సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈసారి కూడా భారీగా సీట్లు తగ్గనున్నాయి. ఈ మేరకు యూనివర్సిటీలు చేపట్టిన కసరత్తు పూర్తికావచ్చింది. అనుబంధ గుర్తింపు జాబితాలను ప్రవేశాల కౌన్సెలింగ్ కోసం వర్సిటీలు సిద్ధం చేస్తున్నాయి. జేఎన్టీయూ పరిధిలోని కాలేజీల్లోనే అత్యధికంగా సీట్లకు కోత పడే పరిస్థితులు ఉన్నట్లు ఉన్నత విద్యా మండలి అంచనా వేస్తోంది. జేఎన్టీయూ పరిధిలో 10 వేల వరకు సీట్లకు కోత పడే అవకాశం ఉందని పేర్కొంటోంది.
కొన్ని కాలేజీల్లో ల్యాబ్లు లేకపోయినా కోర్సులను నిర్వహిస్తున్న కాలేజీలు ఉన్న ట్లు జేఎన్టీయూ తన ఫాక్ట్ ఫైండింగ్ కమిటీల (ఎఫ్ఎఫ్సీ) తనిఖీల్లో తేల్చింది. మరో 36 కాలేజీల్లో ఫ్యాకల్టీ సమస్య అధికంగా ఉన్నట్లు అంచనాకు వచ్చింది. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫె సర్లు లేకున్నా ఆయా కాలేజీలు కోర్సులను నిర్వహిస్తున్నట్లు తేల్చింది. దీంతో ఆ మేరకు సీట్లకు కోత విధించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. మరోవైపు ఇప్పటికే 14 కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతులు నిరాకరించడంతోపాటు 10,122 సీట్లకు కోత విధించింది.
గతేడాది 27 వేల సీట్లకు కోత..
2017–18 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 212 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1.24 లక్షల సీట్ల భర్తీకి ఏఐసీటీఈ అనుమతి ఇచ్చినా.. జేఎన్టీయూ సహా యూనివర్సిటీలు 97,961 సీట్ల భర్తీకి అనుబంధ గుర్తింçపు ఇచ్చాయి. ఈసారి ఏఐసీటీఈ 10,122 సీట్లను తగ్గించిన నేపథ్యంలో యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చే సీట్ల సంఖ్య గతేడాది కంటే భారీగా తగ్గిపోయే పరిస్థితి నెలకొంది.
పైగా వరుసగా మూడేళ్లలో 25 శాతం లోపు సీట్లు భర్తీ అయిన బ్రాంచీలను రద్దు చేస్తామని ప్రకటించడంతో భారీగా సీట్లు తగ్గిపోయే అవకాశం ఉంది. అయితే గతంతో పోల్చితే కాలేజీలు చాలా వరకు తమ లోపాలను సరిదిద్దుకున్నాయని, అయినప్పటికీ ఇంకా కొన్ని కాలేజీల్లో లోపాలు ఉన్నట్లు తేలింది. ఈసారి ఏఐసీటీఈ 228 కాలేజీల్లో 1,14,117 సీట్లలో ప్రవేశాలకు అనుమతులు ఇవ్వగా.. జేఎన్టీయూ మరో 10 వేల వరకు సీట్లకు కోత విధించే అవకాశం ఉన్నట్లు ఉన్నత విద్యా మండలి వర్గాలు అంచనా వేశాయి.
Comments
Please login to add a commentAdd a comment