
నిస్సిగ్గుగా అవినీతి, నిరంకుశ పాలన: వైఎస్ జగన్
రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు నిస్సిగ్గుగా అవినీతి, మోసాలకు పాల్పడుతున్నారని, నిరంకుశ వైఖరితో పాలన సాగిస్తున్నారని ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు రవీంద్రభారతి నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యేలంతా మెడలో నల్ల కండువాలు ధరించారు. ఏపీ రాజధాని ప్రాంతంలో బినామీ పేర్లతో మంత్రులు, టీడీపీ నేతలు సాగిస్తున్న దందా గురించిన నినాదాలు, పత్రికా కథనాలను ప్లకార్డులుగా పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. ''అవినీతి సొమ్ముతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ నిరంకుశ వైఖరితో చంద్రబాబు నాయుడు పట్టపగలు అవినీతితో తాను సంపాదించిన సొమ్మును ప్రదర్శిస్తూ, ఒక్కో ఎమ్మెల్యేకు 20-30 కోట్లు ఆశ చూపించి నిస్సిగ్గుగా తాను చేసిన కార్యక్రమానికి నిరసన తెలుపుతున్నాం.
ఫలానా చోట రాజధాని పెడుతున్నట్లు ముందే ప్లాన్ చేసి, రైతులను మోసం చేసి వాళ్ల దగ్గర భూములు కొనుగోలు చేసిన తర్వాత రాజధానిని అక్కడ ప్రకటించారు. మొదట రాజధాని నూజివీడు ప్రాంతంలోను, నాగార్జున వర్సిటీ ప్రాంతంలో అని మిస్లీడ్ చేశారు. తనవాళ్లు భూములు కొన్న తర్వత రాజధాని అక్కడ పెట్టి రైతులను మోసం చేశారు. ఎస్సీలను సైతం మోసం చేశారు. తన బినామీలకు లాభం చేకూర్చేందుకు జోనింగ్ పద్ధతిని అమలుచేశారు. ఆయా భూములకు మాత్రమే డిమాండు ఉండేలా చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన చేస్తున్న అవినీతి, మోసాలకు నిరసనగా ఈ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నాం'' అని ఆయన అన్నారు.