
‘బాహుబలి 2’కు తప్పని కష్టాలు
హైదరాబాద్: అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘బాహుబలి 2’ సినిమాకు పైరసీ కష్టాలు తప్పలేదు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని దృశ్యాలు ఇప్పటికే ఇంటర్నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. శుక్రవారం విడుదలైన ఈ సినిమా అప్పుడే ఆన్లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు పైరసీదారుల ఆటకట్టించేందుకు చిత్ర యూనిట్ చర్యలు చేపట్టింది.
‘బాహుబలి 2’ పైరసీ లింకులు బ్లాక్ చేసేందుకు సిద్ధమైంది. ఇంటర్నెట్ లో ఈ సినిమా సంబంధించి పైరసీ లింకులు తెలిస్తే తమకు సమాచారం అందించాలని రాజమౌళి బృందం కోరింది. blockxpiracy.com, apfilmchamber.comలకు లింకులు పంపాలని విజ్ఞప్తి చేసింది. పైరసీ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఎంతో కష్టపడి ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ధియేటర్లలోనే చూడాలని ప్రేక్షకులకు ‘బాహుబలి’ బృందం విజ్ఞప్తి చేసింది.
శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ‘బాహుబలి 2’ విడుదలైంది. అయితే తమిళనాడులో చాలా ధియేటర్లు బెనిఫిట్ షోలను రద్దు చేశాయి. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రత్యేక ప్రదర్శనలు వేయలేదని ధియేటర్ల యాజమాన్యాలు తెలిపాయి.