రాస్కోండి!
Published Sun, Mar 16 2014 12:39 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, చెన్నై: బీజేపీ నేతృత్వంలో మెగా కూటమి ఏర్పాటు అయ్యేనా లేదా అన్న ఉత్కంఠ రాష్ట్రంలో నెలకొంది. ఈ కూటమిలోని పీఎంకే, డీఎండీకేల మధ్య సీట్ల పందేరం కొలిక్కి రాలేదు. పొత్తుల చర్చ లు సాగుతున్న సమయంలో శుక్రవారం విజయకాంత్ గుమ్మిడి పూండి వేదికగా తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రచారానికి ముందుగా తొలి విడత అభ్యర్థుల జాబితాను హఠాత్తుగా ప్రకటించి కూటమిపై నీలి నీడలు అలుముకునేలా చేశా రు. తిరువళ్లూరు-వి యువరాజ్, మదురై- శివముత్తుకుమార్, తిరుచ్చి - ఎంఎం జీ విజయకుమార్, నామక్కల్ - సౌందర పాడియన్లు బరిలో దిగుతారని విజయకాంత్ టీవీ చానల్ కెప్టెన్ న్యూస్లో ప్రకటించడం బీజేపీ వర్గాల్లో ఆందోళన రెకెత్తించింది.
ఉరకలు : విజయకాంత్ హఠాత్ నిర్ణయం బీజేపీలో గుబులు రేపింది. రాత్రాంతా బీజేపీ వర్గాలు విజయకాంత్తో మంతనాల్లో మునిగాయి. అదే సమయంలో మెట్టు దిగాలంటూ పీఎంకే నేత రాందాసుకు సూచించే పనిలో పడ్డారు. శనివారం మధ్యాహ్నానికి సీట్ల పందేరం కొలిక్కి వచ్చినట్టు సమాచారం లేదు. శనివారం అరక్కోణం, వేలూరు, ఆరణిల్లో ప్రచారానికి విజయకాంత్ బయలు దేరడంతో మలి విడత జాబితా వెలువడుతుందన్న ఎదురు చూపులు పెరిగాయి.
మీడియా అత్యుత్సాహం:విజయకాంత్ తొలి జాబి తాతో తమిళ పత్రికలు, చానళ్లల్లో కథనాలు ఆరంభం అయ్యాయి. బీజేపీ మెగా కూటమిలో చీలిక వచ్చినట్టేనని, విజయకాంత్ ఒంటరిగా ముందుకెళ్లబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. తన తుది నిర్ణయాన్ని అరక్కోణం లోక్సభ నియోజకవర్గం వేదికగా విజయకాంత్ ప్రకటించేందుకు సిద్ధం అయ్యారంటూ మీడియాల్లో కథనాలు రావడం విజయకాంత్లో ఆగ్రహాన్ని రేపినట్టుంది. తమ కూటమిలో ఎలాంటి చీలిక లేదని చాటుతూ, మోడీ కోసం తన ఓట్ల వేట సాగుతుందని స్పష్టం చేస్తూ, మీడియాపై సెటైర్ల వర్షం కురిపించారు.
మీ ఇష్టం: సాయంత్రం జరిగిన ప్రచార సభలో మీడియాను విజయకాంత్ టార్గెట్ చేశారు. పెన్ను చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు...రాస్కోండి...అని విరుచుకుపడ్డారు. ఒకప్పుడు 4 పత్రికలుంటే... ఇప్పుడు 40కు చేరాయని ఎద్దేవా చేశారు. జయ టీవీ, నమదు ఎంజీయార్ ఛానళ్ల మీద విమర్శలు చేస్తే మాత్రం కేసులు పెట్టేస్తారు బాబోయ్ అంటూ ఛమత్కరించారు. ‘పొట్ట కూటి కోసం రాసుకుంటున్న పత్రికా మిత్రులారా? మిమ్మల్ని మాత్రం ఏమీ అనబోను, నా కళ్లకు మీ కుటుంబాలు కన్పిస్తున్నాయి’ అంటూ పేర్కొన్నా రు. తనపై కేసులు పెట్టించి లోపల వేయించుకోండి తాను మాత్రం భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశా రు. చివరగా, బీజేపీ కూటమితోనే తన పయనం అని, మోడీని పీఎం చేయడం లక్ష్యంగా తన ప్రచారం సాగుతుందన్నారు.
Advertisement
Advertisement