
బారీ(ఇటలీ): సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరగడంతోపాటు, ఆరోగ్యానికి మంచి జరుగుతుందనే విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం సైకిల్ తొక్కే వారి సంఖ్య చాలా తక్కువైంది. పాఠశాల స్థాయి విద్యార్థులు సైతం స్కూటీలు, బైక్లపై చక్కర్లు కొడుతున్నారు. మరికొందరు బద్ధకంతో తక్కువ దూరాలకు సైతం బైక్లు, కార్లు లాంటి వాహనాలను ఉపయోగిస్తున్నారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఇటలీలోని ‘బారీ’ నగరంలో అధికారులు ఓ ప్రోత్సాహక పథకం ప్రవేశపెట్టారు. సైకిల్ మీద ఆఫీసుకు వెళ్లే వారికి నగదు పారితోషికం ఇవ్వాలని నిర్ణయించారు.
పైలట్ ప్రాజెక్టులో భాగంగా సైకిల్పై ఆఫీసుకు వెళ్లేవారికి కిలోమీటరుకు 20 సెంట్ల పారితోషికం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సుమారు వెయ్యిమందికి ఇందులో చేరే అవకాశం ఉంటుంది. గరిష్ఠంగా ఒక్కొక్కరికి 25 యూరోల (సుమారు రూ.2000) వరకు చెల్లించే అవకాశముంది. అత్యధిక కిలోమీటర్లు సైకిల్ తొక్కినవారికి అదనంగా బోనస్ సైతం ఉంటుందట. దీనికోసం ఉద్యోగులు, పిల్లల కోసం తల్లిదండ్రులు సైకిళ్లు కొనేందుకు నగరపాలక సంస్థ నిధులూ కేటాయించింది. సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా డబ్బులూ వస్తాయని నగర మేయర్ ఆంటోనియో డెకారో అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment