
మాయావతి విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రయాణిస్తున్న విమానం పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఎన్నికల ప్రచారం కోసం ఆమె అద్దెకు తీసుకున్నచార్టర్డ్ విమానం ల్యాండింగ్ సమయంలో దాని ముందు చక్రం స్ట్రక్ అయింది. బీఎస్పీ అధినేత్రి మహారాష్ట్రలో ప్రచారం ముగించుకుని తిరిగి లక్నో వస్తుండగా లక్నో విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో మాయావతితో పాటు ఆమె సన్నిహితుడు ఎస్.సి. మిశ్రా కూడా ఉన్నారు.
విమానం రన్వే సమీపంలోకి రాగానే ముందు చక్రం స్ట్రక్ అయ్యింది. దాన్ని సరిచేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. చివరకు బెల్లీ లాండింగ్ చేయించడానికి కూడా పైలట్ ప్రయత్నించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులను పైలట్ ఈ విషయమై అప్రమత్తం చేశారు. దీంతో ఒక్కసారిగా అగ్నిమాపక వాహనాలు, భద్రతా సిబ్బంది, అంబులెన్సు.. అన్నీ ఒక్కసారిగా రన్వే వద్దకు వచ్చేశాయి. అయితే, ఎలాగోలా పైలట్ మాత్రం సురక్షితంగా విమానాన్ని కిందకు దించగలిగారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.