
జైలుకైనా వెళ్తా గానీ..
అవసరమైతే తాను జైలుకైనా వెళ్తాను గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
అవసరమైతే తాను జైలుకైనా వెళ్తాను గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన హైదరాబాద్లోని లోటస్పాండ్లో గల పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తాను టీడీపీలో చేరుతున్నట్లుగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలు కట్టు కథలేనని ఆయన అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతోనే తాను ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు.
టీడీపీ నేతలు తనకు పలు రకాలుగా ఆశలు చూపించారని, చివరకు కేసులు పెడతామంటూ బెదిరించారని తెలిపారు. అయితే తాను కేసులకు భయపడేది లేదని, జగన్ వెంటే నడుస్తానని అన్నారు. వైఎస్ జగన్ రాష్ట్రప్రజల కోసం జలదీక్ష చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం ధనదీక్ష చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అవినీతి వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారని ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు.