
పత్రిక, టీవీ ఛానెల్ స్వాధీనం సాధ్యమేనా?
సాక్షి, చెన్నై: జయ టీవీ ఛానెల్తోపాటు, నమదు ఎంజీఆర్ పత్రికను ఏఐఏడీఎంకే వర్గాలు కైవసం చేసుకోవడం సాధ్యమేనా అన్నది చర్చనీయాంశంగా మారింది. సీఎం ఎడపాడి పళనిస్వామి, పన్నీర్సెల్వం వర్గాలకు చెందిన ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేల సమావేశం సోమవారం చెన్నైలో జరిగింది. ఈ సమావేశంలో నాలుగు ముఖ్య తీర్మానాలను ఆమోదించారు. అందులో ఒకటి జయటీవీ, నమదు ఎంజీఆర్ పత్రికను స్వాధీనం చేసుకోవటం ఒకటి.
ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలితతో ప్రారంభించబడిన అన్ని ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్నది ఈ రెండు వర్గాల లక్ష్యంగా ఉంది. ఇందులో భాగంగానే ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. ఇందుకు సోమవారం దినకరన్ మద్దతుదారుడైన నాంజిల్ సంపత్ తీవ్ర వ్యతిరేకత తెలిపారు. ఈ రెండూ వ్యక్తిగత ఆస్తులని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు ఎవరికీ హక్కు లేదని తెలిపారు.
ఆ తరువాత జయటీవీ సీఈవో వివేక్ జయరామన్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈయన ఇళవరసి కుమారుడు. జయటీవీ, నమదు ఎంజీఆర్ పత్రిక ప్రైవేటు సంస్థలని ఆయన పేర్కొన్నారు. వీటి స్వాధీనానికి తీర్మానం ప్రవేశపెట్టడాన్ని ఖండించారు. ఈ పరిణామాలతో ఈ మీడియా సంస్థలు ఎవరికి చెందుతాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.