విజయనిర్మల విగ్రహావిష్కరణ.. | Sakshi
Sakshi News home page

విజయనిర్మల విగ్రహావిష్కరణ.. పాల్గొన్న ప్రముఖులు

Published Thu, Feb 20 2020 2:32 PM

Mahesh Babu ANd Krishna Inaugurates Vijaya Nirmala Statue At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ సీనియర్‌ సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి విజయనిర్మల తొలి జయంతి సందర్భంగా ఆమె కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. నటిగా, దర్శకనిర్మాతగా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న విజయనిర్మల గతేడాది జూన్‌ 27న తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కాగా, గురువారం నానక్‌రామ్‌గూడలోని కృష్ణ నివాసంలో ఆమె తొలి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత విజయ నిర్మల విగ్రహాన్ని కృష్ణ, మహేశ్‌బాబు, నరేశ్‌తో పాటు పలువురు ప్రముఖులు ఆవిష్కరించారు. అనంతరం నివాళులర్పించారు. ఈ కార్య​క్రమంలో కృష్ణంరాజు దంపతులు, మురళీమోహన్‌, ఎస్వీ కృష్ణారెడ్డి, నమ్రత, సుధీర్‌ బాబు, పరుచూరి బ్రదర్స్‌, గల్లా జయదేవ్‌, తదితరులు పాల్గొన్నారు. ఘట్టమనేని అభిమానులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై విజయ నిర్మల విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. 

1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో ఆమె జన్మించారు. ఏడేళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రం మత్స్యరేఖతో సినీరంగ అరంగేట్రం చేశారు. 11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగులో పరిచయమయ్యారు. మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన అనంతరం విజయనిర్మల కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు నరేష్ ఒక్కడే సంతానం. సాక్షి చిత్రంతో తొలిసారిగా సూపర్ స్టార్ కృష్ణతో కలిసి నటించిన ఆమె ఆయనతో 47 చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ, మలయాళంలో 200కుపైగా చిత్రాల్లో విజయనిర్మల నటించారు. 1971లో దర్శకత్వ బాధ్యతలు చేపట్టి తొలిసారిగా మీనా చిత్రాన్ని తెరకెక్కించారు. 44 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆమె అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించారు. తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆమె అత్యున్నత పురస్కారం రఘుపతి వెంకయ్య అవార్డును (2008) అందుకున్నారు.



(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి:
అలసి విశ్రమించిన అలలు
అది నా తప్పు కాదు, క్యారెక్టర్‌ అలాంటిది

Advertisement
 
Advertisement
 
Advertisement