
శ్రీనగర్ : పుల్వామా తరహా ఉగ్రదాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో జమ్మూతో పాటు పలు ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. శ్రీనగర్లో ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు. జమ్మూలోని అన్ని ప్రాంతాల్లో వాహనాల తనిఖీలను ముమ్మరంగా చేపట్టారు. తనిఖీల్లో భాగంగా బారాముల్లా జిల్లా సోపోర్లో భద్రత బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. అప్రమత్తమైన సిబ్బంది వారిని నిలువరించారు. దీంతో భద్రతా బలగాలకు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. (‘పుల్వామా కంటే పెద్ద ఉగ్రదాడి జరగొచ్చు’)
ఈ నెల 16, 17 తేదీల్లో పాకిస్థాన్ దేశంలోని జైషే మహ్మద్ నాయకులు, కశ్మీర్ లోయలో ఉన్న ఉగ్రవాదులతో సంభాషించారని, ఆ సంభాషణలో జమ్మూ నగరం లేదా జమ్మూ కశ్మీర్ బయటి ప్రాంతంలో ఒకచోట మన జవాన్లపై భారీ దాడి చేయాలని వ్యూహం పన్నినట్లు ఇంటలిజెన్స్ కు సమాచారం అందింది. దీంతో ఇంటలిజెన్స్ అధికారులు మన భద్రతా బలగాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. (పాక్పై నిషేధం వద్దంటున్న డయానా)