
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందే విజయోత్సవాలకు సిద్ధమైన బీజేపీ
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తీపికబురుపై ధీమాతో బీజేపీ రాష్ట్ర శాఖ కౌంటింగ్కు ముందే 5000 లడ్డూలు, పెద్దసంఖ్యలో పూలదండలకు ఆర్డర్ ఇచ్చింది. పార్టీ ముంబై కార్యాలయంలో ఎన్నికల ఫలితాలను ప్రదర్శించేందుకు భారీ స్క్రీన్ను ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమికి భారీ విజయం దక్కుతుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన క్రమంలో కాషాయ శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబికింది. మొత్తం 288 స్ధానాలకు గాను బీజేపీ-శివసేన కూటమికి 197 స్ధానాలు లభిస్తాయని సీఎన్ఎన్ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. దాదాపు 11 ఎగ్జిట్ పోల్స్ బీజేపీ-సేన కూటమికి 211 స్ధానాల వరకూ దక్కుతాయని అంచనా వేశాయి. ప్రసుత్తం మహారాష్ట్ర అసెంబ్లీలో ఇరు పార్టీలకూ 217 స్ధానాలున్నాయి. గురువారం మధ్యాహ్నం నుంచే విజయోత్సవాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు బీజేపీ నేతలు పిలుపు ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తామని తమకు తెలుసని..అయితే ఎన్ని స్ధానాలు లభిస్తాయనే దానిపైనే ఉత్కంఠ నెలకొందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అక్టోబర్ 21న ఎన్నికలు జరిగిన మహారాష్ట్రలో 61.13 శాతం ఓటింగ్ నమోదైంది. కాగా ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే ముందు రోజు బుధవారం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.