
దేశంలో ఎక్కడా లేనివిధంగా ఉద్యమాల ద్వారా రాష్ట్రాన్ని సాధించుకుని అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఆ ఉద్యమాలను దెబ్బతీయడానికి ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపుతోంది. ఇటీవల ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మరోసారి ఉద్యమించిన మందకృష్ణ మాదిగను అరెస్టు చేసి జైళ్లో పెట్టడం యావత్ సమాజాన్ని నివ్వెరపర్చింది. ఉద్యమాలు చేస్తే జైళ్లో పెడతారా అని ప్రజల్లో చర్చ మొదలైంది.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన మందకృష్ణపై కేసీఆర్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణి అవలంబించడం దారుణం. ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో మరణించిన భారతి మృతికి నివాళులు అర్పించేం దుకు నిర్వహించిన అమరవీరుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు మందకృష్ణ మాదిగను అరెస్టు చేసి పలుకేసులు నమోదు చేసి జైలుకెళ్లేలా చేశారు.
ఉద్యమంతోనే రాష్ట్రాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం అదే ఉద్యమాలను అణగదొక్కాలని చూడడం సహేతుకం కాదు. తెలంగాణ రాష్ట్రం రావడానికి ఈ ఉద్యమాలే కారణం అనే విషయం కేసీఆర్ మర్చిపోయారా లేక తాను మాత్రమే ఉద్యమాలు చేయాలి. ఇతరులెవరికీ ఆ హక్కు లేదని భావిస్తున్నారా? తెలంగాణ సాధించడం ద్వారా ఉద్యమకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న సీఎం కేసీఆర్ చివరకు ఆ ఉద్యమాల పట్ల అణచివేత ధోరణితో వ్యవహరించడం మంచిది కాదు.
– ఇ. చంద్రశేఖర్, సీనియర్ పాత్రికేయులు ‘ 98488 22333
Comments
Please login to add a commentAdd a comment