానికి అవ్వలేదు. అబ్బాయి స్కూల్ కి వెళ్లాక నాకు చాలా సమయం దొరికేది. అప్పుడే నేను నా కలను నిజం చేసుకోవాలనుకున్నాను. నాన్నగారి స్నేహితుడి ప్రోద్బలంతో ఆర్ట్లో బ్యాచిలర్స్ డిగ్రీకి అప్లయి చేశాను. నాలుగు సంవత్సరాల కోర్సు పూర్తి చేశాను. డిగ్రీ చదివేటప్పుడు నాతో ఉన్నవారంతా చిన్నపిల్లలు. వాళ్లందరూ మధ్యతరగతివాళ్లు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారు. అప్పటికే వాళ్లు వేసిన పెయింటింగ్స్ తీసుకుని డబ్బులు ఇచ్చేదాన్ని. ఊరికే డబ్బులు ఇస్తే వాళ్లకి డబ్బు విలువ తెలియదని ఎంతో కొంత డబ్బులు ఇచ్చి కొంటూ వాళ్లని ప్రోత్సహించాను. మాస్టర్స్ కోసం సెంట్రల్ యూనివర్సిటీ కి అప్లయి చేసి, జాయిన్ అయ్యాను. గోల్డ్ మెడల్ సాధించాను. మాస్టర్స్ కోర్సు పూర్తయ్యాక కలకత్తా, బరోడా ప్రాంతాలకు వెళ్లాను. ప్రింట్ మేకింగ్ నేను కాలేజీ నుంచి బయటకు వచ్చాక ప్రింట్మేకింగ్ స్టూడియో పెట్టాలనుకుంటున్నారు. అప్పటికి హైదరాబాద్లో ఆ తరహా స్టూడియో లేదు. నా స్పెషాలిటీ కూడా ప్రింట్మేకింగ్లోనే. ఈ స్టూడియోకి పెద్ద మెషినరీ కావాలి. పెయింటింగ్కి కావలసిన రంగులు, జింక్ ప్లేట్లు ఉపయోగించి, పేపర్ మీద ప్రింట్ తీస్తాం. ఈ స్టూడియో నడపడానికి చదువుకున్నవారు చాలామంది కావాలి. నాతో చదువుకున్న వారినే కొందరిని ఇందులోకి తీసుకోవాలనుకున్నాను. ఫైనల్ డిస్ప్లే (ఫైనల్ ఇయర్) కి బరోడా, శాంతినికేతన్లాంటి ప్లేసెస్కి వెళ్లేదాన్ని. అక్కడ టీచర్ స్టూడెంట్ పద్ధతి లేదు. గురుకులంలాగ ఉంటుంది. సాయంత్రం దాకా క్లాసెస్ జరుగుతాయి. ఆ తరవాత బడ్డీకొట్టు దగ్గర కూర్చుని ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల గురించి, అన్ని విషయాలు ఒకరితో ఒకరు పంచుకుంటారు. హైదరాబాద్లో ఇటువంటి వాతావరణం లేదు. పిల్లలకు టీచర్ అంటే భయం. టీచరే అన్ని విషయాలు చెప్తారు. బరోడా ఒక ఆర్ట్ హబ్ భారతదేశంలో బ్యాచిలర్స్ డిగ్రీ అవ్వగానే బరోడాలో మాస్టర్స్ చేస్తారు. బరోడాలో చాలా స్టూడియోలు, గ్యాలరీలు ఉన్నాయి. ఒక్కో గది ఒక్కో ఆర్టిస్టుకి ఇస్తారు. 20 మంది ఒకచోట కూర్చుని పనిచేసుకునే అవకాశాలు ఉన్నాయి అక్కడ. ఇక్కడ అలాంటిది లేదు. అటువంటి స్టూడియో ఇక్కడి విద్యార్థుల కోసం ప్రారంభించాలనుకున్నాను. 2014లో ది ఆర్ట్ స్పేస్ అని ఆర్ట్ గ్యాలరీ ప్రారంభించాను. బాలమురళి, సినారె ప్రారంభోత్సవం చేశారు. థి అనేది సంస్కృత పదం. ఈ పదానికి చాలా అర్థాలున్నాయి. ఈ స్టూడియోలో లైబ్రరీ, పెయింటింగ్ గ్యాలరీ కూడా ప్రారంభించాను. యువతకు ఎవ్వరూ అవకాశాలకు ఇవ్వట్లేదు. ఆ అవకాశం నేను ఇచ్చి వాళ్లని ప్రోత్సహించాలనుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటివరకు క్రియేటివ్గా ఉన్న యువతను ప్రమోట్ చేస్తూనే ఉన్నాను. అంతర్జాతీయంగా కూడా ఫొటోగ్రఫీ, పెయింటింగ్, స్కల్ప్చర్ అన్నీ చేస్తున్నాను. మంచి విషయాలు ప్రతి సంవత్సరం యువతకు మంచి విషయాలు తెలిసేలా నాలుగు ప్రదర్శనలు చేస్తున్నాం. మోడరన్ ఆర్ట్, కాంటెంపరరీ ఆర్ట్.. అన్నీ చేస్తున్నాం. యువత చాలా బాగా వేసిన పెయింటింగ్స్ కొన్నాను. ఇప్పుడు వాళ్లు అంతర్జాతీయ స్థాయికి చేరారు. వాళ్ల పెయింటింగ్స్కి ఇప్పుడు లక్షల రూపాయలు వస్తాయి. పెయింటింగ్స్కి క్యూరేటర్ కోర్సు పెట్టి వారిని ప్రోత్సహిస్తున్నాను. బార్గవి చేయని మంచి పని లేదు, చేయని సేవా రంగం లేదు. ఎంతోమందికి భార్గవి ఆదర్శంగా నిలుస్తున్నారు. నిరంతర ప్రయాణాలు ►వైయస్సార్ యూనిర్సిటీ అడ్వయిజరీ బోర్డు మెంబర్ ►ఎన్జీవో సేవలు ►ఆదిలాబాద్ గిరిజనులు, అంధులు, వృద్ధులకు కావలసిన సేవలు ►గ్రామాన్నిదత్తతు చేసుకుని, బాగుచేయటం ►వ్యవసాయానికి భూమి క్లియర్ చేయటం కరోనా సమయంలో.. ►బోనాలు వంటి మన సంప్రదాయం గురించి మనకు తెలీదు. నిపుణులతో వాటి గురించి ఆన్ లైన్ లో చెప్పించటం. ►ఫౌండేషన్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్ (ఫేస్) తరఫున గ్రాంట్స్ ఇవ్వడం ►ఆన్లైన్లో ఎటికేట్ నేర్పటం ►కాలేజీలో నేర్పని విషయాలు బియాండ్ క్లాస్రూమ్లో నేర్పించటం ►కళాకారులకు ఉండవలసిన క్రమశిక్షణ గురించి నేర్పించటం ►పర్మనెంట్ రెసిడెన్సీకి ఎలా అప్లయి చేయాలి, అక్కడికి వెళితే ఎలా ఉండాలి, ఆర్టిస్టు క్యూరేట్ చేసి ఎలా గుర్తింపు తెచ్చుకోవాలి, ఫౌండేషన్ గ్రాంట్స్ ఎలా తెచ్చుకోవాలి వంటి విషయాల గురించి అవగాహన కల్పించటం ►చరిత్రకారులను పిలిపించి మాట్లాడించటం జ్ఞానాన్ని పంచటం... ఆర్టిస్టులు దేనిని ఎలా నేర్చుకుంటారోననే అంశం మీద ఆధారపడి, కొందరిని సెలక్ట్ చేసుకుని, వారికి ఉచిత తరగతులు (అమౌంట్ ఇస్తాం) నిర్వహిస్తున్నాం. హైదరాబాద్ గురించి చాలామందికి తెలియని ఎన్నోఉన్నతమైన విషయాలు... అంటే హైదరాబాద్లోని దిగుడు బావులు, వైల్డ్ లైఫ్, రాయల్ లైఫ్, చార్మినార్, బేకరీలు, ఆర్జిజాన్లు, గ్లిట్టరింగ్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, అత్తరు, ప్రీ మిడీవల్ ... ఇలా ఎన్నో విషయాలను వారికి తెలియచేసే తరగతులు నిర్వహిస్తున్నాం. పఠాన్చెరు అతి పురాతన ప్రదేశమని, అది ఒకప్పుడు వ్యాపార కేంద్రమని, కొలోనియల్ టైమ్ పీరియడ్ నాటి ప్రదేశమని, ఉర్దూ భాష మాట్లాడేవారని, అప్పటి జనజీవనం, సింగాడా కాయల గురించి (వాటర్ చెస్ట్నట్) ... ఇలా హైదరాబాద్ గురించినవన్నీ చెప్పాం. సంభాషణ: వైజయంతి పురాణపండ చదవండి: జలియన్వాలాబాగ్ దురంతం: ఒక జాతి ఆత్మను తాకిన తూటా.. -
Sakshi Excellence Awards అవార్డు మరింత స్ఫూర్తినిస్తుంది: అరుణ్ డేనియల్ ఎలమటి
-
సేవకు వందనం: ‘యంగిస్తాన్ ఫౌండేషన్’కు సాక్షి పురస్కారం
Sakshi Excellence Awards: హైదరాబాద్లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో ‘సాక్షి మీడియా 2020 ఎక్స్లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. ‘యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్–సోషల్ సర్వీస్’ అవార్డును యంగిస్తాన్ ఫౌండేషన్ స్థాపకుడు అరుణ్ డేనియల్ ఎలమటి అందుకున్నారు. కష్టాల్లో ఉన్నవారికి తన వంతుగా ఏమైనా చేయాలనే సంకల్పంతో 2014లో హైదరాబాద్లో ‘యంగిస్తాన్ ఫౌండేషన్’ ను స్థాపించారు అరుణ్. కోవిడ్ వల్ల నెలకొన్న దుర్భర పరిస్థితుల్లో తిండి లేక ఇబ్బందులు పడుతున్న సుమారు 20 లక్షల మందికి ఆహారం అందించింది ఈ సంస్థ. నల్లమల అటవీప్రాంతంలో అష్టకష్టాలు పడుతున్న గిరిజన కుటుంబాలకు నెలవారీ వంటసామాను సరఫరా చేశారు. మూగజీవాలకు కూడా ఆహారాన్ని అందించి వాటిపట్ల తమకున్న ప్రేమను చాటుకున్నారు. అంతేకాదు.. సోషల్ మీడియా ద్వారా మానసిక ఆరోగ్యం, గృహహింస, లింగవివక్ష, బ్రెస్ట్ క్యాన్సర్ తదితర విషయాలపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తున్నారు. సేవకు స్ఫూర్తి సేవా రంగంలో ముందుకు వెళ్లేలా యువతను ప్రోత్సహిస్తున్న సాక్షి మీడియాకు చాలా థ్యాంక్స్. ఎన్నో ఛాలెంజ్లు ఎదుర్కోవడానికి, మరింత మందికి సేవలు అందించడానికి ఈ పురస్కారం స్ఫూర్తిని ఇస్తుంది. – అరుణ్ డేనియల్ కుమార్, యంగిస్తాన్ -
ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడు.. ఆరునెలలకే సామాజిక సేవ అంటూ..
సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ యువతి ఆరు నెలలకే విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నై పెరంబూర్ నీలం తోటకు చెందిన రామచంద్రన్ (21). ఇతను ఆరు నెలల ముందు కీర్తన (21)ను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. కీర్తన చెన్నైలోని ఓ సూపర్ మార్కెట్లో పని చేస్తోంది. కొన్ని రోజులుగా రామచంద్రన్ పనికి వెళ్లకుండా సామాజిక సేవపై ఆసక్తి చూపినట్లు తెలిసింది. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో విరక్తి చెందిన కీర్తన శనివారం ఉదయం ఇంట్లో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను రాజీవ్గాంధి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం కీర్తన మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జాగృతి వామన్ ఆలయాన్ని పునర్నిర్మిస్తాం
సాక్షి, ముంబై: భారీ వర్షానికి దెబ్బతిన్న జాగృతి వామన్ మందిరాన్ని పునర్నిర్మిస్తామని తెలుగు సమాజ్ సేవా సంస్థ పదాధికారులు, సభ్యులు ప్రకటించారు. ముంబై నగరంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రభాదేవిలోని నాగుసయాజీ వాడిలో ఉన్న భారీ రావిచెట్టు నేలకూలడంతో చెట్టుపక్కనే ఉన్న ప్రముఖ ‘జాగృతి వామన్ మందిరం’ పాక్షికంగా దెబ్బతింది. సుమారు వందేళ్ల చరిత్రగల ఈ మందిరం తెలుగు వారికి ఎంతో ప్రసిద్ధి గాంచింది. ఆలయం దెబ్బతిన్నట్లు తెలియగానే తెలుగు సమాజ్ సేవా సంస్థ పదాధికారులు, సభ్యులు ఆదివారం పరుగున వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. మందిరంపై పడిన చెట్టు కొమ్మలు తొలగించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడే పటిష్టమైన మందిరాన్ని పునర్నిర్మించాలని సభ్యులందరు తీర్మానించారు. ఈ సేవా కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షుడు చిట్టా ఆనంద్, కార్యదర్శి కట్కం గణేశ్, సభ్యులు అంబల్ల సంతోష్, పతర్లా కిషన్, యెల్ది సుదర్శన్, మేక గంగాధర్, కట్కం రాజన్న, రాపెల్లి రాజ్పాల్, స్థానిక మరాఠీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
గ్రేట్ జర్నీ..పత్తి రైతుల కాగడా..
ఆమె ఓ ఉద్యమజ్యోతి. తాను వెలుగుతూ... పదిమందికి వెలుగులు పంచే కాగడా. ‘ఏ ఫ్రేడ్ హిస్టరీ – ద జర్నీ ఆఫ్ కాటన్ ఇన్ ఇండియా’లో వత్తిలా కాలిపోతున్న పత్తి రైతు జీవితాన్ని రాశారు. ఇంగ్లిష్ లిటరేచర్ చదివిన ఓ యువతి సామాజిక కార్యకర్తగా, మల్కా పరిరక్షకురాలిగా రూపాంతరం చెందడానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తుందా పుస్తకం. డెబ్బై ఐదేళ్లు దాటిన ఉజ్రమ్మ లైఫ్ జర్నీతోపాటు పెట్టుబడిదారుల గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా ఆమె తన ఉద్యమాన్ని మౌనంగా విస్తరింపచేస్తున్న వైనం కనిపిస్తుంది. అభ్యుదయ హైదరాబాదీ ఉజ్రమ్మ హైదరాబాద్లో అభ్యుదయ కుటుంబంలో పుట్టారు. నానమ్మ ఉద్యమస్ఫూర్తి వల్ల తమ కుటుంబంలో ఆడపిల్లల చదువుకు మార్గం సుగమమైందని చెప్పారామె. చిన్నాన్న సజ్జత్ జహీర్ కమ్యూనిస్ట్ భావాల ప్రభావం తన మీద ఉందంటారామె. సామాజికాంశాల మీద స్పందించే తత్వం చిన్నాన్న నుంచే వచ్చిందని చెప్పే వజ్రమ్మ ఉద్యమపోరు బ్రిటిష్ కాలంలోనే మొదలైంది. విదేశాల స్పిన్నింగ్ మిల్లులు సూచించిన పత్తి వంగడంతో మనదేశంలో పంట పండించడం మొదలైననాడే ఆమె పత్తి రైతుల ఆత్మహత్యలను ఊహించగలిగారు. ఆ దోపిడీ పత్తితో ఆగదని, దానికి అనుబంధ రంగమైన చేనేతకు కూడా ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. కష్టం మనది... లాభం వాళ్లది ‘‘మనదేశంలో రకరకాల వాతావరణం, భౌగోళిక వైవిధ్యతల కారణంగా ప్రాంతానికి ఒక రకం పత్తి పండుతుంది. ఆ పత్తి నుంచి వచ్చే దారం, ఆ దారంతో నేసే దుస్తులలోనూ భిన్నత్వం ఉంటుంది. ఇంతటి వైవిధ్యతను కాలరాసింది ఒక్క స్పిన్నింగ్ యంత్రం. విదేశాల్లో ఏర్పాటైన వస్త్ర పరిశ్రమలకు ముడిసరుకు కావాలి. ఆ ముడిసరుకు వాళ్లు తయారు చేసుకున్న యంత్రాలకు అనుగుణంగా ఉండాలి. అందుకోసం మన రైతులకు పత్తి గింజలనిచ్చి... ‘పంట పండించండి, ఉత్పత్తిని మేమే కొంటాం’ అని చెప్పారు. అలా పత్తి గింజ వాళ్లదైంది, దారం వాళ్లదే అయింది. దారం ధరను నిర్ణయించే అధికారమూ వాళ్లదే అయింది. దాంతో చేనేత రంగం ముడిసరుకు సమస్యలో పడిపోయింది. మనది కాని వంగడం తో తెగుళ్లు ఎక్కువ. దాంతో పత్తిని పండించే రైతు బతుకుకు లాభాలు వస్తాయనే భరోసా లేదు. దారం ధర నిర్ణయించేది వాళ్లే... దాంతో చేనేత మగ్గం అంధకారంలో మగ్గిపోయింది. లాభాలు మాత్రం స్పిన్నింగ్ మిల్లులవి. లాభాలను బట్టే సమాజంలో గౌరవాల స్థాయిలో కూడా ఎంతో తేడా. పత్తి రైతు, చేనేతకారుడు ఈ విషవలయం నుంచి బయటపడి ఆర్థికంగా బలపడాలి. దేశంలో అనేక ప్రాంతాల్లో పత్తి రైతులను, చేనేత పరిశ్రమలను స్వయంగా చూశాను. చేనేతకారులు తమ ఉత్పత్తులు మార్కెట్ చేసుకోవడానికి ‘దస్తకార్ ఆంధ్ర’ రూపకల్పనలో పనిచేశాను. పదమూడేళ్లు గా మల్కా పరిరక్షణ మీద దృష్టి పెట్టాను. మల్కా అంటే ఖాదీ వంటి ఒక వస్త్ర విశేషం. ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా ఉండదు. సిరిసిల్లలో డెబ్బై కుటుంబాలు మల్కా పరిరక్షణలో పని చేస్తున్నాయి. యూరప్, యూఎస్లు తాము అనుసరిస్తున్న సైన్స్కి మోడరన్ సైన్స్ అని ఒక ముద్ర వేసుకుని, థర్డ్ వరల్డ్ కంట్రీస్ని తమ గుత్తాధిపత్యంలోకి తెచ్చుకోవడానికి కుట్ర పన్నాయి. మన యువతకు చెప్పేది ఒక్కటే. విదేశాల మీద ఆధారపడే పరిస్థితి నుంచి మనం బయట పడాలి. మన పత్తి నుంచి దారం తీయడానికి అధునాతన యంత్రాలను కనిపెట్టండి. మన పత్తి, మన దారం, మన నేత... వీటన్నింటికీ మనమే ధర నిర్ణయించగలిగిన వాళ్లమవుతాం’’ అంటారామె. సెలబ్రిటీల సెలబ్రిటీ ఉజ్రమ్మ నిరాడంబరంగా ఉంటారు. సెలబ్రిటీలు ఆమెతో ఫొటో తీసుకోవాలని ముచ్చటపడతారు. చేనేత అనగానే ముఖం చిట్లించే వారి చేత ‘ఐ లైక్ హ్యాండ్ వీవెన్ ఇండియన్ కాటన్’ అని స్టైలిష్గా పలికిస్తున్నారామె. పత్తి రైతు బతుకుకు కొరివి పెడుతున్న కంపెనీల బారి నుంచి రైతు జీవితానికి కాగడా పట్టే ప్రయత్నం చేస్తున్నారు. తన ఉద్యమానికి వారసులుగా కొత్తతరం చేనేతకారులను తయారు చేస్తున్నారు. వారి కోసం మెహిదీపట్నంలో మల్కా మార్కెటింగ్ ట్రస్ట్ ద్వారా మార్కెటింగ్ మెళకువలు నేర్పిస్తున్నారు ఉజ్రమ్మ. – వాకా మంజులారెడ్డి -
కలెక్టర్కు హైకోర్టు వినూత్న ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్: కోర్టుధిక్కరణ కేసులో తనకు విధించిన శిక్షను రద్దు చేయాలంటూ ఓ కలెక్టర్ దాఖలు చేసిన అప్పీల్లో హైకోర్టు వినూత్న ప్రతిపాదన చేసింది. స్వచ్ఛందంగా సామాజిక సేవ చేసేందుకు ముందుకు వస్తే కోర్టుధిక్కరణ కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును నిలిపివేసే విషయాన్ని పరిశీలిస్తామని నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పౌరసరఫరాల విభాగం ఉద్యోగిని పి.సంధ్యారాణిలకు హైకోర్టు సూచించింది. తదుపరి విచారణలోగా ఎటువంటి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారో తెలపాలని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. సివిల్ సప్లయిస్ అధికారులు అకారణంగా తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ వరంగల్ పట్టణానికి చెందిన పరమేశ్వర బిన్నీ రైస్ మిల్ యజమాని జి.చంద్రశేఖర్ 2016లో హైకోర్టును ఆశ్రయిం చారు. తనపై క్రిమినల్ కేసును సాకుగా చూపి ధాన్యం సరఫరాను నిలిపివేశారని, ఇదే తరహా కేసులు ఉన్నవారికీ సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఈ పిటిషన్ను విచారించిన సింగిల్ జడ్జి... పరమేశ్వర మిల్స్కు కూడా ధ్యానం సరఫరా చేసి బియ్యాన్ని కొనుగోలు చేయాలని అప్పటి వరంగల్ జాయింట్ కలెక్టర్ పాటిల్, డీఎస్వో సంధ్యారాణిలను ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను అమలు చేయకపోగా తనను మరింత ఇబ్బందులకు గురిచేశారంటూ 2016లోనే మిల్లు యజమాని చంద్రశేఖర్ కోర్టుధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు విచారించారు. జేసీ పాటిల్, సంధ్యారాణిలు నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ ఇద్దరికీ రూ.2 వేల చొప్పున జరిమానా లేదా ఆరు వారాలపాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ పాటిల్ 2017లో అప్పీల్ దాఖలు చేశారు. -
సోనూసూద్కు పద్మసేవా పురస్కార ప్రదానం
సాక్షి, హైదరాబాద్: సేవ అనే పదం వింటే చాలు సోనూసూద్ గుర్తుకొస్తున్నాడు. ఏ కష్టం వచ్చినా దేవుడికి దండం పెట్టుకొని తర్వాత సోనూకు ఓ అప్లికేషన్ కూడా పెడుతున్నారు సామాన్యులు. సోనూ అసాధారణ సేవలకు యూఎన్ఓ నుంచి ప్రతిష్టాత్మక స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డ్ అందుకున్నాడు. యూకేకు చెందిన ఈస్టర్న్ ఐ పత్రిక ‘టాప్ 50 సౌత్ ఏషియన్ సెలబ్రిటీస్ ఇన్ ద వరల్డ్’ లిస్ట్లో ఫస్ట్ప్లేస్లో నిలిచాడు. సేవతో.. అటు పేరు ప్రతిష్టలు, ఇటు ప్రతిష్టాత్మక పురస్కారాలనూ అందుకుంటున్న సోనూసూద్కి అవార్డ్ ఇవ్వాలంటే మాటలా? కానీ సిటీకి చెందిన ఓ సాధారణ కార్పెంటర్ సోనూకు అవార్డ్ ఇవ్వడం, దాన్ని ఆయన వినమ్రంగా స్వీకరించడం విశేషం. నగరానికి చెందిన ఇంద్రోజిర రమేష్ ఓ కార్మికుడు. బాల్యమంతా కష్టనష్టాలతోనే నెట్టుకొచ్చాడు. ఎవరైనా సాయం చేస్తారేమో అని ఎదురుచూసిన సందర్భాలెన్నో.. దాంతో సామాజిక సేవకులంటే అమితమైన ఆరాధన ఆయనకు.. సమాజ సేవే లక్ష్యంగా ముందుకు వెళ్లే వారిని వెతికి మరీ ఆసరా అందిస్తారు. అలాంటి మానవతా వాదులను వెతుక్కుంటూ వెళ్లి తనే స్వయంగా తయారు చేసిన ప్రతిమని బహుకరించి పద్మ సేవా అవార్డుతో సత్కరిస్తాడు. కొంతకాలంగా సేవకుల్ని సత్కరిస్తూ వస్తున్న ఈ సేవ బాలీవుడ్ స్టార్, మానవతావాదిగా ఎంతో ఎత్తుకు ఎదిగిన సోనూసూద్కు చేరింది. ఓ నమస్కారం.. ఓ పురస్కారం.. తన స్తోమతకి మరొకరికి సాయం చేయలేడు.. కానీ అలా అండగా నిలుసున్నవారిని అభినందించాలని తపనపడ్డాడు. ఆ తపన ఫలితమే ‘పద్మ సేవా పురస్కారం’. తనో మంచి కళాకారుడు కూడా.. అద్భుతమైన ఫొటో ఫ్రేమ్లు తయారు చేస్తాడు. అలా సమాజ సేవ చేస్తున్న వారి సేవలు ప్రతిబింబించేలా ప్రతిమని తయారు చేసి వారివద్దకే వెళ్లి చిరు సత్కారంతో అందిస్తాడు. ఇలా సామాజిక సేవకులను వెతుక్కుంటూ రాష్ట్రాలు సైతం దాటి వెళ్లాడు. ఇప్పటి వరకు 95 మందికి పైగా వీటిని అందించాడు. అందులో ఉచితంగా గుండె ఆపరేషన్స్ చేయిస్తున్న లారెన్స్, కష్టాల్లో ఉన్నవారికి ‘నేను సైతం’ అంటూ అండగా నిలిచిన లక్ష్మీ మంచు, 220 సార్లు రక్తదానం చేసిన సంపత్ కుమార్, భిక్షాటనతో సంపాదించిన రూ.3 లక్షలను సమాజానికే ఖర్చు చేసిన కామరాజు లాంటి వారు ఎందరో ఉన్నారు. సోనూ.. ది గ్రేట్.. కరోనా కష్టకాలంలో పేదవారికి పెద్ద దిక్కుగా మారాడు సోనూసూద్. సినిమాల్లో విలన్గా చేసినా నిజజీవితంలో మాత్రం ప్రజల మనసు గెలుచుకున్న హీరోగా నిలిచాడు. ఈ నేపథ్యంలో సోనూసూద్ను ఎలాగైనా తన అవార్డ్తో సత్కరించాలనుకున్నాడు రమేష్. నగరానికి వచ్చిన సోనూసూద్ను కలిసి ప్రతిమతో సత్కరించాడు. ఎన్నో కష్టాలు అనుభవించా.. చిన్నప్పుడు నేను ఎన్నో కష్టాలు అనుభవించా.. ఆ సమయంలో నాకు ఎవరూ సాయం చేయలేదు. ఎన్నో ఏళ్లుగా కార్పెంటర్గానే కొనసాగుతున్నాను. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే వారంటే నాకు ఎంతో ఇష్టం. నా ఆర్థిక స్తోమతకు తగ్గట్లు నేనే సొంతంగా అవార్డు తయారు చేసి వారికి అందజేస్తున్నాను. అందరూ ఎంతో సంతోషంగా తీసుకొని నన్ను మెచ్చుకుంటున్నారు. – రమేష్, కార్పెంటర్ -
‘మూగ’నేస్తాలు
సాక్షి, హైదరాబాద్ : 2018 కేరళలో వరదల విల యం.. జనాన్ని కాపాడటంలో అధికార యంత్రాంగం నిమగ్నం.. మరి మూగజీవాల సంగతో?.. అవి వరదలో చిక్కి విలవిల్లాడుతున్నాయని తెలిసి హైదరాబాద్ నుంచి పదిమంది బయల్దేరారు. జేబులు తడుముకుంటే ఓ 90 వేలు పోగయ్యాయి. మరో రూ.30 వేలు విరాళాలుగా పట్టుకుని.. పది హేను రోజులు అక్కడే మకాం వేసి చెట్టూపుట్టా తిరిగి వెయ్యి జంతువులను కాపాడారు. మొన్న..: హైదరాబాద్ను ముంచిన వరదలు.. మళ్లీ ఆ పది మందే రెండ్రోజులపాటు రాత్రింబవళ్లు మోకాల్లోతు నీళ్లలో నగరమంతా తిరిగి వందలాది జంతువులకు ఊపిరిలూదారు. ఇటీవల..: చందానగర్లో 70 అడుగుల లోతైన బోరుబావిలో పిల్లికూన పడిపోయింది. ఈ పదిమందీ 34 గంటలు శ్రమించి బయటకుతీశారు.ఇలా ఈ పది మంది యువకులు ఇప్పటివరకు కాపాడిన జంతువులు, పక్షుల సంఖ్య 70 వేలపైమాటే. యువతలో జీవకారుణ్యాన్ని నయా ట్రెండ్గా మార్చే ప్రయత్నంలో ఉన్న వీరంతా ఉన్నత విద్యావంతులే. మూగజీవాలకు నేస్తాలయ్యేందుకు బంగారంలాంటి జాబ్లనూ వదిలేసుకున్నారు. బోరుబావులు, వ్యవసాయబావులు, నాలాలు, కాలువల్లో పడ్డ వేలసంఖ్యలో జంతువులను రక్షించారు. మాంజా దారాలు, చెట్టు సందులు, కిటికీల్లో ఇరుక్కున్న, కుక్కల దాడిలో గాయపడిన పక్షులను కాపాడారు. ఒక్కరితో మొదలై హైదరాబాద్ కేంద్రంగా ‘యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ’గా రూపాంతరం చెందింది. ప్రమాదంలో ఉన్న మూగజీవాలను కాపాడటంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న ప్రదీప్నాయర్.. తనలాంటి ఆలోచనలే కలిగిన మరికొందరితో కలిసి దీన్ని ఏర్పాటుచేశారు. ప్రతి నెలా రూ.లక్షపైనే ఖర్చు కొద్దిరోజుల కిందట నగరానికి 250 కి.మీ. దూరంలోని నిజామాబాద్ జిల్లా నుంచి రాత్రి ఫోన్కాల్.. పెద్దబావిలో కుక్క పడిందని. అప్పటికే మూడ్రోజులు కావటంతో దాని ఆరోగ్యం క్షీణించింది. ఈ బృందం కారు అద్దెకు తీసుకుని వెళ్లి కుక్కను రక్షించింది. రూ.6 వేలు ఖర్చయ్యాయి. దగ్గరైతే టూవీలర్లు, దూరమైతే అద్దె కార్లు.. ప్రతి టూర్లో ఖర్చే. వీరిలో ఒక్కరికే సొంత కారుంది. సొంత డబ్బులతోనే జంతువులను కాపాడేందుకు అవసరమైన పరికరాలు కొన్నారు. ట్రాలీతో కూడిన జీపులాంటిది జంతువుల రెస్క్యూ ఆపరేషన్కు బాగా ఉపయోగడుతుంది. కానీ, సాయం చేసేవారు లేక సమకూర్చుకోలేదు. రెస్క్యూల ఖర్చు ప్రతినెలా కాస్త అటూఇటూగా రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు వస్తుంది. ఇదంతా జేబు నుంచే పెట్టుకుంటున్నారు. కేరళ వరదలతో పెరిగిన పట్టుదల కేరళ వరదల్లో చిక్కుకున్న మూగజీవాలను రక్షించటంలో కీలకంగా వ్యవహరించి అక్కడి ప్రభుత్వ ప్రశంసలందుకుందీ బృందం. 15 రోజులు అక్కడే మకాంవేసి రోజుకు ఐదారువేల చొప్పున పడవ ఖర్చులు భరించి మరీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. 1,200 మూగజీవాలను రక్షించారు. వీటన్నింటికీ అన్ని రోజులూ ఆహారం అందించారు. తల్లి నుంచి దూరమై వరదల్లో కొట్టుకుపోతున్న ఓ ఏనుగునూ కాపాడారు. అలప్పీ ప్రాంతంలోని 20 గ్రామాల్లో వరదల్లో కొట్టుకొచ్చి ఇళ్లలో నక్కిన పాములను పట్టి అటు వాటిని, వాటి నుంచి జనాన్ని కాపాడారు. మూగజీవాల రక్షణ..విద్యార్థులకు శిక్షణ నగరం చుట్టూ ఉన్న చెరువుల్లో చేరిన కాలుష్య వ్యర్థాలను తొలగించే బాధ్యతనూ ఈ బృందం భుజాన వేసుకుంది. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్, అమీన్పూర్ లేక్, ఫాక్స్సాగర్ సహా పలు చెరువుల వద్ద ప్లాస్టిక్, ఇతర రసాయన వ్యర్థాలు, గుర్రపుడెక్క తొలగించి అటు జలచరాలకు ఇటు అక్కడకు వచ్చే పక్షులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. వలస పక్షులకు ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి వాటిని సంరక్షిస్తున్నారు. విద్యార్థులను సమీకరించి జంతు సంరక్షణపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వారిలో జీవకారుణ్యాన్ని పెంచుతున్నారు. ఖాళీ సమయాల్లో వృథాగా తిరగకుండా వారిని జంతువులను కాపాడే పనిలో బిజీగా మారుస్తున్నారు. ఏటా వేసవిలో దాహంతో అల్లాడే జంతువుల కోసం నీటి సాసర్లు, ఊరపిచ్చుకలను తిరిగి రప్పించేందుకు వందల సంఖ్యలో గూళ్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. జనంలో జీవకారుణ్యం పెంచేందుకే.. బీటెక్ కాగానే మరో ఇద్దరితో కలిసి సొంత సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టా. మంచి ఆర్డర్స్, భారీ ఆదాయం. కానీ ప్రమాదంలో ఉన్న జంతువులను కాపాడాలనే నా ఆశయం పక్కదారి పడుతోందనిపించింది. వెంటనే సంస్థను వదిలేసి నాకు నచ్చిన రూట్లోకి వచ్చా. నాతో కలిసి యానిమల్ కన్జర్వేషన్ యాక్టివిటీలో ఉన్న సంతోషిని పెళ్లి చేసుకున్నా. సంజీవ్శర్మ, అమర్ కూడా మంచి ఉద్యోగాలను వదులుకుని మూగజీవాల రక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నారు. నేటి యువతలో జంతువులపై ప్రేమను పెంచాలన్నదే మా సంకల్పం. అనిరుధ్ సహదేవ్, ప్రభు, మెస్సీ, రాఘవ్, బాలాజీ, మనీష్ చాలాకాలంగా మాతో సాగుతున్నారు. – ప్రదీప్నాయర్, యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ అధ్యక్షుడు ఆ పదిమంది.. మూగజీవాలంటే అమితమైన ప్రేమ గల ప్రదీప్నాయర్.. వాటి కోసం సమయం కేటాయించలేకపోతున్నాననే భావనతో సొంత సాఫ్ట్వేర్ కంపెనీనే మూసేశారు. ఇంటి వద్దే వెబ్ డిజైన్ చేస్తూ ఇప్పుడు మరింత ఎక్కువ సమయాన్ని మూగజీవాల రక్షణకు కేటాయిస్తున్నారు. తనలాంటి అభిరుచే కలిగిన సంతోషిని పెళ్లి చేసుకున్నారు. ఈమె కూడా ‘వర్క్ ఫ్రమ్ హోం’చేస్తూనే మిగతా సమయంలో భర్తకు చేదోడుగా ఉంటారు. బహుళజాతి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే బడా ఎమ్మెన్సీలో కీలక ఉద్యోగి అయిన సంజీవ్వర్మ.. జంతువులపై ప్రేమతో ఉద్యోగాన్ని వదులుకున్నారు. ఇంట్లోనే కన్సల్టెన్సీ తరహా సేవలందిస్తూ, ఎప్పుడంటే అప్పుడు మూగజీవాల రక్షణకు పనిచేస్తున్నారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్లో భారీ ఐటీ ప్రాజెక్టులు చేపట్టే అమర్ సైతం జంతువులపై ప్రేమతో ఉద్యోగాన్ని వదిలి సొంతంగా ఐటీ కన్సల్టెన్సీ పెట్టుకున్నారు. వీరంతా పక్షులు, జంతువులపై ప్రేమతో పెద్ద కొలువులు వదిలి.. చిన్నగా ఉపాధి పొందుతూ.. అలా వచ్చిన డబ్బులనే వాటి సంరక్షణకు వెచ్చిస్తున్నారు. ఇంకా.. అనిరుధ్ సహదేవ్, మనీష్, ప్రభు, మెస్సీ, రాఘవ్, బాలాజీ.. వీరంతా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూనే జంతురక్షణకు సమయం కేటాయిస్తుంటారు. వీరి ధ్యాసంతా మూగజీవాలపైనే. ఫోన్ మోగితే చాలు అర్ధరాత్రయినా లేచి పరుగుపెట్టడమే. డబ్బులకు కటకట ఉన్నా, కుటుంబసభ్యుల నుంచి వ్యతిరేకత వచ్చినా ముందుకే సాగుతున్నారు. -
సేవకు గుర్తింపు....
సాక్షి, హైదరాబాద్: కరోనా విపత్తులో సామాన్య జనానికి పలు సేవా కార్యక్రామాలు అందించినందుకుగాను సీనియర్ సబ్ ఎడిటర్, సామాజిక కార్యకర్త టి.గోపీనాథ్ను ‘విశ్వగురు వరల్డ్ రికార్డ్స్’ సంస్థ ‘కరోనా వారియర్ ఇంటర్నేషనల్ హానర్’ పేరుతో సత్కరించింది. కోవిడ్ కష్టకాలంలో ఇబ్బందులు ఎదుర్కొన్న పేదవారిని గుర్తించి వారికి నిత్యావసరాలు అందించడమేగాక, అలాంటి వారి ఉనికి వెలికి తీసి మరిన్ని సంస్థల సహకారం అందేలా గోపినాథ్ కృషి చేశారు. ఈ మేరకు ‘విశ్వగురు వరల్డ్ రికార్డ్స్’ సంస్థ ఆయనకు సర్టిఫికెట్ ప్రదానం చేసింది. సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ నేమాని భాస్కర్ ఈ మేరకు గోపీనాథ్ను అభినందించారు. తనకు అందిన పురస్కారం తాను మరిన్ని సేవాకార్యక్రమాలు చేసేందుకు బలాన్నిచ్చిందని గోపీనాథ్ పేర్కొన్నారు. గాయని పద్మశ్రీ త్యాగరాజుకు.. సుల్తాన్బజార్: ప్రఖ్యాత గాయని పద్మశ్రీ త్యాగరాజుకు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ వారు ‘కరోనా వారియర్ ఇంటర్నేషనల్ హానర్’ అవార్డును అందించారు. కరోనా కాలంలో పద్మశ్రీ త్యాగరాజు ‘కోవిడ్–19 మ్యూజిక్ ఛాలెంజ్’ శీర్షికన ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు 100 పాటలు స్వయంగా పాడి రోజుకో పాట చొప్పున ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ తన గానం ద్వారా అందరినీ ఆనందపరిచారు. కరోనా కాలంలో ఆమె చేసిన కృషిని గుర్తించి ‘విశ్వగురు’ ఎండీ సత్యవోలు రాంబాబు స్వయంగా పద్మశ్రీ త్యాగరాజుకు అవార్డు ప్రదానం చేశారు. -
లక్ష్మణుడు..అందరి ఆప్తుడు
సాక్షి,సిటీబ్యూరో: పెద్ద ఉమ్మడి కుటుంబం, ఎంత పని చేసినా సమయం చాలని వ్యాపార సమూహం, కాలక్షేపానికి బోలెడు మంది స్నేహితులు..అన్నీ ఉన్నా ఏదో వెళితి అతడిని వెంటాడింది..అన్ని పనులు చేస్తున్నా ఎక్కడో తెలియని అసంతృప్తి ఆయనలో మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో సమాజం నుంచి ఎప్పుడూ తీసుకోటమే కాదు, సమాజానికి మనమూ ఇవ్వాలన్న ఆలోచనతో బీఎల్ఆర్(బండారి లక్ష్మారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్) ఏర్పాటు చేశాడు. గత ఐదేళ్లుగా తన చుట్టూ ఉన్న వారు కన్నీళ్లు, కష్టాలు ఎదుర్కోకూడదన్న లక్ష్యంతో ప్రతి నెల ఐదు రోజులు పూర్తిగా స్వచ్చంద సేవకోసం కేటాయిస్తున్నారు బండారి లక్ష్మారెడ్డి. ఇబ్బందుల్లో ఉన్నవారు తన వద్దకు రావటం కంటే తానే చుట్టూ ఉన్న సమూహాల్లో ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారి వద్దకే వెళ్లి ఓ తోబుట్టువులా స్నేహితుడిలా ఓదార్చి వారి జీవితాలు మళ్లీ గాడిన పడేందుకు అవసరమైన సహాయం చేస్తున్న తీరు అందరి మన్ననలు పొందుతోంది. ఎంప్లాయిమెంట్తో మొదలై: ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగం, ఉపాధి వేటలో కుదేలైన వారి కోసం ఆయన ఐదేళ్ల క్రితం నగరంలోని పలు ప్రాంతాల్లో ఎంప్లాయిమెంట్ గైడెన్స్ మేళాలు నిర్వహించారు. ఎంతోమంది నిరుద్యోగ యువతకు తన స్నేహితుల కంపెనీల్లో అవకాశాలిప్పించటంతో పాటు పలువురికి పోలీస్ ఉద్యోగాల కోసం రెండు నెలల పాటు ప్రత్యేక క్యాంప్నే నిర్వహించారు. ఇందులో తొమ్మిది మంది మెరిట్ జాబితాలో ఉద్యోగం సంపాదించుకున్నారు. ప్రస్తుతం వారు కూడా ఉద్యోగాన్వేషణలో ఉన్న యువతకు గైడెన్స్ ఇస్తుండటం విశేషం. ఆపత్కాలంలో అన్నీ తానై.. కోవిడ్ మహమ్మారి విస్తరణ నేపథ్యంలో కార్మికులు, నిరుపేదలను ఆదుకునేందుకు బీఎల్ఆర్ ట్రస్ట్ అన్నీ తానై ముందుకు వచ్చింది. కరోనా నియంత్రణపై అవగాహన కల్పించడమేగాక, కార్మికులకు అవసరమైన పీపీఈ కిట్ల పంపిణీ, కాలనీల్లో రోజూ డిస్ఇన్ఫెక్షన్ మందుల పిచికారీ, వైరస్ బారిన పడిన వారికి పౌష్టికాహారం పంపిణీ చేస్తూ వారు కోలుకునేందుకు ట్రస్ట్ వలంటీర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇవే కాకుండా కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి గత ఐదు నెలలుగా నిత్యావసర కిట్లను అందజేస్తున్నారు. ఈ విషయమై లక్ష్మారెడ్డిని కదిలిస్తే..’’అపదలో ఉన్న వారికి అండగా ఉండేందుకు తోబుట్టువులే అయి ఉండాల్సిన అవసరం లేదు.. అన్ని మార్గాలు మూసుకుపోయిన వారికి కొత్తదారిని చూపేందుకు స్నేహితుడే కావాల్సిన అవసరం లేదు. నా కిచ్చిన శక్తిని సమాజంలో మంచి కోసం ఉపయోగిస్తున్నా..అందులో గొప్పేం లేదు’’ అని పేర్కొన్నారు. -
అందం.. సేవానందం..
చక్కని అందంతో పాటు మంచి మనసు కూడా ఉంటే మరింతగా ఆ అందం వన్నెలీనుతుందని అనడంలో అతిశయోక్తి లేదు. నగరానికి చెందిన మోడల్, పలు అందాల పోటీల విజేత రష్మీ ఠాకూర్ అలాంటి వన్నెలీనే గ్లామర్ క్వీన్. కొంతకాలంగా గ్లామర్ రంగంలో రాణిస్తున్న ఆమె.. లాక్డౌన్ సమయంలో తన రైజ్ ఇండియా ఫౌండేషన్ ద్వారా ఆపన్నులకు ఆసరాగా నిలిచారు. అంతేకాదు అంతర్జాతీయ స్థాయి సంస్థకు నగరానికి చెందిన మోడల్ బ్రాండ్ అంబాసిడర్ కావడమనే అరుదైన ఘనతను సాధించారు. సాక్షి, సిటీబ్యూరో: యూఎన్ ఆధ్వర్యంలోనే గ్లోబల్ డిప్లొమాటిక్ కౌన్సిల్కు ఫార్ ఈస్ట్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంబాసిడర్గా అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ లైఫ్స్టైల్స్ డైరెక్టర్గా ఎంపికైనట్టు రష్మీ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా తన గురించి పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే... ఫ్యాషన్.. ప్రొఫెషన్.. మాది ఒకప్పటి కరీంనగర్ జిల్లా.. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాగా మారింది. నాన్న రైతు. నేను బీకామ్ కంప్యూటర్స్, టెక్స్టైల్స్లో డిప్లొమా చేశాను. అనుకోకుండా అందాల పోటీల్లోకి ప్రవేశించాను. నిఫ్ట్లో ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నప్పుడు మోడలింగ్ చేశాను. ఫస్ట్ 2013లో అందాల పోటీల్లో పాల్గొన్నాను. ఆ తర్వాత ఏడాది 2014 జనవరి 18న మిస్ ఏపీ గెలిచాను. అక్కడ నుంచి 2016లో మిస్ బ్యూటీఫుల్ ఐస్, మిస్ పర్ఫెక్ట్ టైటిల్స్ గెలిచాను. 2016లో మిస్ ఇండియా ప్లానెట్ గెలిచాను. మొత్తం 7 టైటిల్స్ గెలిచాను. ప్రొఫెషనల్ మోడల్గా దాదాపు అన్ని క్లోతింగ్ బ్రాండ్స్కు పనిచేశా. పలు అందాల పోటీలకు జడ్జ్గా వ్యవహరించాను. 2017 నుంచి నేషనల్ హ్యాండ్లూమ్స్కి అంబాసిడర్గా ఉన్నాను. సినిమా అవకాశాలు వచ్చాయి.. కానీ చేయలేదు. ఎందుకంటే గ్లామర్ రంగం ద్వారా వచ్చిన గెలుపును వ్యక్తిగతానికి కాకుండా సమాజహితానికి వినియోగించాలని నా ఆలోచన. సేవానందం.. అందాల పోటీలకు, గ్లామర్ రంగ తళుకు బెళుకులతో పాటు సమాజంలో ఉన్న కష్టాలు కన్నీళ్లూ కూడా చూశాను. సమాజం పట్ల నా వంతు బాధ్యత నిర్వర్తించాలని 2017 నుంచి రైజ్ ఇండియా అనే ఎన్జీఓ నిర్వహిస్తున్నాను. ఇటీవల లాక్డౌన్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గ్రాసరీస్ ఇచ్చాను. తల్లీ, పిల్లలకు కావాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ అందించాం. ఇప్పటికీ కోవిడ్–19 పరోక్షంగా చాలామంది జీవితాలను దెబ్బతీసింది. రైజ్ ఇండియా ఫౌండేషన్ ద్వారా వీలైనంత మంది ఉపాధి కరువైన మహిళలు నిలదొక్కుకునేలా చేయాలని ఆలోచిస్తున్నాం. బ్రాండ్ అంబాసిడర్ హోదాలో... ఇదే సమయంలో యునైటెడ్ నేషన్స్తో అనుబంధంగా పనిచేసే గ్లోబల్ డిప్లొమాటిక్ కౌన్సిల్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక అవడం నా లక్ష్యాలను నెరవేర్చుకోవడంలో మరింత ఉపకరిస్తుంది. ఈ సంస్థ 14 దేశాల్లో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మహిళా స్వయంసాధికారతకు పెద్దపీట వేస్తోంది. అంబాసిడర్గా 3 సంవత్సరాలు ఉంటాను. గ్లామర్ రంగాన్ని కూడా సరిగా ఉపయోగించుకుంటే మహిళలకు విభిన్న రకాల అవకాశాలు అందించే చక్కని ప్రొఫెషన్. ఈ రంగం మీద ఉన్న అపోహలు తొలగించి ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చే ఆలోచన ఉంది. -
సేవల మాటున స్వాహా!
వివిధ రకాలుగా పేదలకు సహాయం చేస్తున్నట్లు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. కొందరైతే బాధితుల ఇళ్లకు వెళ్లి వారితో భోజనం చేస్తూ, వారి ఇబ్బందులు తెలుసుకుంటూ.. మరి కొందరు బ్యాంకుల్లో ఖాతాలను ప్రాంభించి సహాయం చేయాలని హృదయ విదారక సందేశాలతో సోషల్ మీడియాలో ఆప్లోడ్ చేస్తూ దయామయులను దోచుకుంటున్నారు. సాక్షి సిటీబ్యూరో: మేము మూడు నెలలుగా బస్తీల్లోని పేదలకు రోజూ రెండు పూటలా భోజనం అందజేస్తున్నాం. అవసరమైన వారికి మందులు సరఫరా చేస్తున్నాం. రోగాల బారినపడిన వారికి కార్పొరేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం చేస్తున్నాం. కరోనా టైమ్లో ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లు అందజేస్తున్నాం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వీడియోలు చూసి చలించిపోయిన ఎందరో దేశ విదేశాల నుంచి ఆయా అకౌంట్లకు విరాళాలను పంపిస్తున్నారు. కొందరు నేరుగా, మరికొందరు తమ పేరు రాకుండా గోప్యంగా ఆయా సంస్థల ప్రతినిధులకు డబ్బులు అందజేస్తున్నారు. అయినా ఈ విషయంలో సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. సహాయం చేస్తామని అకౌంట్ ప్రారంభం... చాంద్రాయణగుట్ట సమీపంలో ఓ పేద కుటుంబం ఉంది. తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నది. వీరికి నలుగురు అమ్మాయిలు. తండ్రి సంపాదన అంతగా లేదు. లాక్డౌన్ కారణంగా తండ్రికి వచ్చే కొద్దిపాటి ఆదాయం రాలేదు. తల్లి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుంది. దీంతో చుట్టు పక్కల వారు, బంధువులు తోచినకాడికి సహాయం చేశారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నది అనే విషయం ఓ స్థానిక స్వచ్ఛంద సంస్థ నేతలకు తెలిసింది. వారు ఇంటి వచ్చి చూశారు. ఇంట్లో పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. కుటుంబ సభ్యులు, మంచాన ఉన్న తల్లితో సహా మనస్సు తల్లడిల్లిపోయేలా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో పాటు దేశ విదేశాల నుంచి దాతలు సహాయం చేయడానికి బంధువుల పేరుతో బ్యాంక్లో అకౌంట్ ప్రాంభించారు. రెండు మూడు రోజుల్లో ఆ అకౌంట్లో దాదాపు రూ. 45 లక్షల సహాయం అందింది. సంస్థ ప్రతినిధుల సహాయంతో కుటుంబ సభ్యులు తల్లిని ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేశారు. డాక్టర్లు రోగి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఇంతలోనే దాతల ద్వారా వచ్చిన రూ. 45 లక్షల్లో నుంచి లక్షన్నర ఆస్పత్రిలో కట్టారు. కానీ ఆమె ఆరోగ్యం క్షీణించి మృతి చెందింది. ఆమె మృతికి ముందే ఆ సంస్థ ప్రతినిధి తమ అకౌంట్లోని రూ. 15 లక్షలు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. మిగతా డబ్బును కూడా ఇతర ప్రతినిధి అకౌంట్లో వేసుకున్నారు. పలు సంస్థలు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాయి. దీంతో కొంత మంది ఆ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇలా ఎందరో సేవల పేరుతో డబ్బులు స్వాహా చేస్తున్నారు. విరాళాల దుర్వినియోగం... పేదలకు, అవసరం ఉన్న వారికి సహాయం చేస్తున్నామని వీడియోలు పోస్టు చేసి దాతల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న వారి వద్ద అందుకు సంబంధించిన లెక్కలు ఉండవనే చెప్పొచ్చు. గతంలో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించే వ్యక్తి పేదల కష్టాల వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి అకౌంట్ నంబర్ ఇచ్చే వారు. ప్రస్తుతం పేదల వీడియో ఆప్లోడ్ చేస్తూ సహాయం కోసం అకౌంట్ నంబర్కు బదులు ఫోన్ నంబర్ ఇస్తున్నారు. దాతలు ఫోన్ ద్వారా సంప్రదించాలని కోరుతున్నారు. చాలా మంది పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో డబ్బులు ఇస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వారు స్వయంగా రావడం లేదు. దాతలు ఇచ్చే లక్షలాది రూపాయలకు లెక్కలు ఉండవు. ఇచ్చిన డబ్బులోంచి కొంత ఖర్చు చేసి మిగతా డబ్బులు తమ సొంత అవసరాలకు వాడుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. -
కరోనా రోగులకు ఎన్జీవోల అండ
సాక్షి, హైదరాబాద్ : కరోనా మహమ్మారిపై పోరులో స్వచ్ఛంద సంస్థల (ఎన్జీవోలు) సహకారం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గాంధీ ఆసుపత్రి సహా పలు కరోనా చికిత్స కేంద్రాలు, ఐసోలేషన్ సెంటర్లలో వారి సేవలను ఉపయోగించు కోనుంది. కరోనా కేసులు పెరుగు తుండటం, కొన్ని చోట్ల ప్రభుత్వ వైద్యులు, నర్సులు వైరస్ బారిన పడిన నేపథ్యంలో రోగులకు చికిత్స, ఉపశమన చర్యల్లో ఎన్జీవోలను భాగస్వాములను చేయనుంది. ఇందు కోసం ఐదారు ఎన్జీవోలు ముందుకు వచ్చాయి. ఈ మేరకు సంస్థల ప్రతినిధులు తాజాగా మంత్రి ఈటల రాజేందర్తో ఒప్పందానికి వచ్చారు. ఆ సంస్థల్లోని వారంతా వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బందే కావడం గమనార్హం. ఒక్కో ఎన్జీవోలో 100 మంది వరకు వైద్య సిబ్బంది ఉన్నారు. ఆ ప్రకారం ఐదారు వందల మంది ఎన్జీవోల సభ్యులు.. ప్రభుత్వ ఆసుపత్రులు, ఐసోలేషన్ వార్డులు, హోం ఐసోలేషన్లో ఉన్న కరోనా రోగులకు సేవలు అందించనున్నారు. ఎలాంటి సేవలంటే? రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 44 వేలు దాటింది. బాధితుల్లో కొందరు కోలుకోగా మిగిలిన వారిలో అనేక మంది వివిధ ఆసుపత్రులు, హోం ఐసోలేషన్లలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని సంస్థలు క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాల్లో సేవలు అందించడానికి ముందుకు వచ్చాయి. ఆయా కేంద్రాల్లో అవసరమైన వైద్య సిబ్బందిని ఏర్పాటు చేస్తామని చెబుతున్నాయి. మరికొన్ని సంస్థలు సామాన్య ప్రజలలో అవగాహన పెంచడానికి, సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నివృత్తి చేయడానికి నడుంబిగించాయి. అందుకోసం అవసరమైన పోస్టర్లు, వీడియోలు, ఆడియోలు తయారు చేసి చైతన్యం కలిగించనున్నాయి. ఈ ప్రచారంలో టీవీ చానళ్లు, రేడియోలను భాగస్వాములను చేసుకోనున్నాయి. మరికొన్ని సంస్థలు కరోనాతో చనిపోయిన వారిని ఖననం చేయడంలో సహకారం అందించనున్నాయి. యువజన సంక్షేమ బృందాల సహకారంతో గౌరవప్రదమైన ఖనన సేవలను అందించనున్నాయి. అలాగే వేలాది మాస్క్లను ప్రజలుకు అందించడంతోపాటు ప్లాస్మా బ్యాంకును ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి. లైసెన్స్ పొందిన, పేరున్న బ్లడ్ బ్యాంక్తో కలసి ప్లాస్మా డొనేషన్ బ్యాంక్ను ప్రారంభించాలని నిర్ణయించాయి. కోలుకున్న రోగులు వారి ప్లాస్మాను దానం చేసేలా ప్రోత్సహించనున్నాయి. కరోనా అనుమానితులకు వీడియో సంప్రదింపుల ద్వారా చికిత్స చేయడం, ఇంట్లో చికిత్స పొందే వారికి ఆక్సిజన్ ఏర్పాటు చేయడంలో సాయం అందించనున్నాయి. ఉపశమన చర్యలు కూడా... తీవ్రమైన కరోనా లక్షణాలతో బాధపడుతున్న రోగుల్లో ధైర్యం నింపడం, అవసరమైన సేవలు అందించడం ద్వారా వారి రోగాన్ని తగ్గించేలా స్వచ్ఛంద సంస్థలు పనిచేయనున్నాయి. పాలియేటివ్ కేర్గా పిలిచే ఈ విధానంలో రోగులకు తరచూ ఉపశమనం కల్పించడం, ఓదార్చడం కీలకంగా ఉంటుంది. ఇటువంటి సేవలకూ ఎన్జీవోలు ముందుకొచ్చాయి. ముఖ్యంగా గాంధీ ఆసుపత్రిలో ఇటువంటి సేవలు అందించనున్నాయి. అలాగే హోం ఐసోలేషన్లో చికిత్స పొందే వారిని చూసుకోవడానికి కమ్యూనిటీ నర్సింగ్ సిబ్బందిని నియమించనున్నాయి. నిపుణులు అందుబాటులో లేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు మందుల నిర్వహణపై శిక్షణ ఇవ్వనున్నాయి. ఒకవేళ ఆసుపత్రిలో ఉంటే బంధువులతో ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా రోగులు మాట్లాడే అవకాశం కల్పించనున్నాయి. రోగుల్లో ఎవరైనా మరణశయ్యపై ఉంటే భావోద్వేగ, ఆధ్యాత్మిక సాయం అందించనున్నాయి. -
నాన్న స్ఫూర్తి.. భర్త సహకారం
కవాడిగూడ: సేవ చేయడంలో ఆమె తండ్రి ఎప్పుడూ ముందుండేవారు.. ఎవరు.. ఎప్పుడు.. ఏ సాయం కావాలన్నావెంటనే స్పందించేవారు.. ఎంతో మంది పేదలు ఆయన్ను దేవుడిలా కొలిచేవారు.. దీంతో ఆమె తండ్రి నుంచిస్ఫూర్తి పొందారు. ఆయన బాటలో నడిచేందుకు నిశ్చయించుకున్నారు. తండ్రి చేసే సేవా కార్యక్రమాల్లోపాల్పంచుకున్నారు. మరో అడుగు మందుకు వేసి ‘శ్రీసాయి శాంతి సహాయ సేవా సమితి ట్రస్ట్’ను ఏర్పాటు చేసిఎందరో పేదలకు సేవలు అందిస్తున్నారామె.. అనాథ శవాలకు అంతిమ యాత్రలు నిర్వహించి హిందూసంప్రదాయం ప్రకారం శ్మశాన వాటికలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేయిస్తున్నారు. ఏ సాయం కావాలన్నా నేనున్నానంటూ హామీ ఇస్తున్నారు శ్రీసాయి శాంతి సహాయ సేవా సమితి వ్యవస్థాపకురాలు ఎర్ర పూర్ణశాంతి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన పూర్ణశాంతి 1992వ సంవత్సరంలో నగరంలో స్థిరపడ్డారు. 1999లో ఎర్రం భాస్కర్ అనే వ్యాపారితో వివాహమైంది. తండ్రి తేర్ల నరసింహమూర్తి చూపిన సేవా మార్గాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు 2015లో ‘శ్రీసాయి శాంతి సహాయ సేవా సమితి’ని స్థాపించారు. జంటనగరాల్లో ఎక్కడ అనాథ శవాలున్నా తమకు సమచారం ఇవ్వాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు. అలా ఎవరు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినా ఆమె వెళ్లి మృతుల అంతిమ సంస్కారాలను దగ్గర ఉండి మరీ నిర్వహిస్తున్నారు. 45మందికి షిరిడీ సాయిబాబా దర్శనం సాయిబాబాను దర్శించుకోవాలని ఉన్నా షిరిడీ వెళ్లే ఆర్థిక స్థోమత లేని 45 మందిని సాయినాథుడి దర్శనానికి షిరిడీ తీసుకెళ్లారు. అందులో వృద్ధులు సైతం ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా వారానికోసారి పాత దుస్తులు సేకరించి పేదలకు పంపిణీ చేస్తున్నారు. నగరంలో దాదాపు 25 వృద్ధాశ్రమాలకు రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు అందించారు. సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు రూ.75వేల ఖర్చుతో చిరువ్యాపారాన్ని ప్రారంభించి వారికి అప్పగించారు. సేవకు గుర్తింపుగా అవార్డులు పూర్ణశాంతి చేస్తున్న సేవలకు ఎన్నో అవార్డులు దక్కాయి. వాటిలో ప్రధానంగా సీనారే చేతులమీదుగా రాష్ట్రస్థాయి అవార్డు, వరల్డ్వైడ్ విర్చువల్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ను, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి సావిత్రిబాయి పూలే జాతీయ పురస్కారం, సేవారత్న, సేవా భారతి, సేవాశీలి నామకరణాలతో వివిధ సంస్థల నుంచి అందుకున్నారు. అదేవిధంగా మాజీ గవర్నర్ రోశయ్య, ప్రముఖ పాండిచ్చేరి గవర్నర్ కిరణ్బేడి చేతులమీదుగా సత్కారాలను అందుకున్నారు. భర్త అందిస్తున్న ఆర్థిక సాయంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు సేవలను అందిస్తున్నారు. ఆమె సేవలకు ప్రతి ఒక్కరూ సలాం అంటున్నారు. కుట్టుమిషన్ల పంపిణీ.. బ్యూటీ ట్రైయినింగ్ అదేవిధంగా నిరుపేద మహిళలకు వివాహం సందర్భంగా పుస్తెమెట్టెలు అందిస్తూ దాదాపు 15 జంటలకు హిందూ సంప్రదాయ ప్రకారం వివాహాన్ని సొంత ఖర్చులతో నిర్వహించారు. వికలాంగులకు వీల్ఛైర్లు ఇవ్వడమే కాకుండా కొందరికిఆర్టిఫిషియల్ లెగ్స్, హ్యాండ్స్ను వారికి అందజేశారు. మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై నిలబడేందుకు సుమారు 60 మంది మహిళలకు కుట్టుమిషన్లను అందజేశారు. వితంతువులకు అల్లికలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసి నేర్పించారు. హస్తినాపురంలో 15మంది వితంతువులకు బ్యూటీపార్లర్ ట్రైయినింగ్. వీటితో గో సేవా కార్యక్రమాల్లో కూడా తాను ముందంజలో ఉన్నారు. నాన్న స్ఫూర్తి.. భర్త సహకారం స్పందించే మనస్తత్వం నాది.. నాన్న స్ఫూర్తి, భర్త సహకారంతో ఇన్ని సేవా కార్యక్రమాలను చేయగలుగుతున్నాను. అర్ధరాత్రి సమయంలో ఎవరైనా సాయం కావాలనిగడపతొక్కినా, ఫోన్ చేసినా స్పందించే మనస్తత్వం నాది. దేవుడి ఆశీస్సులుకూడా నాపై ఉండటం వల్లే ఇంతచేయగలుగుతున్నాను.– పూర్ణశాంతి, ‘శ్రీసాయి శాంతి సహాయ సేవా సమితి’ వ్యవస్థాపకురాలు. -
మానవతా దృక్పథంతో వ్యవహరించారు
సాక్షి, హైదరాబాద్ : ఎవరు ఎలా పోతే మాకేంటని పట్టించుకోని కాలమిది. సాటి మనుషులకు ప్రమాదం జరిగినా చూసీచూడనట్టు వెళ్లిపోయే సంఘటనలు ఎన్నో చూస్తుంటాం. మనుషులకే దిక్కులేని ఈ సమాజంలో ఇక పసుపక్షాదుల సంగతి చెప్పనక్కరలేదు. అందులోనూ కాకి లాంటి పక్షులకు దిక్కుండదు. కానీ, కొస ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ఒక కాకిని కాపాడటానికి కొందరు యువకులు చేసిన ప్రయత్నాలు అభినందనీయం. హైదరాబాద్లోని సైనిక్పురి ప్రాంతంలో ఒక కాకి విద్యుత్ తీగలపై పెనవేసుకుపోయిన పతంగి మాంజాలో చిక్కుకుపోయింది. కాకి కాళ్లకు పెనవేసుకున్న మాంజా నుంచి తప్పించుకోలేక గిలగిలా కొట్టుకుంది. ఒకటికాదు రెండు కాదు. మూడు రోజులుగా అలా కొట్టుకుని నీరసించి ఇంక చేతకాక విద్యుత్ వైర్ల నుంచి కిందకు వేలాడింది. అప్పుడప్పుడు బలం తెచ్చుకుని అరవడం మాత్రం ఆపలేదు. మూడురోజులుగా ఈ తతంగం గమనిస్తున్న స్థానికుల్లో ఒకరు విషయాన్ని నగరంలోని వన్యప్రాణులను సంరక్షించే ఎనిమిల్ వారియర్స్ కన్సర్వేషన్ సొసైటీకి చేరవేశారు. అంతే, ఆ వారియర్స్ వెంటనే వాలిపోయారక్కడ. ఆ సొసైటీకి చెందిన యువకులు వచ్చి స్థానికంగా అగ్నిమాపక కేంద్రానికి వెళ్లి సహాయాన్ని అర్థించారు. అగ్నిమాపక సిబ్బంది కూడా సానుకూలంగా స్పందించి ఫైరింజన్తో సహా ఘటనా స్థలానికి చేరుకొని కాకిని పరిశీలించి చూడగా అది ప్రాణాలతోనే ఉంది. ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసి, అగ్నిమాపక సిబ్బంది కాకికి చిక్కుకున్న మంజాను తొలగించి కాకిని పట్టుకుని ఎనిమల్ వారియర్స్ సంస్థకు అందించారు. వారు దానిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకొని ఒక వస్త్రాన్ని చుట్టి దానిని సంరక్షణ కేంద్రానికి తరలించారు. కాకి ప్రాణాలను కాపడానికి అక్కడ జరుగుతున్న తతంగమంతా చూస్తున్న స్థానికి ఎనిమల్ వారియర్స్ ప్రతినిధులను అభినందించారు. ‘పక్కవారికి కష్టం వచ్చినా పట్టించుకోని ఈ కాలంలో ఒక కాకి ప్రాణాల కోసం ఎనిమల్ వారియర్స్ ప్రతినిధులు పడిన తాపత్రయం అభినందనీయం’ అంటూ స్థానిక సీనియర్ న్యాయవాది కే. రాజగోపాల్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈ సంస్థ పెంపుడు జంతువులు, ఇంకా ఇతరత్రా జంతువులు ఆపదలో ఉన్నప్పుడు సాయం అందించడానికి ముందుంటుంది. -
ఓ కానిస్టేబుల్.. ఓ ఎమ్మెల్యే
కరోనాను ఓడించడానికి, సామాన్యుల్లో ఆత్మసై్థర్యాన్ని నింపడానికి కొందరు స్వచ్ఛందంగా పూనుకుంటున్నారు. వారిలో ఓ మహిళా ఎమ్మెల్యే, మహిళా కానిస్టేబుల్ చేస్తున్న ప్రయత్నాలు అందరి ప్రశంసలూ అందుకుంటున్నాయి. కరోనా వైరస్కు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో సాధారణ వ్యక్తుల నుండి ప్రతి ఒక్కరూ ఆయా స్థాయులలో సహకరిస్తున్నారు. దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల దృష్ట్యా దీనిని నివారించడానికి అదే సమయంలో బాధితులకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో... డ్యూటీ తర్వాత మాస్క్ల తయారీ మధ్యప్రదేశ్ లోని కురై గ్రామ పోలీస్ స్టేషన్లో పనిచేసే సృష్టి అనే మహిళా కానిస్టేబుల్ చేసే పని చాలా స్ఫూర్తిదాయకంగా అందరి ప్రశంసలు అందుకుంటోంది. రోజంతా డ్యూటీ చేసి అలసి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత, ఆ మహిళా కానిస్టేబుల్ పోలీసులకు, సామాన్య ప్రజలకు మాస్కుల తయారీలో నిమగ్నం అవుతున్నారు. ఇది మాత్రమే కాదు, తన చేతులతో మాస్క్లు తయారు చేసిన ఆమె ఎవరైనా మాక్ లేకుండా కనిపిస్తారో వారందరికీ మాస్క్ను ఉచితంగా ఇస్తున్నారు. పోలీసు అధికారి ఇన్చార్జి రోహిత్ మిశ్రా మాట్లాడుతూ ‘శానిటైజర్, మాస్క్ల కొరత వల్ల ఈ లాక్డౌన్ సమయంలో మహిళా కానిస్టేబుల్ స్వయంగా తయారుచేయడం చాలా ప్రశంసనీయదగినది’ అంటూ సృష్టి చేస్తున్న పనిని కొనియాడారు. ప్రజల క్షేమమే ముఖ్యం రాజస్థాన్లోని షేర్గడ్ ఎమ్మెల్యే మీనా కన్వర్ మాస్క్లు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఆమె స్వయంగా తన ఇంట్లో 2 వేల మందికి ముసుగులు తయారు చేస్తున్నారు. ప్రజల క్షేమమే నాకు ముఖ్యం అంటూ మాస్క్ల తయారీలో నిమగ్నం అయిన మీనా కన్వర్ను స్థానిక మహిళల్లోనూ కరోనా కట్టడికి స్ఫూర్తిని నింపుతున్నారు. మీనా తయారు చేసే ఈ ముసుగులలో సగం ఖైదీలకు పంపిణీ చేయనున్నామని ఆమె తెలిపారు. -
నా జీవితంలో ఇంతకన్నా ఆనందం ఏముంది?
ఢిల్లీ : కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ప్రం హోం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ నిత్యం ఉరుకుల పరగుల జీవితంలో ఉండే ఉద్యోగులకు వర్క్ ఫ్రం వెసులుబాటు కల్పించడంతో ఇంట్లోనే ఉంటూ తమ పని చేయడమే గాక సురక్షితంగా ఉండొచ్చు అని భావిస్తారు. అయితే ఢిల్లీకి చెందిన రవి చంద్రన్ మాత్రం ఉద్యోగం కంటే సమాజసేవ చేయడమే ముఖ్యమని పేర్కొంటున్నాడు. రవి చంద్రన్.. ఢిల్లీలోని డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ బోర్డ్లో అసిస్టెంట్ స్క్రుటిని ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజు తన ఇంటి నుంచి నార్త్ డిల్లీలోని విధాన సభకు పక్కనే ఉన్న బిల్డింగ్లో విధులు నిర్వహించేవాడు. రోజు 8గంటల పాటు పనిచేసి మెళ్లిగా ఇంటికి చేరుకునేవాడు. ఇది అతని జీవితంలో రెగ్యులర్గా జరిగే పని. అయితే ఇప్పుడు కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో ప్రసుతం అతను పని చేస్తున్న ఆఫీస్కు కొన్ని రోజులు సెలవులు ఇవ్వడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే తనకు మాత్రం ఉద్యోగం లేకపోతే సమాజసేవ చేయడమే చాలా ఇష్టమంటున్న రవి చంద్రన్ను చూడాలంటే మాత్రం ఉత్తర ఢిల్లీలోని ఘాజీపూర్లోని గవర్నమెంట్ సీనియర్ సెకండరీ స్కూల్లో కనిపిస్తాడు. ఇటువంటి ఆపత్కాల సమయంలో రోజుకు 14గంటల పాటు విధుల నిర్వహిస్తూ అందరిచేత శెభాశ్ అనిపించుకుంటున్నాడు. మార్చి 25 నుంచి లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ఈ స్కూల్ను ఇప్పుడు వలసదారుల సహాయ శిబిర కేంద్రంగా మార్చారు. దీనికి ఇప్పుడు రవి చంద్రన్ వార్డెనర్గా వ్యవహరిస్తున్నాడు. ఒక చిన్న షెడ్ వేసుకొని అందులోనే ఒక టేబుల్, కుర్చీ ఏర్పాటు చేసుకున్నాడు. దాదాపు 400 మందికి పైగా ఉంటున్న ఈ శిబిరంలో వారికి అందవలసిన సామాగ్రితో పాటు , తినే ఆహారం నుంచి వారంతా సామాజికి దూరం పాటించే వరకు ప్రతీ విషయాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇదే విషయమై రవి చంద్రన్ను అడిగితే.. 'ఇటువంటి పరిస్థితి నా జీవితంలో ఊహ తెలిసినప్పటి నుంచి చూడలేదు. ఇలాంటి విపత్కర సమయంలో నేను ఖాళీగా ఉండలేను. నాకు తోచినంత సహాయం చేయడానికి ఎప్పుడు మందుంటాను. నేను ఎంత గొప్ప పని చేసినా ఇంకా సాధించాల్సింది ఏదో ఉంది అని ఎప్పుడు అనిపిస్తూనే ఉంటుంది. నేను ఇప్పుడు వార్డెనర్గా విధులు నిర్వహిస్తున్న దగ్గర చాలామందికి డబ్బులు లేవు. ఇప్పుడు ఉన్నపళంగా వారిని అక్కడినుంచి పంపిచేస్తే వారంతా దిక్కులేని వారవుతారు. అందుకే మార్చిలో వచ్చిన జీతం నుంచి కొంచెం పక్కకు తీసి వారికి చేతనైనంత సహాయం చేస్తున్నాను. ఇప్పుడు కూడా నా మిత్రులు, తెలిసినవారి దగ్గరికి వెళ్లి కొంత డబ్బు అడుగుతున్నాను. ఇప్పుడు సహాయ కేంద్రాలలో ఉంటున్నవారు లాక్డౌన్ ముగిశాక తమ ఇళ్లకు వెళ్లే ముందు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి 500 నుంచి వెయ్యి రూపాయలు అందిస్తాను. ఈ మధ్యనే నాకు తెలిసిన కొంతమంది డబ్బులు పోగేసుకొని దాదాపు 450 మాస్కులు అందజేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా చేసే పని కంటే 14 గంటల పాటు సమాజసేవ చేస్తున్నందుకు నా భార్య ఎంతో సంతోషిస్తుంది. కష్టకాలంలో ఇంతమందికి సహాయపడడం కంటే నా జీవితంలో ఆనందం ఏముంటుందంటూ' రవి చంద్రన్ చెప్పుకొచ్చాడు. -
ప్రజా సైనికులకు వందనం
సాక్షి, హైదరాబాద్ : పక్క చిత్రంలో కనిపిస్తున్న పోలీసు అధికారి పేరు డి. రవిరాజ్. వరంగల్ అర్బన్ జిల్లాలోని కమలాపూర్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలకు పారిపోయిన దొంగలను తీసుకురావడంలో ఈయన స్పెషలిస్ట్. గతంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పనిచేసేవారు. ఇప్పుడు కరోనా నేపథ్యంలో 24 గంటల డ్యూటీ. తన స్టేషన్ పరిధిలోని గ్రామాల సర్పం చులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో రోజూ సమావేశాలు... రెవెన్యూ, ఆరోగ్య సిబ్బందితో సభలు.. గ్రామస్తులకు అవగాహన సమావేశాలు... గతంలో స్టేషన్ నుంచి రోజుకు లంచ్కు, రాత్రి పూట డ్యూటీ ముగించుకుని రెండుసార్లు ఇంటికి వెళ్లేవాడు. జనతా కర్ఫ్యూ నుంచి నేటి దాకా రోజుకు కేవలం రాత్రిపూట మాత్రమే వెళుతున్నాడు. తాను రోజూ బయట తిరుగుతూ విధులు నిర్వర్తించాల్సిన నేపథ్యంలో వ్యక్తిగతంగా బాగానే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయినా.. ఇంటి వారితో మనస్ఫూర్తిగా కలవలేకపోతున్నాడు. తన ద్వారా కుటుంబ సభ్యులకు ఎక్కడ వైరస్ వ్యాప్తి చెందుతుందోనన్న ఆందోళనలో ఉన్నాడు. అందుకే వేరే గదిలో పడుకుంటున్నాడు. తనకు పంచ ప్రాణా లైన ఇద్దరు కూతుళ్లతో కలసి సమ యం గడపలేకపోతున్నాడు. మునుపటిలా కలివిడిగా ఉండలేకపోతున్నాడు. ఉండేది క్వార్టర్స్లోనే అయినా టిఫిన్, లంచ్, రాత్రి భోజ అంతా బయటే చేస్తున్నాడు. ఒక్క రవిరాజే కాదు... తుమ్ముతూ, దగ్గుతూ తన వద్దకు వస్తున్న వారికి మందులు ఇస్తున్న ఫార్మసిస్టు కోడి శివప్రసాద్, తన తండ్రిని కనీసం చూడలేకపోతున్న పోలీసు అధికారి విశ్వేశ్వర్ కుమార్తె అన్వి... ఎంతో శక్తివంతమైన సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం భుజాన వేసుకొని వీపు బొబ్బలెక్కుతున్నా లెక్క చేయకుండా పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు యాదయ్య, సిలిండర్ భుజాన వేసుకొని నాలుగు అంతస్తులు ఎక్కి వంట గ్యాస్ అందించే నల్లగొండ రామలింగయ్య, ఖమ్మం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, పిల్లలు వద్దంటున్నా డ్యూటీకి వెళ్తున్న నర్సు సులోచన... ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ప్రస్తుతం అత్యవసర సేవల కింద విధులు నిర్వహిస్తున్న లక్షలాది మంది ప్రజాసైనికులది ఇదే పరిస్థితి. దేశం, రాష్ట్రం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను దీటుగా ఎదుర్కొని ఊపిరి బిగబట్టయినా తన విధులు నిర్వహించి ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా కరోనా మహమ్మరిని పారదోలేందుకు కృషి చేస్తున్న అందరిదీ ఇదే వ్యథ... కాదు... ఇదే కష్టం. తమకు ఎదురయ్యే కష్టాలను దిగమింగుకుంటూ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను కాపాడేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న వారి వీర గాథ ఇది. సాధారణ పరిస్థితుల్లో సమాజం చిన్నచూపు చూసే కార్మికుల ఆసరా, వైద్యో నారాయణో హరి అని చెప్పుకొనే వైద్యుల భరోసా, కనిపించని నాలుగో సింహమేరా ఈ పోలీస్ అని గర్వపడే మన పోలీసు సిబ్బంది రక్షణ.. ఇలా చెప్పుకుంటూ పోతే మున్సిపల్, గ్రామ పంచాయతీ, విద్యుత్, ఫార్మా, గ్యాస్ ఏజెన్సీ, పెట్రోల్ బంకుల సిబ్బంది, రైతులు, బ్యాంకు సిబ్బంది... ఈ ప్రజా సైనికుల కష్టమే ఇప్పుడు మనల్ని కరోనా కష్టాల కడలి నుంచి తీరాన్ని చేర్చే ప్రయత్నం చేస్తోంది. డ్యూటీకి వెళ్లి ఇంటికి వచ్చేంత వరకు వారి కుటుంబ సభ్యుల్లో ఉత్కంఠ, ఆందోళన నెలకొన్నా దాన్ని ఈ సైనికులు ఖాతరు చేయడం లేదు. కష్టకాలంలో తమ వారిని ఇబ్బంది పెట్టయినా సరే సమాజం కోసం పనిచేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలకు అనుగుణంగా కరోనా కర్కశ రక్కసిపై కఠోర యుద్ధం చేస్తున్నారు. అందుకే విపత్కాలంలో సమాజానికి అండగా నిలుస్తున్న మానవ రూపంలోని దేవుళ్లందరికీ ‘సాక్షి’సెల్యూట్ చేస్తోంది. జన సైనికులు వీరే...! కరోనా రక్కసి నుంచి మనల్ని కాపాడేందుకు వైద్య, పోలీసు, మున్సిపల్, గ్రామ పంచాయతీ, విద్యుత్, ఫార్మా, గ్యాస్ ఏజెన్సీ, పెట్రోల్ బంకుల సిబ్బంది, కూరగాయల రైతులు, బ్యాంకు సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తున్నారు. దైనందిన జీవితంలో మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇతర మున్సిపల్, అంగన్వాడీ సిబ్బంది కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. వారిలో వైద్య సిబ్బందే 50 వేల వరకు ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 2,556 మంది ప్రభుత్వ వైద్యులు (ఎంబీబీఎస్), 3,796 మంది స్పెషలిస్టులు, 10,900 మంది స్టాఫ్ నర్సులు, 11,886 మంది పారామెడికల్ సిబ్బందితో కలిపి 49,709 మంది వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. వారితోపాటు డీజీపీ నుంచి హోంగార్డు వరకు 53 వేల మంది పోలీసు సిబ్బంది 24 గంటలూ రోడ్లపైనే ఉంటున్నారు. 12,751 గ్రామ పంచాయతీలు, 140 వరకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో దాదాపు 70 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు, 30 వేల మంది పెట్రోలు బంక్ సిబ్బంది, 10 వేల మంది వరకు వంట గ్యాస్ డెలివరీ బాయ్స్, వేలాది మంది ఫార్మసిస్టులు, కూరగాయల రైతులు, బ్యాంకు సిబ్బంది, విద్యుత్ రంగంలో పనిచేస్తున్న వారు ఇప్పుడు కరోనా నివారణ మహా క్రతువులో పాలుపంచుకుంటున్నారు. వాళ్లందరి సహకారం, ప్రజల నిబద్ధత, చిత్తశుద్ధితో కరోనా భూతంపై తెలంగాణ అప్రతిహత విజయాన్ని సాధించాలని ఆశిద్దాం. చివరిగా వారందరి పక్షాన మూడు మాటలు.... ఈ నెల 14 వరకు ఇళ్లు వదిలి అనవసరంగా బయటకు రాకండి... 20 నిమిషాలకోసారి చేతులు కడుక్కోండి.... సామాజిక దూరాన్ని పాటించండి. పిల్లలు వద్దన్నా డ్యూటీకి... ‘అమ్మా... డ్యూటీకొద్దు.. ఇంటి దగ్గరే ఉండమని పిల్లలు అంటున్నా వస్తున్నాను. ప్రస్తుతం కరోనా అంటేనే అంతా భయ పడుతున్నారు. అయినప్పటికీ మాది సేవతో కూడిన ఉద్యోగం. పీహెచ్సీకి వచ్చిన వారికి కరోనాపై అవగాహన కల్పిస్తున్నాం. జ్వరం, జలుబు లాంటి లక్షణాలుంటే వరంగల్ ఎంజీఎంకు పంపిస్తున్నాం’ – ఎం. సులోచన, స్టాఫ్నర్సు, వంగర పీహెచ్సీ, వరంగల్ జిల్లా ఫార్మసిస్టుగా నా బాధ్యత మెడికల్ షాపులో పనిచేయడం ప్రస్తుత పరిస్థితుల్లో కత్తిమీద సామే. అవగాహన ఉన్నవారు షాపులకు మాస్కులతో వస్తున్నారు కానీ లేనివారు మాత్రం తుమ్ముతూ, దగ్గుతూ వస్తున్నారు. వారికి ఏం ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. అయినా సామాజిక దూరాన్ని పాటిస్తూనే మందులిచ్చి పంపిస్తున్నాం. పారామెడికల్ అత్యవసర సేవలు కనుక మేం పనిచేయాల్సిందే... చేస్తాం కూడా. దేశానికి సేవ చేయడం ఓ యువకుడిగా, ఫార్మసిస్టుగా నా బాధ్యత. అందరం కలసి ఈ మహమ్మరిని పారదోలే వరకు పోరాడుదాం. – కోడి శివప్రసాద్, రిజిస్టర్డ్ ఫార్మసిస్టు, జ్యూపిటర్ ఫార్మసీ, తూప్రాన్, మెదక్ జిల్లా ఐ మిస్ యూ డాడీ... గతంలో డాడీ రోజుకు 2–3 సార్లు ఇంటికి వచ్చేవారు. కానీ కరోనా కారణంగా డాడీ ఇంటికి సరిగ్గా రావట్లేదు. నాతో టైమ్ స్పెండ్ చేయట్లేదు. నేను నిద్రపోయాక వస్తున్నాడు. లేచేలోగా మళ్లీ డ్యూటీకి వెళ్లిపోతున్నాడు. ముఖానికి మాస్కుతోనే వీడియో కాల్ చేస్తున్నాడు. ఒక్కోసారి అసలు నా ఫోన్ కూడా తీయడం లేదు. డాడీని చాలా మిస్సవుతున్నా. కరోనా రాకుండా చేతులకు శానిటైజర్ వాడాలని మా టీచర్ చెప్పింది.. అదే విషయాన్ని డాడీకి కూడా చెబుతున్నా. మా డాడీ గ్రేట్. జనాలకు కరోనా రాకుండా చేసేందుకు రోజంతా వారి కోసమే డ్యూటీ చేస్తున్నాడు. ఐ లవ్ మై డాడీ. బట్ ఐ మిస్ యూ డాడీ.. టేక్ కేర్. – అన్వి, విశ్వేశ్వర్, వరంగల్ కమిషనరేట్ ఇన్స్పెక్టర్ కుమార్తె అంకితభావంతో పనిచేస్తున్నాం.. ప్రతి ఒక్కరి సహకారంతో, అంకితభావంతో కరోనా రోగులకు వైద్యం అందిస్తున్నాం. వ్యాధిపట్ల అవగాహన కల్పిస్తూనే వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన అంశాలను వివరిస్తున్నాం. కరోనా అనుమానితులు ఆందోళన చెందకుండా వారికి మనోధైర్యం కల్పిస్తున్నాం. సహచర వైద్య సిబ్బంది సహకారం మరువలేనిది. మా కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నా సేవ చేయడమే వృత్తి ధర్మంగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. వారికి నిజంగా రుణపడి ఉంటాం. వైద్య సిబ్బంది సేవలను అందరూ గుర్తించాలి. – ఖమ్మం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ బి. వెంకటేశ్వర్లు బిక్కుబిక్కుమంటూ పనిచేస్తున్నాం... కరోనా మహమ్మారి అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తుండంతో బిక్కుబిక్కుమంటూ శానిటేషన్ పనులు చేస్తున్నా. నాకు భార్య, కుమార్తె, కుమారుడున్నారు. విధులకు వచ్చే ముందు వాళ్లు జాగ్రత్తలు చెపుతుంటారు. జీవనాధారం ఇదే కావడంతో విధులకు హాజరవుతూ ప్రజల కోసం పనిచేస్తున్నా. పవర్పుల్గా ఉండే సోడియం హైపో క్లోరైడ్ ద్రావణంతో కూడిన డబ్బాను భుజానికి తగిలించుకోని పిచికారి చేస్తుండంతో వీపుకు బొబ్బలు వస్తున్నాయి. చెత్త చెదారాన్ని ఎత్తిపోయడమేగాక, అంటువ్యాధులతో పనిచేస్తున్న మాకు తక్కువ జీతభత్యాలు ఇస్తుండడమే బాధనిపిస్తుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా మా విలువ ఏంటో అందరికీ అర్థం అయితే అదే సంతోషం. – ఎ. యాదయ్య, పారిశుద్ధ్య కార్మికుడు ఇబ్రహీంపట్నం, మున్సిపాలిటీ మేం లేకపోతే వంట ఎలా? కరోనా వస్తుందని మేం భయపడి ఇళ్లలో కూర్చుంటే అందరి ఇళ్లలో పొయ్యిలు ఎలా వెలుగుతాయి? గ్యాస్ లేకపోతే ఈ రోజుల్లో ఒక్క క్షణం కూడా గడవదు. మామూలు రోజుల్లోనే గ్యాస్ రావడం ఆలస్యమైతే 100 సార్లు ఫోన్లు చేస్తారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మేం లేకపోతే ఎలా? నిత్యం ప్రమాదం పొంచి ఉన్న గ్యాస్ సిలిండర్లను మోసుకొని వెళ్లే మమ్మల్ని కరోనా ఏం చేస్తుంది? గ్యాస్ పేలిన దానికన్నా ప్రమాదం కాదు కదా. అందుకే మా కుటుంబ సభ్యులు వద్దన్నా ధైర్యంగా విధులకు వెళుతున్నాం... వెళ్తాం కూడా. – కె. రామలింగయ్య, శ్రీసాయిదుర్గా గ్యాస్ ఏజెన్సీ, నల్లగొండ శానిటైజేషన్ తర్వాతే పెట్రోల్ పోస్తున్నాం.. మాది హన్మకొండ మండలంలోని భట్టుపల్లి గ్రామం. గత కొన్నేళ్లుగా పెట్రోల్ బంకులో పనిచేస్తున్నా. కరోనా వ్యాప్తి గురించి తెలిసి గత 15 రోజులుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వైరస్ ప్రభావం ఎంతగా ఉందో టీవీలు, పత్రికల ద్వారా తెలుసుకుంటున్నాం. మా యాజమాన్యం సైతం మమ్మల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. ప్రతి ఒక్కరికీ శానిటైజర్ బాటిల్తోపాటు మాస్కులు ఇచ్చింది. వాహనానికి పెట్రోల్ పోసే ప్రతిసారీ చేతులను శానిటైజర్తో శుభ్రం చేసుకుంటున్నాం. ఆ తర్వాతే పెట్రోల్ పోస్తున్నాం. మాస్కులు ఇబ్బందిగా ఉన్నప్పుడు చేతి రుమాలు కట్టుకుంటున్నాం. వాహనదారుడికి వీలైనంత దూరంగా ఉంటున్నాం. – సురేష్, పబ్లిక్ గార్డెన్ పెట్రోల్ పంపు, హన్మకొండ -
ఇవి ఎవరికి ఇవ్వాలో సలహా ఇవ్వండి : ఉపాసన
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో ఫౌండేషన్, అపోలో లైఫ్ గ్రూపుల చైర్పర్సన్ ఉపాసన మరోసారి తన మనసు చాటుకున్నారు. సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే ఉపాసన.. తాజాగా పేదల కోసం మరో మంచి కార్యక్రమం చేపట్టారు. మనకు అవసరం లేనివి, వాడేసిన వస్తువులు, దుస్తులు ఏమైనా ఉంటే వాటిని పేదలకు ఇచ్చే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ఆమె. ఈ మేరకు తన ఇంట్లో వాడకం మొదలుపెట్టి 10 నెలలు దాటిన అలాంటి వస్తువులను జనం కోసం వినియోగించేందుకు సిద్ధమవ్వాలంటూ సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. (చదవండి : ఈ వారం మాకెంతో స్పెషల్ : ఉపాసన) ‘నా వార్డ్ రోబ్ ను మొత్తం క్లీన్ చేశాక ఎంతో మానసిక ప్రశాంతత లభించింది. అయితే దానికి ఎంతో సమయం, ఎంతో శ్రమ ఖర్చైనా కష్టానికి తగ్గ ఫలితం లభించింది. నాకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడంలో ఎప్పుడూ దుబారా చేయను. చాలా జాగ్రత్తగా వస్తువులు కొంటుంటాను. అయినప్పటికీ కొన్ని దుస్తులను వార్డ్ రోబ్ నుంచి తీసేసి మూటకట్టాను. వాటిని చారిటీ సంస్థలకు నిధులు సేకరించేందుకు అమ్మేయాలని భావిస్తున్నాను. మరి ఎవరికి విరాళంగా ఇస్తే బాగుంటుందో సలహా ఇవ్వండి’ అంటూ ఉపాసన ట్వీట్ చేశారు. It’s taken time & effort but totally worth it! Cleaning my wardrobe has brought me so much mental peace. I’ve become a more conscious shopper & value my belongings more. Planning to sell my clothes to raise funds for a charity - any suggestions who to donate to ? pic.twitter.com/2uVZCDrKSl — Upasana Konidela (@upasanakonidela) March 1, 2020 -
పీల్చే శ్వాసలో నా పేరు ఎప్పటికి నిలిచిపోతుంది
సూరత్ : కొందరు చావు పేరు చెబితేనే ఆమడ దూరం వెళ్లిపోతారు. మరికొందరు చావు పేరు వింటేనే మా గుండెల్లో దడ మొదలవుతుంది అంటారు. మరీ అలాంటిది ఒక మహిళ మాత్రం కొద్దిరోజుల్లో తాను మరణిస్తానన్న విషయం తెలిసినా ఏ మాత్రం అధైర్యపడకుండా పర్యావరణాన్ని కాపాడే బాధ్యతను ఎంచుకున్నారు. ఆమె గుజరాత్కు చెందిన 27ఏళ్ల శ్రుచి వదాలియా.. గుజరాత్లోని సూరత్ సిటీకి వెళ్లి అడిగితే ఎవరైనా ఈమె గురించి వివరిస్తారు. మరి ఆమె కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 'చనిపోయేలోగా నేను నాటిన మొక్కల ద్వారా కొంతమేరకైనా వాయు కాలుష్యాన్ని తగ్గించాలనుకుంటున్నట్లు' శ్రుచి వదాలియా పేర్కొంటున్నారు. శ్రుచి వదాలియాకు కొన్ని సంవత్సరాల క్రితం బ్రెయిన్ ట్యూమర్ సోకింది. ఇప్పుడామే తన జీవితంలో చివరి దశకు వచ్చేసింది.. అంటే కొన్ని రోజుల్లో ఈ లోకం విడిచివెళ్లనుంది. అయినా ఆమె ఏమాత్రం బెదరకుండా తాను చనిపోయేలోగా సమాజానికి తనవంతుగా ఏదో ఒక మంచి పని చేయాలని నిర్ణయించుకుంది. అనుకుందే తడవుగా పర్యావరణాన్ని కాపాడే బాధ్యతను స్వీకరించింది. తనకు బ్రెయిన్ ట్యూమర్ రావడానికి వాయు కాలుష్యం కూడా ఒక కారణమని భావించిన శ్రుచి వదాలియా తాను చనిపోయేలోగా వీలైనన్ని మొక్కలు నాటి ప్రమాదకర కాన్సర్తో పాటు, కొంతమేరైనా వాయు కాలుష్యాన్ని అరికట్టవచ్చని నిర్ణయించుకొంది. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణానికి మంచి చేయడంతో పాటు ప్రమాదకర కాన్సర్ను నివారించే అవకాశం ఉందని శ్రుచి పేర్కొన్నారు. ఇప్పటివరకు రెండు సంవత్సరాలలో 30వేలకు పైగా మొక్కలు నాటడమే గాక మిగతవారిని కూడా ఆ పని చేయమని ప్రోత్సహిస్తున్నారు. 'నేను చనిపోతానని నాకు తెలుసు. కానీ నేను పెంచే మొక్కల ద్వారా వచ్చే గాలిని పీల్చే శ్వాసలో నా పేరు ఎప్పటికి చిరస్థాయిగా నిలిచిపోతుంది. నాకు ఎక్కువ రోజులు బతికే అవకాశం లేదు. నాలాగా ఎవరు ఈ వ్యాధికి గురవకూడదనేదే నా ప్రయత్నం. అందుకే వీలైనన్ని మొక్కలను పెంచి నా వంతుగా పర్యావరణానికి మేలు చేస్తున్నానని' శ్రుచి వదాలియా భావోద్వేగంతో తెలిపారు. శ్రుచి వదాలియా సూరత్లోని ప్రతీ పాఠశాలలకు తిరిగి ఒక్కో పిల్లాడి చేత మొక్కను నాటించి పర్యావరణాన్ని కాపాడే భాద్యతను ఎత్తుకున్నారు. -
కుటుంబంతో కలపాలని..
బాధ్యతను విస్మరించి కుటుంబాన్ని గాలికి వదిలేసి ఊరూరా తిరిగి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శివశంకరయ్య తాను చేసిన తప్పును జీవిత చరమాంకంలో తెలుసుకుని కుమిలిపోతున్నాడు. ఇతనికి వైద్యసేవలందింజేసి, చివరి క్షణాల్లోనైనా సంతోషంగా ఉండాలని కుటుంబ సభ్యులతో కలిపేందుకు ‘అంపశయ్యపై నాన్న’ అనే శీర్షికతో ‘సాక్షి’ కథనం ప్రచురించింది. స్వచ్ఛంద సంస్థ సభ్యులు, వైద్యులు, పోలీసులు కూడా తమవంతు సహకారమందిస్తున్నారు. హిందూపురం: వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం మాసాపేటకు చెందిన శివశంకరయ్య (80) హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. చక్కెరవ్యాధిగ్రస్తుడైన ఇతడు కుటుంబాన్ని వదిలి ఊరూరా తిరుగుతూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకున్నాడు. ప్రస్తుతం గాంగ్రిన్తో బాధపడుతున్నాడు. ఎడమకాలు పాదం పూర్తిగా కుళ్లిపోయింది. నడవలేని పరిస్థితికి చేరుకున్నాడు. పాదంలో ఏర్పడిన పుండు (గాంగ్రిన్)ను అలాగే వదిలేస్తే శరీరమంతా పాకి ప్రాణాపాయస్థితికి చేరుకునే ప్రమాదముంది. తనలాంటి దుస్థితి ఏ తండ్రికీ రాకూడదని, తాను చేసిన తప్పులకు దేవుడే శిక్ష విధించాడని పశ్చాత్తాపపడుతున్నాడు. సపర్యలు చేస్తున్నస్వచ్ఛంద సంస్థ సభ్యులు వృద్ధుడి దీన స్థితిని చూసి స్వచ్ఛంద సంస్థ సభ్యులు సపర్యలు చేస్తున్నారు. రోజూ ఉదయాన్నే అతనికి పాలు, అల్పాహారం, మధ్యాహ్నం మజ్జిగ అందిస్తున్నారు. దుర్వాసన వస్తున్న దుస్తులను మార్చి అవసరమైన సేవలందిస్తున్నారు. అతనికి వైద్యసేవలు పూర్తిగా అందించి కుటుంబానికి అప్పగించడానికి చేయూత అందిస్తామని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ముస్లిం నగరా కన్వీనర్ ఉమర్ఫరూక్ అంటున్నారు. ఇతను చేసింది క్షమించరాని తప్పేనని, అయితే మరణానికి చేరువలో ఉన్న క్షణంలో జన్మనిచ్చిన తండ్రికి, కట్టుకున్న భర్తకు ఎంతో కొంత అతని రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలని వారి కుటుంబసభ్యులను కోరారు. మానవత్వంతో ఆపరేషన్కు ఏర్పాట్లు శివశంకరయ్య ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. డయాబెటిక్ విత్ గాంగ్రిన్ వ్యాధి ఇది. ఇలాగే వదిలేస్తే శరీరమంతా పాకి ప్రాణానికే ప్రమాదమని సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులు, సర్జన్లు డాక్టర్ శివప్రసాద్నాయక్, డాక్టర్ ప్రభాకర్నాయుడులు చెప్పారు. అంతేగాక ఇతనికీ, బీపీ, షుగర్ ఎక్కువగా ఉన్నాయని, ఆహారం సరిగా తీసుకోని కారణంగా రోగనిరోధక శక్తి తగ్గిపోయిందని, మరింత ఆలస్యం చేస్తే మరణించవచ్చు అని తెలిపారు. ప్రస్తుతం ఇతని పరిíస్థితి చూసి స్వచ్ఛంద సంస్థ సభ్యులు ముందుకు రావడంతో మానవతాదృక్పతంతో ఆపరేషన్ చేసి.. చెడిపోయిన వరకు కాలు తీసేయాలని నిర్ణయించామన్నారు. ఈ విషయమై ఇతని కొడుకు కోసం ప్రయత్నం చేసినా అతను అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు. రేపటిలోగా అన్ని లెవల్స్ కంట్రోల్ చేసి ఆపరేషన్ చేస్తామని చెప్పారు. ఉన్న కొన్నిరోజులైనా కుటుంబ సభ్యులు చూసుకోవాలని కోరుతున్నామన్నారు. శివశంకరయ్య చేసిన తప్పులకు ఇప్పటికే చాలా అనుభవించేశాడని, కొడుకు పెద్దమనస్సుతో క్షమించి కన్నరుణం తీర్చుకోవాలని సూచించారు. -
గ్రూప్ 1 ఉద్యోగం వదిలి..
