హైబీపీ, డయాబెటిస్‌ ఉన్నాయా..? కిడ్నీ పరీక్షలు తప్పనిసరి | Kidney Disease Special Story | Sakshi
Sakshi News home page

మీకు హైబీపీ, డయాబెటిస్‌ ఉన్నాయా...?

Published Thu, Aug 29 2019 8:32 AM | Last Updated on Thu, Aug 29 2019 8:32 AM

Kidney Disease Special Story - Sakshi

మన శరీరంలో మూత్రపిండాలను (కిడ్నీలను) చాలా సంక్లిష్టమైన అవయవాలుగా  చెప్పుకోవచ్చు. అవి శరీరంలోని విషతుల్యమైన పదార్థాలను మూత్రం ద్వారా వడపోస్తాయి. హార్మోన్లను, ఎంజైములను కూడా విడుదల చేస్తుంటాయి. చిక్కుడు గింజ ఆకారంలో ఉండే మూత్రపిండాల్లో ఎడమవైపుది కొంచెం పెద్దగా కుడివైపు దానికంటే కొంచెం ఎగువగా ఉంటుంది. దాదాపు 150 గ్రాముల వరకు బరువుండే మూత్రపిండాలు 11–14 సెం.మీ పొడవు, 6 సెం.మీ వెడల్పు, 4 సెం.మీ మందంగా ఉంటాయి. రక్తంలోని వ్యర్థాలను తొలగించడంలో కిడ్నీలది ప్రధాన పాత్ర.అధిక రక్తపోటు (హైబీపీ), మధుమేహం (డయాబెటిస్‌)తో బాధపడేవారికి మూత్రపిండాలు వైఫల్యం చెందే ప్రమాదం ఎక్కువ. కాబట్టి ఎప్పటికప్పుడు కిడ్నీ ఫంక్షన్‌ టెస్టులు చేయించుకుంటూ ఉండటం తప్పనిసరి.మూత్రపిండాలకు సంబంధించి నాలుగు రకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి.

1 కిడ్నీ ఇన్ఫెక్షన్స్‌
2 కిడ్నీ స్టోన్స్‌
3 కిడ్నీ ఫెయిల్యూర్‌
4 కిడ్నీ ట్యూమర్స్‌ అండ్‌ క్యాన్సర్స్‌

మహిళల్లో ఎక్కువగా కనిపించే బ్యాక్టీరియల్‌ యూరినరీ ఇన్ఫెక్షన్స్‌ కిడ్నీలకు వరకు పాకి ఇన్ఫెక్షన్లకు గురిచేస్తుంటాయి. యాంటీబయాటిక్‌ కోర్సులతో ఈ సమస్య తొలగిపోతుంది.
పురుషుల్లో ఎక్కువగా కనిపించే మూత్రపిండాల్లో వచ్చే రాళ్లలో అనేక రకాలుండటంతో పాటు ఇసుకరేణువు పరిమాణం దగ్గర్నుంచి గోల్ఫ్‌బాల్‌ సైజు వరకూ ఉంటాయి. తీవ్రమైన నొప్పి, బాధను కలిగించే ఈ రాళ్లకు సైజును బట్టి అనేక రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
అధిక బరువు, పొగతాగడం, మద్యం, రక్తపోటు, చక్కెరపాళ్లు అదుపులో లేకపోవడం వల్ల ఆ దుష్ప్రభావాలతో కిడ్నీలు విఫలమైనప్పుడే కిడ్నీ సమస్యల లక్షణాలు బయటపడుతుంటాయి. కాబట్టి దీన్ని ఒక సైలెంట్‌ డిసీజ్‌గా చెప్పుకోవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్‌కు డయాలసిస్, కిడ్నీ మార్పిడి (ట్రాన్స్‌ప్లాంటేషన్‌) చికిత్స పద్ధతులు తప్పనిసరి.
పుట్టుకతో వచ్చే కిడ్నీ సమస్యల్లో పిల్లలకు స్నానం చేయించేటప్పుడు లేదా డాక్టర్‌ దగ్గరకు చెకప్స్‌ కోసం వెళ్లినప్పుడు కణుతులు బయటపడుతుంటాయి. కణితి పరిమాణాన్ని బట్టి మూత్రంలో రక్తం, కడుపునొప్పి, జ్వరం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, అజీర్ణం, అధిక రక్తపోటు వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. నెఫ్రోబ్లాస్టోమా  లేదా విల్మ్స్‌ ట్యూమర్స్‌గా చెప్పకునే మూత్రపిండాల్లో కణుతులు పిల్లల్లో 4, 5 ఏళ్ల వయసులో బయటపడుతుంటాయి. అబ్బాయిల్లో కంటే అమ్మాయిల్లో ఎక్కువగా కనిపించే ఈ కణుతులను పూర్తిగా నయం చేయడం సాధ్యమే.

ప్రమాదకరమైన కణుతులు
రీనల్‌సెల్‌ కార్సినోమా (ఆర్‌సీసీ) అనే ఒక రకం కణితి పెద్ద వయసులో కనిపిస్తూ ఉంటుంది. ఊపిరితిత్తులకు, ఇతర భాగాలకు వ్యాపించే గుణం ఈ క్యాన్సర్‌కు ఎక్కువ. ఒక్కొక్కసారి ఇలా వ్యాప్తిచెందిన (మెటాస్టాసిస్‌ అయిన) భాగాల ద్వారా కూడా ఈ క్యాన్సర్‌ను గుర్తించడం జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి రెండు మూత్రపిండాలలో కూడా ఈ కణుతులు ఉండవచ్చు. అనేక సబ్‌టైపులలో ఉండే ఈ క్యాన్సర్‌ ఇతర కిడ్నీ సంబంధిత పరీక్షలతో, ఆల్ట్రాసౌండ్‌ వంటి పరీక్షలతో కనుగొనడం జరుగుతుంది. వయసు పైబడే కొద్దీ ఈ క్యాన్సర్‌ పెరిగే అవకాశం ఎక్కువ. అయితే పొగతాగే అలవాటు ఉన్నవారిలో చాలా చిన్నవయసు వారిలోనే ఈ క్యాన్సర్‌ నమోదవుతున్నట్లు అనేక అధ్యయనాలు / సర్వేలు తెలుపుతున్నాయి. అందుకే ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి పట్టణాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. పొగతాగడం, మద్యం అలవాటు ఉండటం, అధిక బరువు వంటి వాటితో పాటు జన్యుపరివర్తనాలు (జీన్‌ మ్యుటేషన్స్‌) కూడా ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారకాలు అవుతాయి.

పరీక్షలు
లక్షణాలు కనిపించనప్పుడు శారీరక పరీక్షలు చేయడం (ఫిజికల్‌ ఎగ్జామ్స్‌), రక్తపరీక్షలు (బ్లడ్‌ టెస్ట్స్‌), మూత్రపరీక్షలు (యూరిన్‌ టెస్ట్స్‌), ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్, ఎమ్మారై, క్యాల్షియమ్‌ లెవెల్స్‌ తెలిపే పరీక్షలతో పాటు, ఒక్కోసారి ఈ క్యాన్సర్‌ బయటపడే సరికే ఊపిరితిత్తులకు, ఎముకలకు క్యాన్సర్‌ పాకి ఉండవచ్చు. కాబట్టి డాక్టర్లు ఛాతీ ఎక్స్‌రేతో పాటు బోన్‌స్కాన్స్‌ కూడా చేయిస్తూ ఉంటారు.

చికిత్స  
కిడ్నీ మొత్తంగా తీసేయాల్సిన శస్త్రచికిత్సతో పాటు క్యాన్సర్‌ రకాన్ని బట్టి కీమో, రేడియో థెరపీలను ఇస్తారు. కిడ్నీలనిప్పుడు లాపరోస్కోపిక్‌ పద్ధతిలోనూ తొలగిస్తున్నారు. క్యాన్సర్‌ కాని కణుతులకు కూడా సైజుని బట్టి రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ కణుతులు ఎక్కువగా ఉన్నా లేదా మూత్రపిండాలలో చాలా పెద్దగా ఉన్న సందర్భాల్లో కూడా కిడ్నీలను తొలగించాల్సి రావచ్చు.
కిడ్నీ ట్యూమర్‌ స్టేజ్‌ మీద ఆధారపడి శస్త్రచికిత్సని మూడు రకాలుగా చేస్తూ ఉంటారు.
రాడికల్‌ నెఫ్రోక్టమీ: ఎక్కువగా చేసే ఈ సర్జరీలో మూత్రపిండంతో పాటు అడ్రినల్‌ గ్లాండ్స్, లింఫ్‌ నాళాలలను, కణజాలాన్ని మొత్తంగా తీసివేయడం జరుగుతుంది. కణితి పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సర్జరీని చేస్తారు.

సింపుల్‌ నెఫ్రొక్టమీ: స్టేజ్‌ – 1 : కిడ్నీ క్యాన్సర్‌కు ఒక్క మూత్రపిండాన్ని మాత్రమే తీసివేయడం జరుగుతుంది.

పార్షియల్‌ నెఫ్రోక్టమీ: పుట్టు్టకతో ఒకే ఒక మూత్రపిండం ఉండి, దానిలో కణితి కనిపించినప్పుడు, కణితి ఉన్నంత వరకు మాత్రమే తీసివేయడం జరుగుతుంది.
ఒక్కోసారి రెండు మూత్రపిండాల్లోనూ కణుతులు ఏర్పడినప్పుడు కూడా ఇలా కణుతులు ఉన్నంత మేరకు మాత్రమే వాటిని తీసేయడం జరుగుతుంది.
కణితిని తొలిదశలోనే గుర్తించి, ఒక్క మూత్రపిండాన్ని మాత్రమే తొలగించినప్పుడు, శస్త్రచికిత్స అయిన కొద్దిరోజుల్లోనే వారు సాధారణ జీవితాన్ని గడపగలుగుతారు. రెండు మూత్రపిండాలను తీసేసినా, ఒక్కటి తీసేశాక రెండోది సరిగా పనిచేయకపోయినా వారికి డయాలసిస్‌ చేస్తూ, వీలైనంత త్వరగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించాల్సి ఉంటుంది.
చికిత్స అయిపోయిన తర్వాత కూడా ఫాలో అప్‌ తప్పనిసరి. సీటీ స్కాన్, ఛాతీ ఎక్స్‌రే వంటి పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకుంటూ ఉండాలి.
మూత్రంలో రక్తం కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా ఉండటంతో పాటు పొగతాగడం, మద్యం వంటి అలవాట్లు ఉంటే వాటికి దూరంగా ఉంటుండటం వల్ల మూత్రపిండాలను కొంతవరకైనా కాపాడుకోగలిగిన వారమవుతాం.
Dr. Ch. Mohana Vamsy
Chief Surgical Oncologist
Omega Hospitals, Hyderabad
Ph: 98480 11421,
Kurnool 08518273001

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement