
సినీ నటుడికి నైజీరియన్ల టోకరా
నగరానికి చెందిన ఓ సినీ నటుడికి టోకరా వేసిన ఇద్దరు నైజీరియన్లను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
ఇద్దరి అరెస్టు
సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ సినీ నటుడికి టోకరా వేసిన ఇద్దరు నైజీరియన్లను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ అవినాష్ మహంతి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నిందితులు ప్రస్తుతం న్యూ ఢిల్లీలోనే ఉంటున్నా,.. మహిళా నిందితురాలు తాను లండన్లో ఉంటున్నట్లు బాధితుడిని నమ్మించి మోసం చేసినట్లు వివరించారు. ఓ సినీ నటుడికి ఫేస్బుక్ ద్వారా ఫిలిసికా ఇస్సాక్ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. దీంతో వారు సినిమాలకు సంబంధించిన విషయాలపై వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసుకునేవారు. ఓ రోజు తాను కొంత డబ్బు ఇవ్వాలనుకున్నానని, లండన్ వచ్చి తీసుకోవాల్సిందిగా ఇస్సాక్ సదరు నటుడికి చెప్పింది. అయితే ఇందుకు వీలు కాదని ఆమెనే భారత్కు రమ్మని చెప్పడంతో గత జనవరి 19న ఇండియాకు వస్తున్నట్లు పేర్కొంటూ తన పాస్పోర్ట్, టిక్కెట్స్ కాపీని ఈ–మెయిల్ చేసింది.
ఆ మరుసటి రోజు తాను ఢిల్లీ విమానాశ్రయంలో దిగానని, పరిమితికి మించిన లగేజీ ఉన్నందున కస్టమ్స్ అధికారులు రూ.25,500 జరిమానా విధించినట్లు తెలిపింది. ఆమె కోరిక మేరకు బాదితుడు ఆ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తరువాత కస్టమ్స్ అధికారిగా ఫోన్ చేసిన వ్యక్తి మరో రూ.50 వేలు చెల్లించాల్సిందిగా పేర్కొంటూ ఢిల్లీకి చెందిన నుమ్ మౌన్ కిమ్ బ్యాంకు ఖాతా వివరాలు పంపడంతో మరో రూ.50 వేలు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ రావడానికి ఆ రోజు విమానాలు లేవని, మరుసటి రోజు వస్తున్నట్లు సమాచారం పంపింది. మరుసటి రోజు లితిక అనే కస్టమ్స్ అధికారిగా కాల్ చేసిన వ్యక్తి సదరు మహిళ లండన్ కరెన్సీ తీసుకువచ్చినందున ఆమెను అదుపులోకి తీసుకున్నామని, నగదుతో సహా విడిచిపెట్టడానికి రూ.1.2 లక్షలు చెల్లించాలంటూ సినీ నటుడికి సూచించాడు.
దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఢిల్లీలో ఉంటున్న నైజీరియన్లు నొబేర్త్ ఛుక్వేదో, నిమ్మున్ కిమ్లను అరెస్టు చేశారు. ఫేస్బుక్లో ఇస్సాక్ పేరుతో ఖాతా తెరించింది కిమ్గా, ఈమెతో పాటు ఛుక్వేదో సైతం బాధితుడితో మాట్లాడి డబ్బు డిపాజిట్ చేయించుకున్నట్లు గుర్తించారు. నిందితుల్ని అరెస్టు చేసి మంగళవారం హైదరాబాద్ తీసుకువచ్చారు. నైజీరియాకు చెందిన వీరు బిజినెస్ వీసాపై వచ్చి ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నట్లు డీసీపీ వివరించారు.