
ఆ కులాలను బీసీల్లో చేర్చండి
బీసీ కమిషన్ను కోరిన ఎంపీ అసదుద్దీన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో దశాబ్దాలుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న పలు కులాలను బీసీల్లో చేర్చాలని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బీసీ కమిషన్ను కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం ఒవైసీ మాట్లాడుతూ.. అహిర్ యాదవ, గవిలి, సారోల్లు తదితర కులాల వారంతా ఆర్థిక, సామాజికంగా వెనకబడి ఉన్నారన్నారు. ఈ కులాలను బీసీల్లో కలిపి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను అందించాలన్నారు.
అంతకుముందు సంచార కులాలకు చెందిన ప్రతినిధులు బీసీ కమిషన్ను కలసి తమ వాదనలు వినిపించారు. బాగోతుల, బొప్పల, శ్రీక్షత్రియ రామజోగి, ఓడ్, గౌలి, బైలుకమ్మర, కాకిపడిగల, సాధనాశూరుల, తెరచీరల కులాల ప్రతినిధులు తమను డీఎస్టీ (డీనోటిఫైడ్ ట్రైబ్స్) కేటగిరీగా పరిగణించాలన్నారు. ఎంబీసీల్లో చేర్చితే ఫలాలు అందవని అన్నారు. దీనిపై స్పందించిన ఆ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు పూర్తిస్థాయిలో పరిశీలన చేపట్టిన తర్వాత నిర్ధారిస్తామని హామీ ఇచ్చారు.