
కొత్త నీరు వచ్చి పాత నీరును తరిమి కొడుతుంది. కొత్త ఎస్.ఐ. వచ్చి పాత కేసుల భరతం పడతాడు. ఇది ఆనవాయితీ!
వరంగల్లోని పరకాల టౌన్.పోలీస్ స్టేషన్లో కొత్తగా చార్జ్ తీసుకున్న ఎస్.ఐ. మల్లేశ్కు వెంటనే హ్యాండిల్ చేయాల్సిన కేసులు కనిపించలేదు.‘పాత కేసుల ఫైల్స్ పట్రా’ అన్నాడు ఆ ఉదయం టీ చప్పరిస్తూ.హెడ్కు తెలుసు అలా జరుగుతుందని. అతడు తన సర్వీస్లో చాలామంది ఎస్.ఐ.లను చూశాడు. పరిచయాల తరువాత పాత ఫైల్స్ తీసుకువచ్చాడు హెడ్.టీ తాగుతూ పెండింగ్ ఫైల్స్ను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు ఎస్.ఐ. ఓ రాబరీ కేసు అతని దృష్టిని ఆకర్షించింది.‘ఇది అన్నల కేసు సార్. మూసేసి రెండేళ్లవుతోంది’ అన్నాడు హెడ్డు.కాని కేసు ఇంట్రస్టింగ్గా ఉంది. డీటెయిల్స్ అన్నీ చదివాడు.‘అసలేం జరిగింది’ అడిగాడు హెడ్ని.‘రెండున్నరేళ్ల క్రితం అన్నలమంటూ చెప్పుకున్న కొందరు వ్యక్తులు చేసిన దోపిడీ సార్’ అన్నాడు హెడ్డు.‘అంటే.. నిజంగా అన్నలు కాదా?’ ‘ఏమో సార్..! ఓసారి అన్నలంటారు. మరోసారి కాదంటారు. ఎవిడెన్స్ సరిగా లేకపోవడంతో కేసు అటకెక్కింది.’ ఎస్.ఐ. తల పంకించాడు.‘ఓసారి బాధితుడిని పిలిచి మాట్లాడదాం’ అన్నాడు ఎస్.ఐ.
అతని వయసు యాభై ఉంటాయి. డబ్బు బాగా ఉన్నా బయటికి తెలియనివ్వని మనుషులు కొందరుంటారు. అతను కూడా అలాగే ఉన్నాడు. కూచుని ఎస్.ఐ.వైపు చూస్తున్నాడు.‘అంత డబ్బు పోగొట్టుకున్నారు. కేసు గురించి మీరు ఎందుకు ఫాలో అప్ చేయలేదు. కేసు మూసేసినా ఎందుకు పట్టించుకోలేదు’ అడిగాడు ఎస్.ఐ.‘పోయింది డబ్బే కదా సార్. ప్రాణాలు పోయి ఉంటే వచ్చి ఉండేవా? అసలే అన్నలతో వ్యవహారం. అందుకే వదిలేశాను. మీరూ వదిలేస్తే మంచిది’ అన్నాడతను.‘నాకెందుకో ఇది దొంగల పనే అనిపిస్తోంది’ అన్నాడు ఎస్.ఐ. ‘లేదు సార్. కచ్చితంగా చెప్పగలను. ఇది ముమ్మాటికీ అన్నల పనే’ అంటూ ఏం జరిగిందో చెప్పడం మొదలుపెట్టాడతను.‘నా పేరు పట్టాభిరాం. మాది ధాన్యం బిజినెస్. చుట్టుపక్కల ఊళ్లలో ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు అమ్ముతుంటాను. ఆ రోజూ ఎప్పటిలాగే చీకటిపడుతుండగా డబ్బులున్న బ్యాగ్తో ఇంటికి వచ్చాను. అర్ధరాత్రి మా ఇంటి తలుపు చప్పుడైంది. ఎవరై ఉంటారా అనుకుంటూ వెళ్లి తీశాను. ముసుగులు వేసుకున్న నలుగురు వ్యక్తులు నన్ను తోసుకుంటూ ఇంట్లోకి చొరబడ్డారు. తాము అన్నలమని, ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపుతామని బెదిరించారు. చితకబాది కుర్చీకి కట్టేశారు. మా ఇంట్లో వాళ్లందరినీ కొట్టి, నోట్లో గుడ్డలు కుక్కి మరో గదిలో బంధించారు. డబ్బు, నగలు ఎక్కడున్నాయో నా చేతే చెప్పించి తీసుకున్నారు. వారు కొట్టిన దెబ్బలు మామూలుగా లేవు. నా రెండు చేతులూ విరిగాయి. అడుగు తీసి అడుగేసేందుకు వారం పట్టింది.ముందు నేను పోలీసులకు చెప్పలేదు. నా ఒంటిపై దెబ్బలు చూసిన డాక్టర్ కేసు ఫైల్ చెయ్యందే వైద్యం చేయలేమని తేల్చి చెప్పారు. గత్యంతరం లేక ఫిర్యాదు చేయాల్సి వచ్చింది’ అన్నాడతను. ‘నగలు, డబ్బుతో పాటు ఇంకేమన్నా తీసుకెళ్లారా’? ‘నా మొబైల్ ఫోన్ తీసుకెళ్లారు’ ‘ఇక మీరు వెళ్లొచ్చు’ అనడంతో వెళ్లిపోయాడు పట్టాభి.
‘నేను చెప్పాను కదా సార్. ఇది అన్నల పనే. అందుకే కనీసం వారిని గుర్తించలేకపోయాం. ఒకవేళ గుర్తించగలిగినా వారు తెలంగాణ బోర్డర్ దాటి ఎప్పుడో ఏ ఛత్తీస్ఘడ్లోకో లేదా ఒడిశా అడవుల్లోకో వెళ్లి ఉంటారు. వారిని పట్టుకోవడం దాదాపుగా అసాధ్యం’ అంటూ నిట్టూర్చాడు హెడ్.‘ఈ పనులు అన్నలు చేయలేదు’ అన్నాడు ఎస్.ఐ.‘అన్నలు చేసి ఉంటే తప్పక ఓన్ చేసుకుని ఉండేవారు. కారణం చెప్తూ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి ఉండేవారు. సెల్ఫోన్ తీసుకెళితే ట్రేస్ అవుతారు కనుక సెల్ తీసుకెళ్లి ఉండేవారు కాదు. చిన్న బెదిరింపుకు వచ్చే డబ్బు కోసం అర్ధరాత్రి దాడి చేసి అంత తీవ్రంగా కొట్టాల్సిన పని కూడా లేదు. పైగా ఆడవాళ్లను కొట్టడం స్ట్రేంజ్. ఇవన్నీ క్లూస్గా పరిగణించలేదా?’ అన్నాడు ఎస్.ఐ.హెడ్ మౌనం దాల్చాడు.‘వాళ్లు తీసుకెళ్లిన మొబైల్ ఫోన్ ఐ.ఎమ్.ఇ.ఐ. ద్వారా లొకేట్ చేయడానికి ట్రై చేయలేదా’ అడిగాడు ఎస్.ఐ.‘చేశాం సార్. కానీ దొరకలేదు’ అన్నాడు నిరాశగా.‘ఆ ఫోన్ని మళ్లీ అబ్బర్వేషన్లో పెట్టండి’ క్యాప్ తలమీద పెట్టుకొని కుర్చీలోంచి లేస్తూ ఆర్డర్ వేశాడు ఎస్.ఐ.
రెండు వారాలు గడిచాయి..ఓ రోజు హెడ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఎస్.ఐ.కి ‘ఫోన్ ఆన్ అయింది సార్’ విషయం చెప్పాడు.‘లొకేషన్ ఎక్కడ చూపిస్తుంది’? ‘పట్టాభి ఇంటి సమీపంలోనే’ సమాధానిమిచ్చాడు హెడ్.‘ట్రేస్ చేసి, ఆ ఫోన్ వాడుతున్నదెవరో పట్టుకురండి’ అన్నాడు.అరగంటలో ఆ సెల్ వాడుతున్న కుర్రాడిని పట్టుకొచ్చారు పోలీసులు.ఎంత ప్రశ్నించినా ఆ కుర్రాడు సెల్ తనదే అని చెబుతున్నాడు.దీంతో తమదైన శైలిలో ప్రశ్నించారు పోలీసులు.‘ఇది మా బావది. అటక మీద దొరికింది. నా ఫోన్ పగిలితే, ఇవాళే చార్జింగ్ పెట్టి నా సిమ్ వేశాను’ అసలు విషయం చెప్పాడు ఆ కుర్రాడు.ఎస్.ఐ. తలెత్తి చూడగానే హెడ్కి అర్థమై బయల్దేరాడు.సాయంత్రానికి ఆ కుర్రాడి బావను కూడా పట్టుకొచ్చారు. విచారణలో విషయం మొత్తం బయటికి వచ్చింది.
వారు నలుగురు కుర్రాళ్లు. పేర్లు విక్రమ్, కాశీ, సుబ్బు, గణేష్లు. రెండున్నర ఏళ్ల క్రితం అంటే ఈ దోపిడీ జరిగిన నాటికి వాళ్లు చదువులు పూర్తిచేసి ఖాళీగా ఉండేవారు. వీధిలో పనీ పాటా లేకుండా పిట్టగోడ మీద కూర్చున్న వీరికి ఓ రోజు పట్టాభి కనిపించాడు. ఎప్పుడూ సాయంకాలం పూట డబ్బు బ్యాగ్తో ఇంటికి వెళ్లే పట్టాభిని గమనించడం మొదలెట్టారు.‘మీలో ఎవరికైనా నాతో బ్యాంకాక్ ట్రిప్కు రావాలని ఉందా?’ అని అడిగాడు విక్రమ్.మిగిలిన ముగ్గురూ ‘ఉంది’ అని జవాబు చెప్పారు ఉత్సాహంగా!‘అయితే నేను చెప్పినట్టుగా వినాలి. పట్టాభిని దోచుకోవాలి’ అన్నాడు. ముగ్గురికీ భయం వేసింది.‘దొరికిపోతాం’ అన్నాడొకడు.‘దొరకం. ఈ ఏరియాలో అన్నల ప్రభావం ఉంది కాబట్టి, దొంగతనం వారి పేరు మీద పోయేలా ప్లాన్ చేద్దాం’ అన్నాడు.అనుకున్న విధంగా ముసుగులు వేసుకొని పట్టాభి ఇంట్లో చొరబడ్డారు. ఇంటిల్లిపాదినీ కొట్టి, అన్నలమని బెదిరించి డబ్బు, నగలు దోచుకుపోయారు. పోలీసులకు ఫోన్ చేస్తాడేమోనని వస్తూ వస్తూ పట్టాభి వద్ద నుంచి ఫోన్ని కూడా తీసుకొచ్చారు. నలుగురు కలిసి డబ్బు, నగలు పంచుకున్నారు. ‘ఈ విషయం ఇక్కడితో మర్చిపోండి. ఊళ్లో కూడా ఉండొద్దు. అందరం ఉద్యోగాల పేరుతో వేరే ప్రాంతాలకు వెళ్లిపోదాం’ అన్నాడు విక్రమ్. అంతా అతను చెప్పింది తు.చా తప్పకుండా పాటించారు. బ్యాంకాక్ ట్రిప్కు కూడా వెళ్లొచ్చారు.పట్టాభి ఫోన్ తెచ్చిన కాశీ మొదట దాన్ని పగలగొట్టి ఎక్కడైనా విసిరేయాలని అనుకున్నాడు. వీలు కాకపోవడంతో స్విచ్ఛాఫ్ చేసిన అటక మీదకు విసిరేశాడు. ఆ తర్వాత రోజులు గడిచిపోయాయి. ఫోన్ విషయం మర్చిపోయాడు. బావమరిది కుర్రాడు దానిని బయటకు తీసి ఆన్ చేయడంతో బండారం బయటపడింది.’అది సార్ జరిగింది’ అన్నాడు కాశీ. ‘సో. మాస్టర్ మైండ్ విక్రమ్ ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నాడు’? అడిగాడు ఎస్.ఐ.‘ఇప్పుడెక్కడున్నాడో తెలియదు సార్! దొంగతనం తరువాత ఇంతవరకూ ఎవరమూ కలుసుకోలేదు’ అన్నాడు కాశీ. హెడ్వైపు తిరిగి ‘విక్రమ్ ఎక్కడున్నాడో వెంటనే తెలుసుకోండి’ ఆర్డర్ వేశాడు ఎస్.ఐ.
‘వ్వాట్... విక్రమ్ దొరకలేదా? వాళ్ల ఇంట్లో ఎవర్నైనా పిలిపించండి’ అన్నాడు ఎస్.ఐ. కోపంగా. మాస్టర్ మైండ్ దొరికినట్టే దొరికి, తప్పించుకోవడంతో కోపం నషాళానికెక్కింది .మరికాసేపట్లో విక్రమ్ తండ్రి వచ్చాడు.‘సార్... మావాడు ముందు నుంచీ నా అదుపులో లేడు. ఆవారాగా తిరిగేవాడు. ఎన్నోసార్లు దండించాను. కాని దారిలోకి రాలేదు. సడన్గా హైదరాబాద్కు వెళ్లి జాబులో చేరాడు. చేరిన రెండు నెలలకే రిజైన్ చేసి లండన్ వెళ్లాడు. విక్రమ్ క్లాస్మేట్ కమ్ గర్ల్ఫ్రెండ్ లండన్లో ఉంది. అక్కడే ఉండొచ్చు’ చెప్పాడు విక్రమ్ తండ్రి.కాశీతో పాటు మిగతా ఇద్దరు స్నేహితులను పిలిపించారు పోలీసులు. ఆ ముగ్గురిని అరెస్టు చేసి జైలుకు పంపారు పోలీసులు. చోరీ సొత్తును రికవరీ చేసి బాధితుడికి అందించారు. లండన్లో ఉన్న విక్రమ్ని రప్పించే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. క్లోజ్ చేసిన పాత కేసును ఓపెన్ చేసి, ఛేదించడంతో ఎస్.ఐ మల్లేశ్, అతని టీమ్కు డిపార్ట్మెంట్లో ప్రశంసలు వెల్లువెత్తాయి.
– అనిల్ భాషబోయిన
Comments
Please login to add a commentAdd a comment