
సాక్షి, న్యూఢిల్లీ : గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (66) శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఈనెల 9న జైట్లీ ఎయిమ్స్లో చేరగా.. 20వ తేదీ నుంచి వెంటిలేటర్పైనే చికిత్స అందిస్తున్నారు. 1952, డిసెంబర్ 28న న్యూఢిల్లీలో జైట్లీ జన్మించారు. ఆయనకు భార్య సంగీత, కుమారుడు రోహన్, కూతురు సోనాలీ ఉన్నారు. శనివారం మధ్యాహ్నం 12.07 నిముషాలకు అరుణ్ జైట్లీ మరణించారని ఢిల్లీ ఎయిమ్స్ ఒక ప్రకటన విడుదల చేసింది.
(చదవండి : వకీలు నుంచి విత్తమంత్రిగా ఎదిగి..)
విద్యార్థి సంఘం నాయకుడిగా..
ఢిల్లీ వర్సిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించిన జైట్లీ రాజకీయాల వైపు అడుగులేశారు. వాజ్పేయి మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. మోదీ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. జైట్లీ హయాంలోనే నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి సంస్కరణలను కేంద్రం తీసుకొచ్చింది. ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే సాధారణ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్ను విలీనం చేశారు. గత మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ.. అమెరికాలోనూ దీర్ఘకాలంపాటు చికిత్స తీసుకున్నారు. గతేడాది కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకున్నారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో మొన్నటి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment