
వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) సోకి దాదాపు లక్ష మంది అమెరికన్లు మరణించే అవకాశం ఉందని తాను విశ్వసిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే మహమ్మారిని కట్టడి చేసేందుకు ఈ ఏడాది చివరినాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కరోనా వైరస్ నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ పురుద్ధరణ, వ్యాక్సిన్ తయారీ తదితర అంశాల గురించి ట్రంప్ ఆదివారం ఫాక్స్ న్యూస్తో మాట్లాడారు. ప్రాణాంతక వైరస్ పుట్టుకకు కారణమైన చైనా వల్లే ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి వెళ్లిందని ఈ సందర్భంగా ఆయన మరోసారి మండిపడ్డారు. (వారంతా న్యూక్లిక్ యాసిడ్ టెస్టు చేయించుకోవాలి: చైనా)
ఇక అమెరికాలోని పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ నిబంధనలు పాక్షికంగా ఎత్తివేస్తున్న తరుణంలో.. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఇతర రాష్ట్రాలకు సూచించారు. ‘‘దేశాన్ని ఇలాగే వదిలేయలేం కదా. ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాల్సి ఉంది’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘కరోనా ధాటికి 75 లేదా 80 వేల నుంచి లక్ష మంది ప్రజలను మనం పోగొట్టుకోబోతున్నాం. ఇది చాలా భయంకరమైన విషయం’’ అని పేర్కొన్నారు. కాగా కరోనా కారణంగా అమెరికాలో ఇప్పటి వరకు దాదాపు 68 వేల మంది మరణించగా.. 11 లక్షల మందికి పైగా మహమ్మారి బారిన పడ్డారు. ఇక గతవారం ఇదే విషయం గురించి మీడియాతో మాట్లాడిన ట్రంప్.. అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 70 వేలకు మించదని పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా... కరోనా చైనాలోని వుహాన్ ల్యాబ్లో ఉద్భవించిందనేందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అమెరికా విదేశాంగ శాఖా మంత్రి మైక్ పాంపియో వ్యాఖ్యానించారు.(కరోనా వ్యాక్సిన్.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment