![Inside A Madhya Pradesh Temple, Decorated With Nearly Rs. 100 Crore Cash](/styles/webp/s3/article_images/2017/10/18/ratlam-temple.jpg.webp?itok=jkny6BSV)
సాక్షి, రత్లామ్ : మానవసేవే మాధవ సేవ అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పడం, ఆ మాటలనే ప్రతి చోటా మనం వింటుండటం జరుగుతోంది. ఈ రోజుల్లో సేవ చేయాలంటే డబ్బుతో ముడిపడి ఉన్న అంశం. అయితే, ఆ డబ్బు ఉపయోగించి మనుషులకు సేవలు చేయడాన్ని పక్కకుపెట్టి మన దేశంలోదేవుళ్ల సేవలకు మాత్రం భారీ క్యూలు కడతారని మరోసారి నిరూపితమైంది. మధ్యప్రదేశ్లో ఓ మహాలక్ష్మీ ఆలయాన్ని డబ్బులతో నింపేశారు. దీపావళి సందర్భంగా ఆలయంలోని గర్భగుడిలో అడుగుడగున డబ్బు, ఆభరణాలు ఇతర విలువైన వస్తువులతో అలంకరించారు. వీటి విలువ అక్షరాల రూ.100కోట్లు ఉంటుందని ఆలయ అర్చకులు చెబుతున్నారు. ఒక రూపాయి నుంచి మొదలుకొని రూ.2000 నోట్ల వరకు ప్రతీది ఉపయోగించి ఆలయాన్ని అలంకరించారు.
ఆలయానికి వచ్చే సామాన్య భక్తులు దేవీని చూసే ఆసక్తికంటే ఆలయంలో అన్ని చోట్ల అలంకరించిన డబ్బును చూసేందుకు కుప్పలుగా తరలి వస్తారట. అంతేకాదు, కోరిన వారి కోరికలు తీర్చే కొంగుబంగారం ఆ మహాలక్ష్మీదేవీ అని అక్కడి భక్తులు చెబుతున్నారు. అయితే, ఇదేదో ఈఏడాది జరిగిన విషయం కాదు.. ప్రతిసంవత్సరం ఇలాగే చేస్తుంటారట. భక్తులే కానుకల రూపంలో తీసుకొచ్చిన ఈ మొత్తం సొమ్మును ఇలా అలంకరించడం పరిపాటి అని చెబుతున్నారు. 'మహాలక్ష్మీ ఆలయాన్ని నేను ఆరేళ్లుగా సందర్శిస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆలయానికి వచ్చి నేను ఏం కోరుకున్నా జరిగి తీరుతుంది' అని మమతా పోర్వాల్ అనే భక్తురాలు తెలిపారు. 'కానుకల రూపంలో ఈ ఏడాది వచ్చినవి డబ్బు, ఆభరణాలు ఇతర వస్తువులు కలిపి మొత్తం రూ.100కోట్ల వరకు ఉంటుంది. చాలా దూరం నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ప్రతి దీపావళికి ఇలాగే ఉంటుంది. గర్భగుడిలో ఎప్పుడూ పోలీసులను తిప్పుతుంటాం' అని ఆలయ ప్రధాన అర్చకుండా సంజయ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment