
99 మంది డ్యాన్సర్లతో పాట
పండగ పాటలు భలే సందడిగా ఉంటాయి. ఆ పాటలకు డ్యాన్స్ చేస్తున్నవాళ్లని చూస్తుంటే, చూసేవాళ్లకి కూడా కాలు కదపాలనిపించేంత జోష్గా ఉంటాయ్. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ అలాంటి పాటకు జోరుగా, హుషారుగా స్టెప్పులేస్తున్నారు. శ్రీవాస్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘డిక్టేటర్’ కోసం ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ప్రస్తుతం చిత్రీకరిస్తున్న పాట వినాయకుడి బ్యాక్డ్రాప్లో వస్తుంది. ఈ పాట కోసం హైదరాబాద్లో భారీ సెట్ వేశారు. బాలకృష్ణకు ఇది 99వ చిత్రం కావడంతో ఈ పాటకు ఆయనతో కలిసి 99మంది డ్యాన్సర్లు కాలు కదిపేలా దర్శకుడు ప్లాన్ చేశారు. 2000 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా ఈ పాటలో ఉంటారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాట చిత్రీకరణ మరో మూడు రోజుల్లో పూర్తవుతుంది.
తదుపరి షెడ్యూల్ను యూరోప్లో జరపనున్నారు. వచ్చే సంక్రాంతి పండగకు చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నాజర్, బ్రహ్మానందం, రవికిషన్, కబీర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ-స్క్రీన్ప్లే: కోన వెంకట్-గోపీ మోహన్, రచన: శ్రీధర్ సీపాన, మాటలు: ఎం. రత్నం, సంగీతం: ఎస్.ఎస్. థమన్, కెమెరా: శ్యామ్ కె. నాయుడు.