కాంగ్రెస్ - సీపీఐ మధ్య పొత్తు ఉందా లేదా అన్నది అనుమానంగా మారింది. తెలంగాణ ప్రాంతంలో ఈ రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే, పొత్తులో భాగంగా సీపీఐకి సీట్లు కేటాయించినట్లే కేటాయించిన కాంగ్రెస్ పార్టీ.. మళ్లీ అక్కడ తమ అభ్యర్థులను రెబెల్స్గా నిలబెట్టి, వారికి చివరకు బీ ఫారాలు కట్టబెట్టింది. పలు ప్రాంతాల్లో ఇలాగే జరిగింది. గతంలో మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహించిన మహేశ్వరం నియోజకవర్గాన్ని ఈసారి పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించారు.
అయితే అక్కడ సబిత ప్రోద్బలంతో మల్రెడ్డి రంగారెడ్డి రెబెల్గా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పలు దఫాలుగా మంతనాలు జరిపిన కాంగ్రెస్ నాయకులు, షరతులతో కూడిన బీ ఫారం ఆయనకు ఇచ్చినట్లు చెప్పారు. దీనిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో ఆయన శుక్రవారం నాడు భేటీ అయ్యారు. మహేశ్వరంలో మల్రెడ్డి రంగారెడ్డితో నామినేషన్ ఉపసంహరింపజేయాలని పొన్పాలను కోరారు. అయితే వీరిద్దరి చర్చల ఫలితం ఏమైందో మాత్రం ఇంకా తెలియరాలేదు.
కాంగ్రెస్ - సీపీఐ పొత్తు ఉన్నట్లేనా?
Published Fri, Apr 11 2014 1:05 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement