ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు | YSR Congress seeks disqualification of defectors | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు

Published Sun, Mar 6 2016 4:26 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు - Sakshi

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు

నిస్సిగ్గుగా అవినీతి, నిరంకుశ పాలన
రాజధాని ఎంపికలో తప్పుదారి పట్టించారు
జోనింగ్ పద్ధతిలోనూ రైతుల్ని మోసగించారు
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
నల్లకండువాలతో వైఎస్సార్ సీపీ సభ్యుల నిరసన
ప్రకాశం పంతులు విగ్రహం నుంచి పాదయాత్రగా అసెంబ్లీకి

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబుఅవినీతి సొమ్ముతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ నిరంకుశంగా పాలన సాగిస్తున్నారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.

చంద్రబాబు నిస్సిగ్గుగా అవినీతికి, మోసాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు బినామీలతో సాగిస్తున్న భూ దందా, అనైతికంగా ఎమ్మెల్యేలను ఫిరాయింపజేయడం, ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా శాసనసభ  బడ్జెట్ సమావేశాల తొలిరోజున శనివా రం జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి నల్లకండువాలు ధరించి రవీంద్రభారతికి ఎదురుగా ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం వద్ద నుంచి పాదయాత్రగా అసెంబ్లీ ప్రాంగణానికి వెళ్లారు. అంతకు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పట్టపగలే తాను సంపాదించిన అవినీతి సొమ్మును ఎర చూపిం చి, ఎమ్మెల్యేకు 20 కోట్ల నుంచి 30 కోట్లు ఆశ చూపించి  ప్రలోభపెడుతున్నారన్నారనీ, దీనికి తాము నిరసన తెలుపుతున్నామన్నారు.
 
ఎస్సీల భూములు మోసపూరితంగా కొన్నారు
ఫలానాచోట రాజధాని పెడుతున్నట్లు ముందే ప్లాన్‌చేసి, రైతులను మోసం చేసి వాళ్ల దగ్గర భూములు కొనుగోలు చేసిన తర్వాత రాజధానిని అక్కడ ప్రకటించారని చెప్పారు. మొదట రాజధాని నూజివీడు ప్రాంతంలోను, నాగార్జున వర్శిటీ ప్రాంతంలోను అని తప్పుదోవ పట్టించారన్నారు. తన వాళ్లు భూములు కొనుగోలు చేసిన తర్వాత అక్కడే రాజధానిని పెట్టి రైతులను మోసం చేశారన్నారు. ఎస్సీలను సైతం వదలకుండా వాళ్ల భూములను మోసపూరితంగా కొన్నారని మండిపడ్డారు.
 
బినామీల లబ్ధికే జోనింగ్ వ్యవస్థ
తన బినామీలకు లాభం చేకూర్చాలని జోనింగ్ వ్యవస్థను తీసుకువచ్చి.. తన బినామీలకు సంబంధించిన భూములు మాత్రమే అమ్ముడు పోయే విధంగా డిమాండ్ క్రియేట్ చేసి మిగిలినచోట సప్లయి లేకుండా జోనింగ్ వ్యవస్థని రూపొందించి రైతులను మోసం చేశారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు అవి నీతి, ఇప్పుడు, ఎన్నికల ముందు చెప్పిన అబ ద్దాలు, చేసిన మోసాలకు నిరసనగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నామని తెలిపారు. ‘ఏపీ రాజ దాని ప్రాంతంలో బినామీ పేర్లతో మంత్రులు, టీడీపీ నేతలు సాగిస్తున్న భూ దందా గురించి పత్రికా కథనాలు’, ‘ఎమ్మెల్యేలను కొనడమే అభివృద్ధా?’ అనే ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అమరావతిలో భూదందాలపైన, బొగ్గు నుంచి కాంట్రాక్టర్ల దాకా సీబీ ఐతో విచారణ జరిపించాలని, మంత్రి రావెల కిశోర్‌బాబు కుమారుడిని అరెస్టు చేయాలని నినాదాలు చేస్తూ.. పాదయాత్రగా అసెంబ్లీకి వెళ్లారు.

ఈ నిరసన పాదయాత్రలో వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉప నాయకుడు జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పి.రాజన్నదొర, కొక్కిలిగడ్డ రక్షణనిధి, దాడిశెట్టి రాజా, బూడి ముత్యాలనాయుడు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, గిడ్డి ఈశ్వరి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, కంబాల జోగులు, కాకాని గోవర్ధనరెడ్డి, రాజేంద్రనాథరెడ్డి, ఉప్పులేటి కల్పన, పాముల పుష్పశ్రీవాణి, గౌరు చరి తారెడ్డి, విశ్వాసరాయి కళావతి, మేకా ప్రతాప్ అప్పారావు, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, యక్కలదేవి ఐజయ్య, గొట్టిపాటి రవికుమార్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఆదిమూలపు సురేశ్, వరుపుల సుబ్బారావు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొడా లి నాని, కొరుముట్ల శ్రీనివాసులు, కోన రఘుపతి, జంకె వెంకటరెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, కిలివేటి సంజీ వయ్య, షేక్ బేపారి అంజాద్ బాషా, వై.విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్‌బాషా, కళత్తూరు నారాయణస్వామి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, ఎమ్మెల్సీలు శేషుకుమార్, వీరభద్రస్వామి పాల్గొన్నారు.
 
నినాదాలతో మార్మోగిన  రవీంద్రభారతి సర్కిల్
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల నినాదాలతో రవీంద్రభారతి సర్కిల్ మార్మోగింది. మధ్యాహ్నం 2.10 గంటల నుంచి ఒక్కొక్కరుగా చేరుకున్న ఎమ్మెల్యేలు నల్లకండువాలు వేసుకుని నినాదాలతో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ‘ప్రజా రాజధానా.. బీనామీలా రాజధానా!, భూ భకాసురుడు చంద్రబాబు!, ఎమ్మెల్యేలను కొనటమే నీ అభివృద్ధా బాబూ!’ అంటూ సీఎం చంద్రబాబు, మంత్రుల అవినీతిని తెలిపే నినాదాలున్న ప్లకార్డులు పట్టుకుని మండే ఎండలో నిరసన తెలిపారు.

ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, ఆళ్ల రామకృష్ణారెడ్డి రోడ్డుపై వెళ్తున్న ప్రజలకు ప్లకార్డులు చూపిస్తూ చంద్రబాబు అనినీతిని వివరించారు. మధ్యాహ్నం 2.40 గంటలకు ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, కొడాలి నానితో కలసి ప్రతిపక్షనేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకాశం పంతులు విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత 2.45 గంటలకు వైఎస్ జగన్‌తో కలసి ఎమ్మెల్యేలు పాదయాత్రగా అసెంబ్లీకి చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement