
పొన్నవరం నుంచి సుప్రీంకోర్టుకు జస్టిస్ ఎన్వీ రమణ
మన రాష్ట్రానికి చెందిన జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గతంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన, ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.
మన రాష్ట్రానికి చెందిన జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గతంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన, ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. కృష్ణా జిల్లాలో పొన్నవరం అనే గ్రామంలో 1957 ఆగస్టు 27న ఓ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన జస్టిస్ ఎన్వీ రమణ, 1983 ఫిబ్రవరి 10వ తేదీన న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. రాష్ట్ర హైకోర్టు, కేంద్ర, రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునళ్లు, సుప్రీంకోర్టులలో సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, కార్మిక, సేవ, ఎన్నికల అంశాలపై ఆయన పలు కేసులు వాదించారు. రాజ్యాంగ, నేర, సేవా, అంతర్రాష్ట్ర నదీ చట్టాలలో ఆయన నిపుణులు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు ఆయన ప్యానల్ న్యాయవాదిగా కూడా ఉండేవారు. ఆంధ్రప్రదేశ్కు అదనపు అడ్వకేట్ జనరల్గా కూడా వ్యవహరించారు.
రాష్ట్ర హైకోర్టులో శాశ్వత జడ్జిగా 2000 జూన్ 27న పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2013 సెప్టెంబర్ వరకు రాష్ట్ర హైకోర్టులోనే పనిచేసి, తర్వాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లారు. ఇప్పుడు మరింత పదోన్నతి పొంది, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.