
కేకులు..పిజ్జా బర్గర్లతో రోజులు గడిపేస్తూంటే.. కొంచెం జాగ్రత్త. ఈ జంక్ఫుడ్ మీ ఒంటికే కాదు.. మనసుకూ చేటు చేస్తుందని హెచ్చరిస్తున్నారు మాంఛెస్టర్ మెట్రోపాలిటన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. కొలెస్ట్రాల్, సంతప్త కొవ్వులు పిండిపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మనో వ్యాకులత (డిప్రెషన్) వచ్చే అవకాశాలు 40 శాతం వరకూ పెరుగుతాయని వీరు జరిపిన అధ్యయనం ఒకటి చెబుతోంది. పదహారేళ్ల నుంచి 72 ఏళ్ల మధ్యవయస్కులు దాదాపు లక్ష మందిపై జరిగిన పదకొండు అధ్యయనాల ఫలితాలను విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాక వచ్చినట్లు ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త స్టీఫెన్ బ్రాడ్బర్న్ తెలిపారు.
అమెరికాతోపాటు యూరప్, ఆస్ట్రేలియా, మధ్యాప్రాచ్య దేశాల్లోని స్వచ్ఛంద కార్యకర్తలతో ఈ అధ్యయనం జరిగిందని మనోవ్యాకులత లేదా దాని లక్షణాలు ఉన్న వారి ఆహారపు అలవాట్లను సేకరించి.. అవి శరీరంలో మంట/వాపు కలిగించేందుకు ఉన్న అవకాశం ఆధారంగా ఒక సూచీ సిద్ధం చేశామని వివరించారు. సూచీలో ఎక్కువ స్థాయిలో ఉన్న వారు వారి వయసు, ప్రాంతాలతో సంబంధం లేకుండా జంక్ఫుడ్ తీసుకుంటున్నట్లు స్పష్టమైందని అన్నారు. డిప్రెషన్కు సరికొత్త ఆహారం ఆధారంగా చికిత్స పద్ధతులను అభివద్ధి చేసేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ పరిశోధన వివరాలు క్లినికల్ న్యూట్రీషన్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment