
ఐక్యరాజ్యసమితి: ప్రపంచవ్యాప్తంగా కరోనాను ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్యసమితి 2 బిలియన్ డాలర్ల అత్యవసర నిధిని ప్రకటించింది. ‘ఊహించని ముప్పును ప్రపంచం ఎదుర్కొంటోంది. కోట్లాది ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూలుస్తోంది. ఇది ప్రపంచ మానవాళి అంతటికీ ఎదురైన సమస్య. కాబట్టి మానవాళి అంతా కలసి దీంతో పోరాడాలి. దీని కోసం మేము రెండు బిలియన్ డాలర్ల ప్రపంచ మానవత్వ నిధిని ఏర్పాటు చేస్తున్నాం. ప్రపంచంలోని పేద దేశాలకు ఇది ఉపయోగపడుతుంది. దీన్ని సరిగ్గా వినియోగించుకుంటే, ఎంతోమంది ప్రజల ప్రాణాలను కాపాడవచ్చు. ఇప్పుడు సరైన చర్యలు తీసుకోకపోతే పెనుముప్పుగా మారుతుంది. అన్ని దేశాలకు మేము చెప్పేది ఒక్కటే. ఈ హెచ్చరికను ఆలకించండి’ యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు.