
ఆ వయసు ఇంకా రాలేదు!
సంచలన తారల్లో నటి రాయ్లక్ష్మీ ఒకరని కచ్చితంగా చెప్పవచ్చు. పలు వదంతులకు కేంద్రబిందువుగా మారిన ఈ అమ్మడు ఆ మధ్య క్రికెట్ క్రీడాకారుడు ధోనీతో చెట్టాపట్టాల్ అంటూ సాగిన ప్రచారం కలకలాన్నే రేకెత్తించింది. నటిగా పుష్కరకాలాన్ని అధిగమించి రాయ్లక్ష్మీ దక్షిణాదిలోనే కాకుండా హిందీలోనూ నటించినా ఎందుకనో ప్రముఖ హీరోయిన్ల పట్టికలో చేరలేకపోయింది. అయితే కథానాయకిగానే నటిస్తానని పట్టుపట్టకుండా అందివచ్చిన ఎలాంటి పాత్రలోనైనా నటించి ఆ విధంగా పాపులర్ అయ్యింది. ఈ మధ్య తెలుగులో ఖైదీ నంబర్–150 చిత్రంలో చిరంజీవితో సింగిల్ సాంగ్కు చిందులేసి మంచి గుర్తింపునే తెచ్చుకుంది.
నటిగా 12 ఏళ్లకు పైగా కొనసాగుతున్నారు పెళ్లెప్పుడు చేసుకుంటారు అన్న ప్రశ్రకు రాయ్లక్ష్మీ బదులిస్తూ ఇప్పుడే పెళ్లికి అవసరమేముందీ అంటూ ఎదురు ప్రశ్నించింది. అయినా 30 ఏళ్లు దాటిన నటీమణులు కూడా ఇంకా కథానాయికలుగా నటిస్తున్నారు. అలాంటిది తన వయసు 28దే. ఇంకా సినిమాలో తాను చేయాల్సిన పయనం చాలా ఉంది. మరి కొన్నేళ్ల తరువాత పెళ్లి విషయం ఆలోచిస్తాను అంటూ పేర్కొంది. అదీ నిజమే మూడు పదులు దాటిన ప్రౌడలు చాలా మంది పెళ్లికి దూరంగా ఉండి కథానాయికలుగా రాణిస్తూనే ఉన్నారుగా...