
ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ప్రవాస బాలిక
దుబాయ్: ప్రతిష్టాత్మక బాలల శాంతి బహుమతి రేసులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన భారత సంతతి బాలిక కేకాషణ్ బసు(16) నిలిచింది. బాలల హక్కులు, స్థితిగతులు మెరుగుపరచడానికి ఆమె చేసిన కృషి ఫలితంగా ఈ అవార్డు రేసులో ఉన్న తుది ముగ్గురిలో ఆమె కూడా నిలిచింది. దీని కోసం ప్రపంచవ్యాప్తంగా 120 ఎంట్రీలు వచ్చాయి. ఆదివారం(నవంబర్ 20) ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా దీనికి సంబంధించిన ప్రకటన చేశారు.
తుది పోటీలో ఉన్న ముగ్గురూ బాలల హక్కుల కోసం పోరాటాలు చేశారు. ప్రతీ యేటా ఈ అవార్డు గ్రహీతలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల ముందు తమ సందేశం వినిపించే అవకాశం లభిస్తుంది. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఈ అవార్డును 2006 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనిస్ అందించనున్నారు. ఈ కార్యక్రమం హేగ్లోని హాల్ ఆఫ్ నైట్స్లో జరగనుంది.
కేకాషణ్ బసు ఎనిమిదేళ్ల వయసులోనే పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటం ప్రారంభించింది. 2012లో ‘గ్రీన్ హోప్’ అనే సంస్థను ప్రారంభించి దాని ద్వారా చెత్త సేకరణ, బీచ్లను శుభ్రం చేయడం, అవగాహనా సదస్సులను నిర్వహించడం వంటివి చేస్తుండేది. ఆమె ఇంతకు ముందు ఎన్నో అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొంది.