రావణ దహనంలో తొక్కిసలాట: 32మంది మృతి
పాట్నా : పాట్నాలోని గాంధీ మైదాన్లో జరిగిన రావణ దహనం కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 32మంది మృతి చెందగా, అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 15మంది పరిస్థితి విషమంగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో విజయదశమి రోజున రావణ దహనం కార్యక్రమం నిర్వహించడం అలవాటు.
అలాగే పాట్నా గాంధీ మైదానంలో నిర్వహించిన కార్యక్రమానికి లక్షలాది మంది ప్రజలు హాజరయ్యారు. అయితే విద్యుత్ తీగలు తెగిపడినట్లు వదంతులతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. మృతుల్లో ఐదుగురు చిన్నారులు సహా 23మంది మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
కాగా తొక్కిసలాట దుర్ఘటనలో 32మంది దుర్మరణం చెందినట్లు బీహార్ హోంశాఖ కార్యదర్శి అమీర్ సుభాని ప్రకటన చేశారు. మరోవైపు ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ... బీహార్ ముఖ్యమంత్రితో మాంఝీతో ప్రధాని మోడీ మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. కాగా సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ దుర్ఘటనపై హోంశాఖ సమగ్ర విచారణకు ఆదేశించింది.