
కేసులు పెట్టించి వేధిస్తారా?
హైదరాబాద్: ఏపీ రాజధాని ప్రాంతంలో అధికార టీడీపీ నేతల భూ అక్రమాలను 'సాక్షి' ఆధారాలతో వెలుగులోకి తెచ్చిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాజధాని విషయంలో ముందే లీకులిచ్చి టీడీపీ నేతలు భూములు కొనేలా చేశారని, అదే విషయాన్ని 'సాక్షి' వెలుగులోకి తెచ్చిందని చెప్పారు.
పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వాస్తవాలు వెలుగులోకి తెస్తే ప్రాసిక్యూట్ చేస్తారా అని ప్రశ్నించారు. పోలీసులతో కేసులు పెట్టించి వేధిస్తారా అని నిలదీశారు. తప్పు చేయకుంటే చంద్రబాబు విచారణకు ఎందుకు సిద్ధపడడం లేదని అడిగారు. ఏపీ రాజధానిలో టీడీపీ నేతల భూ దందాపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. విలేకరులను బెదిరించడం మాని విచారణకు సిద్ధపడాలని హితవు పలికారు.
ఏపీ రాజధాని ప్రకటనకు ముందే టీడీపీ నేతలు భూములు కొన్నారని, వీటిని ల్యాండ్ పూలింగ్ లోకి రాకుండా చూసుకున్నారని ఆరోపించారు. రాజధానికి తాము వ్యతిరేకం కాదని, చంద్రబాబు భూసేకరణకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు.