
సాక్షి, వైరా: గ్రామాల్లోనే పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకునే నూతన విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్తో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు త్వరితగతిన అందే అవకాశం ఉంటుంది. గ్రామ కార్యదర్శులకు వివాహం రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని ఇస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
నేటి నుంచే అమల్లోకి..
కాగా ఈ విధానం నేటి నుంచి అమలులోకి రానుంది. పంచాయతీ కార్యదర్శులతో పాటు మండలంలోని ఈఓపీఆర్డీలు ఈ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నారు. పెళ్లి రిజిష్ట్రేషన్కు నామమాత్రపు రుసుము చెల్లించాలి. రెండు నెలల గడువు దాటితే రూ.100 చెల్లించి గ్రామ పంచాయతీల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆపై గడువుదాటితే రిజిష్ట్రేషన్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలి. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా ఆర్థికసాయం పొందేందుకు ఈ రిజిస్ట్రేషన్ తప్పని సరి.
పంచాయతీల్లో నమోదు చేసుకోవాలి
గ్రామాల్లో జరుగుతున్న వివాహాలను ఇక నుంచి తప్పని సరిగా గ్రామ పంచాయతీలో నమోదు చేసుకోవాలి. దీంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథక ఫలాలను త్వరిత గతిన పొందే అవకాశం ఉంది.
– శ్రీనివాస్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి, ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment