
ఎన్నాళ్లీ నిరీక్షణ..!
అంద ని ద్రాక్షగాఓయూ పీహెచ్డీ ప్రవేశాలు
ఏడాది నష్టపోయిన ఆశావహ అభ్యర్థులు
ఎటూ తేల్చని అధికారులు
సిటీబ్యూరో: పరిశోధనలకు నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాల ప్రక్రియ పట్టాలు తప్పింది. ఇందుకు సంబంధించిన కటాఫ్ మార్కుల తగ్గింపు అంశం గందరగోళంగా మారిన విషయం తెలిసిందే. నెలలు గడుస్తున్నా కటాఫ్ మార్కులు తగ్గిస్తారా? లేదా? అన్న విషయంపై అధికారులు ఎటూ తేల్చడం లేదు. ఫలితంగా ఆశావహ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నాన్నారు.
ఏడాదిన్నరగా నాన్చివేత
గతేడాది జూలైలో పీహెచ్డీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల కాగా... ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన అర్హత పరీక్షకు 10,828 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఏడాది జూలైలో విడుదల చేసిన ఫలితాల్లో 6,747 మంది అర్హత సాధించారు. అయితే ఫలితాల విడుదల నాటి నుంచే కటాఫ్ మార్కుల అంశంపై విద్యార్థులకు ఆందోళన చేపట్టిన విద్యార్థులు తెలంగాణ ఉద్యమం కారణంగా చదువుపై దృష్టి సారించలేక పోయినందున కటాఫ్ మార్కులు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వర్సిటీకి రెగ్యులర్ వీసీ లేకపోవడం, ఇన్ఛార్జి వీసీ పట్టించుకోకపోవడంతో సమస్యను డిప్యూటీ సీఎం కడియం దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా వర్సిటీ స్టాండింగ్ కమిటీ ఎస్సీ-ఎస్టీ, బీసీ, ఓసీలకు వరుసగా 30, 35, 40కి తగ్గించామని అధికారులు పేర్కొంటుండగా, మరింత తగ్గించాలని, లేనిపక్షంలో 2011 నాటి విధానాన్నే అనుసరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఫలితాలు వెల్లడై 4 నెలలు గడిచినా అధికారులు ప్రవేశాలు మొదలుపెట్టే సాహసం చేయలేకపోతున్నారు.
ఖాళీలపై కొరవడిన స్పష్టత
ఓయూలో 1,088 పోస్టులకుగాను 651 మంది అధ్యాపకులు ఉన్నారు. ఇందులో 266 మంది ప్రొఫెసర్లు, 62 మంది అసిస్టెంట్, 324 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ఉన్నారు. ఒక్కో రిసెర్చ్ గైడ్ పరిధిలో కనిష్టంగా నలుగురు.. గరిష్టంగా 8 మంది పీహెచ్డీ స్కాలర్లు పరిశోధనలు చేస్తుంటారు. ప్రస్తుతం ఉన్న ప్రొఫెసర్ల కొరతకు తోడు కొందరికి గైడ్గా వ్యవహరించే గుర్తింపు లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఫలితాలు వెల్లడైన 62 సబ్జెక్టులకు, ప్రొఫెసర్ల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో వర్సిటీ అధికారులే చెప్పలేకపోతున్నారు. మరోపక్క కటాఫ్ మార్కులు తగ్గించడంతో అర్హత సాధించినవారు 6 వేలకు పైగా ఉన్నారు. ఈ క్రమంలో ఎంతమందికి ప్రవేశాలు దక్కుతాయన్న అంశం ఆసక్తికరంగా మారింది. రెగ్యులర్ వీసీ లేకపోవడం, కటాఫ్ మార్కులెన్నో తేలకపోవడం ప్రవేశాలకు అడ్డంకిగా పరిణమించాయి.
ఈ తరుణంలో ఇంటర్వ్యూలకు నోఫికేషన్ వేస్తే విద్యార్థులు ఆందోళన చేస్తారన్న భయంతో అధికారులు నాన్చుడు థోరణి అవలంభిస్తున్నారు. ఈ విషయమై వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేష్ కుమార్ను ఫోన్లో సంప్రదించగా.. ఎలాంటి స్పందన లభించలేదు.