నాలుగు గంటల్లో.. వందకోట్ల బంగారం!
పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రకటించారు. సరిగ్గా అదేరోజు రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు.. అంటే కేవలం నాలుగంటే నాలుగే గంటల్లో ముంబైకి చెందిన ఓ నగల వ్యాపారి ఏకంగా 100 కోట్ల రూపాయల బంగారం అమ్మారట! ఈ విషయాన్ని ఆయన తన లెక్కల్లో చూపించారు. అంత అమ్మకాలు ఎలా సాధ్యమయ్యాయని ఈడీ అధికారులు అతడిని ప్రశ్నించారు. నోయిడా సెక్టార్ 51 లోని యాక్సిస్ బ్యాంకు బ్రాంచిలో జరిగిన అక్రమాలు, నకిలీ అకౌంట్ల బాగోతంపై ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా ఢిల్లీ, ముంబైకి చెందిన ఇద్దరు నగల వ్యాపారుల లావాదేవీలపైనే స్పష్టత రాలేదు. దాంతో వారిని ప్రశ్నిస్తున్నారు.
ఇద్దరిలో ఒక వ్యాపారి ఏకంగా 800 కోట్ల మేర లావాదేవీలు చేశారు. వాటిలో 200 కోట్లు కొనుగోళ్లు కాగా, మరో 600 కోట్లు బంగారం అమ్మకాలు. కొనుగోలు చేసిన బంగారానికి, జరిగిన అమ్మకాలకు ఎక్కడా పొంతన కనిపించడం లేదని ఈడీ వర్గాలు కనుగొన్నాయి. తాను 5 వేల మందికి బంగారం అమ్మానని ఓ నగల వ్యాపారి చూపించినా, వాటిలో ఏ ఒక్క లావాదేవీ మాత్రం 2 లక్షలు దాటలేదు. అంటే ఒక్కో కస్టమర్కు కేవలం 15 సెకండ్లలోనే బంగారం అమ్మేసినట్లవుతుంది. ఇది ఎలా సాధ్యమని ప్రశ్నిస్తే, అతడి వద్ద సమాధానం లేదు. దాంతో ఈ నగల వ్యాపారులు ఇద్దరూ నల్లధనాన్ని తెల్లగా చేసుకోడానికి అంతకుముందు జరిగిన అమ్మకాలను కూడా ఇప్పుడే జరిగినట్లు చూపిస్తున్నారని అనుమానాలు వస్తున్నాయి.