
ఇది మహిళా వ్యతిరేక ప్రభుత్వం: సబిత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళలను అవమానించే విధంగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ మాజీ మంత్రులు పి.సబితా ఇంద్రారెడ్డి, వి.సునీతా లకా్ష్మరెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. ఇది మహిళా వ్యతిరేక ప్రభుత్వమని, మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా వారిని అవమానించారని మండిపడ్డారు. ఇప్పటిదాకా మహిళలకే ఇచ్చే సంప్రదాయమున్న మహిళా, శిశు సంక్షేమ శాఖను తుమ్మలకు ఇవ్వడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
టీఆర్ఎస్లో సమర్థులైన మహిళలు లేరా, వారి శక్తిసామర్థ్యాల మీద నమ్మకం లేదా అని అన్నారు. కేసీఆర్ కుమార్తె కవితకు పోటీగా పార్టీలో మరే మహిళ ఎదగడం ఇష్టం లేదా అని ఆరోపించారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. పేద మహిళలకిచ్చే పింఛన్లను రద్దుచేసి వారికి అన్యాయం చేశారని సబిత, సునీత విమర్శించారు.