సాక్షి, ఒంగోలు : పుటుక నీది, చావు నీది, బతుకంతా ప్రజలది’ అంటాడు కాళోజీ. చదువంటే ఉద్యోగం కోసం అని, ఉద్యోగమంటే సొంత ఆస్తికోసమనే నేటి రోజుల్లో గ్రూప్ 1 ఆఫీసర్గా ఉద్యోగం వదిలేసి అనాథ సేవలో తరించేవారు అరుదుగా ఉంటారు. అటువంటి వ్యక్తుల్లో జిల్లాకు చెందిన వెనిగండ్ల పద్మజ ప్రధానంగా కనిపిస్తారు. ఒకరిద్దరు బిడ్డల్ని సాకలేకే వసతిగృహాల్లో చేరుస్తున్న ఈ కాలంలో ఆమె ఏకంగా 400 మంది అనాథ చిన్నారులకు అమ్మగా మారారు. ఇప్పటికి కనీసం 1000 మందికి పైగా చిన్నారుల విద్యోన్నతిలో ఆపన్న హస్తమయ్యారు. కంటేనే అమ్మ కాదు అని నిరూపిస్తూనే జీవన నైపుణ్యాలు లేని విద్య ద్వారా ఏమీ సాధించలేమంటూ ఆ ప్రాంతంలో విద్యా విలువలు బోధిస్తున్నారు. ఇంకోవైపు గాంధీ మార్గంలో తమ ఆశ్రమం ఉన్న ప్రాంతం మొత్తం పరిశుభ్రత కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు. మరోవైపు తమ అనాథాశ్రమంలో ఉన్న చిన్నారులను యోగా, శాస్త్రీయ నృత్యంలో తీర్చిదిద్దుతున్నారు. ఇన్ని విశేషాలున్న వెనిగండ్ల పద్మజ జీవితం అందరికీ ఆదర్శనీయం. నాగులుప్పలపాడు మండలంలోని ఒమ్మెవరానికి చెందిన వెనిగండ్ల పద్మజ ప్రాథమిక విద్యను ఆ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదివారు. ‘చిన్నప్పటి నుంచే మంచిపనులు చేయటం వల్ల పెద్దలు ప్రశంసించటంతో ఇదేదో బాగుందని తనకు అనిపించేది. పద్మజ తర్వాత కాలంలో తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నిమిత్తం కర్ణాటకలోని రాయచూరు ప్రాంతానికి వలస పోవటంతో అక్కడే డిగ్రీ చేసింది. డిగ్రీ రోజుల్లో చదివే సమయంలో ఒక స్వచ్ఛంద సేవాసంస్థతో కలిసి పనిచేయటంతో సామాజిక సేవవైపు రావాలని నిశ్చయించుకుంది. అయితే, చదివిని చదువుకు సార్ధకత ఉండాలని పెద్దలు చెప్పటంతో ఒకేసారి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ల పోటీ పరీక్షలు రాసి గ్రూప్ 1 సాధించింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ను ఎంచుకుని 2002 ప్రాంతంలో ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండల అభివృద్ధి అధికారిగా కొంతకాలం పనిచేశారు. తద్వారా ప్రభుత్వ విధానాలపై అవగాహన చేసుకున్నారు. మళ్లీ కొన్నాళ్లకు హైదరాబాద్లో ఉపాధికల్పనాధికారిగా కూడా ఉద్యోగించారు. ఆ సమయంలో కొన్నాళ్లు మానసిక వికలాంగుల సేవా సంస్థలో కొంతకాలం పనిచేశారు. సరిగ్గా ఇదే సమయంలో పూర్తి స్థాయిలో అనాథల సేవకు వెళ్లాలని ఆమె భావించారు. ఈ క్రమంలోనే అన్వేషణ మొదలు పెట్టి విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ఓ ఆశ్రమాన్ని సందర్శించారు. అదే జట్టు – భావ సమాఖ్య ఆశ్రమం. అయితే అప్పటికే స్థానికంగా ఉన్న ఉపాధ్యాయుడు పారినాయుడు మాస్టారు నిర్వహిస్తున్నారు. 2000 సంవత్సరం నుంచి పారినాయుడు మాస్టారు నిర్వహిస్తుండగా, ఈ ఆశ్రమాన్ని ఎంచుకుని ఆమె పూర్తి స్థాయిలో సేవలోకి వెళ్లారు. ‘గిరిజన గ్రామాల్లో చిన్నరోగాలతోనే సరైన వైద్య సదుపాయాలు లేక పెద్దలు చనిపోవటంతో చిన్నారులు అనాథలవుతున్నారు. పూర్తి స్థాయిలో వారికి ఆదుకోవాలనే ఉద్దేశంతో జట్టు ఆశ్రమాన్ని ఎంచుకున్నా’ అని చెబుతున్న పద్మజ 2004 నుంచి అక్కడే ఉండి సేవ చేస్తున్నారు. తనకు మిత్రులుగా ఉండేవారిని ఒక ఒక నెట్వర్క్ చేసి ఎందరో అనాధలకు తల్లిగా సేవలందిస్తున్నారు. యోగా, శాస్త్రీయ నృత్యాలు, వ్యవసాయం జట్టు ఆశ్రమ నిర్వహణ మొత్తం చిన్నారులే నిర్వహిస్తారు. వారికి కొద్దిమంది పెద్దలు సహకరిస్తారు. యోగ, చదువులు వారి దినచర్య. ఈ క్రమంలో పిల్లలే జీవన శైలి మారాలి అంటారు. సంపద కాదు ఆనందాన్ని ఇచ్చేది అనే పద్మజ గడచిన నాలుగేళ్లుగా ఆశ్రమానికి అనుబంధంగా రజనీ రాజా కళాక్షేత్రం నిర్వహిస్తూ చిన్నారులకు శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. విశేషమేమంటే శాస్త్రీయ నృత్యం, యోగాకు ఆమె శిక్షకురాలు. మరో విశేషమేమంటే ఆ్రస్టేలియా వెళ్లి అనాథాశ్రమ నిర్వహణ కోసం ప్రత్యేకంగా కోర్సు చేయడం. ఈ క్రమంలోనే స్థానికంగా స్వచ్ఛ పార్వతీపురం కార్యక్రమంలో ఆమె క్రియాశీల కార్యకర్తగా ఉన్నారు. ఇలా జీవితాన్ని సేవారంగానికి వెచ్చిస్తున్న మన జిల్లా వాసి మనకాలం ‘మదర్’గా వేనోళ్ల ప్రశంసలందుకుంటన్నారు. పలు పురస్కారాలు ఆమెను వరించినా, ఆమె వాటిని సున్నితంగా తిరస్కరించిన ఘనత ఆమె సొంతం. -
2019లో నింగికేగిన ప్రముఖులు...
జీవితమే పోరాటంగా అహర్నిశలు శ్రమించిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు 2019లో నింగి కేగిశారు. సాహిత్య, సామాజిక సేవా రంగాలకు చెందిన పలువురి ప్రముఖుల మరణాలు అభిమానులను కలచివేశాయి. సాహిత్య రంగంలో సాహితీ సవ్యసాచిగా పేరుగాంచిన ద్వా.నా. శాస్త్రి, తెలుగులో అరుదైన కథలు రాసిన సాహిత్యవేత్తగా గుర్తింపు పొందిన అబ్బూరి ఛాయాదేవి ఈ ఏడాది కనుమరుగయ్యారు. సామాజిక సేవా రంగంలో అభ్యుదయవాది, స్త్రీ విద్య, మహిళా సాధికారతకు విశేష కృషి చేసిన డాక్టర్ వి.కోటేశ్వరమ్మ ఈ ఏడాది తుదిశ్వాస విడిచారు. కుష్ఠు వ్యాధి బాధితుల కోసం జీవితాంతం కృషి చేసిన దామోదర్ గణేష్ కన్నుమూశారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ లోకాన్ని విడిచిపెట్టడం విషాదాన్ని నింపింది. ►సాహిత్య రంగం.. ద్వానా శాస్త్రి సాహితీ సవ్యసాచిగా పేరుగాంచిన ద్వా.నా. శాస్త్రి.. విభిన్న పత్రికల్లో వేలాది పుస్తక సమీక్షలు చేసిన ఏకైక వ్యక్తి. వందేళ్లనాటి ఛాయా చిత్రాలు, అరుదైన పుస్తకాలు, అలనాటి విశేష కవితలు, వెలుగులోకి తెచ్చారు. అంతేకాకుండా సాహిత్యంలో పలు ప్రయోగాలు చేసి అంతర్జాతీయ రికార్డులు సొంతం చేసుకున్నారు. ఏకధాటిగా 12 గంటల పాటు తెలుగు భాషా సాహిత్యాలపై ప్రసంగించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు.కాగా ద్వా.నా.శాస్త్రి అని పిలవబడే ద్వాదశి నాగేశ్వర శాస్త్రి కృష్ణాజిల్లా లింగాలలో 1948 జూన్ 15వ తేదీన జన్మించారు. శ్వాసకోశ వ్యాధితో ఫిబ్రవరి 25న ఆయన కన్నుమూశారు. అబ్బూరి ఛాయాదేవి తెలుగులో అరుదైన కథలు రాసిన సాహిత్యవేత్తగా గుర్తింపు పొందిన ఛాయాదేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో 1933 అక్టోబర్ 13వ తేదీన జన్మించారు. ప్రముఖ రచయిత, విమర్శకుడు, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు అబ్బూరి వరదరాజేశ్వరరావు సతీమణి ఛాయాదేవి. 1960 దశకంలో ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైబ్రేరియన్గా ఆమె పనిచేశారు. స్త్రీల జీవితాల్లోని దృక్కోణాలను కథల్లో ఛాయాదేవి ఆవిష్కరించారు. బోన్సాయ్ బ్రతుకు, ప్రయాణం సుఖాంతం, ఆఖరికి ఐదు నక్షత్రాలు, ఉడ్రోజ్ కథలు ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. బోన్సాయ్ బ్రతుకు కథని 2000 సంవత్సరంలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో పెట్టింది. ఆమె రాసిన 'తన మార్గం' కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 2003లో వాసిరెడ్డి రంగనాయకమ్మ ప్రతిభా పురస్కారం, 1996లో తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు అందుకున్నారు. జూన్ 28న ఆమె తుది శ్వాస విడిచారు. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ అభ్యుదయ కవి, సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంత శర్మ జూలై 26న కన్నుమూశారు. 1944 మే 29న జన్మించిన ఇంద్రగంటికి.. తండ్రి హనుమత్ శాస్త్రి సుప్రసిద్ధ కవి కావడంతో సహజంగానే సాహిత్యం ఒంటబట్టింది. విద్యార్థి దశనుంచే ఆయన రచనావ్యాసాంగాన్ని చేపట్టారు. చిన్నవయసులోనే అభ్యుదయ కవిగా ప్రసిద్ధులయ్యారు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి వారపత్రికలో సబ్ఎడిటర్గా పనిచేశారు. 1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో సహాయ సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహించారు. రేడియోలో నాటికలు, డాక్యుమెంటరీలు, సంగీత రూపకాలకు ప్రాణం పోశారు. ఆ తర్వాత ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికకు సంపాదకులుగా కూడా ఇంద్రగంటి శ్రీకాంత శర్మ పనిచేశారు. ఇంటిపేరు ఇంద్రగంటి పేరుతో తన ఆత్మకథను వెలువరించారు. గత యాభై సంవత్సరాల్లో తానెరిగిన సాహిత్య జీవితాన్ని, అలాగే తన కుటుంబ విశేషాలను, రచయితగా తన అనుభవాలను కలగలిపి ఈ ఆత్మ కథ రాసి 2018 జనవరిలో విడుదల చేశారు. రామతీర్థ వక్తగా, అనువాదకుడిగా, కవిగా, వ్యాసకర్తగా, విమర్శకుడిగా గుర్తింపు పొందిన రామతీర్థ మే 30న కన్నుమూశారు. అసలు పేరు యాబలూరు సుందర రాంబాబు. 1960లో నెల్లూరు జిల్లా అలగానిపాడు గ్రామంలో జన్మించారు. తండ్రి రైల్వే ఉద్యోగి కావడం వల్ల నెల్లూరు, ఒడిశాలలో విద్యాభ్యాసం సాగింది. బి.ఎ. తర్వాత 1981లో పారదీప్ పోర్టులో కార్మికుల రక్షణ విభాగంలో ఉద్యోగంలో చేరారు. 1985లో బదిలీపై విశాఖపట్నం వచ్చి అక్కడే స్థిరపడ్డారు. ఐదేళ్ళ క్రితం స్వచ్ఛంద పదవీ విరమణ చేసి పూర్తి కాలం సాహితీసేవలో నిమగ్నమయ్యారు. మహాస్వప్న.. దిగంబర కవిత్వోద్యమానికి శంఖారావం పూరించిన మహాస్వప్న.. జూన్ 24న కన్నుమూశారు. మహాస్వప్న అసలు పేరు కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు. కమ్మిశెట్టి వెంకయ్య నారాయణమ్మల ఏకైక కుమారుడు. ఆయనకు ఒక చెల్లెలు ఉంది. వృతిరీత్యా వ్యవసాయదారుడు. ఆజన్మ బ్రహ్మచారిగానే జీవితాంతం గడిపారు. ఇంటర్మీడియెట్ వరకు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మహాస్వప్న చదువుకున్నారు. ఉన్నత విద్య కోసం హైదరాబాద్కు వెళ్లడంతో, ఆయన జీవితం మలుపు తీసుకొంది. అక్కడ వివేకవర్థని కళాశాలలో బీఏలో చేరారు. ఈ క్రమంలో అభ్యుదయ, ప్రగతిశీల సాహిత్యంతో పరిచయం పెంచుకొన్నారు. 1958లో ప్రముఖ సంపాదకుడు నార్ల చిరంజీవి సహకారంతో పద్దెనిమిదేళ్ల వయసులోనే ‘చందమామ’ పేరుతో బాలకవితా సంపుటి వెలువరించారు. 1964లో అగ్నిశిఖలు - మంచు జడులు, స్వర్ణధూళి, కవితా సంపుటిలను ప్రచురించారు. వాసా ప్రభావతి ప్రముఖ రచయిత్రి, సాహితీవేత్త డాక్టర్ వాసా ప్రభావతి అనారోగ్యంతో డిసెంబర్ 18న కన్నుమూశారు. ఆమె వాసా ప్రభావతి పలు నవలలు రాశారు. ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యురాలిగా కూడా పనిచేశారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు కాశీచేనుల సూర్యనారాయణ లక్ష్మీదేవమ్మ దంపతులకు 1940లో ఆమె జన్మించారు. స్వాతంత్య్ర సమరయోధురాలు దువ్వూరి సుబ్బమ్మపై ‘దేశ బాంధవి’ అనే పుస్తకాన్ని ప్రభావతి రాశారు. వెండి వెలుగులు, హృదయ నేత్రం, పలు పద్య కావ్యాలు, 50కి పైగా లలిత గీతాలు, నవలలు, 20 వరకు నాటకాలు రాశారు. కులశేఖర్రావు ప్రముఖ సాహితీవేత్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య మడుపు ఎం.కులశేఖర్రావు మే నెల లో కన్నుమూశారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో జన్మించిన కులశేఖర్రావు తెలంగాణలో తొలితరం సాహితీవేత్త. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఏ, ఎంఏ తెలుగు చదివారు. ఆంధ్ర వచన వాజ్ఞ్మయ వికాసంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. ఉస్మానియా వర్సిటీ తెలుగు శాఖలో మూడున్నర దశాబ్దాలపాటు లెక్చరర్గా, రీడర్గా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా, శాఖ అధిపతిగా సేవలందించారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో పలు రచనలు, పద్య రచనలు సైతం అందించారు. తెలుగు సాహిత్య చరిత్రను ఆంగ్లంలో రాశారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి సాహిత్య బహుముఖి వ్యక్తిత్వంపై ఆంగ్లంలో ఒక గ్రంధాన్ని రచించారు. ►సామాజిక సేవా రంగం.. వి.కోటేశ్వరమ్మ విజయవాడ మాంటిస్సోరి విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు, అభ్యుదయవాది, స్త్రీ విద్య, మహిళా సాధికారతకు విశేష కృషి చేసిన డాక్టర్ వి.కోటేశ్వరమ్మ జూన్ 30న కన్నుమూశారు. విజయవాడ సమీపంలోని గోశాలలో కోనేరు వెంకయ్య, మీనాక్షి దంపతులకు 1925, మార్చి 5న కోటేశ్వరమ్మ జన్మించారు. తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ చేసి నెల్లూరు, విజయవాడల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. మహిళలు చదువుకుంటేనే పురుషులతో సమానంగా రాణిస్తారన్న నమ్మకంతో 1955లో చిల్డ్రన్స్ మాంటిస్సోరి స్కూల్ను స్థాపించారు. ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులను ఒప్పించి మరీ బాలికలను పాఠశాలలో చేర్పించేవారు. పది మందితో ప్రారంభమైన ఆ పాఠశాల క్రమంగా ప్రాథమికోన్నత, ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాలలుగా ఎదిగింది. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎడ్యుకేషన్, బయోటెక్నాలజీ, ఫిజియోథెరపీ వంటి కోర్సులూ ప్రారంభమయ్యాయి. ఆమె విద్యా సంస్థల్లో చదివిన లక్షలాది మంది మహిళలు దేశ, విదేశాల్లో ఉన్నత స్థితిలో ఉన్నారు. తన సేవలకు గుర్తింపుగా కోటేశ్వరమ్మ పలు అవార్డులు పొందారు. 1971లో బెస్ట్ టీచర్గా జాతీయ స్థాయి అవార్డు, 2017లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. మహిళా విద్యా సంస్థలను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు 2015లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్లో స్థానం పొందారు. రిటైర్డ్ ఐఏఎస్ పీఎస్ కృష్ణన్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరగని కృషి చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీఎస్ కృష్ణన్ నవంబర్ 9న కన్ను మూశారు. కేరళకు చెందిన 1956 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి కృష్ణన్.. కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం విశేష కృషి చేసిన అఖిల భారత సర్వీసు అధికారిగా అందరి మన్ననలు పొందారు. మండల్ కమిషన్ సిఫార్సుల్లో ఆయన ముఖ్యభూమిక పోషించారు. వైఎస్సార్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా ముస్లిం రిజర్వేషన్ల రూపకల్పనలో కృష్ణన్ది ప్రముఖపాత్ర. కేంద్ర సంక్షేమ శాఖ కార్యదర్శిగా, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడిగా, బీసీ కమిషన్ సభ్య కార్యదర్శిగా, ప్లానింగ్ కమిషన్లోని వివిధ విభాగాల్లో చైర్మన్, సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎస్సీ, ఎస్టీ చట్టం-1989, సవరణ చట్టం-2015, సవరణ చట్టం-2018 డ్రాఫ్ట్ రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. కేంద్ర ప్రభుత్వ గౌరవ సలహాదారుడిగా పనిచేశారు. భాగవతుల వెంకట పరమేశ్వరరావు గాంధేయవాది,శాస్త్రవేత డాక్టర్ భాగవతుల వెంకట పరమేశ్వరరావు జూన్ 9న విశాఖపట్నంలో కన్నుమూశారు. ఆయన స్వగ్రామం విశాఖ జిల్లా దిమిలి. 1976 నవంబర్లో యలమంచిలి సమీప గ్రామం హరిపురంలో బీసీటీ అనే పేరుతో స్వచ్ఛంద సేవా సంస్థను భాగవతుల ఏర్పాటు చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయంపై గ్రామాల్లో ప్రచారం చేసి వినూత్న మార్పునకు కృషి చేశారు. గ్రామ స్వరాజ్యం స్థాపన ధ్యేయంగా స్వగ్రామం దిమిలిలో హైస్కూల్ ఏర్పాటు చేసి అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య,వైద్యం అందించడానికి చేసిన కృషికి పలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఆయనను సత్కరించాయి. దామోదర్ గణేష్.. కుష్ఠు వ్యాధి బాధితుల కోసం జీవితాంతం కృషి చేసిన దామోదర్ గణేష్ బాపట్ ఆగష్టు 17న కన్నుమూశారు. తన 87ఏళ్ల జీవితకాలంలో 47ఏళ్ల పాటు కుష్ఠువ్యాధి బాధితులకు సేవలు అందించారు. 1972 నుంచి కుష్ఠువ్యాధిగ్రస్తుల సేవలో ఉన్నారు. కాట్రేనగర్ చంపాలో సొంత ఆశ్రమాన్ని ఏర్పాటు చేసిన ఆయన.. సామాజికంగానూ, ఆర్థికంగానూ వారి జీవితాల్లో మార్పుకు కృషి చేశారు. ఆయన సేవలకుగానూ 2018లో భారతప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. -
పాఠశాలకు ప్రేమతో..!
సాక్షి, ఇచ్ఛాపురం : విద్యాబుద్ధులు నేర్పిన గురువు, పాఠశాల రుణం తీర్చుకోవాలనే ఆలోచన ప్రతిఒక్కరికి ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల వాటిని ఆచరణలోనికి తీసుకురాలేని పరిస్థితి. కొద్దిమంది మాత్రమే ఆచరణలోనికి తీసుకొచ్చి అందరికి ఆదర్శంగా నిలుస్తుంటారు. అటువంటి కోవకు చెందిన వారిలో ఇచ్ఛాపురం వ్యాపారవేత్త వజ్రపు వెంకటేశ్వరరావు ఒకరు. ఈయనతో పాటు ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఇచ్ఛాపురం ప్రభుత్వోన్నత పాఠశాల సమస్యలతో కొట్టుమిట్టాడటం, సరైన తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బందిపడటం చూసి చలించిపోయారు. అదనపు గదులను నిర్మించాలని గతేడాది ఆగస్టులో సంకల్పించారు. అందుకు తగ్గట్టుగా అప్పటి కలెక్టర్ కె.ధనంజయ్రెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులను స్వయంగా కలిసి నిర్మాణానికి అవసరమైన అనుమతులు పొందారు. ఇచ్ఛాపురం ప్రభుత్వోన్నత పాఠశాలను 1903లో శ్రీసురంగి రాజావంశీలయులు నిర్మించారు. ప్రస్తుతం గదులన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుతం 1358 మంది విద్యార్థులు చదువుతున్నారు. వెంకటేశ్వరరావు ఇదే పాఠశాలో 1985లో విద్యాభ్యాసం ప్రారంభించారు. బడి రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో కోటీ 50 లక్షల రూపాయంతో 10 అదనపు భవనాలు నిర్మించారు. ఈ నెల 28న రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఆపద్బాంధవుడు హనీఫ్..
తాను సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని సమాజ సేవకు వినియోగించాలని తలపెట్టారాయన. పేదల సేవలో నేను సైతం అంటూ ఓ బృహత్తర కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తున్నారాయన. వృద్ధాప్యాన్ని సైతం లెక్క చేయకుండా తన జీవితాన్నే సేవా తత్పరతకు అంకితం చేశారు. మానవత్వానికి చిరునామాగా నిలుస్తున్నారు 84 ఏళ్ల మహ్మద్ హనీఫ్ సాహెబ్. మానవతకు మారుపేరుగా. మంచితనానికి మరోరూపుగా.. కష్టకాలంలో ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న హనీఫ్సేవాగుణంపై కథనం ఇదీ.. బంజారాహిల్స్ రోడ్ నెం.10లోని జహీరానగర్లో నివసించే హనీఫ్కు ఆరుగురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. 50 ఏళ్లుగా ఆటో తోలుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తాను సంపాదించినదానికి కొంత సార్థకత చేకూరాలనే ఉద్దేశంతో తలంచారు. కష్టాల్లో ఉన్నవారికి 20 ఏళ్లుగా తన ఆటో ద్వారా ఉచితంగా ఆస్పత్రులకు చేరుస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని బాలింతలు, గర్భిణులు, ఆస్పత్రులకు వెళ్లే వృద్ధులు ఫోన్ చేస్తే చాలు.. తాను కళ్లారా చూస్తే చాలు వారిని తన ఆటోలో ఎక్కించుకొని ఆస్పత్రులకు కిరాయి డబ్బులు తీసుకోకుండానే ఉచితంగా చేరువేస్తున్నారు. ప్రతినిత్యం కనీసం 10 మందినైనా ఆస్పత్రులకు చేరుస్తుంటానని హనీఫ్ తెలిపారు. ఇలా చేయడంలో తనకెంతో ఆనందం ఉందని, తన కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సహిస్తారు తప్పితే ఏనాడూ ప్రశ్నించలేదన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన సబ్కా సాథ్.. సబ్కా వికాస్ నినాదానికి ప్రభావితమయ్యాయనన్నారు. తన ఫోన్ నంబర్, ఇతర వివరాలను ఆటోపై రాసి ఓ బోర్డు ఏర్పాటు చేసుకొని ఉచిత సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. పట్టపగలు.. అర్ధరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా వెంటనే అక్కడ వాలిపోతుంటారు ఆయన. ప్రమాదం జరిగినప్పుడు పలువురు తనకు ఫోన్ చేసి పిలుస్తాంటారని వెల్లడించారు. సైకిల్పై హజ్ యాత్ర.. 2006లో హనీఫ్ సైకిల్పై మక్కా యాత్ర చేపట్టారు. 2006 ఆగస్ట్ 7న నాంపల్లి హజ్భవన్ నుంచి ప్రారంభమైన సైకిల్ యాత్ర తొమ్మిది నెలల తర్వాత 2007లో మక్కాకు చేరుకుంది. ఏడు రాష్ట్రాలు, ఏడు దేశాలు దాటుకొని ఆయన మక్కా చేరుకున్నారు. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం వద్దకు వెళ్లి తను మక్కా వెళ్లేందుకు సైకిల్ యాత్ర కోసం అనుమతిప్పించాల్సిందిగా కోరారు. ఇందుకోసం ప్రస్తుత సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి అప్పట్లోనే తనకు అనుమతులు ఇప్పించారని గుర్తు చేసుకున్నారు హనీఫ్. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సైకిల్ యాత్రకు అనుమతివ్వడానికి సతాయించగా బీజేపీ నేతలు మాత్రం దగ్గరుండి తనకు అనుమతులు ఇప్పించారని వారి మేలు మర్చిపోలేనిదన్నారు. నెలకు రూ.30 వేల ఆర్జన.. తాను స్కూల్ పిల్లలను ప్రతిరోజూగచ్చిబౌలి నాసర్ స్కూల్కు తీసుకెళ్లి మళ్లీ గమ్య స్థానాలకు చేర్చేందుకు నెలకు రూ.21 వేలు సంపాదిస్తానన్నారు. మిగతా సమయంలో మరో రూ.9 వేల దాకా వస్తుందన్నారు. రూ.30 వేలు జీవనోపాధికి సరిపోతాయని ఉచితంగా సేవలు అందించేందుకు మహా అంటే నెలకు రూ.5 వేలు ఖర్చవుతుందని, ఈ రూ.30 వేల నుంచే ఆ ఖర్చులు తీసేసుకుంటానని వెల్లడించారు. ఎవరు, ఎప్పుడు ఫోన్ చేసినా తనకు శక్తి ఉన్నంత వరకుఈ సేవలు కొనసాగుతాయనిస్పష్టంచేశారు. ఆపదలో ఉంటే ఫోన్ చేయొచ్చు.. ఎవరైనా ఆపదలో ఉంటే, ప్రమాదంలో గాయపడి ఆటో దొరక్క ఇబ్బంది పడితే 76808 58966 నంబర్లో సంప్రదించవచ్చని హనీఫ్ తెలిపారు. -
వాడని ఫోన్లతో.. వైకల్య బాధితులకు ఆసరా..
సాక్షి, సిటీబ్యూరో: దివ్యాంగులను ఆదుకునేందుకు ఇప్పుడు సరికొత్త మార్గాన్ని నారాయణ్ సేవా సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. నగరంతో పాటు దేశవ్యాప్తంగా అంగవికలుర కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఇన్స్టా క్యాష్ అనే సి2బి ఆన్లైన్ ఇ కామర్స్ ప్లాట్ ఫామ్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. స్మార్ట్ఫోన్స్ సెకండ్స్ సేల్స్ కోసం...ఇన్స్టా క్యాష్... ఆన్లైన్ ద్వారా మనం వాడని ఫోన్స్ని ఇన్స్టా క్యాష్ ద్వారా విక్రయించుకునే వెసులుబాటు ఉంది. దీని ద్వారా కేవలం 60 సెకన్లలోనే మన సెకండ్ హ్యాండ్ ఫోన్ని అమ్మి నగదును పొందవచ్చునని ఈ ప్లాట్ఫామ్ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వందల సంఖ్యలో దివ్యాంగులకు సేవలు అందిస్తున్న నారాయణ్ సేవాశ్రమ్ వైకల్య బాధితుల ఆపరేషన్లకు, ఇతర చికిత్సలకు గాను మనవంతు సాయంగా మనం వాడని ఫోన్స్ను అందిస్తే చాలని అభ్యర్ధిస్తోంది. ఈ మేరకు ఈ సంస్థ ఇన్స్టా క్యాష్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు మనం నారాయణ్ సేవాశ్రమ్కు విరాళం అందించేందుకు రూ.వేలూ లక్షలూ ఇవ్వక్కర్లేదు. కేవలం మన వాడని ఫోన్ని ఇన్స్టా క్యాష్లో అప్లోడ్ చేసి దాని ద్వారా వచ్చే మొత్తాన్ని నారాయణ్ సేవాశ్రమ్కి అందించమంటే చాలు. దివ్యాంగుల సేవ కోసం నిరుపయోగంగా ఉన్న ఫోన్ని మార్గంగా మార్చుకోనే ఆలోచన దివ్యంగా ఉంది కదూ... -
ఆకలి తీర్చే.. దాతలు
సాక్షి, ఆదిలాబాద్ : సేవ చేయాలనే ఆలోచన ఉంటే చాలూ.. జేబులో చిల్లిగవ్వ లేకున్నా కొత్త ఆలోచనతో మిగులు ఆహారాన్ని పేదలకు అందిస్తున్నారు. మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజల కడుపు నింపేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, సత్యసాయి సేవా సమితి ముందుకొస్తున్నాయి. జానెడు పొట్ట కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎంతోమంది ఎండ, వాన, చలీలో కూలీ పనులు చేసి జీవనం సాగిస్తున్నారు. మరికొంత మంది వికలాంగులు, వృద్ధులు, అనాధలు, చిన్నారులు యాచకులుగా మారుతున్నారు. అలాంటి వారికి మేమున్నామంటూ స్వచ్ఛంద సంస్థల సభ్యులు, సేవా సమితి సభ్యులు కడుపునిండా భోజనం పెడుతున్నారు. దీంతోపాటు శుభకార్యాల్లో మిగిలిన ఆహారాన్ని వృథాగా పోనివ్వకుండా అక్కడి నుంచి కార్మికవాడల్లో, రైల్వేస్టేషన్, రిమ్స్ ఆస్పత్రిలో ఆకలితో ఉన్నవారికి భోజనం వడ్డిస్తున్నారు. కడుపునిండా తిన్నవారు అన్నదాత సుఖీభవ అంటూ వారిని ఆశీర్వదిస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ.. మానవ సేవే మాధవ సేవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ సంఘం సభ్యులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఓ శుభకార్యానికి వెళ్లిన సమయంలో మిగిలిపోయిన ఆహారాన్ని పారవేసే సమయంలో ఈ సంఘం సభ్యులకు ఓ ఆలోచన తట్టింది. మిగులు ఆహారాన్ని వృధా చేయకుండా ఆకలితో ఉన్న పేదలకు వడ్డిస్తే కడుపునిండా భోజనం చేస్తారని.. ఇలా కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఏళ్లుగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నారు. పెండ్లీలు, బర్త్డే పార్టీలు, చిన్నచిన్న శుభకార్యాల్లో మిగిలిపోయిన అన్నం కార్మిక వాడల్లోకి తీసుకెళ్లి వారికి భోజనం వడ్డిస్తున్నారు. ఈ సంఘంలో బాధ్యులు పస్పుల రాజు, శివగణేష్, దేవిదాస్, రామకృష్ణ, ప్రశాంత్, సంతోష్, అభికృత్, కనక నర్సింగ్, శశికళ సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు. శుభకార్యాల్లో మిగిలిపోయిన అన్నం వృధా కాకుండా సేవ సమితి సెల్: 7382747696 లపై సంప్రదించవచ్చు. రోగుల బంధువులకు అండగా.. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రం రోజుకు ఎంతో మందికి కడుపునిండా ఉచితంగా ఒకపూట భోజనం పెడుతున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగలేని పేద ప్రజలే నిత్యం రిమ్స్కు చికిత్స కోసం వస్తుంటారు. అలాంటి వారు భోజనం చేయలేని పరిస్థితుల్లో వారికి కడుపునిండా భోజనం అందిస్తున్నారు. 2012 ఆగస్టు 21న శ్రీ సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రాన్ని ప్రారంభించారు. అన్నదానం చేయాలనుకునేవారు సెల్: 9440871776, 9705692816 సంప్రదించాలి. ఆరోగ్యానికి జొన్నరొట్టె మంచిర్యాల : రోజురోజుకు ప్రాచీన వంటకాలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఆరోగ్యాన్ని వ్యాధుల నుంచి కాపాడు కోవడానికి పలు రకాల ప్రాచీన వంటకాలను భుజిస్తున్నారు. ప్రాచీన వంటకాల్లో జొన్నరొట్టెలకు పట్టణంలో బలే గిరాకి పెరిగింది. జొన్నరొట్టె వలన శారీరానికి పౌష్టికాహారంగా ఉపయోగపడుతుందని ప్రజలు ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. ఒక్క దుకాణంతో మొదలైన జొన్నరొట్టె వ్యాపారం పన్నెండు దుకాణాలుగా వెలిసాయి. ఒక్క రొట్టెకు పది రూపాయల చొప్పున అమ్మతున్నారు. నిత్యం చాల మంది జొన్నరొట్టెల కోసం ఆసక్తిని చూపుతున్నారు. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు నిత్యం జొన్నరొట్టెలు తింటు ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. కొంతమంది మహిళలు నిత్యం మధ్యాహ్నం వచ్చి జొన్నపిండి కలుపుకుని కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తు వేడివేడిగా కారం చెట్నితో ప్రజలకు అందిస్తు జీవనోపాధిని పొందుతున్నారు. జొన్నరొట్టెలతో ఆర్యోగానికి కలిగే మేలా చాల ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. దీంతో పట్టణంలో ప్రాచీన వంటకం జొన్నరొట్టెకు భలే గిరాకీ పెరిగింది. -
ఎంగిలి ప్లేట్లు తీసిన న్యాయమూర్తి
సాక్షి, హైదరాబాద్ : ఆయన హైకోర్టు న్యాయమూర్తి. అధికారం.. హోదా.. చిటికేస్తే పనులు చేసిపెట్టే మనుషులు.. ఇలా అన్నీ ఉన్నా ఆయన వాటన్నింటినీ పక్కన పెట్టారు. ఆయనే స్వయంగా ఎంగిలి పేట్లు ఎత్తారు. ఈ ఘటనకు హైకోర్టు ప్రాంగణం వేదికైంది. శుక్రవారం సాయంత్రం హైకోర్టులో సీని యర్ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్కుమార్ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. న్యాయవాదులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అందరూ టీ తాగారు.. బిస్కెట్లు.. సమోసాలు తిన్నారు. ఎప్పటి లాగే ప్లేట్లు అక్కడే పడేసి వెళ్లిపోయారు. ఇదంతా గమనిస్తున్న జస్టిస్ చల్లా కోదండరామ్కు మనసు చివుక్కుమంది. న్యాయవాదులుగా బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి ఇలా ఎక్కడపడితే అక్కడ, అది కూడా హైకోర్టు ప్రాంగణాన్ని అపరిశుభ్రంగా మార్చడాన్ని భరించలేకపోయారు. వెంటనే స్వయంగా వచ్చి ఈ ప్రదేశం మొత్తం తిరుగుతూ న్యాయవాదులు పడేసిన ఎంగిలి ప్లేట్లను ఎత్తడం ప్రారంభించారు. మొదట్లో న్యాయవాదులకు ఆయన ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. ఆ తర్వాత ఎంగిలి ప్లేట్లు తీస్తున్నారని అర్థం చేసుకున్న న్యాయవాదులు వారు ఆయనతో పాటు ప్లేట్లను తీయడం ప్రారంభించారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సూర్యకరణ్రెడ్డి కూడా జస్టిస్ కోదండరామ్తో కలిసి ఈ ప్లేట్లను తీసేశారు. -
నేనున్నానని...
అతనొక ఉద్యోగి. భావితరాల చిన్నారులకు విద్యను అందించాలనే తపనతోఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు...ఏకంగా 40 మంది విద్యార్థుల తల్లిదండ్రులను కలిశాడు. ‘మీ పిల్లలను నేను చదివిస్తాను. వాళ్లకు ఉద్యోగాలు వచ్చే వరకు నాదే బాధ్యత..’ అంటూ భరోసా ఇచ్చాడు. పిల్లలు చదువుకుంటే ఎంత ప్రయోజకులు అవుతారనే విషయాల్ని ల్యాప్టాప్ ద్వారా చూపించాడు. వారిని ఒప్పించాడు. అందుకోసం తల్లిదండ్రుల వద్ద తెల్లపేపర్పై ‘మీ పిల్లల భవిష్యత్కు నేనే బాధ్యడ్నంటూ’ రాసి నేటితరం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ప్రశాంత్ కుమార్ బోనగిరి. సాక్షి, సిటీబ్యూరో:రామంతపూర్కు చెందిన ప్రశాంత్కుమార్ బోనగిరి ‘శ్రీ వాసవి చారిటబుల్’ పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేశాడు. ఉచితంగా అనాథలకు, చదువుకోలేని వారికి విద్యను అందిస్తున్నాడు. వృత్తిరీత్యా పెయింటర్. అదే విధంగా ‘మ్యాన్ పవర్ సొల్యూషన్’ కంపెనీని స్థాపించాడు. ఈ కంపెనీ ద్వారా వచ్చే తన ఆదాయంలో కొంత భాగాన్ని పక్కనపెట్టి స్వచ్ఛంద కార్యక్రమాలకు వినియోగిస్తున్నాడు. ఆదాయంలో 40 శాతం ట్రస్ట్కే... పెయింటింగ్లో ప్రశాంత్ మంచి ప్రతిభావంతుడు. నెలకు మూడే మూడు పెయింటింగ్స్ వేస్తాడు. ఒక్కో పెయింటింగ్ని రూ.10 వేలకు అమ్ముతాడు. ఈ పదివేల నుంచి 40 శాతం పక్కకు తీసి ట్రస్ట్కు వాడతాడు. అదేవిధంగా సొంతంగా ‘మ్యాన్పవర్ సొల్యూషన్’ కంపెనీ ఉంది. ఈ కంపెనీ ద్వారా సెక్యూరిటీ గార్డులను కార్పొరేట్ కంపెనీలకు రిక్రూట్ చేస్తాడు. ఈ కంపెనీ ద్వారా దాదాపు నెలకు రూ.2 లక్షల ఆదాయం వస్తే..దానిలో 40 శాతం ట్రస్ట్కు వినియోగిస్తున్నాడు. ఇలా ఈ డబ్బుతో ఇప్పటివరకు ప్రత్యక్షంగా 40 మందిని చదివిస్తుండగా..50 మందికి పైగా విద్యార్థులకు అవసరమైన సదుపాయాల్ని కల్పిస్తున్నాడు ప్రశాంత్. నేనే బాధ్యుడ్ని అంటూ అగ్రిమెంట్ నగరంతో పాటు ఆదిలాబాద్, మంచిర్యాల, గోదావరిఖని తదితర ప్రాంతాలకు చెందిన అనాథలు, బడుగు, బలహీన వర్గాలకు చెందిన చిన్నారులను స్వయంగా చదివిస్తున్నాడు. చదువు మానేసి ఇంటిపట్టున ఉంటూ..కుటుంబానికి ఆసరాగా ఉంటున్న వారిని గుర్తించాడు. ఆయా ప్రాంతాలకు వెళ్లాడు. వాళ్ల తల్లిదండ్రులను బతిమిలాడాడు. వారు ఒప్పుకోకపోవడంతో..‘మీ పిల్లల చదువులు అయ్యే వరకు నేనే చూసుకుంటా. చదువుకు సంబంధించి వారికి కావాల్సిన అవసరాలన్నింటినీ నేనే తీరుస్తా. ఉద్యోగం వచ్చే వరకూ నాదే బాధ్యత’ అంటూ అగ్రిమెంట్ కూడా రాసి వారికి ఇవ్వడం జరిగింది. ఇలా 15 మంది చిన్నారుల తల్లిదండ్రులకు అగ్రిమెంట్ రాసినట్లు ప్రశాంత్ తెలిపారు. సేవల్లోభేష్ నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభంలో ఉచితంగా బుక్స్, పెన్నులు, బట్టలు, బూట్లు ఇవ్వడం చేస్తుంటాడు. బాలికలకు శానిటరీ న్యాప్కిన్స్ను పంపిణీ చేస్తాడు. టాయ్లెట్స్ని క్లీన్ చేయించడం, మంచి తాగునీరు అందించడం లాంటి ఎన్నో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాడు. ఇటీవల రామంతపూర్కి చెందిన లక్ష్మమ్మ అనే ఓ వృద్ధురాలికి ప్రభుత్వం నుంచి పింఛన్ రావట్లేదు. విషయం తెలుసుకున్న ప్రశాంత్ ఆ వృద్ధురాలికి సొంత ఖర్చులతో టీ స్టాల్ని ఏర్పాటు చేశాడు. యోగిత అనే విద్యార్థినికి తండ్రి లేడు. చదువు భారం కావడంతో ఆమెను ఉచితంగా చదివిస్తున్నాడు. పీజీ పూర్తయ్యే వరకు తనదే బాధ్యతంటూ ఆమె తల్లికి భరోసా ఇచ్చాడు. వర్షకాలంలో రాజేంద్రనగర్లోని ఓ ప్రభుత్వ పాఠశాల్లో 50 మంది విద్యార్థులకు ఉచితంగా గొడుగులను పంపిణీ చేశాడు. మరికొద్దిరోజుల్లోఉచితంగా వాటర్ట్యాంకులు ప్రస్తుతానికి నాకు వచ్చే ఆదాయంలో 40 శాతం ట్రస్ట్కు ఖర్చు పెడుతున్నా. ట్రస్టు ఏర్పాటు చేసి రెండేళ్లు అవుతుంది. ఇప్పటి వరకు ఎవ్వరినీ ఒక్క రూపాయి అడగలేదు. కొద్దిరోజుల్లో నా వ్యాపారంలో మరింత లాభాలు వచ్చే అవకాశం ఉంది. వచ్చిన ఆదాయంతో నగరంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా వాటర్ట్యాంక్స్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నా. నా శక్తిమేరకు ఎంతమందిని చదివించగలిగితే అంతమందిని చదివించేందుకు నేను సిద్ధం. – ప్రశాంత్కుమార్, ట్రస్టు వ్యవస్థాపకులు -
ఆ గ్లామర్ ఎంతో స్పెషల్
సాక్షి,సిటీబ్యూరో:ర్యాంప్పై మెరుపులు మెరిపిస్తుంది. మంచి మనసుతోనూ మురిపిస్తుంది. మంచిని పంచేందుకు ముందుంటుంది. సిటీ మోడల్ చందనా ప్రేమ్... సేవాలంటీర్గా సామాజిక కార్యక్రమాల్లో తన ఆలోచనల్ని పంచుకుంటోంది. కిడ్స్– మామ్స్ ఫ్యాషన్ రన్ వే 29న ఆ చిన్నారుల కోసం ఏమైనా పెద్ద సాయం చేయాలనే ఆలోచనతో నాకు పరిచయం ఉన్న ర్యాంప్ను వేదిక చేసుకున్నాను. అలా కిడ్స్ అండ్ మామ్ ఫ్యాషన్ రన్ వే కార్యక్రమం రూపుదిద్దుకుంది. దీనిలో భాగంగా స్పెషల్ చిన్నారుల డ్యాన్స్, లైవ్ బ్యాండ్ పెర్ఫార్మెన్స్, తల్లులూ, పిల్లల ర్యాంప్ వాక్, స్పెషల్ చిల్డ్రన్ ర్యాంప్వాక్...వంటివి ఉంటాయి. ఈ నెల 29న కొండాపూర్లోని హార్ట్ కప్ కఫేలో దీన్ని నిర్వహిస్తున్నాం. ఇదో స్పెషల్ ప్రోగ్రామ్... ఐటి ఉద్యోగినిగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. కాని చందనా ప్లాన్ చేసిన ఈ ఈవెంట్ చాలా ప్రత్యేకమైనది. స్పెషల్ చిల్డ్రన్ గురించి ఎంత చేసినా తక్కువే. ఈ ఈవెంట్ సక్సెస్ అవడం అంటే ఒక హెల్పింగ్ హ్యాండ్ గెలిచినట్టే. – సంగీత మోడలింగ్ ప్రొఫెషనల్లో బిజీగా ఉంటూనే లైఫ్స్కిల్స్ ట్రైనర్గా పనిచేస్తున్నాను..కొంతకాలంగా సోషల్ యాక్టివిటీస్లో నిమగ్నమయ్యాను. అందులో భాగంగా శ్రీవిద్య సెంటర్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్ హోమ్కి వెళ్లాను. ఆ సెంటర్ తొలుత 8 మందితో మొదలై ఇప్పుడు 160 మంది íస్పెషల్ చిల్డ్రన్కు ఆశ్రయం ఇస్తోంది. అమాయకమైన పిల్లలను చూస్తుంటే బాధ, వాళ్ల గురించి ఏమైనా చేయాలనిపించింది. వీలున్నప్పుడల్లా స్నేహితురాలు సంగీతతో అక్కడికి వెళ్లొచ్చేదాన్ని. అక్కడి చిన్నారుల్లో ప్రతిభ ఉంది. దానికి వెలుగునిచ్చి, అదే చేత్తో వారికి కావాల్సిన అత్యాధునిక వసతి సౌకర్యం ఏర్పాటు చేయాలని అనుకున్నా. -
ఈ సైనికుడు మంచి సేవకుడు
సాక్షి,కాకినాడ : విశ్రాంత జీవితాన్ని కుటుంబ సభ్యులతో గడపాలని ఏ ఉద్యోగి అయినా కోరుకుంటారు. దేశ సేవలో 13 ఏళ్లు పనిచేసిన ఆ సైనికుడు విశ్రాంత జీవితాన్నీ సమాజం కోసం వెచ్చించాలని భావించి పోలీసు శాఖలో చేరి ట్రాఫిక్ విభాగంలో ఇతోథికంగా సేవ చేస్తున్నారు. కాకినాడ నగరానికి చెందిన బులుసు విశ్వేశ్వరరావు బీఎస్ఎఫ్లో పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆయన సేవా దృక్పథం, సైనికుడిగా పొందిన శిక్షణలో క్రమశిక్షణను ప్రజలలో ఇసుమంతైనా అలవాటు చేయాలని తలచారు. అందుకు పోలీసు శాఖను ఎంచుకుని స్వచ్ఛందంగా పని చేసేందుకు ముందుకు వచ్చి ట్రాఫిక్ విభాగంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే కాకినాడ టౌన్హాల్ వద్ద జంక్షన్లో ట్రాఫిక్ నియంత్రణ సేవకుడిగా తొమ్మిదేళ్లుగా సేవలందిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారికి ఆ నిబంధనలు బంధనాలు కావని, స్వీయ రక్షణ కోసమని ఎంతో వినయంగా వారికి వివరిస్తున్నారు. దీంతో నిత్యం ఆ మార్గంలో వచ్చి వెళ్లే వాహనచోదకులకు ఆయన సుపరిచితుడయ్యారు. జీతం ఇస్తామన్నా వద్దని.. ట్రాఫిక్ నియంత్రణకు స్వచ్ఛందంగా వచ్చిన విశ్వేశ్వరరావు ఎటువంటి జీతం, భత్యం ఆశించకుండానే తన విధి నిర్వహణను కొనసాగిస్తున్నారు. నెలవారీ జీతం వచ్చే ఏర్పాటు చేస్తామని ఎందరు ఎస్పీలు సూచించినా ఆయన ససేమిరా అంటారు. నిబంధనలు అతిక్రమించి వెళ్లేవారికి తన సూచనలు సలహాలు నచ్చి కృతజ్ఞతతో శభాష్ సార్, థాంక్యూ సార్ అంటూ ఇచ్చే మెచ్చుకోళ్లే తనకు సంతృప్తిని ఇస్తాయని, ప్రోత్సాహాన్నిస్తాయని అంటారు విశ్వేశ్వరరావు. దేశ సేవలో ఒక రకమైన సంతృప్తి ఉంటే, ట్రాఫిక్ నియంత్రణ ద్వారా సమాజ సేవలో లభించే సంతృప్తి మరో రకమైనదని ఆయన గర్వంగా చెప్తారు. -
అప్పుడు టీ అమ్మాడు.. ఇప్పుడు 'నీట్' బోధిస్తున్నాడు
భువనేశ్వర్ : జార్ఖండ్కు చెందిన 47 ఏళ్ల అజయ్ బహుదూర్ సింగ్ పేరు ప్రస్తుతం ఒడిశాలో మారుమోగిపోతోంది. భువనేశ్వర్ పట్టణంలో నివసిస్తున్న ఆయన.. మరో సూపర్-30 ఆనంద్కుమార్లా పేరు సంపాదిస్తున్నారు. ఒకప్పుడు పేదరికంలో మగ్గిన అజయ్.. అంచెలంచెలుగా ఎదిగి.. ప్రస్తుతం తన ఇంటిలోనే ఒక గదిని ఏర్పాటు చేసుకొని పేద విద్యార్థులకు నీట్ పాఠాలు బోధిస్తున్నారు. అంతేకాదు ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న 19 మంది విద్యార్థుల్లో(2018-19 బ్యాచ్కు చెందినవారు) 14 మంది నీట్కు అర్హత సాధించడం విశేషం. అదే విధంగా 2017-18 బ్యాచ్లో 20 మంది విద్యార్థులకు అజయ్ పాఠాలు బోధించగా..వారిలో 18 మంది నీట్లో ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దుతూ సేవాభావం చాటుకుంటున్న అజయ్ తన నేపథ్యం గురించి చెబుతూ..పరిస్థితుల ప్రభావం వల్ల తాను డాక్టర్ కాలేకపోయినా తనలా మరే ఇతర విద్యార్ధి బాధపడకూడదనే ఇలా పాఠాలు బోధిస్తున్నట్లు తెలిపారు. ‘చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే కోరిక బలంగా ఉండేది. ఎంబీబీఎస్కు ప్రిపేర్ అవుతున్న సమయంలో నాన్న ఆరోగ్యం పాడవడంతో కుటుంబ పోషణ భారమైంది. దాంతో చదువుకు స్వస్తి చెప్పి టీ అమ్మాల్సి వచ్చింది. అప్పుడే ఓ నిర్ణయం తీసుకున్నాను. నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో... ''జిందగీ'' పేరుతో ఫౌండేషన్ను ఏర్పాటు చేశాను. నా దగ్గరికి వచ్చే విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి నీట్ పాఠాలు బోధిస్తున్నా అని పేర్కొన్నారు. ''జిందగీ ఫౌండేషన్''ను తన సొంత రాష్ట్రమైన జార్ఖండ్తో పాటు ఇతర ప్రాంతాలకు త్వరలోనే విస్తరించనున్నట్లు వెల్లడించారు. నీట్కు అర్హత సాధిస్తా.. 'మాది నిరుపేద కుటుంబం. మా తండ్రి దినసరి కూలీకి వెళ్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఆర్థిక స్తోమత సరిగా లేకపోవడంతో కోచింగ్కు వెళ్లలేకపోయాను. కానీ జిందగీ ఫౌండేషన్ ద్వారా అజయ్ బహుదూర్ సార్ ఉచితంగా నీట్ పాఠాలు బోధిస్తున్నట్లు తెలుసుకొని అందులో చేరాను' అని నీట్కు ప్రిపేర్ అవుతున్న రేఖారాణి వెల్లడించింది. ఎంత కష్టపడైనా సరే.. నీట్లో అర్హత సాధించి ఎంబీబీఎస్ అడ్మిషన్ సాధించడమే తన లక్ష్యమని ఆమె పేర్కొంది. -
'పల్లవిం'చిన సేవా స్ఫూర్తి
చక్కని ఉద్యోగం.. ఐదంకెల జీతం.. చేతి నిండా డబ్బు.. ఎంజాయ్ చేసే వయసు.. మనిషికి ఇంతకంటే ఇంకేం కావాలి? కానీ ఇవన్నీ ఉన్నా ఆ యువతి మాత్రం నలుగురికి సాయం చేయడంలోనే ఆనందాన్ని వెతుక్కుంది. అదే మానవ జన్మకు సార్థకమంటోంది. తండ్రి నుంచి సేవచేయడాన్ని వారసత్వంగా తీసుకున్న ఆమె పేరు ‘పల్లవి ప్రియ’. ఉత్తరప్రదేశ్లో పుట్టి పెరిగిన ఈమె సిటీలో ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. అంతేకాదు.. ‘కాజ్ ఫర్ సెలబ్రేషన్’ పేరుతో ఓ ఎన్జీఓను నెలకొల్పి దాని ద్వారా వందలాది మందికి అండగా నిలుస్తోంది. సాక్షి,సిటీబ్యూరో: పల్లవి ప్రియ సిటీలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తునే అదే కంపెనీలోని సీఎస్ఆర్లో కోర్ మెంబర్గాను ఉంది. ఉత్తరప్రదేశ్లో చదువుకునే రోజుల్లో ఎన్ఎస్ఎస్ మెంబర్గా కాలేజీ అయ్యాక తన స్నేహితులతో కలసి సమీపంలోని బస్తీల్లో పర్యటించి అక్కడి వారి అవసరాలను గుర్తించేంది. అలా తన వద్దనున్న డబ్బులతో చేతనైన సాయం అందించేది. ఉద్యోగం వచ్చాక ఈసేవను మరింత విస్తృతం చేసింది. పల్లవిప్రియ చేసే ప్రతి పనికి ఓ లెక్క ఉంటుంది. ప్రస్తుతం వర్షాకాలంలో రోడ్డుపై ఉండే చిరు వ్యాపారులు వర్షంలో తడుస్తునే తమ పనులు చక్కబెట్టుకోవడం చూసిన ఆమె ‘ఫుట్పాత్ వ్యాపారులకు పెద్ద పెద్ద గొడుగులను ఇవ్వాలనే లక్ష్యంతో నేను ఓ అడుగు వేస్తున్నా.. ఆసక్తి ఉన్నవారు నాతో చేయి కలపండి’ అంటూ తన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. అది జరిగి ఆరు గంటల్లో పదుల సంఖ్యలో ఆమెను సంప్రదించి నగర వ్యాప్తంగా ఫుట్పాత్పై ఉండే చిరు వ్యాపారులకు గొడుగులు పింపిణీ చేసే నగదు సమకూర్చుకుని వారిసి సాయం అందించింది. చిన్నారులకు బహుమతులు ఇస్తున్న పల్లవి ప్రియ ఒక్క రోజులో ఏడాదికి సరిపోయే బుక్స్ గత ఏడాది సెప్టెంబర్లో తన పుట్టిన రోజున నగరంలోని ఓ అనాథ ఆశ్రమానికి వెళ్లిన పల్లవి ప్రియ అక్కడి పిల్లలతో సరదాగా గడిపి, వారికి కడుపునిండా భోజనం పెట్టింది. తిరిగి వచ్చే సమయంలో వారంతా ‘అక్కా..మాకు నోట్ బుక్స్ లేవు, చదువుకోవడానికి, రాయడానికి చాలా ఇబ్బంది ఉంద’నడంతో అనాథ పిల్లలకు నోట్బుక్స్ పంపిణీ చేసేందుకు దాతలు కావాలంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. కొన్ని గంటల్లోనే 12 మంది ముందుకు వచ్చారు. అక్కడి పిల్లలకు ఏడాది పాటు కావాల్సిన నోట్బుక్స్, బట్టలు, షూస్, ఇతరాత్ర అవసరాల కోసం సాయం అందించారు. మరోరోజు ఇన్ఫోసిస్ కార్యాలయానికి కొందరు పిల్లలు విజిటింగ్ కోసం వచ్చారు. ఆ సమయంలో వారి కాళ్లకు చెప్పులు లేవు. వారి వద్దకు వెళ్లి వారి గురించి ఆరా తీసింది పల్లవిప్రియ. వారంతా నిరుపేదలని తెలిసి రాచకొండ పోలీస్ కమిషనర్ సాయంతో ఆ రోజు అక్కడకు వచ్చిన పిల్లలందరికీ చెప్పులతో పాటు చాక్లెట్స్, బిస్కెట్స్ ఇచ్చి వారిలో ఆనందాన్ని నింపింది. అంతేకాదు.. డిగ్రీ, బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ స్కూల్స్లో బెంచ్లు, ఫ్యాన్లు పంపిణీ చేయడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోంది పల్లవిప్రియ. ఈమెకు ప్రకృతి అంటే ఎంతో ప్రేమ. అందుకే పర్యావరణంపై శ్రద్ధను తీసుకుంటోంది. స్కూలు విద్యార్థులను కలిసి పర్యావరణం ప్రాముఖ్యతను వివరిస్తూ వారితో ఎస్సై రైటింగ్స్ పోటీలు నిర్వహిస్తోంది. వక్తృత్వ పోటీలు పెట్టి బహుమతులు సూతం ఇస్తోంది. ప్లాస్టిక్ కవర్ల వాడకం వల్ల కలిగే అనర్థాలు వివరించి చెబుతోంది. పల్లవి ప్రియ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఇన్ఫోసిస్ ఉన్నతోద్యోగలు, స్వచ్ఛంద సంస్థలు సైతం అభినందింది సత్కరించడం గమనార్హం. నాన్నే స్ఫూర్తి.. మా నాన్నకు ఇతరులకు సాయం చేయడం అంటే ఇష్టం. ఆయన మార్గంలోనే నేనూ నడుస్తున్నాను. సమాజానికి నా వల్ల ఏ విధమైన ఉపయోగం ఉంటుందనేది గుర్తించాను. అప్పటి నుంచే పేదలకు నాకు తోచిన విధంగా సాయం చేస్తున్నా. అందుకు ఫేస్బుక్ను వేదికగా చేసుకున్నా. నా సొంత డబ్బులతో పాటు నాకెంతో మంది అండగా నిలుస్తున్నారు. వారు ఇచ్చిన ప్రతి రూపాయికి బిల్లులతో సహా లెక్క కూడా చెప్తుంటాను. అందుకే సహాయం కోసం పోస్ట్ పెట్టిన ప్రతిసారీ నాకు తోడుగా ఎంతో మంది వెన్నంటి వస్తున్నారు. – పల్లవి ప్రియ, ఇన్ఫోసిస్ ఉద్యోగి -
నాడు కార్మికుడు.. నేడు యజమాని
సాక్షి, రాజేంద్రనగర్: పదవ తరగతి పాసై ఉన్నత విద్యకు నోచుకోక ఆ యువకుడు పరిశ్రమలో కార్మికుడిగా చేరాడు. ఒకపక్క పని చేస్తూనే మరోపక్క తాను పరిశ్రమను నెలకొల్పి నలుగురికి ఉపాధి కల్పించాలని ఆలోచించేవాడు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు నానా కష్టాలు పడ్డాడు. పైసాపైసా కూడబెట్టి చిన్న ప్లాస్టిక్ పరిశ్రమను స్థాపించాడు. అంచలంచలుగా ఎదుగుకుంటూ నేడు 40 కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నాడు. మైలార్దేవ్పల్లి లక్ష్మిగూడ ప్రాంతానికి చెందిన అడికే మారప్ప, కమలమ్మలకు ముగ్గురు కుమారులు, ఒక కూతురు. రెండవ కుమారుడైన అడికే అర్జున్ 10వ తరగతి వరకు పాతబస్తీలోని రాఘవేంద్ర స్కూల్లో అభ్యసించాడు. వేసవి సెలవుల్లో కాటేదాన్ పారిశ్రామికవాడల్లోని పరిశ్రమల్లో పని చేసేవాడు. ఇలా ప్లాస్టిక్ పరిశ్రమలో పని చేస్తూ యజమాని మెప్పుపొందాడు. సెలవులు, ఆదివారాల్లో పరిశ్రమకు వెళ్లి పని చేసి వచ్చేవాడు. పదవ తరగతి అనంతరం ఉన్నత విద్యా చదువుకోవాలన్న కోరిక ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితుల కారణంగా పరిశ్రమలో చేరాడు. పని చేస్తూనే తాను కూడా పరిశ్రమను నెలకొల్పి నలుగురికి ఉపాధి కల్పించాలని అనుకున్నాడు. ఇలా తనకు వచ్చే జీతంలో కొంత భాగం పక్కనపెట్టి ఆ డబ్బుతో చిన్న ప్లాస్టిక్ పరిశ్రమను స్థాపించాడు. నలుగురితో ప్రారంభించిన ఆ పరిశ్రమ నేడు 40 మందితో కోనసాగుతోంది. రిసైక్లింగ్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను ప్రస్తుతం తయారు చేసి విక్రయిస్తున్నారు. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా తనవంతు కృషి చేస్తున్నాడు. పని చేసిన పరిశ్రమలో నేర్చుకున్న మెలకువలతో నేడు అదే పరిశ్రమను స్థాపించి నిలదొక్కుకున్నాడు. సంఘ సేవకుడిగా... అడికే అర్జున్ సంఘ సేవకుడిగానూ గుర్తింపు పొందాడు. యువజన సంఘాలతో పాటు స్థానికంగా పేరు సంపాదించాడు. గత రెండు సంవత్సరాలుగా రాజేంద్రనగర్ సర్కిల్ మహాత్మా జ్యోతిరావుపూలే జయంతోత్సవ కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఇబ్బందుల్లో ఉన్నామని ఎవరూ వచ్చిపా తన స్థాయికి అనుగుణంగా సహాయం చేస్తూ పేరు తెచ్చుకున్నాడు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నా ప్లాస్టిక్ పరిశ్రమ నెలకొల్పినప్పటికీ తనవల్ల పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా తన వంతు సహాయ, సహకారాలను ఎప్పటికప్పుడు అందజేస్తున్నాడు. హరితహారం కార్యక్రమం పాల్గొని మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకున్నాడు. దూరప్రాంతాలకు వెళ్లిన సమయంలో తాను సేకరించిన అన్ని రకాల విత్తనాలను అడవుల్లో చల్లుతూ మొక్కలు మొలిచేవిధంగా పాటుపడుతున్నాడు. వర్షాకాలం మొదలై వర్షాలు ప్రారంభం కాగానే వీటిని చల్లుతానని తెలిపాడు. గత రెండు సంవత్సరాలుగా కొత్తగా విత్తన బాల్స్ను తయారు చేసి అడవులు, ఇతర గుట్టల్లో వేస్తున్నట్లు వివరించాడు. – అడికే అర్జున్ -
వీధి శునకాల ఆత్మ బంధువు
జూబ్లీహిల్స్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్, యూసఫ్గూడ పోలీస్ లైన్స్ పెట్రోల్ బంక్.. ఇలాంటి చోట్లవేసవిలో కాస్త పరీక్షగా చూస్తే నీళ్లు నింపిన సిమెంట్ తొట్టెలు కనిపిస్తాయి. కాసేపు అక్కడే ఉండిగమనిస్తే వీధి శునకాలు అక్కడికి రావడం.. ఆ తొట్టెల్లోని నీరు తాగడం కూడా చూడొచ్చు. నగరంలో ఇలాంటివి ఇంకా చాలా చోట్లేకనిపిస్తాయి. వీటి ఏర్పాటు వెనుక వీధి శునకాల దుస్థితికిచలించిపోయిన ‘విజయలక్ష్మి’ మానవతా హృదయం ఉంది. పెంపుడు జంతువులు మాత్రమే కాదు..రోడ్డు మీద తిరిగే ప్రతి జంతువు బాగూ కోరే కొండంత తపన ఉంది. సాక్షి, సిటీబ్యూరో :బేగంపేటలోని ఓ వీధిలో అపార్ట్మెంట్స్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో వీధికుక్క ఆరు పిల్లల్ని పెట్టింది. చుట్టుపక్కల నివాసితులంతా వాటిని అక్కడి నుంచి ఎలా తరిమేయాలా అనే ఆలోచన చేశారు. కొందరు తరిమేసేందుకు విసిరిన రాళ్ల దెబ్బలకూ బెదిరి అటూ ఇటూ పరుగులు తీసిన పిల్లల్లో రెండు రోడ్డుపై వెళ్లే వాహనాల కింద పడి నలిగిపోయాయి. మిగిలిన తల్లీ పిల్లల్ని స్థానికుల ఫిర్యాదు మేరకు మున్సిపల్ వ్యాన్లో తరలించబోతే అడ్డుకుని వాటిని పెంచుకుంటానని ఇంటికి తెచ్చుకుంది ఆ మానవతా హృదయం. ఆ మనసు పేరు ‘‘ఇవటూరి విజయలక్ష్మి’’. వెంగళరావునగర్ డివిజన్ సిద్ధార్థనగర్లో నివసిస్తున్న ఈమె వీధి శునకాల కోసం ‘డాలర్ హోమ్స్’ పేరుతో ప్రత్యేక స్వచ్ఛంద ఆశ్రమాన్నే నడుపుతున్నారు. అంతేకాదు శంషాబాద్లో దాదాపు 250 దాకా నిరాశ్రయ శునకాలను సాకుతున్నారు. ఆమె పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే.. వీధికుక్కలకూ విలువుంది.. శునకాలంటే చిన్నప్పటి నుంచి అభిమానం. మాకు ఇంట్లో ‘డాలర్’ పేరుతో ఓ పమేరియన్ ఉండేది. దాన్ని బాగా చూసుకునేవాళ్లం. అదే సమయంలో వీధిలో తిరిగే కుక్కల్ని చూసినప్పుడు బాధనిపించేది. గాలికి తిరుగుతూ రాళ్ల దెబ్బలు తింటూ ఏ వాహనం కిందో పడి రాలిపోయే వీధి కుక్కల సమస్యలు చూసి చలించిపోయేదాన్ని. బేగంపేటలో మా అపార్ట్వెంట్ పక్కనే ఖాళీ స్థలంలో ఓ శునకానికి పుట్టిన ఆరు పిల్లల్లో రెండు అలాగే ప్రాణాలు కోల్పోయాయి. మిగిలిన తల్లీ, పిల్లల్నీ తీసుకొచ్చి పెంచతున్నాను. తల్లికి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించాను. ఫ్రెండ్కి ఒకటి దత్తతకి ఇచ్చాను. బేగంపేట నుంచి ఇల్లు మారే సమయంలో కుక్క పిల్లలకి రూ.500, పెద్ద వాటికి రూ.1000 చొప్పున చెల్లించి కిస్మత్పూర్లోని కెనల్లో ఉంచాను. నెలకి ఇంత చొప్పున చెల్లించే పద్ధతిలో మొత్తం 11 వీధి కుక్కల్ని అక్కడ ఉంచాను. కెనల్ నిర్వాహకురాలికి ఆరోగ్యం బాగాలేదని నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకునేటప్పటికి అక్కడ నేను చేర్చిన శునకాతో కలిపి 42 ఉన్నాయి. అవన్నీ ఏమవుతాయో అనే భయంతో అలవాటు లేని పనే అయినా కెనల్ నిర్వహణ తలకెత్తుకున్నా. డాలర్ని కోల్పోయి.. కేన్సర్కు గురై.. నా పిల్లలు ముగ్గురికి పెళ్లయి అమెరికాలో సెటిలైపోయారు. సొంత బిడ్డలా 15 ఏళ్లు పెంచుకున్న నా డాలర్ పమేరియన్ ఐదేళ్ల క్రితం చనిపోవడంతో తట్టుకోలేకపోయాను. అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆస్పత్రి పాలయ్యా. అదే సమయంలో నాకు కేన్సర్ అని నిర్థారణ అయింది. దాంతో భర్త, పిల్లలు నేను చేసే ప్రైవేట్ జాబ్ మాన్పించేశారు. మరోవైపు చాలా మంది నన్ను ఈ కుక్కల బాధ్యతలు వదిలేయమని సలహా ఇచ్చారు. కానీ అప్పుడే నాకు ఇంకా పట్టుదల వచ్చింది. కేన్సర్తో పోరాడుతూనే.. నచ్చిన సేవను విస్తరించాను. అంకురించిన ‘డాలర్ హోమ్స్’ డాలర్ హోమ్స్ పేరుతో ఓ ట్రస్ట్ రిజిస్టర్ చేశాను. శంషాబాద్లోని తుండుపల్లి గ్రామం వద్ద స్థలం తీసుకుని వీధి శునకాల కోసం హోమ్ ప్రారంభించాను. ఇది ఒక రకంగా మనుషులకు ఉన్నట్టే శునకాల అనాధాశ్రమం. ఇందులో ఆరుగురు పనివాళ్లు ఉన్నారు. పెరాలసిస్ వచ్చినవి, కళ్లులేని, అంగవైకల్యం కలవి.. ఇలా అన్ని రకాల శునకాలూ ఇక్కడ ఆశ్రయం పొందుతున్నాయి. వలంటీర్స్ కొందరు రెస్క్యూ చేసిన డాగ్స్ తెచ్చి ఇస్తుంటారు. ఏటేటా వ్యాక్సిన్లు వేయించడం, స్టెరిలైజేషన్ అవన్నీ చేస్తుంటాం. ఏదైనా శునకం చనిపోతే అంత్యక్రియలు చేస్తాం. వండిన ఫుడ్ నైవేద్యం కింద పెట్టి మిగతాది కుక్కలకి పెడతాం. ఈ హోమ్కి చాలా మంది సిటిజనులు మద్ధతు ఇస్తున్నారు. ఏపీ టూరిజంలో పనిచేసే గోవిందరాజులు గత నాలుగేళ్లుగా తండ్రి సంవత్సరీకం రోజున కిలోల కొద్దీ చికెన్, పెడిగ్రీ, పెరుగు.. తెచ్చి ఇక్కడి డాగ్స్కి పెడుతుంటారు. గచ్చిబౌలిలో వెటర్నరీ డాక్టర్ మధు పదుల సంఖ్యలో కుక్కలకు ఉచిత సర్జరీలు కూడా చేశారు. అనాథ శునకాలకు కనీసం తాగే నీరు కూ డా కరవే. ఎండాకాలంలో వాటి బాధలు వర్ణనాతీతం. ఆకలి కొంతైనా తీర్చాలని సమ్మర్లో బక్కెట్ వాటర్ పట్టే సిమెంట్ బౌల్స్ వందల సంఖ్యలో తయారు చేయిస్తున్నాం. దాదాపు నగరంలో అన్నిచోట్లా పెట్టిస్తున్నాం. పూర్తి స్థాయి షెల్టర్ లక్ష్యంగా.. కేన్సర్ వ్యాధికి మందులు తీసుకుంటున్నా. అందుకే 10 రోజులకో, రెండు వారాలకోసారి మాత్రమే మా డాలర్ హోమ్స్కు వెళ్లగలుగుతున్నా. నగరంలో ఏ యానిమల్ అయినా సరే ఏ కారణంగానైనా బాధపడకూడదనే ఉద్దేశంతో ‘డాలర్ హోమ్స్’ పెట్టాను. మీకు వద్దనుకున్న డాగ్స్ని రోడ్డు మీద వదిలేయకుండా నా దగ్గర వదిలేయాలని కోరుతున్నా. డాగ్స్తో పాటు అన్ని రకాల జంతువులకీ షెల్టర్ ఇవ్వాలని, దీనికోసం మరింత భారీ స్థాయిలో సొంతంగా హోమ్ కట్టాలని ఆలోచన ఉంది. అలాగే వీధి శునకాలకు బర్త్ కంట్రోల్ సర్జరీలు చేసే పనిలో పెద్ద ఎత్తున పాలుపంచుకోవాలని ఉంది. -
పెద్ద మనసు చాటుకున్న విజయ్
పెరంబూరు: ప్రతిభకు ప్రోత్సాహం ఇవ్వడంలోనూ సేవ ఉంటుంది. అలాంటి ప్రతిభను గుర్తించడం అందరికీ సాధ్యం కాదు. అలా చిత్ర పరిశ్రమలో ప్రతిభను ప్రోత్సహించే చాలా కొద్దిమందిలో నటుడు విజయ్సేతుపతి ఒకరు. పలువురికి ఆర్థిక సాయం చేసిన ఈయన తాజాగా మరో విద్యార్థినికి సాయం అందించారు. ఈ వివరాలు చూస్తే.. తేని జిల్లా, అల్లినగరానికి చెందిన ఉదయకీర్తిక ప్రభుత్వ పాఠశాలలో తమిళం ప్రధాన సబ్జెట్గా చదివింది. అనంతరం ఏయిర్ క్రాప్ట్మెయిన్టైన్స్ ఇంజినీరింగ్ విద్యను ఉక్నైన్, కార్గిల్లోని నేషనల్ యూనివర్సిటీలో అభ్యసించింది. ఇందులో 92,5 మార్కులతో ఏ గ్రేడ్లో ఉత్రీర్ణతను సాధించింది. 2022లో ఇండియన్ ఇస్రో ద్వారా అంతరిక్ష యానం చేసే టీమ్లో స్థానం సంపాధించడమే ధ్యేయంగా విద్యార్థిని నిర్ణయించుకుంది. ఈమెకు పోలాండ్ దేశంలో అంతరిక్ష అనలాగ్ ఆస్ట్రోనైట్ ట్రైనింగ్ సెంటర్లోని అంతరిక్ష విజ్ఞాణిగా శిక్షణ పొందడానికి స్థానం లభించింది. అయితే అక్కడ శిక్షణ రుసుం, బస చేయడానికి, విమాన ఖర్చులు రూ.8 లక్షలు అవసరం అవుతుంది. ఈ విషయం తెలిసిన నటుడు విజయ్సేతుపతి ఉదయకీర్తిక శిక్షణకు అయ్యే రూ.8 లక్షలను సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఆ మొత్తాన్ని తన అభిమాన సంఘ నిర్వాహకుల ద్వారా శనివారం ఉదయకీర్తికకు అందజేశారు. విజయ్సేతుపతి షూటింగ్లో ఉండడంతో ఆమెను ఫోన్లో మాట్లాడి అభినందించారు. -
చారిటీ సిస్టర్స్ ..
సాక్షి, సిటీబ్యూరో: వారిద్దరూ అక్కా చెల్లెళ్లు. పేరు ప్రగ్యా నగోరి, మృధు నగోరి. తమ ఇంటికి దగ్గరలో ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకోవాలని ఉన్నా అక్కడి పరిస్థితులు చూసి అందులో అడుగుపెట్టడానికి భయపడేవారు. అదే సమయంలో అక్కడి అపరిశుభ్రతలో ఆడుకునే స్థానిక పిల్లలను చూసి కూడా ఆందోళన చెందేవారు. ఓ చారిటీ సంస్థ గొడుగు కిందకు చేరినవీరిద్దరూ సంస్థ తమకు అప్పగించిన ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు తమ ఇంటి ముందున్న సమస్యనే ఎంచుకున్నారు. ఇంకా ఓటు హక్కు కూడా రాని ఈ లిటిల్ సిస్టర్స్ సామాజిక సేవను తమ భుజాలపై వేసుకున్నారు. పరిశుభ్రత కోసం తొలి అడుగు బంజారాహిల్స్లోని గౌరీశంకర్ కాలనీకి సమీపంలో నివసించే 12వ తరగతి విద్యార్థిని ప్రగ్యా నగోరి, ఫ్యూచర్ కిడ్స్ స్కూల్లో 11వ తరగతి చదివే ఆమె సోదరి మృధు నగోరి ఇద్దరికీ తమ ఇంటికి సమీపంలోని ఖాళీ స్థలంలో ఆడుకోవాలని ఉండేది. కానీ అది అత్యంత దయనీయ స్థితిలో ఉంది. దాన్ని సమూలంగా మార్చాలంటే ఏం చేయాలని ఆలోచించేవారు. అందుకు వారికి ప్రపంచ వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించే ‘జూనియర్ జేసీఐ బంజారా’తో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. దీన్ని ఉపయోగించుకున్న వీరిద్దరూ ఆ ఖాళీ స్థలం పరిశుభ్రంగా మార్చేందుకు పూనుకున్నారు. స్థానికులు, ప్రభుత్వ అధికారుల సహకారంతో దిగ్విజయంగా దీన్ని పూర్తి చేశారు. అదే స్థలంలో మొక్కలు నాటారు. వర్షాకాలంలో మొలకెత్తే విధంగా విత్తనాలు చల్లారు. అంతేకాదు నాటిన మొక్కల్ని కాపాడేందుకు, అక్కడి బస్తీ పిల్లలు వారి కుటుంబాలతో 10 మందికి ఓ మొక్క చొప్పున పరిరక్షిస్తామని మాట తీసుకున్నారు. ‘సాఫ్ హైదరాబాద్’లో భాగం.. తొలి విజయం అందించిన ఉత్తేజంతో ప్రగ్యా నగోరి, మృధు నగోరి మరిన్ని సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గత ఏడు రోజులుగా బస్తీ పిల్లల కోసం విభిన్న రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 2000 లేబుల్స్ని 500 మంది చిన్నారులకు పంపిణీ చేశారు. ఉదయ్నగర్లోని శ్రీ సరస్వతి హైస్కూల్ ప్రైమరీ సెక్షన్లోని 350 మంది పిల్లలకు ఉపయోగపడేలా వాటర్ ప్యూరిఫైర్ని ఉచితంగా అందించారు. అలాగే పిల్లకు నీటి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ‘మన హైదరాబాద్, స్వచ్ఛ హైదరాబాద్, సాఫ్ హైదరాబాద్, షాందార్ హైదరాబాద్’ ఉద్యమంలో పిల్లను భాగస్వామలను చేసేందుకు ఆ పిల్లలతోనే స్లోగన్స్ ప్లకార్డులను తయారు చేసి ప్రదర్శించేలా ప్రోత్సహించారు. తాము ఎక్కడ చదివినా, ఎంత ఎదిగినా ఈ తరహా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని, తమ ఇంటి ముందున్న ఖాళీ స్థలం పరిశుభ్రంగా చేయడం ఆనందంగా ఉందంటున్నారు ఈ సిస్టర్స్. -
మేధా వారధి
సాధారణంగా పైచదువుల కోసం విదేశాలకు వెళ్లినవారు, చదువు మీదే దృష్టి పెడతారు. కాని మేధ మాత్రం చదువుతో పాటు సామాజిక సేవా చేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి హెల్త్ సైకాలజీలో ఇంటిగ్రేటెడ్ ఎం.ఎస్సి. చేసిన మేధ, స్కాలర్షిప్ మీద పిట్స్బర్గ్ యూనివర్సిటీలో చేరి మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ రెండో సంవత్సరం చదువుతున్నారు. అక్కడ చేరిన మూడు నెలలకే ‘వాయిస్ ఫర్ గర్ల్స్’ స్వచ్ఛంద సంస్థలో శిక్షణ పొందారు. ఒక పక్కన చదువులో రాణిస్తూనే మరో పక్క సంఘ సేవపై శ్రద్ధ పెట్టారు. మేధ సెంట్రల్ యూనివర్సిటీలో చేరిన మొదటి సంవత్సరమే వాయిస్ ఫర్ గర్ల్స్ సంస్థ తరఫున పనిచేయడానికి కాంపస్ నుండి ఎన్నికయ్యారు. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం సాంఘిక సేవ. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన సమస్యల గురించి అవగాహన కల్పించి, వాటిని ఎదుర్కొనేలా వారిలో ఆత్మవిశ్వాసం కలిగించడం. అంతే కాదు.. అట్టడుగు వర్గాలకు చెందిన టీనేజర్స్కి ఆర్థిక, సాంఘిక సమానత్వం సాధించుకునేలా ‘వాయిస్’ వలంటీర్లు అవగాహన కల్పిస్తారు. జీవనోపాధికి ఉపయోగపడే మార్గాలను ఎంచుకునేలా తీర్చిదిద్దుతారు. గ్రామాలలో, చిన్న చిన్న పట్టణాలలో ఉండే బాలికల ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి, వారికి జీవన నైపుణ్యాలు నేర్పుతారు. వ్యక్తిగత పరిశుభ్రత, ఋతు సమయంలో పాటించవలసిన పరిశుభ్రత, న్యాప్కిన్స్ వాడటం వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలియచేస్తారు. ‘‘మొదట్లో వారికి నా మాటలు నచ్చలేదు. వారం రోజులు గడిచేసరికి పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఆ తరవాత ఆచరించడం ప్రారంభించారు’’ అన్నారు మేధ.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు ఇంగ్లీషు అక్షరాలు రాయడం, చిన్న పదాలు చదవడం వచ్చు. ఎవరైనా ఇంగ్లీషు మాట్లాడితే అర్థం చేసుకోగలరు, కాని మాట్లాడాలంటే సిగ్గు పడతారు. అటువంటివారికి నెల రోజుల పాటు స్పోకెన్ ఇంగ్లీషు తరగతులు నిర్వహించి, ధైర్యంగా మాట్లాడేలా తయారుచేశారు. వారి మీద జరిగే లైంగిక అత్యాచారాల గురించి అవగాహన కలిగించారు. వారికి ఉండే మౌలిక హక్కులను వారికి తెలియపరిచారు. స్వచ్ఛంద సంస్థల వారధివిద్య పరంగా వెనుకబడిన చోట బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతాయి. అటువంటి వివాహాలు జరగకుండా జాగ్రత్త పడాలని వారికి అర్థమయ్యేలా వివరించడం తన బాధ్యతగా భావించారు మేధ. అలాగేజీవితం లో ఎదుర య్యే ఆటంకాలను అధిగమించేలా పాఠ్య ప్రణాళికను రూపొందించి, ప్రభుత్వ పాఠశాలలలో చదువుకునే బాలికలకు బోధించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సహకారం కూడా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో శిబిరాలు నిర్వహించి, ప్రభుత్వ పాఠశాలకు, స్వచ్ఛంద సంస్థలకు వారధిగా, ఇతర కౌన్సెలర్లకు మార్గదర్శిగా కూడా వ్యవహరించారు మేధ. ఎమ్.ఎస్సీ హెల్త్ సైకాలజీలో భాగంగా హైదరాబాద్లోని గ్లోబల్ హాస్పిటల్లో ఎనిమిది నెలలు ఇంటర్న్షిప్ చేసిన సమయంలో రోగుల మానసికస్థితిని పూర్తిగా గమనించారు. – వైజయంతి పురాణపండ బాపూ అభిమాని అమెరికా పిట్స్బర్గ్ యూనివర్సిటీలో నేర్చుకున్న విషయాలను, భారత దేశంలోని గ్రామాల అభివృద్ధి, బాలల హక్కుల పరిరక్షణ, బాలికల అభ్యున్నతి, సంక్షేమం కోసం వినియోగించాలనేది మేధ ఆశయం. సితార్ వాదనం, శాస్త్రీయసంగీతం, శాస్త్రీయ నృత్యంలో కూడా మేధకు ప్రవేశం ఉన్నది. నాట్యం అంటే మక్కువ. కవిత్వం, సామాజిక అంశాల మీద వ్యాసాలు రాస్తారు. చక్కటి చిత్రకారిణి కూడా. ఆమె అభిమాన చిత్రకారులు జామిని రాయ్, బాపు, వాంగో. అంతర్జాతీయ పురస్కారం ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ లో ఎమ్.ఎస్ సోషల్ వర్క్లో స్కాలర్ షిప్తో సీటు వచ్చిన మూడు నెలలకే యూనివర్సిటీ సోషల్ వర్క్ విభాగం నుండి అంతర్జాతీయ ప్రతినిధిగా ఎంపికయ్యారు. తర్వాత ఆరు నెలలకు ఐరిస్ మేరియాన్ యంగ్ అనే ప్రముఖ రాజకీయశాస్త్రవేత్త, అంతర్జాతీయ సమస్యల అధ్యయనకర్త పేర నెలకొల్పిన ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. పట్టభద్రులలో ఒకరికి, ఇంకా పట్టభద్రులు కాని గ్రాడ్యుయేట్ విద్యార్థులలో ఒకరికి, అధ్యాపకులలో ఒకరికి ఈ పురస్కారం ప్రదానం చేస్తారు. బాలల హక్కుల సంస్థలో విద్యాబోధనకై తను ప్రవేశపెట్టిన సృజనాత్మక బోధన పరికరాలకు, నేతృత్వ స్ఫూర్తికి మేధ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. -
మానవత్వం చాటిన మహిళ ఏఎస్ఐ
రాయచూరు రూరల్: దేహంపై నూలిపోగు కూడా లేకుండా సంచరిస్తున్న మానసిక దివ్యాంగురాలిని ఓ మహిళా ఏఎస్ఐ అక్కున చేర్చుకొని దుస్తులు ధరింపచేసి మానవత్వాన్ని చాటుకున్నారు. కలబుర్గి పట్టణ ప్రాంతంలో ఓ మానసిక దివ్యాంగురాలు దేహంపై ఎలాంటి అచ్ఛాదనం లేకుండా తిరుగుతుండగా కలబుర్గి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళ ఏఎస్ఐ యశోద గమనించారు. తన వాహనంలో ఉన్న దుస్తులు తెప్పించి ధరింపచేశారు. చిన్నతనం నుంచే సేవాభావం : యశోద చిన్నతనం నుంచి పేదరికంలో పెరిగి కష్టసుఖాలను అనుభవించారు. పేదలు ఎక్కడ కనిపించినా తోచిన సహాయం చేస్తుంటారు. ఆమె కలబుర్గిలో రాజాపుర కాలనీలో తల్లితో నివాసం ఉంటున్నారు. స్వంత ఖర్చుతో 33 మంది పేద విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించారు. బాల కార్మికులకు విద్యాదానం చేశారు. పేద కుటుం బంలో మరణించిన వారికి రూ.3 వేలు, వివాహానికి రూ.3 వేలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తుంటారు. భవిష్యత్తులో రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసి పేదలను ఆదుకోవాలని ఉందని యశోద పేర్కొన్నారు. -
ఆప్తుడికే ఆపదొచ్చింది...
సాక్షి, హైదరాబాద్: మనది కాని కాలం ఎదురైతే క్షణం చాలు జీవితం తలకిందులు కావడానికి.. అలాంటిపరిస్థితే ఓ మనసున్న నిరుపేదకు అనారోగ్యం రూపంలో ఎదురైంది. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితుల్లోనూ ఇతరులకు సేవ చేసేవాడు. వైద్యం కోసం నగరానికి వచ్చే నిరుపేదలకు సర్కారు దవాఖాలే దిక్కు.. అలాంటి వారికోసం నిమ్స్ ఆసుపత్రి ఎల్లప్పుడూ ఒక ఆటో సిద్ధంగా ఉంటుంది, దానిపై గర్భిణీ స్త్రీలకు ఉచితం..వృద్ధులకు, వికలాంగులకు ఫ్రీ’ అనే పెద్ద అక్షరాలు కనిపిస్తాయి. కష్టాలు, కన్నీళ్లు తెలిసిన ఆటోవాలా సంజయ్ ఆపదలో ఉన్న వారికి తోచిన సాయం చేయడానికి ఆటోను ఎంచుకున్నాడు. ఇప్పటి వరకు వేలాది మందికి ఉచితంగా సేవలందించాడు. ఆప్తుడిలా అందరినీ ఆదుకున్న అతడిరూ నేడు పెద్ద కష్టం వచ్చిపడింది. అనారోగ్యంతో బాధపడుతున్న తనను ఎవరైనా ఆదుకోకపోతారా అని ఆశగా ఎదురు చూస్తున్నాడు. వివారాల్లోకి వెళితే.. తన భార్య పరిస్థితి మరెవరికీ రాకూడదని బోరబండకు చెందిన మ్యాదరి సంజయ్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. 20 ఏళ్ల క్రితం సెంట్రింగ్ కార్మికుడిగా పని చేస్తున్న అతడి భార్యకు అర్థరాత్రి పురుటి నొప్పులొచ్చాయి. ఆసుపత్రి తీసుకెళ్లేందుకు ఆటో కోసం వెళ్లగా రాత్రి వేళల్లో రాలేమని చెప్పారు. చివరకు ఓ పెద్దాయన రిక్షా ఇచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో తానే స్వయంగా రిక్షాలో భార్యను నీలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆపరేషన్ చేసిన వైద్యులు ఆలస్యంగా తీసుకురావడంతో బిడ్డ ఊపిరాడక మృతి చెందిందని తెలిపారు. సకాలంలో తీసుకువచ్చినట్లయితే బిడ్డ బతికేదని చెప్పడంతో సంజయ్ కలత చెందాడు. ఆ ఘటన అతని మనసులో బలమైన ముద్రవేసింది. అలాంటి సందర్భాల్లో ఎవరున్నా వారికి సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. తోచినంతలో సాయం: తర్వాత కొన్నాళ్లకు సెంట్రింగ్ పనిమానేసి ఆటో కొనుక్కున్నాడు. భార్యా బిడ్డలను పోషించుకునేందుకు ఎంతో కొంత ఆదాయం వస్తోంది. తనకు తోచినంతలో ఆటో ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి సహాయం చేయాలనుకున్నాడు. దీంతో ‘ఆటో వెనక అమ్మానాన్నలకు ప్రేమతో.. గర్భిణి స్త్రీలకు ఉచితం..వృద్ధులు, వికలాంగులకు ఫ్రీ..అని రాయించాడు. ఏ సమయంలో అయినా ఎవరు ఫోన్ చేసినా గర్భిణులు, వికలాంగులు, వృద్ధులను ఆసుపత్రికి చేరవేసేవాడు. కేన్సర్తో పోరాటం: అందరి ఆపదలు తీర్చే సంజయ్కి అనారోగ్యం రూపంలో ఆపద ముంచుకొచ్చింది. అకస్మాత్తుగా అనారోగ్యం భారిన పడటంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు పేగు క్యాన్సర్గా నిర్దారించారు. సాధ్యమైనంత త్వరగా ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమని చెప్పడంతో రూ. 3.5 లక్షలు అప్పు చేసి ఆపరేషన్ చేయించుకున్నాడు. 2014లో మెడ్విన్ హాస్పిటల్లో డాక్టర్ ప్రదీప్ కేసరీ అతడికి శస్త్ర చికిత్స చేశారు. ఆరునెలల పాటు కీమో థెరపీ చేయించుకోవాలని సూచించారు.అప్పటి నుంచి ఓ వైపు ఆప్పుల బాధలు, మరోవైపు అనారోగ్యం అతడి జీవితాన్ని అస్తవ్యస్తం చేశాయి. అదుకునే వారి కోసం అతడి కుటుంబం ఆశగా ఎదురు చూస్తోంది. దీంతో ఆటో నడిపితే కాని ఇళ్లు గడవని సంజయ్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు: ఆపరేషన్ తర్వాత కేన్సర్ ప్రభావం తగ్గినా, ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడకపోవడంతో ఆటో నడపడం కష్ట సాధ్యమైంది. సంజయ్ భార్య ఇళ్లలో పనిచేస్తే వచ్చే ఆదాయం ఏ మాత్రం సరిపోవడం లేదు. ఇద్దరు పిల్లల చదువులు, ఇంటి అద్దెలకు తోడు చికిత్స కోసం అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో అతని కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. సంజయ్కి చేయూతనందించాలనుకునే వారు 8978564644 నంబర్ను సంప్రదించవచ్చు.. జీవిత పోరాటంలో అలిసిపోయా.. ఆపరేషన్ చేయించుకున్నప్పటి నుంచి ఆటో నడపడానికి శరీరం సహకరించడం లేదు. ఆపరేషన్ కోసం చేసిన అప్పులకు తోడు పిల్లల చదువులు, ఇంటి అద్దెలతో బతుకు భారంగా మారింది. జీవనాధారంగా ఉన్న ఆటో కూడా పాడైపోయింది. నా పరిస్థితి చూసి ఒక టీవీ ఛానెల్ నిర్వాహకులు రూ.2 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన రేషన్ కూడా అందడం లేదు. కనీసం రేషన్ సౌకర్యం కల్పించి, డబుల్ బెడ్రూం ఇంటిని మంజూరు చేయాలి. – సంజయ్ -
ఆమె అందరికీ అమ్మ
సాక్షి, విజయనగరం : ఆమె అందరు ఆడపిల్లల్లాగే చదువుకుంది. గ్రూప్–1 ఉద్యోగాన్ని సంపాదించింది. ఆకర్షణీయమైన ప్రభుత్వ ఉద్యోగం.. హాయిగా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండొచ్చు.. కానీ ఆమె ఆలోచనలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. సమాజ సేవ చేయాలి. ఆ సేవ చేయడంలోనే ఆనందం పొందాలి.. ఆ ఆలోచనలతోనే ఆమె అన్నింటినీ త్యజించి అనాథలకు సేవ చేయాలని నిర్ణయించుకుంది. ఆలోచన రావడమే మొదలు ఇక ఆగలేదు. సమాజ సేవే లక్ష్యంగా ముందుకెళ్తూ.. ప్రస్తుతం అందరికీ అమ్మ అయ్యింది. ఆమె ప్రకాశం జిల్లాకు చెందిన వెనిగండ్ల పద్మజ. ఎమ్మెస్సీ చదివిన పద్మజ ప్రకాశం జిల్లాలో ఎంపీడీఓగా, హైదరాబాద్లో చైల్డ్ లేబర్ కో–ఆర్డినేటర్గా పనిచేశారు. అయినప్పటికీ ఆమెకు ఆ ఉద్యోగాలు సంతృప్తిని ఇవ్వలేదు. అభాగ్యులకు సేవచేయాలి.. అందులోనే నిజమైన ఆనందం పొందాలని భావించారు. అమాయక గిరిజనులకు సేవ చేయాలనే ధృడ సంకల్పం ఆమెలో మెండుగా ఉండేది. దీంతో శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజన్సీలో గిరిజనులకు సేవలు అందించాలని నిర్ణయించారు. అప్పట్లో సెర్స్ సీఈఓగా పనిచేసిన విజయకుమార్ పరిచయంతో విజయనగరం జిల్లా పార్వతీపురంలోని జట్టు ఆశ్రమాన్ని సందర్శించారు. 2004లో జట్టు ఆశ్రమాన్ని చూసేందుకు వచ్చిన ఆమె ఇక్కడి పిల్లలు, వాతావరణాన్ని చూసి ఈ ప్రాంత గిరిజనులకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. 2007లో పూర్తిగా కుటుంబ సభ్యులను విడిచిపెట్టి కట్టుబట్టలతో వచ్చేశారు. అప్పటినుంచి ఆశ్రమ బాధ్యతలు ఎన్నో ఒడిదొడుకుల నడుమ నిర్వర్తిస్తూ ఆశ్రమంలోని పిల్లలకు ఆమ్మయ్యారు. వివాహం చేసుకుంటే ఆ బంధం ఎక్కడ అడ్డు వస్తుందో.. ఎక్కడ సమస్యలు ఉత్పన్నమవుతాయో అని భావించి ఒంటరిగా ఉంటున్నారు. పిల్లల యోగ క్షేమాలను చూసుకుంటున్నారు. నాటి నుంచి నేటి వరకు 150 మంది వరకు పిల్లలను అక్కున చేర్చుకుని చదివిస్తున్నారు. ఏటా నలుగురైదుగురు పిల్లల వివాహాలు కూడా చేస్తున్నారు. ఆశ్రమాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. గాంధేయ మార్గంలో తెలుపు నూలు వస్త్రాలను ధరిస్తూ సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారు. సమాజ సేవ చేయడంలో తాను పొందుతున్న ఆనందం చెప్పలేనిదని.. అది అనుభవిస్తే తప్ప అర్థం కాదంటున్నారు. స్త్రీ శక్తిమంతురాలని.. ఆ శక్తిని పదిమందికి ఉపయోగపడేలా వినియోగించాలి తప్ప.. వినిమయ వస్తువుగా మిగిలిపోరాదని హితవు పలికారు. -
సేవకు సెల్యూట్
అల్వాల్: అటు దేశ సేవలో.. ఇటు సామాజిక సేవలో తరిస్తున్నారు వైట్ వలంటీర్స్ సంస్థ వ్యవస్థాపకుడు శేఖర్ మారవేణి. జమ్మూ కశ్మీర్లో సీఆర్పీఎఫ్ సబ్ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న శేఖర్.. ఎంతో మంది విద్యార్థులను ఆదుకుంటూ దాతృత్వం ప్రదర్శిస్తున్నారు. గత ఏడాది మార్చిలో వైట్ వలంటీర్స్ సంస్థ ఏర్పాటు చేసి సిరిసిల్లలో మూడు ప్రభుత్వ పాఠశాలలు, పిల్లాయిపల్లిలో రెండు ప్రభుత్వ పాఠశాలల్ని దత్తత తీసుకొని పాలామృతం పేరుతో ప్రతిరోజూ విద్యార్థులకు పాలను అందిస్తున్నారు. ప్రతి ఏటావిద్యార్థులకు దుస్తులు పంపిణీ చేస్తున్నారు. వృద్ధులు, అనాథలు, వికలాంగుల పాలిట ఆపద్బాంధవుడిగా మారారు. ఒక్కరి ఆలోచన 200 మందికి స్ఫూర్తి మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా నాగరానికి చెందిన శేఖర్ తాను చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలలో ఎంతో మంది విద్యార్థులు పోషకాహార లోపంతో బాధపడుతుండటం, సరైన దుస్తులు లేకపోవడంతో మధ్యలోనే బడి మానేయడం వంటి సమస్యలను గమనించారు. దీంతో తాను భవిషత్తులో కొంత మేరకైనా సహాయం చేయాలన్న లక్ష్యాన్ని ఏర్పర్చుకున్నారు. 2012లో సీఆర్ఫీఎఫ్లో ఉద్యోగం వచ్చాక ఒడిశా, ఛత్తీస్గఢ్లలో విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు రక్షణతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అప్పటినుంచి సామాజిక సేవ చేయాలనే సంకల్పం రెట్టింపయ్యింది. ఏడాది క్రితం 8 మందితో వైట్ వలంటీర్స్ సంస్థను స్థాపించారు. ప్రస్తుతం ఇది 200 మంది ప్రతినిధులతో నగరంలోని పలు ప్రాంతాల్లో సేవలందిస్తోంది. బాక్స్లు ఏర్పాటు చేసి.. ఈసీఐఎల్, మల్కాజిగిరి చౌరస్తాల్లో బాక్స్లు ఏర్పాటు చేసి దుస్తులు, పుస్తకాలు, ఇతర వస్తువులను సేకరిస్తూ విద్యార్థులకు, వృద్ధులకు పంపిణీ చేస్తున్నారు. శేఖర్ ఉద్యోగ విధులు నిర్వర్తిస్తుండగా.. ఆయన భార్య లత, సంస్థ ప్రతినిధులు యోగధాత్రి, ప్రభాకర్, శ్రావణి, దీపాంజలి, విక్రాంత్, రాజు, సతీష్లతో పాటు ఆరు కళాశాలలకు చెందిన 200 ప్రతినిధులు సేవాతత్పరతను చాటుతున్నారు. హ్యాపీ.. సెల్ఫీ జూబ్లీహిల్స్: ప్రముఖ సినీనటి తమన్నా మంగళవారం బంజారాహిల్స్ జీవీకే వన్ మాల్లోని యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనెటన్ స్టోర్లో సందడి చేశారు. కొత్త ఎస్ఎస్–19 సమ్మర్ కలెక్షన్ను ఆమె ఆవిష్కరించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలు తమ శక్తిసామర్థ్యాలను గుర్తించి ముందుకెళితే విజయం తథ్యమన్నారు. చిన్నప్పటినుంచి తనకు శ్రీదేవి, మాధురీ దీక్షిత్ అంటే ఎంతో ఇష్టమన్నారు. -
‘2 నెలలకొకసారి ప్రియాంక మా ఇంటికొస్తుంది’
న్యూఢిల్లీ : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ నియమితులైన సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటికి.. సమాజ సేవను మాత్రం వదల లేదు ప్రియాంక గాంధీ. ఢిల్లీలోని ఔరంగజేబు రోడ్ ప్రాంతానికి చెందిన ఆశిష్ అనే బుద్ధిమాంద్యం ఉన్న బాలుని వైద్యానికి సాయం చేస్తున్నారు ప్రియాంక. ఈ విషయం గురించి ఆశిష్ తండ్రి మాట్లాడుతూ.. ‘ప్రియాంక గాంధీ గత నాలుగేళ్లుగా మా కుమారుని చికిత్సకు సాయం చేస్తున్నారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి ప్రియాంక మా ఇంటికి వచ్చి ఆశిష్ను పరమార్శించి.. కాసేపు ముచ్చటించి వెళ్తారు. రాహుల్ గాంధీ కూడా మాకు ఎంతో సాయం చేశారు’ అని చెప్పుకొచ్చారు ఆశిష్ తండ్రి. ప్రియాంక గాంధీలానే రాహుల్ గాంధీ కూడా నిర్భయ సోదరునికి సాయం చేస్తున్నారు. 2012, డిసెంబరులో ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన అనంతరం రాహుల్ గాంధీ నిర్భయ కుటుంబానికి అండగా నిలిచాడు. ఈ విషయం గురించి నిర్భయ తండ్రి మాట్లాడుతూ.. ‘కష్ట సమయంలో రాహుల్ గాంధీ మా కుటంబాన్ని చాలా ఆదుకున్నారు. మా కుమారుడు కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని.. ప్రస్తుతం ప్రైవేట్ ఏయిర్లైన్లో విధులు నిర్వహిస్తున్నాడు. రాయ్బరేలీలోని స్వతంత్ర సంస్థ ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీలో నా కుమారుడు పైలట్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాడు. ఇందుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని రాహుల్ గాంధీ చేశారు’ అంటే చెప్పుకొచ్చారు. -
210 సార్లు రక్తదానం, 17 సార్లు ప్లేట్లెట్స్ దానం
భువనేశ్వర్: పెద్దల అదుపాజ్ఞలు లేక కుంటుపడిన తన విద్యాభ్యాసంలా.. నేటి తరం బాలలు విద్యకు దూరం కాకూడదనే ‘పెద్ద మనసు’ ఆయనను సంఘ సేవలోకి అడుగిడేలా చేసింది.. పసి హృదయాల్లో ప్రాథమిక విద్యాభ్యాసంపై మక్కువ పెంపొందించి విద్యార్జనకు పునాది వేసే ‘ఆశా ఓ ఆశ్వాసన్’ సంస్థను స్థాపించేలా ప్రేరేపించింది. స్వీయ జీవితంలోని తప్పిదాలు భావితరాలకు పునరావృతం కాకూడదనే సదభిప్రాయమే ఆయనకు మన దేశపు ప్రతిష్టాత్మక పురస్కారం ‘పద్మశ్రీ’ తెచ్చిపెట్టింది. ఆయనే ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ నుంచి వలస వచ్చి కటక్ మహానగరంలోని బక్షిబజార్ (మురికివాడ)లో స్థిరపడిన దేవరపల్లి ప్రకాశరావు. ఆయన వయసిప్పుడు 59 సంవత్సరాలు. తాత, ముత్తాతల కాలం నుంచి అదే ప్రాంతంలో స్థిరపడ్డారు. అర్ధాంతరంగా ఆయన చదువు అటకెక్కడంతో.. తండ్రి పెట్టిన టీ కొట్టునే జీవనాధారం చేసుకున్నారు. తనలా మరెవరూ విద్యకు దూరం కాకూడదనే సత్సంకల్పంతో తనకున్న రెండు గదుల ఇంటిలోనే ఓ గదిని చిన్న స్కూల్గా మార్చేశారు. ఇప్పుడు ఆ స్కూల్లో సుమారు 80 మంది విద్యనభ్యసిస్తున్నారు. విద్యాదానమే కాదు... ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలోనూ ప్రకాశరావుది పెద్ద చెయ్యే. ఒకానొక సందర్భంలో తనకు రక్తదానం చేసి.. ప్రాణాలు కాపాడిన ఓ అపరిచిత వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకున్న ఆయన.. 1976 నుంచి ఇప్పటి వరకు 210 సార్లు రక్తదానం, 17 సార్లు ప్లేట్లెట్స్ దానం చేశారు. ప్రతి రోజూ ప్రభుత్వాస్పుత్రిలోని పేద రోగులకు పాలు, బిస్కెట్లు, పండ్లు దానం చేస్తుంటారు. విద్యాధికుడు కాకున్నా జీవన స్రవంతిలో దైనందిన మనుగడ కోసం ఆయన 8 భాషల్లో మాటామంతీ చేయగల సమర్థుడు. ప్రభుత్వం నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకం తరహాలోనే చదువుపై బాలల్లో మక్కువ పెంపొందించేందుకు పాలు, బిస్కెట్లు, బన్ వంటి తినుబండారాలు నిత్యం ఉచితంగా ఇస్తూ ఆదరిస్తున్నారు. పిల్లలకు యూనిఫాం, చెప్పులు కూడా ఉచితంగా ఇస్తారు. ప్రస్తుతం 4 నుంచి 9 ఏళ్ల లోపు సుమారు 80 మంది బాలలు ఆయన ఆధ్వర్యంలో అక్షరాలు నేర్చుకుంటున్నారు. చిట్ట చివరగా ఆయన మరణానంతరం కూడా మానవాళి మనుగడకు ఎంతో కొంత దోహదపడాలనే తపనతో అవయవ దానం చేసేందుకు ఇప్పటికే అంగీకార పత్రం ఇచ్చారు. ఆయన ఆర్జించిన దానిలో సింహ భాగం సంఘసేవకే వెచ్చిస్తుంటారు. కాగా నిజ జీవితంలో ఎదురైన కష్ట నష్టాలు తోటి వారిలో తిరిగి చూడరాదనే భావమే సంఘ సేవకు ప్రేరేపించి నేడు తనను ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీతగా నిలిపిందని ‘సాక్షి’తో దేవరపల్లి ప్రకాశరావు ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు ప్రకాశరావు సంఘసేవ గురించి తెలుసుకున్న ప్రధాని నరేంద్రమోదీ గత ఏడాది మే నెలలో ఒడిశా రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా దేవరపల్లి ప్రకాశరావుతో భేటీ అయ్యారు. ఆయన నిర్వహిస్తున్న సంస్థను సందర్శించి ముచ్చటపడ్డారు. ఆయన సేవలు అనన్యమని అభినందించారు. అనంతరం మన్ కీ బాత్ ప్రసార కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రకాశరావు సంఘసేవలో తలమునకలై నిరంతరం కొనసాగించడం అభినందనీయమని.. ఆయనను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించడం విశేషం. ప్రకాశరావును పద్మశ్రీ వరించినందుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆయనకు అభినందనలు తెలియజేశారు. -
సేవా హస్తాలు..!
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ అభాగ్యుడికి ఆపరేషన్ కోసం రూ.లక్షలు అవసరమయ్యాయి. కానీ ఎవరిస్తారు? చదువుకునేందుకు డబ్బులు లేక సాయం చేసే దాతలు లేక చదువు మానేసి ఇంటిబాట పట్టిన వారూ ఉన్నారు. ఇటువంటి కష్టాలకు, సమస్యలకు చెక్ పెట్టే దిశగా సేవాహస్తాలు ముందుకొచ్చాయి. కష్టం ఏదైనా.. సమస్య ఎంత పెద్దదైనా సరే.. తాము నిధులు సేకరించి ఆదుకుంటున్నారు ‘గుడ్క్లాప్’ నిర్వాహకులు. వెబ్సైట్ రూపొందించి దాతలు ఇచ్చిన డబ్బులతో ఆపన్నహస్తం అందిస్తున్నారు. హిమాయత్నగర్: నిజాంపేటకు చెందిన గండ్రపు శశాంక్ సీఏ చదువుకున్నారు. ఆర్థిక సమస్యలు, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారికి సాయం చేసేవారు లేక, చదువుకునే వారికి ఆర్థిక సాయం చేసేవారు లేక ఇబ్బందుల పాలవుతున్నవారిని గుర్తించి ఆదుకుంటున్నారు. సమస్యల్లో ఉన్న వారి కోసం నిధుల సేకరణ చేయాలనే ఆలోచనకు 2017లో శ్రీకారం చుట్టారు. స్నేహితుడు డాక్టర్ రాజ్కు విషయాన్ని వివరించారు శశాంక్. రాజ్ ప్రోత్సాహంతో 2018 మార్చిలో క్రౌండ్ ఫండింగ్ను మొదలుపెట్టారు. దీని కోసం ‘గుడ్క్లాప్’ పేరుతో కంపెనీని స్థాపించి అదే పేరుతో వెబ్సైట్ను రూపొందించారు. క్లిక్ చేస్తే చాలు సాయం.. మీ ఇంట్లోని వారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా.. చదువు కోసం ఫండింగ్ కావాలన్నా.. సమాజానికి ఉపయోగపడే మంచి పని చేయాలన్నా.. డబ్బు కావాల్సిందే. మనవద్ద ఉన్న డబ్బు సరిపోని పరిస్థితుల్లో దాతల కోసం ఎదురు చూస్తుంటాం. ఇటువంటి వారు తమ ‘గుడ్క్లాప్’ని ఆశ్రయిస్తే తాము మధ్యవర్తిత్వం వహిస్తూ మీకు కావాల్సిన డబ్బును ఇస్తామంటున్నారు ఫౌండర్ శంశాంక్. వెబ్సైట్లోకి వెళ్లి ‘స్టార్ట్ క్యాంపెయిన్’ అనే బటన్ క్లిక్ చేస్తే చాలు. ‘గుడ్క్లాప్’ నిర్వాహకులు మీకు కాంటాక్ట్లోకి వచ్చేస్తారు. ఇప్పటివరకు వీరు ఎంతో మందిని ఆదుకున్నారు ‘గుడ్క్లాప్’ సభ్యులు భార్గవ, పావని, రాజు, నితిన్, ఫణి. మనల్ని కాంటాక్ట్ చేస్తారు. ఆ తరువాత ఎక్కడైతే చికిత్స జరుగుతుందో..ఆ హాస్పిటల్కు వస్తారు. సంబంధిత డాక్టర్తో సంప్రదింపులు జరుపుతారు. మెడికల్ రిపోర్ట్స్ అన్నీ పరిశీస్తారు. వాస్తవమని నిర్ధారించుకున్న తర్వాత.. దీనికి సంబ«ంధించిన స్క్రిప్ట్ని తయారు చేస్తారు. స్క్రిప్ట్ చదివే వారికి నమ్మకాన్ని, కంటతడి పెట్టించేలా రాస్తారు. ఆ తర్వాత వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. దీనిద్వారా వచ్చిన డబ్బులను హాస్పిటల్కే వెళ్లి చెల్లిస్తారు. కమీషన్ 6శాతం.. ఇంత కష్టపడి టీం వర్క్ చేస్తూ ఫండ్ కలెక్ట్ చేస్తున్న వీరు వచ్చిన ఫండింగ్లో నుంచి 6శాతం కమీషన్ తీసుకుంటారు. ఈ కమీషన్తో సంస్థ ఉద్యోగుల జీతాలు, మెయింట్నెన్స్, స్క్రిప్ట్ సిద్ధం చేసిందుకు వాడతారు. సాయం చేసిన వారి వివరాలు ఫొటోతో సహా వెబ్సైట్లో ప్రచురిస్తారు. తమకు ఈ విధమైన ప్రచారం వద్దనుకుంటే ఆప్షన్ హైడ్ చేస్తే సరిపోతుంది. మీరు సాయం చేసినా.. పబ్లిగ్గా మీ ఫొటో, మీ వివరాలు కనిపించవు. మీరు మాత్రమే చూసుకునే వెసులుబాటు ఉంటుంది. వీరిని ఆదుకున్నారు.. ♦ తమిళనాడు వేలూరులోని ‘సీఎంసీ’ హాస్పిటల్లో ‘రేర్ బ్లడ్ డిజార్డర్’తో బాధపడుతున్న స్రవంతి అనే యువతి రూ.15 లక్షలు అవసరమయ్యాయి. గుడ్క్లాప్ వెబ్సైట్ ద్వారా ఇప్పటి వరకు రూ.2.41లక్షలు హాస్పిటల్కు చెల్లించారు. ♦ ఇండోసోల్ అనే కర్ణాటక వాళ్లు ఓ ఆల్బమ్ కోసం ఫండ్ కావాల్సి వచ్చింది. దీంతో గుడ్క్లాప్ను సంప్రదించారు. వారికి రూ.2.8 లక్షలు ముట్టాయి. దీనిద్వారా వాళ్ల ఆల్బమ్ రెడీ అయ్యింది. ♦ బెంగళూరుకు చెందిన నటరాజ్ అనే యువకుడు ఇంటర్నల్ బ్లీడింగ్తో చికిత్సలో ఉన్నాడు. దీనికి గాను రూ.10లక్షలు అవసరం. ఇప్పటి వరకు రూ.2లక్షలు నేరుగా హాస్పిటల్కు ఇచ్చారు. ♦ కేరళ వరదల్లో చిక్కుకున్న వారికి సాయం చేయాలనే దృక్పథంతో ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ వాళ్లు ఫండ్కు రేజ్ చేశారు. ఇలా రూ.5.66 లక్షలను కేరళ వరద బాధితులకు ఇవ్వగలిగారు. ♦ హైదరాబాద్కు చెందిన వేణుకుమార్ భార్య ప్రసవించింది. పాప ఏడో నెలలో పుట్టడంతో ఇంక్యుబెటర్లో ఉంచాల్సి వచ్చింది. వైద్య ఖర్చుల కోసం రూ.4 లక్షల వరకు అవసరమయ్యాయి. ఆమెకు రూ.3.9లక్షలు అందించారు. ♦ అన్నపూర్ణ స్టూడియోకు చెందిన కొందరు యువకులు ‘నాన్దెవ్రూ’ అనే షార్ట్ఫిల్మ్ తీయడానికి రూ.2.20లక్షల సాయం కావాల్సి వచ్చింది. వీరికి రూ.2.23లక్షలు వచ్చాయి. ఇదే స్టూడియోలో మరో టీం ‘అంతర్గత’ ‘ఫేక్ ప్రెగ్నెన్సీ’ పై షార్ట్ ఫిల్మ్ తీసేందుకు రూ.1.49లక్షలు అవసరం కాగా..రూ.1.50లక్షలు వచ్చాయి. ♦ నగరానికి చెందిన రాజు తండ్రి రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతిచెందారు. రాజు తలకు తీవ్రగాయాలయ్యాయి. రిబ్స్ విరిగిపోయాయి. ఇప్పుడు ఇతని చికిత్స కోసం రూ.7లక్షలు కావాలి. ప్రస్తుతం రూ.1.46లక్షలు అందాయి. -
పక్షులకు ప్రాణదాత!
నాంపల్లి: పతంగులు పక్షుల పాలిట శాపంగా మారాయి. చైనా మాంజాలతో పతంగులు ఎగురవేయడంతో తెగిపడిన మాంజాలకు చిక్కుకుంటూ గద్దలు, కాకులు, పావురాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. కాళ్లను, రెక్కలను పోగొట్టుకుంటున్నాయి. ఆకాశంలో ఎగరలేక కిందపడ్డ ఓ గద్ద ఒకానొక రోజు నాంపల్లి రోడ్లపై కనిపించింది. పైకెగరలేని గద్దను నాంపల్లి వ్యాయామశాల వద్ద నివాసం ఉండే టూ వీలర్ మెకానిక్ సుబ్బారావు కుమారుడు త్రిమూర్తి పిళ్లై దగ్గరకు తీసుకున్నారు. మాంజా (దారం) చుట్టుకుని గాయపడ్డ గద్దకు చికిత్సలు అందించారు. నెల రోజుల పాటు నాంపల్లి మార్కెట్లో చికెన్ కలేజాను కొనుగోలు చేసి ఆహారంగా అందించారు. పూర్తిగా కోలుకున్న తర్వాత గద్దను పైకి వదిలేశారు. ఈ సంఘటన జరిగి సుమారు 20 ఏళ్లు కావస్తోంది. పక్షులపై నాడు చిగురించిన ప్రేమ నేటికీ అతనిలో తగ్గలేదు. నాటి నుంచి నేటి వరకు ఆయన గద్దలకు మాంసం వేస్తూ తనవంతుగా పక్షులకు ప్రేమను పంచుతున్నారు. వృత్తిరీత్యా మెకానిక్... త్రిమూర్తి పిళ్లై ద్విచక్రవాహనాల మెకానిక్. నాంపల్లి ఏరియా ఆసుపత్రికి వెనుక వైపు ఫుట్పాత్పై మెకానిక్ షెడ్డు ఏర్పాటు చేసుకున్నారు. వికలాంగుడు కావడం చేత ప్రభుత్వం సైతం సహకరిస్తోంది. త్రిమూర్తి పిళ్లై మెకానిక్గా స్థిరపడినప్పటికి ఆయన గొప్ప జంతు ప్రేమికుడు. ఆయన మనసంతా జంతువులు, పక్షుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే ఉడుతలకు, చీమలకు ఆహారాన్ని అందిస్తారు. నాంపల్లిలోని ఆయన నివాసం వద్ద తెలవారగానే ఉడతలు ఆహారం కోసం అరుస్తూ కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదు. నెలలో రెండు పర్యాయాలు నర్సాపూర్ అడవులకు అద్దె కారులో వెళ్లి అక్కడ ఉండే కోతులకు పల్లీలను ఆహారంగా ఇస్తారు. అంతేకాదు ఆలయాల వద్ద గోవులకు ఆహారాన్ని అందిస్తారు. అనాథలకు అండగా నిలుస్తూ వారికి దుస్తులు అందజేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదన్న కారణంతో అరటి పండ్లను ఇస్తారు. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు పిళ్లై దైనందిన దినచర్యలో భాగం అయ్యాయి. గద్దలకే అధిక వ్యయం.... ఆకాశంలో ఎగిరే గద్దలంటే త్రిమూర్తి పిళ్లైకు చాలా ఇష్టం. సాయంత్రం 5 గంటలు అయ్యిందంటే చాలు వాటికి ఆహారం ఇవ్వడం పరిపాటిగా మారింది. త్రిమూర్తి పిళ్లైకు సుస్తీ చేసినా, ఇతర ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పడు తన దగ్గర మెకానిక్గా శిక్షణ పొందే యువకులకు బాధ్యతలు అప్పగిస్తారు. ముర్గీ మార్కెట్లో ప్రతి రోజూ నాలుగు కిలోల చికెన్ కలేజాను కొనుగోలు చేస్తారు. తనతో పాటు శిష్యులతో కలిసి ఆకాశంలో ఎగిరే గద్దలకు మాంసాన్ని విసిరివేస్తారు. సంపాదనలోకొంచెం సామాజిక సేవకు ఆశాంలో ఎగిరే పక్షులు పతంగుల మాంజాలకు బలవుతున్నాయి. పక్షులు అనుభవిస్తున్న క్షోభను చూస్తే ఎవరికైనా బాధేస్తుంది. వాటిని రక్షించాల్సిన అవసరం ఉంది. విదేశాలకు చెందిన మాంజాలను నిషేధించాలి. నేను సంపాదించిన ఆదాయంలో ప్రతి రోజూ రూ.800 వరకు సామాజిక సేవకు ఖర్చు పెడతాను. ఈ సేవ నాకెంతో తృప్తినిస్తోంది. – త్రిమూర్తి పిళ్లై, జంతుప్రేమికుడు -
నిబద్ధతకు నిలువెత్తు సంతకం!
జీవితమంతా ప్రజలకు నిబద్ధులై ఉండే అరుదైన అధికారుల గురించి ఆలోచిస్తే మొట్టమొదట మన కళ్లముందు కదలాడే ప్రత్యక్ష రూపం ఎస్.ఆర్. శంకరన్దే. 1974 ప్రాంతంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దళితుల, ఆదివాసీల విషయంలో చేసిన కీలక నిర్ణయాలు, శంకరన్ లాంటి అభ్యుదయ అధికారుల చేతిలో శక్తివంతమైన ఆయుధాలుగా మారాయి. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాక దళిత, ఆదివాసీల అభ్యున్నతికి బాటలు వేసే అత్యంత సాహసోపేత మైన నిర్ణయాలెన్నో చేసిన ఎస్.ఆర్. శంకరన్ ఒక్క ఏడాదిలోనే దాదాపు 120 ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం ఐఏఎస్ అధికారుల చరిత్రలో అరుదైన సందర్భం. భారత రాజ్యాంగం అత్యున్నతమైనది. విశిష్టమై నది. అధిపతులూ, అధికా రులూ, పరిపాలకులూ ఈ దేశంలో ఎంతటి అత్యు న్నత పదవిలో ఉన్న వారైనా భారత రాజ్యాంగానికి బద్ధులైæ ఉండాల్సిందే. భారతదేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడి, పాలనను కొనసాగించే వ్యవ స్థలు మూడు. అందులో ఒకటి శాసన వ్యవస్థ. రెండు అధికార వ్యవస్థ. మూడు న్యాయ వ్యవస్థ. ఈ మూడింటిలో శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ కేవలం విధానాలూ, చట్టాల, రూపకల్పనలో ప్రధాన పాత్ర వహిస్తాయి. కానీ శాసన న్యాయ వ్యవస్థలు అంతగా ప్రజలకి చేరువ కావు. అయితే అధికార వ్యవస్థ నిత్యం ప్రజలమధ్యే ఉండాల్సి ఉంటుంది. వీరె ప్పుడూ ప్రజలకు, రాజ్యాంగానికీ మాత్రమే జవాబు దారీగా ఉండాలి. ప్రభుత్వంలోని బ్యూరోక్రాట్స్ కానీ, అధికారంలో ఉన్న పెద్దలెవరైనా, ఇతర ఆధి పత్యశక్తుల ఆజ్ఞలకు లోబడి పనిచేయాల్సిన అవ సరం లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రభుత్వా లను నడిపే ముఖ్యమంత్రులనూ, మంత్రులనూ ఎది రించి రాజ్యాంగం అమలుకోసం నిలబడే శక్తిసామ ర్థ్యాలు వీరికి కావాలి. జీవితమంతా ప్రజలకు నిబద్ధులై ఉండే అరుదైన అధికారుల గురించి ఆలోచిస్తే మొట్టమొ దట మన కళ్లముందు కదలాడే ప్రత్యక్ష రూపం ఎస్ఆర్ శంకరన్దే. ప్రభుత్వాలు, రాజ్యాంగం, న్యాయ వ్యవస్థా, ఇతర పాలనా విభాగాలేవైనా వాటి కర్తవ్య నిర్వహణ అణగారిన వర్గాల సమస్యల పరి ష్కారంలోనే ప్రతిబింబిస్తుందని మనస్ఫూర్తిగా నమ్మి నవాడు. తాను బతికి ఉన్నంత కాలం అట్టడుగు వర్గాల, దళితుల అభివృద్ధి కోసం నిర్విరామంగా కృషి చేసారు. పేదలు, అత్యంత నిరుపేదలు అనే ఊహాజనితమైన ఆవిష్కరణలను తిప్పికొట్టి అన్ని రకాల పేదరికాలనూ, వివక్షనూ ఎదుర్కొంటున్న వర్గం కేవలం అంటరాని కులాలేనని తేల్చి చెప్పారు. పామరుల చెంతకు పాలనావ్యవస్థ పామరుల చెంతకు పాలనావ్యవస్థను పరుగులు పెట్టించిన ఘనత ఎస్.ఆర్. శంకరన్దేనంటే అతి శయోక్తికాదు. తమిళనాడులోని తంజావూరులో 1934, అక్టోబర్ 22న ఆయన జన్మించారు. మదు రైలో కామర్స్లో డిగ్రీ పూర్తిచేశారు. ఆయన ఐఏ ఎస్లో చేరకముందు లెక్చరర్గా కొంత కాలం పని చేశారు. 1956లో ఐఏఎస్లో చేరిన శంకరన్ 1959లో కర్నూలు జిల్లా నంద్యాల సబ్ కలెక్టర్గానూ, నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్గానూ పనిచేశారు. తరువాత కేంద్ర ప్రభుత్వ సర్వీసులోకి వెళ్ళారు. 1971–73లో కేంద్ర ఉక్కు, గనుల శాఖామంత్రిగా ఉన్న కుమార మంగళంకు స్పెషల్ అసిస్టెంట్గా కూడా పనిచేశారు. బొగ్గు గనులను జాతీయం చేసే కార్యక్రమంలో ఎస్.ఆర్. శంకరన్ పాత్ర అత్యంత కీలకమైనది. బొగ్గుగని కార్మికులు బానిసలుగా జీవి స్తున్న స్థితిలో వారికి రాజ్యాంగపరమైన హక్కులను కల్పించడంలో శంకరన్ కృతకృత్యులయ్యారు. సాంఘిక సంక్షేమానికి ఆద్యుడు కారణాలేవైనప్పటికీ 1974 ప్రాంతంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దళితుల, ఆదివాసీల విషయంలో చేసిన కీలక నిర్ణయాలు, ఎస్సీ, ఎస్టీల పట్ల అను సరించిన వైఖరి శంకరన్ లాంటి అభ్యుదయ అధికా రుల చేతిలో శక్తివంతమైన ఆయుధంగా మారాయి. హైదరాబాద్లో 1976లో నిర్వహించిన హరిజన కాన్ఫరెన్స్ హరిజన పదం వాడకం అవమానకరమైన దనీ, దాన్ని ఇకపై వాడకూడదనీ తీర్మానించింది. తదనంతర కాలంలో ఆ తీర్మానమే ప్రభుత్వ ఉత్త ర్వుగా రూపుదిద్దుకుంది. అప్పటినుంచి ప్రభుత్వ రికార్డుల్లో హరిజన అనే పదం స్థానంలో షెడ్యూల్డ్ కులాలు అని చేర్చారు. ఈ సదస్సులో ఎస్సీల సమ స్యపై దాదాపు 322 సిఫారసులను సూచించారు. అందులో 224 తీర్మానాలు ఆమోదించారు. ఆంధ్ర ప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దళిత, ఆది వాసీల అభ్యున్నతికి బాటలు వేసే అత్యంత సాహ సోపేత మైన నిర్ణయాలెన్నో చేసిన ఎస్.ఆర్. శంకరన్ ఒక్క ఏడాదిలోనే దాదాపు 120 ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం ఐఏఎస్ అధికారుల చరిత్రలో అరు దైన సందర్భం.120 జీఓల్లో 100కి పైగా శంకరన్గారి సింగిల్ సిగ్నేచర్తో ఉండడం నిజాయితీ కలిగిన, పాలనాధికారులకు ఒక గొప్ప సందేశాన్నిస్తోంది. హరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ పేరును సాంఘిక సంక్షేమ శాఖగా మార్పు చేయడం జీఓల్లో ఒకటి. దళితుల, ఆదివాసీల గురించి జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో సైతం అత్యంత స్పష్టంగా వివక్ష కనిపిస్తూంటుంది. వీరికోసం ప్రభుత్వం నిర్మించి ఇస్తోన్న ఇళ్లన్నీ వెలివేసినట్టు ఊరుచివరే నిర్మిస్తారు. గ్రామం వెలుపల కాకుండా, గ్రామం మధ్యలోనే వీరి ఇళ్ళు నిర్మించాలనీ, దళితుల వాడల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలనీ, రేషన్ షాపు లను దళితులకే కేటాయించాలనీ, దళితుల పిల్లలకు పౌష్ఠికాహారం, గ్రామ పంచాయతీల్లో దళిత మహిళ లకు రిజర్వేషన్లు, ఒంటరి దళిత మహిళలకు ఇండ్ల స్థలాలు, కులాంతర వివాహాలకు ప్రోత్సాహకాలు, వ్యాపార, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో శిక్షణ, ఇనాం భూములకు పట్టాలు, ప్రభుత్వ హౌజింగ్ కాలనీల్లో దళితులకు ఇండ్ల కేటాయింపుల్లో ప్రాధాన్యం, స్థానిక సంస్థల బడ్జెట్లో 15 శాతం నిధులను దళితుల అభివృద్ధికి ప్రత్యేకించి కేటాయిం చడం కుల నిర్మూలన అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చడం, దళిత వాడల్లో విద్యుదీకరణ, పబ్లిక్ స్కూల్స్లో రిజర్వేషన్లు దళిత వాడల్లో పాఠశాలల ఏర్పాటు లాంటివి వంద జీవోల్లో కొన్ని మాత్రమే. రెండో వైపు షెడ్యూల్డ్ తెగలైన ఆదివాసీలకు అభివృద్ధిపై కూడా ఆయన దృష్టి సారించారు. ఆది వాసీల కోసం ప్రత్యేక సమీకృత ఆదివాసీ అభివృద్ధి సంస్థ (ఐటిడిఎ)లను ఏర్పాటు చేయడంలో శంకరన్ కృషి మరువలేనిది. పైగా ఎస్సీ, ఎస్టీ పిల్లలకు మెరుగైన విద్యనందించే లక్ష్యంతో ప్రత్యేక హాస్టల్స్ను ప్రారంభించిన ఘనత కూడా శంకరన్దే. 1976లో వచ్చిన వెట్టిచాకిరీ నిషేధ చట్టం ఆయన కృషి ఫలి తమే. ఎందరినో భూస్వాముల చెర నుంచి విముక్తి చేసి పునరావాసం కల్పించారు. ఈ విషయమై 1978లో అధికారంలోనికి వచ్చిన ముఖ్యమంత్రి మర్రిచెన్నారెడ్డితో వచ్చిన విభేదాల కారణంగా త్రిపుర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బదిలీపై వెళ్ళారు. అక్కడ కేంద్ర పారామిలిటరీ దళాల అరా చకాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎంతో కృషి చేశారు. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేప ట్టిన అనంతరం ఆయన తిరిగి మన రాష్ట్రానికి వచ్చారు. సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్య తలు స్వీకరించారు. రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు, స్కాలర్షిప్ల పెంపుదల, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల అమలు కోసం కృషి చేసారు. 1985లో ప్రకాశం జిల్లా కారంచేడులో జరిగిన దారు ణానికి చలించిపోయిన ఎస్ఆర్.శంకరన్ ప్రభుత్వ పెద్దలను ధిక్కరించి కూడా కొన్ని సాహసోపేత నిర్ణయాలు చేసారు. నక్సలైట్లతో చర్చలు పదవీ విరమణ తర్వాత మూడు ముఖ్యమైన విష యాలలో క్రియాశీలకంగా ఆయన పనిచేశారు. అందులో పౌరస్పందన వేదిక (కన్సర్డ్న్ సిటిజన్స్ కమిటీ) ఒకటి. ప్రభుత్వానికీ నక్సలైట్లకూ మధ్య జరుగుతోన్న పోరులో కోల్పోతున్న పౌరుల ప్రాణా లను కాపాడేందుకు మానవీయ దృక్పథంతో మేధా వులను కూడగట్టి పౌరస్పందన వేదికను ఏర్పరి చారు. 1997లో ఏర్పాటైన ఈ వేదిక ప్రభుత్వానికీ నక్సలైట్ల మధ్య చర్చలు జరగడానికి తీవ్రంగా కృషి చేసింది. దాని ఫలితంగా 2004లో అధికారంలోకి వచ్చిన వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో నక్స లైట్లను చర్చలకు ఆహ్వానించడం భారతదేశ చరిత్ర లోనే అరుదైన సంఘటన. ఆ తర్వాత ఆయన దృష్టి మొత్తం పాకీపనివారి విముక్తిపై సారించారు. దళిత మావన హక్కుల కార్యకర్త బెజవాడ విల్సన్తో కలిసి సఫాయి కర్మచారీ ఆందోళన్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ప్రారంభమైన ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేయడం కోసం శంకరన్ చేసిన ప్రయత్నం అద్వితీయమైనది. ప్రభుత్వ పాలనలో తన అనుభవాన్ని ఉపయోగించి ఆ సమస్యపై దేశ వ్యాప్తంగా చర్చకు తెరదీసారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చే విధంగా సుప్రీంకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఆ ఉద్యమం వల్ల చేతితో మలం ఎత్తే అమానవీయ పని నుంచి ఎందరో బయటపడ్డారు. శంకరన్ ప్రధాన పాత్రధారిగా ప్రారంభమైన సఫాయి కర్మచారీ ఆందోళన్కు అంతర్జాతీయ గుర్తింపు రావడమే కాకుండా, దాని కన్వీనర్ బెజ వాడ విల్సన్కు రామన్ మెగసెసే అవార్డు రావడం శంకరన్ కృషిలో భాగంగా భావించాలి. పెళ్ళి తన లక్ష్యానికి అవరోధం అవుతుందని భావించి వ్యక్తిగత జీవితాన్నే త్యజించినవాడు. 2008 అక్టోబర్ 7వ తేదీన అశేష దళిత ప్రజానీకానికి వీడ్కోలు పలు కుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకున్న ఆస్తి మిత్రులు కొనిచ్చిన ఓ చిన్న ఫ్లాటు, ఆయన పుస్తకాలు మాత్రమే. నిస్వార్థ నిరాడంబర అభినవ బౌద్ధుడు ఎస్ఆర్.శంకరన్. ఆయన కృషికి గుర్తుగా పద్మభూషణ్ అవార్డు అతన్ని వరించి వస్తే సున్ని తంగా తిరస్కరించారు. కేంద్ర రాష్ట్రాల్లో శంకరన్ లాంటి నిబద్ధత కలిగిన అధికారులు చాలా అరుదనే చెప్పాలి. శంకరన్ ఆశయాలను ఈతరం అధికారులు పుణికిపుచ్చుకోవాల్సిన సందర్భమిదే. (అక్టోబర్ 22న ఎస్ఆర్.శంకరన్ జయంతి) మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 -
బాలిక.. బతకాలిక !
బాలికలు, మహిళలపై రోజురోజుకూ వేధింపులు, అఘాయిత్యాలు పెచ్చుమీరుతున్నాయి. సమాజంలో వీరి భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. అమ్మాయిల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ‘సేవ్ గర్ల్ చైల్డ్’ నినాదాన్ని తలకెత్తుకున్నారామె. బాలికల సంరక్షణకు నడుం కట్టారు.అవగాహన సదస్సులు, సోషల్ మీడియాలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆడవాళ్లభద్రతకు తనవంతు బాధ్యతగాముందుకెళ్తున్నారు హైదరాబాద్కు చెందిన బొట్ల లతా చౌదరి. నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ‘ఆడపిల్లను రక్షించుకుందాం’ అనే నినాదంపై అవగాహన కల్పిస్తున్నారు. సమాజంలో వారికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రొజెక్టర్ల ద్వారా ప్రదర్శిస్తూ చైతన్యం తెచ్చే దిశగా అడుగులు వేస్తున్నారామె. ప్రతి అత్తా ఒక తల్లిలాఆలోచించాలని హితవు చెబుతున్నారు. హిమాయత్నగర్: కూకట్పల్లిలోని బాచుపల్లికి చెందిన లతా చౌదరి ‘ఉమెన్ వెల్ఫేర్ సర్వీస్ ఆర్గనైజేషన్’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. పలువురు మహిళలను వలంటీర్లుగా నియమించుకున్నారు. ‘సేవ్ ఎ గర్ల్’ నినాదంతో నగరంలోని బాచుపల్లి, నిజాంపేట్, బోరంపేట, కూకట్పల్లి ప్రాంతాలతో పాటు ఏపీలోని విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు. రెండునెలలకోసారి ఓ ప్రాంతాన్ని ఎంచుకుని సంస్థ వలంటీర్లతో కలిసి గ్రామీణ మహిళలతో సమావేశమవుతుంటారు. ‘అసలు ఆడపిల్లలను ఆడదే చంపుతోంది’ అనే విషయాన్ని లేవనెత్తుతూ ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా మహిళలు, బాలికలపై జరిగిన దాడులకు సంబంధించిన వీడియోలను ప్రొజెక్టర్లతో ప్రదర్శిస్తున్నారు. ప్రతి అత్తా తల్లిలా భావిస్తే సమాజంలో ఆడపిల్లకు ఎటువంటి అన్యాయం జరగదు. కలకాలం ఆడపిల్ల మనముందు కదలాడుతుందనే విషయంపై అవగాహన కల్పిస్తున్నారు. ఇలా అవగాహనలో కల్పిస్తుండటంతో ఎన్నో కుటుంబాల్లో మార్పు వచ్చిందని లతా చౌదరి చెబుతున్నారు. వారు ఆరోగ్యంగా ఉంటేనే.. ‘సేవ్ ఎ గర్ల్’ క్యాంపెయిన్ ముగిశాక మరో ప్రాంతంలో ‘హెల్త్ అండ్ న్యూట్రిషియన్’ పేరుతో మరో క్యాంపెయిన్కు శ్రీకారం చుడుతున్నారు లతా చౌదరి. 20 ఏళ్లు దాటిన యువతులు, మహిళలతో సమావేశమవుతారు. గ్రామాల్లోని మహిళలు రక్తహీనతకు ఎందుకు గురవుతున్నారనే విషయాలను వారికి వివరిస్తుంటారు. ఆరోగ్యపరమైన అంశాలను వారికి చెబుతుంటారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో కొన్ని నిత్యావసర సరుకులు అందిస్తుంటారు. అలాగే ఇళ్లల్లో వాడి పడేసిన, అవసరం లేని వస్తువులను సేకరించి పేదలకు అందజేస్తున్నారు. ఇలా ‘దుస్తులు, పాదరక్షలు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్రిజ్లు, నిత్యావసర సరుకులు’వంటి వాటిని పేదలకు ఇస్తున్నారు లతాచౌదరి. ఈ ఏడాది సుమారు 3వేల మందికి వీటిని అందజేసినట్లు ఆమె పేర్కొన్నారు. మార్పు కోసమే ఇదంతా.. ఇదంతా మార్పు కోసమే చేస్తున్నా. చాలావరకు ఆడపిల్లల జీవితాలు ఇంట్లోని ఆడవాళ్ల కారణంగానే నాశనమవుతున్నాయి. ఇరువురి మధ్య సఖ్యత అనేది చాలా ప్రాముఖ్యం. దీనిని వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నాం. అన్ని వర్గాల నుంచి ఆదరణ వస్తోంది. నా వల్ల సమాజంలో కొంత మార్పు వచ్చినా చాలు. – లతా చౌదరి, ఫౌండర్, ఉమెన్ వెల్ఫేర్ సర్వీస్ ఆర్గనైజేషన్ సాయిబాబా ఆలయ నిర్మాణానికి కృషి.. నిజాంపేటలోని బాబా టెంపుల్ లైన్లో ఉన్న బాబా మందిరం ఒకప్పుడు చాలా చిన్నగా ఉండేది. ఈ ప్రాంతంలో ఎందరో కోటీశ్వరులు ఉన్నప్పటికీ ఎవరూ దీనిని పట్టించుకోలేదు. దీంతో లతా చౌదరి ‘షిరిడీ సాయి సేవా ట్రస్టు’ను ఏర్పాటు చేసి దీని ద్వారా విరాళాలు సేకరించారు. సుమారు రూ.కోటితో కొత్తగా దేవాలయాన్ని నిర్మించడంలో తన వంతు పాత్ర పోషించారు. -
సాధారణ మహిళగా ఉండలేను
తమిళసినిమా: ఒక సాధారణ మహిళగా ఉండటం నా వల్ల కాదు అంటోంది నటి అమలాపాల్. ప్రేమ, పెళ్లి, విడాకులు అన్నీ వెంట వెంటనే ఎదుర్కొన్న ఈ సంచలన నటి హీరోయిన్గా మాత్రం కేరీర్ను కొనసాగిస్తూనే ఉంది. అయితే మునుపంత దూకుడు లేదు. గ్లామరస్ ఫొటోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేయడం లాంటి ఏదో ఒక విధంగా వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తున్న అమలాపాల్ తాను చాలా మందిలా సాధారణ అమ్మాయిలా ఉండలేను అంటూ మరోసారి వార్తలకెక్కింది. ఇంతకీ ఈ జాన ఏమంటుందో చూద్దాం. నటి అన్నాక గ్లామర్ పాత్రలనే కాకుండా అన్ని రకాల పాత్రలను చేయాలి. అమ్మగా నటించడానికి కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే మీడియా వాళ్లే దీని గురించి చర్చ చేస్తున్నారు. కొచ్చి, చెన్నై ఈ రెండు నాకు పుట్టిల్లు లాంటివే. కొచ్చి పుట్టిన ఊరు అయితే చెన్నై ఉద్యోగం చేస్తున్న ఊరు కొచ్చికి వెళితే అమ్మకు గారాలబిడ్డనైపోతాను. బాగా నిద్రపోతాను. బాగా తింటాను. ఎక్సర్సైజు చేస్తాను. చెన్నైలో ఉంటే అలా ఉండలేను. కారణం ఇది జీవితాన్నిచ్చిన ఊరు. అందుకే కాస్త భయంగా ఉండాలి. నాకు సినిమా మినహా వేరేం తెలియదు. అయితే తొలిసారిగా ఏదైనా వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చింది. ఆయుర్వేదానికి సంబంధించిన వృత్తిలో దృష్టి సారిద్దాం అని అనుకుంటున్నాను. దీంతో పాటు స్నేహితులతో కలిసి ఒక సామాజిక సేవా సంస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. తద్వారా 100 మందికి నేత్ర చికిత్స చేయించాలనే పథకం ఉంది. అంతేగాకుండా మనసులో ఆలోచనలను కథల రూపంలో పేపర్పై పెడుతున్నాను. అయితే ఒక్కటి మాత్రం దృఢంగా చెప్పగలను అమలాపాల్ అందరిలా సాధారణ మహిళలా ఉండలేదు అని అంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కోలీవుడ్, మాలీవుడ్లతో ఒక్కో చిత్రం చేస్తోంది. -
ప్రజాసేవలో తెలంగాణ పోలీసు
రెంజల్(బోధన్): సమాజంలో జరుగుతున్న నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను అందించేందకు రాష్ట్ర పోలీసు వ్యవస్థ కృషి చేస్తోందని సీపీ కార్తికేయ అన్నారు. అందుకు అవసరమైన ఆదేశాలకు జిల్లా పోలీసు యంత్రాంగానికి జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తమ పోలీసులు అంకితభావంతో పనిచేస్తారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. రెంజల్ మండలం నీలా గ్రామంలో గురువారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని హైస్కూల్లో గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడారు. జాగ్రత్తలే మనిషికి బలం అని అన్నారు. ఎదుటివారి మాటలను నమ్మకుండా జాగ్రత్తగా వ్యవహరించినప్పుడే మోసాల నుంచి తమను తమం కాపాడుకునే అవకాశం ఉంటుందన్నారు. అపరిచితులు తమ ఏటీఎం కార్డు గురించి అడిగితే పిన్ నంబరు, ఓటీపీలను చెప్పవద్దన్నారు. ఖాతాదారులకు బ్యాంకుల నుంచి గాని పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం ఫోన్ ద్వార అడగరని తెలిపారు. మత సామరస్యానికి సంబంధిచి జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. మహిళల భద్రతకు షీటీంలకు ఏర్పాటు చేశామన్నారు. దేవుని గుడికి ఎంత నమ్మకంతో వెళతారో ఆదే నమ్మకం పోలీసులపై ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామన్నారు. గల్ఫ్ మోసాలను నియంత్రించేందుకు హెల్ప్లైన్ ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ఇతర దేశాలకు పంపిస్తామని వస్తే ముందుగా వారి సమాచారాన్ని సమీపంలోని స్టేషన్లో అందించాలన్నారు. గ్రామాల్లో ఇంటర్ పూర్తి చేసిన యువకులకు ఉచితంగా పోలీసు శాఖ ద్వార శిక్షణ అందింస్తుననట్లు తెలిపారు. పోలీసు జీతంతో పాటు వీఆర్వో జీతాలకు ప్రీపెరయ్యె వారికి సైతం శిక్షణ దోహదపడుతుందన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ(ఆడ్మిన్) ఆకుల రాంరెడ్డి, బోధన్, ఆర్మూర్, ఎస్బీఐ, ఏఆర్ ఏసీపీలు రఘు, శివకుమార్, మహేశ్వర్, రవీందర్, 8 మంది సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
అభాగ్యుల ఆకలి తీర్చే ఆప్తుడు
నంద్యాల విద్య: అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు పెద్దలు..భుజించే ముందు కొందరు దైవాన్ని సైతం గుర్తు చేసుకుంటారు. అయితే అభాగ్యులు చాలా మంది ఒక పూట తింటూ మరోపూట పస్తులతో కాలం గడుపుతున్నారు. ఇలాంటి వారి ఆకలి తీర్చేందుకు నంద్యాల పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ముందుకు వచ్చాడు. తన వద్ద ఆర్థిక స్తోమత లేకపోవడంతో పెళ్లిళ్లు, బర్త్డే ఫంక్షన్లు, శుభకార్యాల్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను నేలపాలు చేయకుండా సేకరిస్తున్నాడు. వాటిని పేదలకు అందిస్తూ ఆప్తుడిగా నిలిచాడు. నంద్యాల పట్టణంలోని ఓ ప్రముఖ ప్యాక్టరీలో చిరు ఉద్యోగిగా పనిచేస్తున్న జాన్.. కొందరు సభ్యులతో కలిసి జెనిటర్స్, జెడ్జిస్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. వేడుకల్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలు సేకరించి నంద్యాల, చుట్టుపక్కల గ్రామాల్లో ఆకలితో అలమటిస్తున్న వారికి పంచుతున్నాడు. ఈ సేవా కార్యక్రమాన్ని ఓ యజ్ఞంలా చేపట్టేందుకు ప్రజలందరినీ చైతన్య పరిచాడు. మిగిలిన ఆహారాన్ని పారవేయకుండా తన సెల్ నంబర్ 6301080873కు సమాచారం ఇవ్వాలని ప్రచారం చేయిస్తున్నాడు. ఆహార పదార్థాలను తీసుకు వెళ్లడానికి శేషు అనే దాత ఆటోను సమకూర్చాడు. ఎవరైనా.. ఎప్పుడైనా ఫోన్చేసి ఆహారపదార్థాలు మిగిలి ఉన్నాయని సమాచారాన్ని అందిస్తే వెంటనే అక్కడికి వెళ్లి సేకరిస్తారు. సంస్థ కార్యదర్శి వెంకటేశ్వర్లు, మిత్రులు ఉసేన్వలీ, రాముడు, రాజ్కుమార్.. స్వచ్ఛందంగా ముందుకువచ్చి సేవలు నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని ప్రాంతాలేకాకుండా పొరుగు జిల్లాలైన ప్రకాశం, గుంటూరు జిల్లాలో జాన్.. తన మిత్రుల సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. కేవలం ఆహార పదార్థాలే కాకుండా దాతల సహకారంతో వారివద్ద ఉన్న దుస్తులను సేకరించి నిరుపేదలకు, నిరాశ్రయులకు అందజేస్తున్నాడు. జాన్ సేవలను గుర్తించిన ప్రభుత్వం.. నంద్యాల మునిసిపల్ బ్రాండ్ అంబాసిడర్గా 2018 స్వచ్ఛసర్వేక్షణ్ జ్ఞాపికను అందజేసింది. అంతేకాకుండా పలు స్వచ్ఛంద సంస్థలు జాన్ను సత్కరించాయి. మరికొన్ని సేవా కార్యక్రమాలు.. ♦ వేసవికాలంలో నల్లమల అటవీ ప్రాంతంలోని మూగజీవులకు ఆకలి, దాహం తీరుస్తున్నారు. ఇందుకు నంద్యాల పట్టణంలోని దాతల సహకారం తీసుకుంటున్నారు. ♦ గర్భిణిలు, వికలాంగులు అపద సమయాల్లో ఫోన్ చేస్తే వెంటనే వారిని ఆటోలో ఆసుపత్రిలో ఉచితంగా చేరవేస్తున్నారు. సమాచారం అందిస్తే వెంటనే స్పందిస్తా రైల్వే, బస్స్టేషన్ల వద్ద చాలామంది ఆకలితో అలమటించడాన్ని చూశాను. కొంత మంది నోరు తెరిచి అడుగుతారు. మరికొంత మంది అడగలేక అలాగే ఉండిపోతారు. ఇలాంటి వారికి ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. ఎవరైనా ఫోన్ చేసి ఆహారం ఉందని చెబితే వెంటనే స్పందిస్తాను. పేదల ఆకలి తీర్చడంలో ఉన్న తృప్తి ఎక్కడా దొరకదు. – ఎం.జాన్, జెనిటర్స్ వ్యవస్థాపకుడు -
అనాథలు, అభాగ్యులకు కట్టింగ్, గడ్డాలు చేస్తారు..
బంజారాహిల్స్: ముగ్గురితో మొదలైన ఓ సేవా ఉద్యమం.. దాదాపు మూడు వేల మంది యువతరాన్ని కదిలించేలా చేసింది.. తమ కళ్ల ముందు జరిగిన ఘటనకు చలించిన యువ హృదయాలు ఆపన్నులు, అనాథలు, వికలాంగులు, రోగులను ఇలా సేవ కోసం ఎదురుచూసే ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకొనేలా చేసింది.. నాలుగు రోజుల ఉద్యోగం.. మూడు రోజుల సేవా ఉద్యమం.. అదే ఆ యువతరం చేసే సామాజిక కార్యక్రమం.. ప్రమాదంలో గాయపడితే వైద్యం అందజేస్తారు. మృత్యువాతపడితే ముందుకొచ్చి మంచి మనసుతో సాయం చేస్తారు.. రోడ్డు పక్కన చెరిగిన జుత్తు, పెరిగిన గడ్డంతో ఎవరైనా కనిపిస్తే వారి రూపాన్ని మార్చేస్తారు.. ఆకలి అంటూ కనిపిస్తే వారి ఆకలి బాధను తీరుస్తారు.. యువతరాన్ని, విద్యార్థిలోకాన్ని సమాజసేవ వైపు నడిపించేందుకు వారంలో ఒకరోజు చైతన్య తరగతులు నిర్వహిస్తారు.. శ్రీరాజమాత సేవా సొసైటీ పేరుతో నగరంలోని చాలా మేర ప్రాంతాల్లో ఈ సామాజిక చైతన్య ఉద్యమం వేదిక ద్వారా ఆదుకుంటున్నారు. చెంగిచర్ల ప్రాంతానికి చెందిన ఆర్జే ఉదయ్రెడ్డి(ఒకప్పుడు రేడియో జాకీ) ఇంటర్ చదువుతున్న సమయంలో తనతోపాటు చదివే ముగ్గురు స్నేహితుల తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. దీంతో ఆ ముగ్గురు స్నేహితుల ఆర్థిక స్థోమత బాగోలేక చదువుకు దూరం కావల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటి వరకు అంతా కలిసి చదవుకున్న వారు ఒక్కసారిగా జరిగిన పరిణామంతో తమ స్నేహానికి, చదువుకు దూరం కావడంతో ఉదయ్రెడ్డి తట్టుకోలేకపోయారు. ఎలాగైనా కలిసి చదువుకోవాలని భావించారు. అదే తపన అతని స్నేహితులను కదిలించేలా చేసింది. అంతా కలిసి ముందుకొచ్చి వారి చదువుకు ఆర్థికంగా బాసటగా నిలిచారు. ‘తల్లిదండ్రులు లేకుంటే ఎంత కష్టం.. వారి పరిస్థితి ఎంత దుర్భరం.. ముగ్గురిని చదివిస్తేనే ఇంత ఆనందం.. ఇలాంటి వారికి సాయ పడితే...’ ఇదే ఆలోచన వారిని శ్రీరాజమాత సేవా సొసైటీ ఏర్పాటుకు ముందుకొచేలా చేసింది. మూడు వేల సైన్యం.. ఉదయ్రెడ్డి ఒక్కడే కాకుండా తన సోదరుడు మనోజ్రెడ్డితోపాటు మరికొంతమందితో కలిసి ఈ సేవా సంస్థను ప్రారంభించాడు. తన ఆలోచనలను తాను చేసిన సేవా కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా విస్తృతం చేశాడు. తెలిసిన వారందరికి తెలియజేశారు. ఇలా తన సేవా కార్యక్రమంలో అనేక కళాశాలల విద్యార్థులను కలుపుకొని ముందుకు వెళ్లాడు. కస్తూర్భా ఉమెన్స్ కళాశాల, రెడ్డి ఉమెన్స్ కాలేజ్, మధర్థెరిస్సా కాలేజ్, సిద్దార్థ కాలేజ్, శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలతోపాటు మరికొన్ని కళాశాలలకు చెందిన విద్యార్థులు, పలువురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ ఉద్యమంలో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చారు. సేవకు ముందుంటారు.. తల్లిదండ్రులు లేని అనాథలను అక్కున చేర్చుకోవడం, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, అనాథగా ఎవరూ మృతిచెందకుండా వారి ఖర్మకాండలు నిర్వహించడం, రోడ్డు పక్కన ఉన్న యాచకులకు, అనాథలకు, వికలాంగులకు, అవసరార్థులకు జుత్తు కత్తిరించడం, గడ్డం చేయడం, దేశంలో ఎక్కడ ఎవరికి అవసరమైనా రక్తం ఇవ్వడానికి నేరుగా తమ సొంత ఖర్చుతో వెళ్లడం, ప్రమాదాలలో గాయపడిన వారికి వైద్య సేవలందించడం ఇలా అనేక సేవా కార్యక్రమాలతో తమ సేవను విస్తృతం చేశారు. ఇలా ఇప్పటికీ రోడ్డు పక్కన ఉన్నవారికి దాదాపు 1500ల మందికి జుత్తు, గడ్డం కత్తిరించి అందంగా తీర్చిదిద్దారు. ఒక్కసారి చేసి వదిలేయడమే కాదు.. ప్రతి నెల చేస్తుంటారు. నగరంలో సగం.. నగరంలోని సగం ప్రాంతాల్లో ఈ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సికింద్రాబాద్ మదర్థెరిస్సా విగ్రహం, కిమ్స్ ఆసుపత్రి, రాణిగంజ్, బేగంపేట, ఉప్పల్క్రాస్ రోడ్, హబ్సీగూడ, మెట్టుగూడ, చిలకలగూడ చౌరస్తా, గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్, పద్మారావునగర్, పారడైజ్, పాట్నీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట, పంజాగుట్ట ఇలా నగరంలోని చాలా మేర ప్రాంతాల్లో పర్యటిస్తూ తమ సేవను కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతాలన్నింటిలో అన్నదానం చేస్తుంటారు. రామ్లక్ష్మణ్లు మెచ్చారు. శ్రీరాజమాత సేవా సొసైటీ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్న సినీ ఫైటర్స్ రామ్లక్ష్మణ్లు తమ వంతు సాయంగా వారు కూడా ముందుకొచ్చారు. సాయం చేయాలనే పెద్దమనసుతో అన్నదానానికి అవసరమైన మారుతీ ఓమ్నీ వాహనాన్ని కొనుగోలు చేసి వీరికి అందించారు. దీంతో ఈ సేవా సంస్థ సభ్యులు ఓమ్నీ వాహనం ద్వారా ప్రయాణించి అన్నదానం చేయడం, అనాథలకు, అభాగ్యులకు సేవ చేయడం చేస్తుంటారు. ఇక సోషల్ మీడియా ఆధారంగా తమ సేవకు సహకరించే వారి సాయం తీసుకుంటారు. అలాగని వీరు ఎవరి వద్ద నుంచి డబ్బులు ముట్టుకోరు. సేవకు అవసరమైన సామగ్రినే తీసుకుంటారు. అనాథ శవాలకు వీరే బంధువులు ఒక్కోసారి ప్రమాదం జరిగితే అలాంటి ఘటనలో తీవ్రంగా గాయపడిన వారుంటారు. కొందరు మృత్యువాత పడతారు. మరికొన్ని అగ్నిమాపక ఘటనల్లో బాధితులు మంటలకు తీవ్రంగా గాయపడి కాలిపోతారు. ఈ తరహా ఘటనల్లో ఈ సేవా సంస్థ సభ్యులు చురుగ్గా ముందుకొస్తారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన రాంరెడ్డి కొద్ది నెలల క్రితం ఇలానే అగ్నికి దాదాపు 85 శాతం గాయాలపాలయ్యాడు. అతన్ని కొందరు గాంధీ ఆసుపత్రి వద్దకు తీసుకొచ్చి వదిలివెళ్లారు. ఉదయ్రెడ్డి బృందం రంగంలోకి దిగి దాదాపు 15 రోజులపాటు బాధితుడికి సాయం అందించింది. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటన జరిగితే అక్కడి ఇన్స్పెక్టర్ విఠల్ రెడ్డి ఈ సేవా సంస్థకు సమాచారం అందిస్తారు. ప్రాథమిక చికిత్స, బాధితుల తరలింపు, మృతదేహాల తరలింపు ఇలాంటి అన్ని అంశాల్లో వీరి సాయం కూడా తీసుకుంటున్నారు. కాగా సొసైటీకి చెందిన ఉదయ్రెడ్డితోపాటు మనోజ్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, నవీన్, కీర్తన, అఖిల్, లక్ష్మీనర్సింహారెడ్డి, సాయినిహాల్లు ప్రాథమిక చికిత్సకు సంబంధించి శిక్షణ సైతం పొందారు. ప్రమాద ఘటనల్లో వీరే ప్రాథమిక సాయం అందిస్తారు. అభాగ్యులకు అండగా నిలవడానికే..: ఉదయ్రెడ్డి, అధ్యక్షుడు అభాగ్యులు, అనాథలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ఈ సంస్థను ప్రారంభించాం. తమ లక్ష్యసాధనలో చాలా మంది కలిసి వస్తున్నారు. సేవపై యువతలో మరింత ప్రోత్సాహాన్ని కల్పించడానికి వారంలో ఒకరోజు వివిధ కళాశాలలకు, పాఠశాలలకు వెళ్లి అక్కడ విద్యార్థులకు యువత, సమాజం, పెడదోవ పడితే కలిగే నష్టాలు, సామాజిక సేవ అంశాలపై అవగాహన కల్పిస్తాం. ఎవరూ అనాథలుగా చనిపోవద్దు. తమవారు లేక ఎవరూ వైద్యసేవలకు దూరం కావొద్దు.. ఆకలితో అలమటించవద్దు.. వీటినే నమ్మాం.. అందుకే ఆయా సేవలను అందిస్తున్నాం. వీటితోపాటు చదువుకు ప్రాధ్యాన్యమిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలకు అవసరమైన పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు ఇలా అవసరమైన ప్రతి సామగ్రిని ఈ సంస్థ అందజేస్తుంది. వారి చదువులకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. సేవకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఇందుకోసం వాట్సాప్ నంబర్ 9652752324లో సంప్రదిస్తే చాలని అంటున్నారు ఉదయ్రెడ్డి. -
రాణాప్రతాప్.. సేవలో టాప్!
కేపీహెచ్బీకాలనీ : ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా.. నిజం మరిచి నిదురపోకుమా.. మహాకవి శ్రీశ్రీ పాటను నిజం చేసి చూపిస్తున్నారాయన. స్వయంకృషితో ఎదిగి ఎదుటివారికి సహాయపడాలని చాటిచెబుతూ ఆచరణలో అమలుపరుస్తున్నారు ఓ మాజీ భద్రతా అధికారి. చిన్నతనంలో తాను చదువుకునేందుకు పడిన కష్టాలను గుర్తుంచుకొని.. ఉన్నత స్థానాలకు చేరుకున్నారాయన. కష్టాల కడలిలో సాగుతున్న పేద విద్యార్థులకు, వృద్ధులకు సహాయ, సహకారాలను అందిస్తున్నారు. సామాజిక సేవతో సాటివారిపై మానవతను చాటుతూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్నారు రాణాప్రతాప్. కూకట్పల్లిలోని వసంతనగర్ కాలనీలో నివాసముంటున్న రాణాప్రతాప్ ఐడీపీఎల్ సంస్థ భద్రతా విభాగంలో సేఫ్టీ ఎగ్జిక్యూటివ్గా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. అనంతరం లిబియాలోని పెట్రో కాంప్లెక్స్లో సేఫ్టీ కన్సల్టెంట్గా పనిచేశారు. హైదరాబాద్లోని ఓ రసాయన పరిశ్రమలో భద్రతా విభాగం మేనేజర్గానూ సేవలందించారు. పదవీ విరమణాంతరం ఖాళీగా ఉండకుండా తోటివారికి సహాయపడేందుకు ముందుకొచ్చారు. కార్మికుల భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలపై ఉచిత శిక్షణ, అవగాహన కార్యక్రమాలను తలపెట్టారు. వసంతనగర్కాలనీలో సుమారు 300 మందికి ఆసరా కార్డులను ఇప్పించారు. స్థానిక సంక్షేమ సంఘం కార్యదర్శిగా, సొసైటీ డైరెక్టర్గా మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేశారు. వీటితో పాటు అనాథలకు అండగా నిలిచేందుకు, అక్షరం, ఆహారం, ఆరోగ్యం పట్ల ప్రతిఒక్కరిలో అవగాహన పెంపొందించేందుకు తన పెన్షన్ డబ్బుల్లో నుంచి ప్రతినెలా ప్రత్యేకంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ‘సేవ్ ఏ లైప్, సేప్టీ ఫర్ హ్యుమానిటీ’.... రాణాప్రతాప్ ఓ స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి ఆరేళ్లుగా సేవలందిస్తున్నారు. ప్రతి ఏటా పేద అనాథ బాలలకు, విద్యార్థులకు ఉచితంగా దుస్తులు, పుస్తకాలు, బ్యాగ్లను, పాఠశాలలకు బెంచీలు అందజేస్తున్నారు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలలోని మహిళలకు చీరలు, కనీస అవసరాల కిట్స్, అన్నదానం, ఒంటరి వృద్ధులకు ఆసరా పథకం ద్వారా లబ్ధి చేకూర్చుతున్నారు. ఓ వికలాంగ ఉపాధ్యాయురాలికి నెలనెలా వేతనం అందిస్తున్నారు. రోడ్లపై నిద్రించే అనాథలు, పేదలకు ఉచితంగా రగ్గులు, ప్రమాదాల నివారణ, ఆరోగ్యం పట్ల శ్రద్ద, కుటుంబ సంక్షేమం తదితర అంశాలపై ప్రత్యేకంగా పుస్తకాలను ముద్రించి పంపిణీ చేస్తున్నారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా చేసిన కృషికి గుర్తింపుగా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పౌరసన్మానం పొందారు రాణాప్రతాప్. పేదలకు సేవ చేసేందుకు ఆర్థికస్థోమత ఉన్నవారు ముందుకు రావాలని ఆయన కోరుతున్నారు.