
సాక్షి, న్యూఢిల్లీ : వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల జీవిత చరిత్రల ఆధారంగా వస్తున్న బయోపిక్ల పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ పరంపర ఇప్పటి వరకు సినిమాలకే పరిమితం కాగా, ఇప్పుడు టీవీ ఛానళ్లుకు కూడా పాకుతోంది. యోగాసనాలు నేర్పే సాధారణ సాధువు నుంచి మూలికా మందులతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని దశదిశలా విస్తరించకున్న బాబా రాందేవ్ జీవితంలో సాధించిన అంశాల ప్రాతిపదికన ఆయన బయోపిక్ను బుల్లితెరకు ఎక్కిస్తున్నారు. ‘డిస్కవరి జీత్’ ఛానల్లో సీరియల్గా ప్రసారం చేసేందుకు ‘స్వామి రాందేవ్: ఏక్ సంఘర్ష్’ను బాలీవుడు నటుడు అజయ్ దేవ్గన్ నిర్మిస్తున్నారు.
ఎంఎస్ ధోని, గోలియోంకా రాస్లీలా రామ్–లీలా చిత్రాల్లో నటించిన క్రాంతి ప్రకాష్ ఝా ఈ చిత్రంలో స్వామి రాందేవ్గా నటిస్తున్నారు. చిల్లార్ పార్టీ, రాంజానాలో నటించడమే కాకుండా బాల నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్న నామన్ జైన్ బాల రాందేవ్గా నటిస్తున్నారు. ఈ టెలివిజన్ చిత్రం జనవరి నెలలో ప్రసారం అవుతుంది. తాము తీస్తున్న బయోపిక్పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని తాను ఆశిస్తున్నానని అజయ్ దేవ్గన్ ఈ సందర్భంగా ‘ముంబై మిర్రర్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.