
ముగిసిన రెండో రోజు షర్మిల పరామర్శయాత్ర
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండోదశ రెండో రోజు పరామర్శయాత్ర ముగిసింది. యాత్రలో భాగంగా మంగళవారం మహబూబాబాద్ నియోజక వర్గంలోని నెల్లికుదురు, మహబూబాబాద్, గూడురు మండలాల్లో ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. ఈ రోజు 93 కిలో మీటర్ల మేర పర్యటించారు. షర్మిల వెంట పార్టీ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, కొండా రాఘవరెడ్డి, గట్టు శ్రీకాంత్ రెడ్డి, రవీందర్, మహేందర్ రెడ్డి తదితరులున్నారు.
తొర్రూరు నుంచి ప్రారంభమైన యాత్రలో మొదటగా నెల్లికుదురు మండలం ఎర్రబెల్లి గూడెం లోని కమ్మజర్ల సాయమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. తార్సింగ్బాయి తాండాలో గుగులోత్ బచ్చి కుటుంబాన్ని, చిన్నముప్పారంలో కె.వెంకట్రాం నర్సయ్య కుటుంబాన్ని, మహబూబాబాద్లో కర్రెయ్య కుటుంబాన్ని, గాంధీపురంలో షేక్ బికారి కుటుంబాన్ని, బ్రాహ్మణపల్లి లక్ష్మీపురంలోని ఆలకుంట్ల లక్ష్మయ్య కుటుంబాన్ని, చివరగా గూడూరు మండలం ఊట్లలోని సబావట్ మంగమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బబ్బి మనవడు, మనవరాలికి వైద్యం చేయిస్తానని భరోసా ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులకు ఉపాధి చూపుతానని షర్మిల హామీ ఇచ్చారు.