
రైతాంగం పేదరికం నుంచి బయటపడాలి
--సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ లో గవర్నర్
హైదరాబాద్సిటీ: నాణ్యమైన కూరగాయల నారును సబ్సీడిపై రైతులకు సరఫరా చేసి అధిక దిగుబడులు సాదించడంపై రాష్ట్ర గవర్నర్ శ్రీ ఈ. ఎస్. ఎల్. నరసింహన్ హర్షం వ్యక్తం చేసారు. సోమవారం జీడిమెట్ల లోని సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీని కుటుంబ సమేతంగా సందర్శించిన రాష్ట్ర గవర్నర్కు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు సంప్రదాయ పంటలతో సరియైన లాభాలు రావడంలేదన్నారు. సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ తో రాష్ట్రంలో నీటి పారుదల క్రింద సేద్యం పెరుగుతుందన్నారు. ఉధ్యాన పంటల రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు సాగు లో ఇటువంటి నూతన పద్దతులు పాటించాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రైతాంగం అధిక దిగుబడులతో లాభాలు అర్జించి పేదరికం నుంచి బయటపడాలని ఆశాభావం వ్యక్తం చేసారు. పాలీహౌస్ లలో పంటల సాగు, డ్రిప్, స్ప్లింకర్ ల ద్వారా నీటి నియంత్రణ, ఉష్ణోగ్రత నియంత్రణ, నాణ్యమైన నారు మొక్కల పెంపకం వంటి అంశాలపై మంత్రిని, ఉధ్యాన శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పేద, సన్నకారు రైతులకు దెశంలోనే అత్యధిక సబ్సిడిపై సూక్ష్మ, బిందు సేద్య పరికరాలను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి గవర్నర్ కు వివరించారు. పూలు, కూరగాయల ఉత్పత్తిలో అత్యాధునిక పద్దతులను సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీలో ఏర్పాటు చేసామని తద్వారా రైతులు అనుభవపూర్వకంగా తెలుసుకొని సాగు చేస్తున్నారని మంత్రి గారు గవర్నర్ కు తెలిపారు.సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీలోని అన్ని పాలీహౌస్ లను, సాగులో ఉన్న కూరగాయాలు, పండ్ల సాగునూ గవర్నర్ పరిశీలించారు. దేశంలోనే అత్యంత అధునాతన టెక్నాలజి, నూతన పద్దతులలో పండ్లు, కూరగాయాలను సాగు చేయడంపై గవర్నర్ అభినందించారు. రైతులకు అధిక ఆధాయాన్ని సమకూర్చే ఉధ్యాన పంటలని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి పోచారం గవర్నర్ కు వివరించారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి, రాష్ట్ర ఉద్యాన శాఖ కమీషనర్ ఎల్. వెంకట్ రామ్ రెడ్డి, ఉద్యాన శాఖ అధికారులు మధుసూదన్, బి. బాబు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.