
30న సీమాంధ్రలో నరేంద్ర మోడీ ప్రచారం
హైదరాబాద్: బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఈ నెల 30, వచ్చే నెల 1వ తేదీ రెండురోజుల పాటు సీమాంధ్రలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా ఈ సభల్లో పాల్గొననున్నారు. రెండురోజుల్లో మొత్తం ఆరు సభలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30న తిరుపతి, గుంటూరు, మే 1న మదనపల్లి, నెల్లూరు, భీమవరం, విశాఖపట్నం లలో సభలు నిర్వహించనున్నారు.
కొన్ని సభలకు జనసేన నాయకుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి. ఇలావుండగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాధ్సింగ్ ఈ నెల 28న సీమాంధ్రలో ఒక రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అయితే ఏ ఏ ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేసేదీ ఒకటిరెండు రోజుల్లో ఖరారవుతుందని బీజేపీ నేతలు తెలిపారు.