
బెంగళూరు: ఎన్నికల రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్ మంత్రుల ఇళ్లపై ఆదాయపన్ను శాఖ(ఐటీ) దాడుల వ్యవహారం తీవ్రకలకలానికి దారితీసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అనుంగుడు, పీడబ్ల్యూడీ శాఖ మంత్రి మహదేవప్పకు చెందిన ఇళ్లపై సోమవారం ఐటీ అధికారులు దాడులు చేసిందని, బెంగళూరు, మైసూరుల్లోని నివాసాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయని, పెద్దమొత్తంలో అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయని స్థానిక మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి. సీఎం సిద్ధరామయ్య (బాదామి స్థానం నుంచి) నామినేషన్ దాఖలు చేయడానికి కొద్ది నిమిషాల ముందే ఈ వార్తలు గుప్పుమనడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ.. కేంద్ర సంస్థలను రంగంలోకి దింపి, కుట్రలు పన్నుతున్నదని విమర్శలు వెల్లువెత్తాయి.
ఐటీ శాఖ వివరణ: కాగా, సోమవారం కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించడం నిజమే అయినా, మంత్రి మహదేవప్ప ఇంట్లో సోదాలు మాత్రం నిజంకాదని ఐటీ శాఖ అధికారులు చెప్పారు. ‘‘అక్రమ ఆస్తుల వ్యవహారాలకు సంబంధించి నలుగురైదుగురు కాంట్రాక్టర్ల ఇళ్లల్లో సోదాలు నిర్వహించాం. ఆ జాబితాలో మహదేవప్ప లేనేలేరు. ‘మంత్రి ఇట్లో ఐటీ దాడులు’ జరిగాయంటూ ప్రచారంలో ఉన్నవన్నీ తప్పుడు వార్తలే. వాటిని నమ్మొద్దు’’ అని ఐటీ అధికారులు మీడియాకు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment