
సాక్షి, చెన్నై : నిర్మాతల మండలికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించడాన్ని వ్యతిరేకిస్తూ మండలి అధ్యక్షుడు విశాల్ సోమవారం చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిర్మాతల మండలిలో అవకతవకలు జరిగాయని, కార్యవర్గం నిబంధనల ప్రకారం ఏ విషయంలోనూ నడుచుకోలేదన్న ఆరోపణల నేపథ్యంలో... ప్రభుత్వం నిర్మాతల మండలిని తన చేతుల్లోకి తీసుకుని ఎన్.శేఖర్ను ప్రత్యేక అధికారిగా నియమించిన విషయం తెలిసిందే. దీంతో నిర్మాతల మండలి ప్రత్యేక అధికారిని నియమించడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రస్తుత కార్యవర్గం కాలపరిమితి పూర్తి అయ్యిందని, మండలి ఆదాయ, వ్యయ వివరాలను సభ్యుల ముందు ప్రవేశ పెట్టి వారి ఆమోదం పొందడానికి మే 1వ తేదీన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నామని పిటిషన్లో పేర్కొన్నారు. సమావేశంలోనే తదుపరి ఎన్నకల తేదీ గురించి ప్రకటించనున్నట్లు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మండలికి ప్రత్యేక అధికారిగా ఎన్.శేఖర్ను నియమించడం సరైన నిర్ణయం కాదన్నారు.
ఇది చట్ట విరుద్ధం...
నిర్మాతల మండలిలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, అలాంటప్పుడు ప్రత్యేక అధికారిని నియమించడం చట్ట విరోధం పిటిషన్లో అని పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలనీ, ప్రతేక అధికారి నియామకంపై నిషేధం విధించాలనీ కోరారు. అదే విధంగా ఈ పిటిషన్ను అత్యవసర విచారణకు స్వీకరించాలని కోరారు. అందుకు సమ్మతించిన న్యాయమూర్తి ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరపనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment