
మళ్లీ పార్టీ మారి పరువు పోగొట్టుకోకు : కోమటిరెడ్డి
హైదరాబాద్: నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్లో బుధవారం ఆయన మాట్లాడుతూ...ఇప్పటికే మూడు పార్టీలు మారావు, ఇప్పుడు మళ్లీ మారి పరువు పోగొట్టుకోకు అని ఎంపీ గుత్తాకు సూచించారు.
గాంధీభవన్ మెట్లు ఎక్కకుండా..పార్టీ సభ్యత్వం లేకుండా..సోనియా చలవతోనే ఎంపీ అయ్యవనీ, ఒకవేళ పార్టీ మారాలనుకుంటే కాంగ్రెస్కు రాజీనామా చేయాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. సుఖేందర్ రెడ్డి పార్టీ మారతారని తాను అనుకోవడంలేదని తెలిపారు. రుణమాఫీకి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు వడ్డీకే సరిపోవడంలేదని అన్నారు. ఇప్పటికైనా రుణమాఫీ పూర్తిగా చేయాలని కోరారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకుల కోసం రూ.300 కోట్లు ఖర్చు చేయడం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. ఆ డబ్బుతో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకుంటే బాగుండేదని కోమటిరెడ్డి అన్నారు.